2, మార్చి 2022, బుధవారం

క్షీర సాగర మథనము.

 MAAGHA PURANAM -- 29


29 అధ్యాయము 


మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.


మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. 

పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును  మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని  విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు.  తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా  వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా  భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషమును తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారి ఆనాటినుండి నీలకంఠుడని పేరు వచ్చింది. మళ్ళీ దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రమును మధించగా అమృతము పుట్టింది. ఆ అమృతము కొరకు వారిరువురు తగవులాడుకొన సాగారు. శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారము ధరించి వారి తగవును పరిష్కరించాలి అనుకున్నాడు. 

మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతమును ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతము  పంచుతాను మీకు ఇష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారములతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ విషయము గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని రూపములో ఉన్న శ్రీమహావిష్ణువు కోపించి తన చక్రాయుధంతో వారి తలను నరికివేసాడు.  మిగిలిన అమృతము దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండమును  భద్రపరుస్తూ ఉండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన దేవతలు కోరగా మళ్ళీ వచ్చి రహస్యముగా పువ్వులను కోయాలని  తోటలో ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపైన, వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును తుంచబోడగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయము వివరించాడు. కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. అమోఘమైన శక్తి కల సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించాడు. సత్రాజిత్తుకి చెప్పి అమృత తుల్యమగు పారిజాత వృక్షమును దానికి అర్హుడైన దేవేంద్రునికి ఇప్పించి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. ఆనాటి నుంచి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యములో ఆయనతో సమానముగా పూజలు అందుకుంటున్నది. అందుచేత తులసిని పూజించిన సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి. 


ఫలశ్రుతి: 


సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది.  అందరు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృప పొందగలరని దీవించాడు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయము అయిన తర్వాత నదిలో స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువును మనసారా పూజించిన సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తి పొందుతారు. 


సర్వేజనాః సుఖినోభవన్తు!!


మాఘపురాణము సంపూర్ణమ్ !!

కామెంట్‌లు లేవు: