🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*మంగళవారం 3 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣5️⃣2️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*152వ రోజు*
*వన పర్వము సప్తమాశ్వాసము*
*సావిత్రి*```
“యమ ధర్మరాజా! సతికి భర్త సేవయే పరమార్ధం. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది. తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు ఔతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కనుక నా కోరికను మన్నించుము" అని అడిగింది.
అందుకు యమధర్మరాజు సంతోషించి "సావిత్రీ! నీకు మరొక వరం ఇచ్చెదను కోరుకొనుము" అని చెప్పాడు.
అందుకు సావిత్రి "యమధర్మరాజా! ఇప్పటి దాకా నువ్వు ఏ వరం కోరుకొమ్మన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను. యమధర్మరాజా! సతికి పతియే దైవము. పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభ కార్యానికి ఆమెను పిలువరు. కనుక సాళ్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయుము”అని కోరింది.
ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశ పెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో "సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవు ఔతావు" అని చెప్పి వెడలి పోయాడు.```
*సావిత్రి సత్యవంతులు తిరిగి వెళ్ళుట*```
సావిత్రి వెను తిరిగి సత్యవంతుని దేహమున్న చోటుకు వచ్చింది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లు లేచాడు.
సత్యవంతుడు "ఏమిటి సావిత్రీ! ఇంతసేపు నిద్రపోయాను లేపలేదా. కాని ఎవరో నన్ను పట్టి లాగినట్లు ఉంది. అది కల కాదు నిజమే అన్నట్లు ఉంది. ఎవరై ఉంటారు" అన్నాడు.
సావిత్రి "నాధా! ఇప్పటికే చాలా పొద్దు పోయింది. మీ తల్లి తండ్రులు మనకోసం ఎదురు చూస్తుంటారు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి" అని ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళారు.
అప్పటికే ద్యుమత్సేనుడికి చూపు వచ్చింది. ఎదురుగా కుమారుడు కనిపించక పరితపిస్తున్నారు. వారు రాగానే ఆలస్యానికి కారణం అడిగారు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు.
సావిత్రి "మహారాజా! నా భర్త సత్యవంతునికి ఈ రోజు మరణం అని చెప్పారు కదా. అందుకని నేను నా భర్తతో అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడి పోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకు పోవుచుండగా నేను అతనిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది నాలుగు వరాలు పొందాను అందులో చివరిది నా భర్త ప్రాణములు. మరొక వరం తమకు చూపు వచ్చుట, మరొక వరం మీ రాజ్యం ప్రాప్తించుట. నాల్గవది నా భర్త ప్రాణములు" అన్నది. సాళ్వభూపతి "అమ్మా! ఆపత్సమయంలో ఉన్న మాకు నావలా ఆదుకున్నావు. నీ పుణ్య చరితము కీర్తనీయము" అన్నాడు.
ఆ తరువాత సాళ్వభూపతి అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారు కలహించుకుని మరణించారని ద్యుమత్సేనుని రాజ్యపాలన చేయమని కోరారు.
ద్యుమత్సేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగములు అనుభవించింది.
కనుక ధర్మరాజా పతివ్రత అయిన ద్రౌపది కూడా మీకు శుభములు చేకూరుస్తుంది" అని చెప్పి మార్కండేయుడు తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళాడు.
*సశేషం*``
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷``
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి