*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*596 వ రోజు*
అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము
పామువాదన
వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో " అన్నా ! ఇందు నాతప్పు ఏమీ లేదు మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు " అని పలికింది పాము. బోయ వాడు " మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నీన్ను చంపడం తప్పు కాదు " పామును చంపబోయాడు. పాము " అయ్యా ! కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా ! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది " అన్నది. బోయవాడు " బాగా చెప్పావు సర్పమా ! ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా ! వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా ! అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి " అన్నాడు. అందుకు పాము నవ్వి " అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు " అన్నది.
మృత్యుదేవతవాదన
అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి " సర్పరాజమా ! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి " అని మృత్యుదేవత పలికింది. పాము " నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని " అని " బోయవాడితో " అన్నా ! మృత్యు దేవత మాట విన్నావు కదా ! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా ! " అన్నది. బోయవాడు నవ్వి " నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు " అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి " మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మలఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించ వలసిన అవసరము ఏముంది " అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి " అన్నా ! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా ! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి ? కనుక ఆ పామును విడిచి పెట్టు " అన్నది. ఇందరి మాట విని బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా ! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే ! నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా ! " అని చెప్పాడు.
మృత్యుభయము
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి