🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*మంగళవారం 17 మార్చి 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *28వ భాగం*``
*నారద మహర్షి కథ*```
నారద మహర్షి తండ్రి బ్రహ్మదేవుని ఆహ్వానం మేరకు తన సహోదరులు, బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు, కర్దమ మహర్షి, దేవహూతిల తొమ్మిది మంది కుమార్తెలకు జరిగిన వివాహ మహోత్సవం చూడటానికి
వచ్చాడు.
శ్రీమహావిష్ణువు అంశ అయిన కపిల మహర్షిని దర్శంచుకున్నాడు.
కపిల మహర్షి బోధించిన అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరి దర్శనం కోసం తపస్సు చేయాలని నారదుడు మానస సరోవర తీరానికి వెళ్లాడు. చాలాకాలం నారాయణమంత్రం జపిస్తూ కఠోర తపస్సు చేశాడు. నారాయణుడు ప్రసన్నుడైనాడు. నారదుని పరీక్షించి అనుగ్రహించాలని మానస సరోవరంలో హంస రూపం దాల్చి తీరాన తపస్సులో ఉన్న నారదుని ముందుకు వచ్చి “నారదా! నారదా!” అని మధుర స్వరములో పిలిచాడు.
చెవులకు మృదుమధురంగా తన పేరు వినిపించడంతో కన్నులు తెరచి హంసను చూసి ఆశ్చర్యపడ్డాడు. మరింతవిస్మయానికి గురి చేస్తూ ఆ హంస మానవ భాషలో “నారదా! నీ కఠోర తపస్సు చూస్తుంటే ముచ్చట వేస్తోంది, ఆందోళన కలిగిస్తోంది. ఎవరి అనుగ్రహం కోసం అన్నపానాదులు, సమస్త సుఖాలు వదిలివేసి దేహాన్ని శుష్కింపచేసుకుంటూ తపస్సు చేస్తున్నావు?” అని అడిగింది.
నారదుడు “హంసరాజమా! మానవ భాషలో పలుకుతూ ఆశ్చర్యపరుస్తున్నావు. ఎవరు నీవు? నాకఠోర తపస్సుకి జాలిపడుతున్నావు. శ్రీమన్నారాయణుని అనుగ్రహం కోసం చేస్తున్న తపస్సు ఎందుకు ఆపుతున్నావు?" అని ప్రశ్నించాడు.
హంస “నారదా! అనాదికాలం నుండి ఈ మానస సరోవరంలో ఉంటున్నాను. ఈ మానస సరోవరం బ్రహ్మ మానసం నుండి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు నారాయణుని నాభికమలం నుండి జన్మించాడు. నిత్యం బ్రాహ్మి ముహుర్త సమయంలో బ్రహ్మదేవుడు ఈ మానస సరోవరానికి వచ్చి స్నానం చేసి నారాయణ మంత్రం జపం చేస్తూ ధ్యానంలో నిమగ్నుడవుతాడు.
ధ్యానంలో ఆనాడు చేయబోయే సృష్టికార్యంగురించి ఆలోచిస్తాడు. సృష్టించబోయే జీవుల పూర్వ, పరాజన్మలను దివ్య జ్ఞాన దృష్టి తో వీక్షిస్తాడు. పిదప బ్రహ్మలోకం వెళ్లి జీవసృష్టి ప్రారంభిస్తాడు. నిత్యం బ్రహ్మదేవుడు చేసే ధ్యాన దీక్షను నేను ఆసక్తితో గమనించేవాడిని. ఆ క్రమంలో నాకు తెలియకుండానే అప్రయత్నంగా బ్రహ్మ దేవుని దివ్యజ్ఞానశక్తి నాకు కలిగింది. జీవుల భూత వర్త మాన భవిష్యత్తులు చూడ గలిగిన దివ్య దృష్టి వచ్చింది.
ఆ దివ్యదృష్టితోనే నీ విషయం తెలిసి నిన్ను పలకరించడానికి వచ్చాను" అని పలికింది.
హంస మాటలు నమ్మలేక “హంసరాజమా! నిజంగా నీవుబ్రహ్మదేవునికి గల దివ్యజ్ఞానదృష్టి కలిగి ఉన్నావా? అయితే నాపూర్వ జన్మవృత్తాంతం చెప్పు" అని అడిగాడు.
నారదునిలో తాను బ్రహ్మమానస పుత్రుడిని అనే అహంకారం ఉంది. తాను బ్రహ్మ నుంచి మాత్రమే జన్మించానని, తనకు పూర్వ జన్మలు లేవని నమ్మకం.
హంస నారదుని అహంకారపు మాటలకు నవ్వి నమ్మకాన్ని పటా పంచలు చేస్తూ "నారదానీపూర్వ జన్మ గురించి నాకు బాగా తెలుసు. చెబుతాను. వినుము. గడచిన మహాకల్పంలో నీవు ఒక గంధర్వుడుగా జన్మించావు. నీ తండ్రి మహావిష్ణువుకి పరమ భక్తుడు. నిరంతరం నారాయణ అష్టాక్షరి మంత్రోపాసన చేసే వాడు. ఆయన భక్తికి మెచ్చి వైష్ణవాంశతో పుత్రుడిగా జన్మించావు.
నీ నామధేయము ఉపబహర్హణుడు. శ్రీహరి అంశావతారమైన నీవు అపూర్వ సౌందర్యం,గాత్రం కలిగి ఉండేవాడివి. నీ గంధర్వ మధురగానం అందరినీ ఆకర్షించేది. స్త్రీలు నీ సౌందర్యం, గాత్రం,బుద్ది చాతుర్యం,మాటకారితనం చూసి అమితంగా ప్రేమించేవారు. నీ చుట్టూ చేరేవారు. నీవు నీతండ్రి హితోక్తులు పక్కనపెట్టి, వైష్ణవాంశ అని మరచి పోయి భ్రమరంలా స్త్రీల చుట్టూ తిరిగేవాడివి. క్రమంగా దేహసుఖాలకు అలవాటు పడిపోయావు. విశ్వశాంతి కోసం సప్తర్షులు దేవవ్రతం అనే యాగం ఆరంభించారు. యాగప్రదేశంలో శ్రీమన్నారాయణ కథ గానం చేయడానికి ఆహ్వానం పై నీవు, నీ తండ్రి ఇతర గంధర్వులతో కలసి అక్కడకు వెళ్లారు. శ్రీమన్నారాయణ నామగాన సంకీర్తనతో యాగశాల పరవశించ సాగింది. గానం చేస్తున్న నీ దృష్టి అక్కడఉన్న అందమైన యోగినుల పై పడింది. అందరం గానమాధుర్యంలో మైమరచి ఉన్నసమయంలో నీవు ఆ యోగినుల వద్దకువెళ్లి నీ హావభావచేష్టలతో కామాసక్తిని ప్రదర్శించావు.
త్రికాలజ్ఞులైన మహర్షులు గమనించి ఆగ్రహం చెందారు. నిన్ను చూసి “ఉపబర్హణా! శ్రీమన్నారాయణ నామ గానామృతంతో పవిత్రమైన యాగ ప్రదేశాన్ని పరస్త్రీ వ్యామోహంలో అపవిత్రం చేసావు. ఫలితంగా నీవు నీ సహజ తేజస్సు కోల్పోయి భూలోకంలో మానవు నిగా జన్మించుము" అనిశపించారు.
ఫలితంగా నీవు గంధర్వ జన్మ వదలి భూమిపై ఒక వేద పండితుని గృహంలో సేవ చేసే స్త్రీకి పుత్రుడిగా జన్మించావు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి