21, మార్చి 2022, సోమవారం

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు. 


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు. 


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు. 


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు. 


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు. 


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు. 


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు. 


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు. 


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: