_కన్నతల్లి కడుపులోంచి బయట పడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే 'నేను '_*
*_ఈ 'నేను ' ప్రాణశక్తి అయిన "ఊపిరి "కి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా 'నేను' అనే భావన కొనసాగుతూనే ఉంటుంది._*
*_జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ 'నేను 'ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ 'నేను ' లోంచే 'నాది ' అనే భావన పుడుతుంది.!_*
*_ఈ 'నాది 'లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి..._*
*_చివరికి ఈ 'నేను ' అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి 'అహం 'గా ప్రజ్వరిల్లుతుంది._*
*_'అహం ' అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ 'నేను ' నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలుకుతుంది._*
*_పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతుంది._*
*_బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన 'నేను ' అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది._*
*_వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది._*
*_సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన 'నేను ' చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది._*
*_కడసారి చూపుల కోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది. మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంని విముక్తి కలుగుతుంది._*
*_మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది._*
*_'నేనే ' శాసన కర్తను, 'నేనే ' ఈ భూమండలానికి అధిపతిని, 'నేనే ' జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన 'నేను ' లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది._*
*_ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన 'నేను ' కథ అలా... సమాప్తమవుతుంది._*
*_అందుకే ఊపిరి ఆగకముందే 'నేను ' గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత._*
*_చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది 'శ్మశానవైరాగ్యం ' మాత్రమే. అది శాశ్వతం కానే కాదు._*
*_'నేను ' గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది._*
*_'వైరాగ్యం ' అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీద మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగడం..._*
*_స్వర్గనరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం._*
*_అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం._*
*_ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం. నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం._*
*_అహం బ్రహ్మాస్మి అంటే 'అన్నీ నేనే ' అనే స్థితి నుంచి 'త్వమేవాహమ్ ' అంటే, 'నువ్వేనేను ' అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత మరియు ఆ తండ్రి పరమాత్మ పాదాలచెంత కాసింత చోటుకు మార్గం.☝️_*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి