8, ఫిబ్రవరి 2021, సోమవారం

మన మహర్షులు- 13

 మన మహర్షులు- 13


 కర్దమ మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


బ్రహ్మదేవుడు, గంధర్వుల్ని, అప్సరసల్ని, సిద్ధుల్ని,  కిన్నెరల్ని, కింపురుషుల్ని సృష్టించాక ఋషుల్ని సృష్టించాడు. 

వీళ్ళందర్ని ప్రజాసృష్టికి ఉపయోగించుకున్నాడు బ్రహ్మ. అందులో ఒక ఋషి మన కర్ధమ మహర్షన్నమాట.


కర్దమ మహర్షి కృతయుగంలోని వాడు.


ఒకసారి కర్దముడు సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమం కట్టుకుని విష్ణుమూర్తి దర్శనం కోరి తపస్సు చేశాడు. 


పదివేల సంవత్సరాలు అలా తపస్సు చేశాక విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఏంకావాలో కోరుకో అన్నాడు. 


కర్దమ మహర్షి విష్ణుమూర్తిని చూసి ఆనందం పట్టలేక సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ ! నేను వివాహం  చేసుకోవాలని తపస్సు చేశాను సృష్టి కార్యానికే గాని సుఖాలకోసం కాదు. నీ అనుమతి ప్రకారమే నేను కోరుకున్నాను అన్నాడు


కర్దముడి మాటలు విని విష్ణుమూర్తి మహర్షీ ! నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది. బ్రహ్మవర్త దేశపురాజు భార్యతో కలిసి నీ దగ్గరకు వచ్చి వారి కూతుర్ని నీకిచ్చి పెళ్ళి చేస్తారు. నీకు తొమ్మిది మంది కూతుళ్ళు వాళ్ళకు గొప్ప మునులు పుడ్తారు తర్వాత నువ్వు నాలోనే లోకాలన్ని వున్నాయనీ, నీలో కూడ నేనే ఉన్నానని తెలుసుకుని నన్నే పూజించు. నాఅంశతో నీ భార్య వలన నేనే కొడుకుగా నీకు పుడతాను అని చెప్పాడు


కర్దముడు మళ్ళీ తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు.


 స్వాయంభువుడు భార్య శతరూపతోను, కూతరు దేవహూతితోను కలిసి వచ్చి తన కూతుర్ని పెళ్ళి చేసుకోమని  అడిగాడు...అపుడు కర్ధముడు తనకు సంతానం కలిగిన తరువాత సన్యాసం తీసికొంటానని చెప్పాడు..


దేవహూతి తన భర్త అయిన కర్ధముడికి సేవచేస్తూ ఉండిపోయింది. 


కొంతకాలం తర్వాత వాళ్ళకి తొమ్మిదిమంది కూతుళ్ళు పుట్టారు. కర్దముడు పిల్లలు పుట్టారు కనుక సన్యాసం తీసుకుని తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోతానని చెప్పాడు. 


దేవహూతి ఆడపిల్లలు

పెళ్ళిళ్ళయి అత్తవారిళ్ళకు వెళ్ళేవరకు తనకు ఒక కొడుకు పుట్టేవరకు ఉండమని భర్తని వేడుకుంది. 


కర్దముడు కొడుకు కావాలంటే విష్ణుమూర్తిని ధ్యానం చెయ్యమని చెప్పాడు.


కొంతకాలం తర్వాత దేవహూతికి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే కొడుకుగా పుట్టాడు .అతనికి కపిలుడు అని నామకరణం చేశారు.


 మరీచి మొదలయిన మునులతో కలిసి వచ్చి కపిలుడు దేవదేవుడని లోకాల్ని ఉద్ధరించడానికే పుట్టాడని ,కర్దముడి కూతుళ్ళకు మునులనే ఇచ్చి పెళ్ళి చెయ్యమని చెప్పి వెళ్ళిపోయాడు బ్రహ్మ


బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే కర్దముడు తన తొమ్మిదిమంది కూతుళ్ళకు మునులతో వైభవంగా పెళ్ళి చేశాడు.


 కపిలుణ్ణి కనిపెట్టుకుని దేవహూతీ కర్థములు ఉండిపోయారు.


 కొంతకాలం గడిచాక కర్దముడు దేవదేవుడే తన కొడుకుగా ఇంట్లో ఉన్నాడని కొడుకయిన కపిలుడికి నమస్కారం చేసి స్వామి ! ఆదివిష్ణువయిన నువ్వే నా ఇంట్లో పుట్టావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా మనస్సు నీలోనే లగ్నం చేసి తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు కర్దముడు


కపిలుడు "నేను నీకు మాట ఇచ్చినట్లే నీకు కొడుకుగా పుట్టాను. మునులందరికి తత్త్వజ్ఞానం గురించి చెప్తాను. నువ్వు కూడ కోరికలు వదిలేసి భక్తి కలిగి నన్ను మనస్సులో తలచుకుంటూ మోక్షాన్ని పొందు "అని చెప్పాడు


కర్దముడు కపిల మహర్షికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి ఆశ్రమానికి వెళ్ళి పరబ్రహ్మని మనస్సులో నిలుపుకుని లోకమంతా భగవంతుడే వ్యాపించి ఉన్నాడని తెలుసుకుని మోక్షాన్ని పొందాడు.


ఇదీ..కర్దమ మహర్షి జీవితచరిత్ర!


విష్ణుమూర్తికే తండ్రి అయిన కర్ధముడు ఎంత గొప్పవాడో కదా...


సనాతన ధర్మంలోని పలు గ్రంథాల్లో ఈ మహర్షి పేరు ప్రస్తావితమైనది.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: