10, డిసెంబర్ 2023, ఆదివారం

*కార్తిక పురాణము - 28*

 *కార్తిక పురాణము - 28*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై ఎనిమిదవ అధ్యాయము*


అంబరీష ఉవాచ:

అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా! ఆగు నీకు నమస్కారము.ఈ బ్రాహ్మణుని చంపుట తగదు. నీకు వధతో కూడిన ఆహారము కావలెనన్న నా శరీరమును ఇచ్చెదను. ఈ బ్రాహ్మణుని విడువుము. లేని యెడల నాతో యుద్ధము చేయుము. నీవు హరియొక్క ఆయుధమువి గనుక నాకు దైవమయినప్పటికీ నీతో యుద్ధము చేయుదును గాని నిన్ను బ్రతిమాలుటలేదు.క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించెను గాని యాచనను విధించలేదు.అయినాను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును. ఓ సుదర్శన చక్రమా! నీవు సమస్త భూతములకు అజేయుడవన్నమాట నాకు తెలియును అయినను నా బాహుబలమును చూడుము.


విష్ణ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురు గాక. నిన్నిపుడు భూమియందు పడవైచెదను. అట్టియవస్థను చెందక ఇతనిని విడువుము. నీకు జీవించియుండి హరిహస్తమందు నివసించు కోరికయున్న యెడల నన్ను పాలించుము.శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువమని రాజు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజును పరీక్షించవలయునను తలంపుతో కోపము వచ్చినట్లు నటించి సుదర్శనము, రాజా! నీకు తెలియునా? మధుకైటభులను రాక్షససులను చంపితిని దేవతలకు జయించుటకు శక్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితినని తెలియదా?ఈ దుర్వాసుని కోపముతో కూడిన ముఖమును చూచుటకెవ్వడైన సమర్దుడున్నాడా?ఈ దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారియైనను ఇప్పుడిట్టి అవస్థను నావలన చెందెను గదా? శంకరుని వలన క్షత్రియ సంహారకారకమయిన తేజస్సు సంభవించినది. ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము గాదు.అదియు నాచేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది.క్షత్రియ తేజోవంతుడైన నీవు నాతో యుద్ధమునకు ఎట్లు సమర్థుడవగుదువు? బ్రహ్మ శంకరుల రెండు తేజస్సులు నాకు చాలనివి.


రాజా! క్షేమము కోరినవాడు బలవంతునితో స్నేహము చేయవలెను. ఇట్లు న్యాయముండగా నీవు మూర్ఖత్వమునవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడవెందుకైతివి? నీవు హరిభక్తుడవని నేను నిన్ను ఇంతవరకు సహించితిని. నీవు దూరముగా పొమ్ము. ప్రాణములను వృధాగా పోగొట్టుకొనకు! అన్న సుదర్శన చక్ర వాక్యమును విని అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శన చక్రముతో అంబరీషుడు ఇట్లు పల్కెను.


సుదర్శన చక్రమా! నీవు నా దేవునకు ఆయుధమైతివని నిన్ను బాణములచేత నూరు ఖండములుగా కొట్టలేదు.నీవు క్షత్రియ ధర్మము అవలంబించి నాతో మాట్లాడుచున్నావు.గనుక ఇకముందు నీకు గర్వముండబోదు.నీ గర్వమును నశింపజేయు బాణములు నా హస్తమందున్నవి.నేను బ్రాహ్మణులందును, దేవతలందును, స్త్రీలయందును, జ్ఞాతులందును గోవులందును, బాణములను వదలను.నీవు క్రూరుడవైనను దేవుడవగుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని. నీవు దేవత్వమును వదలుకొని క్షత్రియత్వముతో గూడి నాయందు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను సహించు చూతమని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వదలెను.


క్షాత్ర పౌరుషముతో గూడిన రాజును జూచి సుదర్శనుడు నవ్వుచు సుదర్శనుడు రాజా! నీ సంరక్షణ నిమిత్తమే హరినన్ను పంపినాడు. నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని.సుఖముగా ఉండుమని పలికి ధనుర్బాణములతో గూడియున్న రాజును కౌగలించుకుని భూమియందు పడి నమస్కారము చేసెను.


ఓ అగస్త్యా! రాజు అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో సంసార మధ్యను సంచరించెడు పురుగునైన నేనెక్కడ? హరియొక్క హస్తమందు ప్రకాశించెడి నీవెక్కడ? ఇట్లు తెలిసియు నీతో యుద్ధమునకు సన్నద్ధుడయిన నా తప్పును క్షమించుము.నేను నిన్ను తిరస్కరించి విజ్రుంభించి యుద్ధమునకు సిద్ధపడితిని. క్రూరమయిన నా క్షత్రియ స్వభావమిట్లు చేసినది గనుక క్షమించుము.ఇది శుక్ల పక్షము, పగలు, యుద్ధభూమి, మకరమాసము., మాఘమాసము.ఇట్టి పుణ్యకాలమునందు నా దేవుడైన నీవలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చితిని. భగవద్గీతయందు ఇట్లు కలదు.


ఉత్తరాయణమందు శుక్లపక్షమందు పగలు మృతినొందిన వారు బ్రహ్మపదమును చేరుదురు.కార్తిక శుక్ల ద్వాదశినాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు తిరిగి వచ్చెను.సుమారు మూడు మాసములకు అంబరీషుని చేరినాడు.

జ్వాలలచేత భయంకరమై నూరు మెరుపులకంటే అధికమయిన కాంతిగలదియును అయిన నీ రూపమును గవ్వతో సమానుడను నేనెట్లు సహింతును? సహస్రాగ్నియుతమైన రవిబింబము వలె సహస్రారములను ధరించునటువంటి సమస్త సంహారకరమగునటువంటి నీ రూపముతో యుద్ధము చేయనేనెట్లు శక్తుడనగుదును? కోరలతో గూడి భయంకరము దశదిక్కులందు అగ్నులను బయటకి చిమ్ముచున్నటువంటి నీ యొక్క దంతపుదెబ్బను దేవుడుగాని, రాక్షసుడు, దేవేంద్రుడు గాని, రాక్షసాధిపతి గాని ఇంకెవ్వడు గాని సహించగలడు? మెరుపులను సూర్యునికిరణజాలములును మొత్తములై భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సును తిరస్కరించలేవు.


విష్ణువు భయంకరాకారమయిన నిన్నాశ్రయించి మూడు లోకములను పాలించుచున్నాడు. నీతో విరోధించినయెడల దేవతలు గాని, దానవులు గాని, అన్యులు గాని నిన్ను జయించలేరు. దైత్యులన చంపుదానవు భక్తులను పరిపాలించుదానవు.విష్ణువు యొక్క కాంతిచేత ప్రకాశించుదానవు. ప్రాణగమన కష్టమును హరించుదానవు అగు నీకు నమస్కారము.


ఇట్లు స్తుతించి నమస్కారము చేయుచున్న రాజును లేవదీసి నీకు క్షేమమగుగాక! అని సుదర్శనుడు పలికెను. ఈ సుదర్శన చక్ర స్తోత్రమును మూడుకాలములందు పఠించువాడు ఆపదలనుండి విముక్తులై నిరంతరసుఖములను పొందుదురు.


కలియుగమందు ఈ అధ్యాయమును ఒకమారయినను వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షము పొందుదురు.


ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే అష్టావింశాధ్యాయ సమాప్తః!!

కామెంట్‌లు లేవు: