🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 3 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
*14వ భాగం*
*బ్రహ్మాండం - అర్థనారీశ్వర స్వరూపం ఆవిర్భావం*```
శౌనకాది మునులు సూత మహర్షిని "బ్రహ్మాండం అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణువులలో నిజమైన సృష్టికర్త ఎవరు?" అని అడిగారు.
సూత మహర్షి సమాధానం చెబుతూ "అనంతమైన ఈ విశ్వాంతరాళాన్ని అవ్యక్తం అని కూడా అంటారు. సృష్టికి పూర్వం నిరాకారంగా శూన్యంలో ఉన్నది అవ్యక్తమే. అవ్యక్తము నుంచి పరబ్రహ్మ స్వరూపం వ్యక్తమైంది. పరబ్రహ్మ సృష్టికి సంకల్పంచేశాడు అప్పుడు పరబ్రహ్మం రోమకూపాల నుంచి అనంత విశ్వంలోకి పంచభూతాత్మకమైన అనేక బ్రహ్మాండాలు వెలువడ్డాయి. ప్రతి బ్రహ్మాండాన్ని ఆవరించి ఏడు ఆవరణలు ఏర్పడ్డాయి.
అన్నిటికన్నా పైన మహత్తత్త్వం ఉంటుంది. దీనిలోపల అహంకార తత్త్వం ఉంది. అహంకార తత్త్వం లోపల ఆకాశ తత్త్వం, ఆకాశ తత్త్వం లోపల వాయు తత్త్వం, వాయుతత్త్వం లోపల తేజోతత్త్వం, తేజతత్త్వం లోపల జలతత్త్వం, జలతత్త్వం లోపల పృధ్వీ తత్త్వం ఉంటాయి.
ఈ సప్త ఆవరణలు ఒకదానికన్నా ఒకటి పది రెట్లు పెద్దవి. ఒకదానిలో మరొకటి ఇమిడి ఉంటాయి. సప్త ఆవ రణలు ఈవిధంగా కలిగి ఉన్నదానిని బ్రహ్మాండం అంటారు.
ప్రతి బ్రహ్మాండంలోను పద్నాలుగు లోకాలు ఉన్నాయి. సుఖాలు ఇచ్చేవి ఊర్థ్వలోకాలు, దుఖాలు ఇచ్చేవి అధోలోకాలు. సుఖదుఃఖాలు ఇచ్చేది మధ్యనున్నభూలోకo. మూడురకాల అనుభవాలు ఇచ్చేవి కనుక మూడింటిని త్రిలోకాలు అంటారు. సృష్టికర్త ఆద్యుడైన పరబ్రహ్మ మాత్రమే. ఎందుకంటే పరబ్రహ్మ నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. అందుకని పరబ్రహ్మను పరమాత్మ అని, నారాయణుడు అని, సర్వేశ్వరుడు అని అంటాము.
బ్రహ్మాండాలలో సృష్టికార్యం కోసం నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మలను సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మల ద్వారా ఆయా బ్రహ్మాండాలలో సృష్టి కార్యం జరుగుతుంది. పరబ్రహ్మ చేసే సృష్టి అద్వారక సృష్టి, స్వయంసృష్టి అయితే, చతుర్ముఖ బ్రహ్మలు చేసే సృష్టిని సద్వారక సృష్టి లేదా పరోక్ష సృష్టి అంటారు. ప్రతి బ్రహ్మాండంలో
ఆ బ్రహ్మాండానికి సంబంధించిన చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మ సంకల్పించిన సృష్టి కార్యాన్ని పూర్తి చేస్తాడు.
ఈ చతుర్ముఖ బ్రహ్మలకు ఒకరితో మరొకరికి ఎలాంటి సంబంధం ఉండదు. కానీ పరబ్రహ్మను అందరూ తమ సృష్టికర్తగా, తమకి తండ్రిగా భావిస్తారు. పరబ్రహ్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మల ద్వారా సకల సృష్టి జరుగుతుంది. అలాగే మహా లయం జరిగినప్పుడు బ్రహ్మలతో కలసి సకలం పరబ్రహ్మం లోనే విలీనం అవుతుంది"
విన్న శౌనకాదిమునులు ఆనందంతో నమస్కరించి "మహర్షీ! ఈ కథనం విన్నాక పరబ్రహ్మఅయిన శ్రీమహావిష్ణువు దివ్యలీలలు మీ నుంచి తెలుసుకోవాలనే కుతుహలం మరింత పెరిగింది. మన బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు సృష్టి తరువాత చతు ర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యం ఎలా ప్రారంభించాడో వివరించి చెప్పండి" అని కోరారు.
సూత మహర్షి సరేనని "పద్నాలుగు లోకాల సృష్టి జరిగిన తరువాత పద్నాలుగు లోకాల నివాసులను సృష్టించడానికి శ్రీమహావిష్ణువు సహాయం కోరుతూ అష్టాక్షరి మంత్ర జపంచేస్తూ ధ్యానంలో నిమగ్నుడైనాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరబ్రహ్మ ప్రసన్నుడై జరగబోయే సృష్టి తత్త్వము బ్రహ్మకు తెలియజేయాలని అర్థ నారీశ్వర రూపంతో బ్రహ్మముందు ప్రత్యక్షమైనాడు.
సగం పురుషుడు, సగం స్త్రీగా తనముందు సాక్షాత్కరించిన దివ్య రూపం చూసి మొదట బ్రహ్మ ఆశ్చర్యం చెందాడు. తరువాత ఆ రూపానికి గల మహత్తు అర్థం చేసుకున్నాడు.
"పరబ్రహ్మము నుండి సృష్టి కోసం పురుషుడు, స్త్రీ రూపంతో ప్రకృతి అవతరించారని. సృష్టి ముందుకు సాగడానికి పురుషునికి ప్రకృతి సహచర్యం అవసరమని" బ్రహ్మ దేవుడు అవగతం చేసుకున్నాడు. ఇందుకోసం తనకు మార్గదర్శనం చేయమని ఆ అర్థనారీశ్వరుడిని కోరాడు.
అర్థనారీశ్వరుడు బ్రహ్మను చూసి "చతుర్ముఖా! జన సృష్టి నీవు చేయాలంటే సంతానప్రదాయిని, జీవసృష్టికి అధిదేవత అయిన ‘సావిత్రీదేవి’ ని ప్రసన్నం చేసు కోవాలి" అని చెప్పగానే బ్రహ్మ విస్మయం చెంది "ఈ సావిత్రీదేవి ఎవరు? ఎక్కడ ఉంటుంది? అసలు అర్థనారీశ్వరుడైన మీరెవ్వరు?
నాకు తెలిసినది నారాయణ స్వరూపం ఒక్కటే" అని నమస్కరించి అడిగాడు.
అర్థనారీశ్వరుడు "బ్రహ్మదేవా! ప్రకృతి పురుషుల కలయిక తోనే సృష్టి జరుగుతుంది. నేను సృష్టి స్థితి లయ కార్యం కోసం శ్రీమన్నారాయణుని నుంచి అవతరించిన ‘పరమేశ్వరుడి’ని.
నేను,విష్ణువు ఏకాత్ములము. కేశవుడిగా విష్ణువు ఉంటే శివుడిగా ఈ రూపంలో నేను ఉన్నాను. శివకేశవులం అయిన మేమిద్దరం ఒకటే. మాలో ఎటువంటి భేదం లేదు.
నా అర్థశరీర భాగమైన స్త్రీ స్వరూపము గురించి వివరిస్తాను. పరదేవత అయిన ఈ శక్తి స్వరూపం నా నుంచి ఉద్భవించి నాలో సగమై ఉంటూ నాతో కలసి ఉంది. పరాశక్తిగా నా అర్థనారీశ్వరి ఐన ఈ ప్రకృతి విష్ణువు వక్షస్థలంలో లక్ష్మీదేవిగా నివసిస్తుంది. త్రిమూర్తులమైన మనకు ఈ శక్తిస్వరూపం తోడు లేకపోతే సృష్టి స్థితి లయ కార్యాలు జరుగవు. గాయత్రిగా, సరస్వతిగా నీ వద్ద ఉండేది ఈ శక్తి స్వరూపమే అని గ్రహించుము. వీరి వలన నీకు బ్రహ్మజ్ఞానం, సర్వశాస్త్ర వేదజ్ఞానము
లభించింది. కానీ జీవసృష్టి నీవు చేయాలంటే నీ వద్ద సృష్టికి అధిదేవత అయిన సావిత్రీదేవి ఉండాలి. సావిత్రీదేవి గోలోకంలో కృష్ణుని సేవిస్తూ కృష్ణుడి సన్నిధిలో ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకుని నీవద్దకు తెచ్చుకొనుము. జీవసృష్టి చేయ గలుగుతావు" అని ఆశీర్వదించి అర్థనారీశ్వరుడు అదృశ్య మయ్యాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి