4, మార్చి 2021, గురువారం

మన మహర్షులు- 39

 మన మహర్షులు- 39


వైశంపాయన మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


ఈ రోజు మనం  వైశంపాయన మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన చాలా గొప్ప ఋషి, మహాభారతంలో ఈ ఋషి పేరు ఎక్కువ విని వుంటాం. అసలు వేదాల్ని అన్ని వైపులా వ్యాప్తి చేసింది ఈ వైశంపాయన మహర్షి.


వైశంపాయన మహర్షి ఒక ముని కొడుకు. చిన్నప్పుడే వ్యాస మహర్షికి అప్పగించాడు తండ్రి. వ్యాసుడు ఈ పిల్లవాడికి విద్యాబుద్ధులు చెప్పి కొంచెం పెద్దవాడయ్యాక యజుర్వేదం

నేర్పి ఈ వేదాన్ని అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చెయ్యమన్నాడు.


 వైశంపాయనుడు యజుర్వేదాన్ని ఇరవై ఏడు శాఖలుగా విభజించి తన శిష్యుల్తో అన్ని లోకాల్లోనూ వ్యాపించేలా చేశాడు.


 వైశంపాయనుడి ఆశ్రమంలో ఎంతోమంది శిష్యులు వేదం నేర్చుకుంటూ వుండేవాళ్ళు.


యాజ్ఞవల్యుడనే శిష్యుడు నాలుగు వేదాలు నేర్చుకుని గురుభక్తి కలిగి ప్రియశిష్యుడుగా ఉండేవాడు.


 కాని రానురాను యాజ్ఞవల్క్యుడికి గర్వం ఎక్కువయి పోయింది.


 అహంకారం ఉండకూడదని గురువుగారు ఎంత చెప్పినా వినకపోవడంతో తాను నేర్పిన వేదం తన దగ్గరే కక్కేసి వెళ్ళమని చెప్పి బయటకి పంపేశాడు యాజ్ఞవల్క్యుడుని వైశంపాయనుడు.


తనకి అత్యంత ప్రియమైనవాడు, గురుభక్తి వున్నవాడు అయినా సరే! అహంకారి కాబట్టి శిష్యుణ్ణి శిక్షించాడు వైశంపాయనుడు.


  వేదవ్యాసుడు తన విజ్ఞానంతో మహాభారతాన్ని రచించి విశ్వానికి ఉపయోగించేలా చేశాడు.

 మహాభారతాన్ని భూలోకంలో జనమేజయుడికి చెప్పడానికి

వైశంపాయన మహర్షిని పంపాడు. 


వైశంపాయనుడు గురువుగారికి మనస్సులో నమస్కారం చేసి వినేవారికి కోరిన కోరికలిచ్చేది, జన్మజన్మల పాపాన్ని పోగొట్టేది, ధర్మార్థ కామమోక్షాలకి గొప్ప సాధనమైంది, సత్యవాక్యాలతో వంద వేల శ్లోకాలతో వున్నది, వ్యాసమహామునితో వ్రాయబడింది అయిన భారతాన్ని జనమేజయుడికి వివరంగా చెప్పాడు.


జనమేజయుడు మళ్ళీ సందేహాలు అడిగాడు. ..


యుద్ధం తర్వాత పాండవులు కౌరవులు స్వర్గానికి వెళ్ళి ఎక్కడ వున్నారు? అని


వైశంపాయనుడు రాజా! కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళు ముందు స్వర్గానికి వెడతారు. తర్వాత నరకానికి వెడతారు. దుర్యోధనుడు వీరస్వర్గం పొందాడు. కాబట్టి ముందు స్వర్గానికి వెళ్ళి తర్వాత కలిలో కలిసిపోయాడు. అతని తమ్ముళ్ళు రాక్షసులయ్యారు అని చెప్పాడు.


ఎవరెవరు ఎక్కడెక్కడ చేరారో చెప్తాను విను. అర్జునుడు నారాయణుడి ప్రక్కన చేరాడు, కర్ణుడు ద్వాదశాదిత్యుల ప్రక్కన, భీముడు మరుద్గణాల్లో, నకుల సహదేవులు అశ్వినీ దేవతల్లోనూ ఉన్నారు అని చెప్పాడు వైశంపాయనుడు


ధృతరాష్ట్రుడు కుబేర లోకంలోనూ, పాండురాజు ఇంద్ర భవనంలో, అభిమన్యుడు

చంద్రుడిలో, ద్రోణుడు బృహస్పతిలో, భీష్ముడు వసువులో, ధర్మరాజు, విదురుడు ధర్మదేవతలో


ఇలా ఇంకా ఎవరెక్కడెక్కడ ఉండిపోయారో వివరంగా చెప్పాడు వైశంపాయనుడు.


 తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి హరివంశ కథలన్నీ చెప్పాడు.


పృథు చక్రవర్తి చరిత్ర, మన్వంతర వివరణ, కువలయాశ్వ చరిత్ర, త్రిశంకు చరిత్ర జాంబవతీ చరిత్ర, దత్తుని చరిత్ర, యయాతి చరిత్ర, ఇలా చాలాచాలా కథలున్నాయి ఇవన్నీ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.


 చివరగా జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగి మోక్ష మార్గం గురించి కూడా

తెలుసుకున్నాడు.


వైశంపాయనుడు రాసిన 'నీతిప్రకాశిక' అనే గ్రంథంలో యుద్ధ నీతి గురించి తెలియచెయ్యబడింది.


 దాంట్లో సేనా నాయకుడి విధులు, సైనిక విన్యాసం, ప్రాచీక భారతదేశ శస్త్రాస్త్రాల గురించి, సుమారు నూట ముఫై ఆరు రకాల ఆయుధాల గురించి రాశాడు .యుద్ధం వివరంగా ఎలా చెయ్యాలి సైన్య సమీకరణ మొదలు ఎనిమిది సర్గలున్నాయి దీంట్లో.


 ఇంతటి మేధావిని గురించి తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం.🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: