15, జూన్ 2021, మంగళవారం

అజ్ఞాతకవి వ్రాసిన పద్యం

 (ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన పద్యం.)

*కం. అంచిత చతుర్ధ జాతుడు

పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్

గాంచి, తృతీయం బక్కడ

నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!

భావం: గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవమార్గంలో వెళ్ళి మొదటికుమార్తెను చూసి, మూడవదానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను.

ఏమీ అర్థం కాలేదు కదా! ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం.

ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.

చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,

పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,

ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,

తృతీయము అంటే అగ్ని ,

ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి ఇప్పుడు భావం చూడండి.

హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటివచ్చాడని భావం

ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. వ్రాసిన కవికి నమస్సుమాంజలి.

🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: