9, మార్చి 2026, సోమవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*ఆదివారం 8 మార్చి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣7️⃣&1️⃣5️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*

            

          *157,158 వ రోజు*                   

*వన పర్వము సప్తమాశ్వాసము*


*యక్షప్రశ్నలు*```


అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి “అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి” అని ధర్మరాజును అడిగాడు. 


ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి 

“అన్నయ్యా! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు. 


ధర్మరాజు నవ్వి "నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు" అన్నాడు. 


భీముడు నకులుని చూసి “తమ్ముడూ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి" అన్నాడు. 


నకులుడు "అన్నయ్యా భీమా! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం. అన్నయ్యలూ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా” అన్నాడు సహదేవుడు. 


ఆ మాటలు వింటున్న ధర్మరాజు 

“తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు” అన్నాడు.```


*దాహార్తులై పాండవులు కొలను చేరుట*```


నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. 


ధర్మరాజు "అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా" అన్నాడు. 


నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. “అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి” అన్న మాటలు వినిపించాయి. 


నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. 


నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి "సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటముకు వెళ్ళి ఎంతకూ రాలేదు. నీవు పోయి చూసి రా” అని చెప్పి పంపించాడు. 


సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్ళు త్రాగటానికి కొలనులో దిగపోయే సమయంలో 

“మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు” అన్న మాటలు వినిపించాయి. 


సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులుని లాగానే స్పృహతప్పి పడి పోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు అర్జునిని చూసి “అర్జునా! నీ తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఎంతకూ రాలేదు. ఏం జరిగిందో చూసి రా” అని చెప్పి పంపించాడు. 


అర్జునుడు కొలను సమీపించగానే అశరీరవాణి "ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహతప్పి పడిపోతారు” అన్నాడు. 



అర్జునుడు “ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడు తున్నావు. ఉండు నిన్ను సంహరిస్తాను" అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. 


మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. 


అర్జునుడు కూడా స్పృహతప్పి పడి పోయాడు. 


వెళ్ళిన ముగ్గురూ రాకపోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి “భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా" అని పంపాడు. 


భీముడు కొలను సమీపించగానే మరలా అదే అశరీరవాణి 

“ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు" అన్నది. 


భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.```


               *సశేషం*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: