17, అక్టోబర్ 2022, సోమవారం

3 దోషములు/పాపములను చేశాను

 *నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు శ్రీ ఆది శంకరాచార్యులు  వారు.*


🥦🥦🥦🥦🥦🥦🥦

        

శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.


గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట


“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.


ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపము లు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.


ఒక శిష్యుడు, ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.


1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.


అది నేను చేసిన మొదటి దోషం. 


2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు. 


3. నిర్వాణ శతకం లో

“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః

అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను. 


అర్థము :

నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!


ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.


నీతి :


మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.


*బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.*


*“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”*


ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము.

కామెంట్‌లు లేవు: