🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*మంగళవారం 17 మార్చి 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣6️⃣7️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*167 వ రోజు*
*విరాట పర్వము ప్రథమాశ్వాసము*
*సహదేవుడు కొలువులో చేరుట*```
సహదేవుడు చేతిలో ముల్లుగర్రతో, తలమీద తాళ్ళ మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో.. “మహారాజా! నాపేరు తంత్రీ పాలుడు. నేను ఆల మందలను చక్కగా పెంచుతాను. నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలను. ఇంతకు ముందు ధర్మరాజు పాలనలో పశు పాలకుడిగా ఉండే వాడిని. నన్ను తమరి కొలువులో పశు పాలకునిగా నియోగించండి” అని కోరాడు.
విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశు పాలకుడిగా నియోగించాడు.
ఈ విధంగా పాండవులు అయిదుగురు కొలువులో చేరారు.```
*ద్రౌపది అంత:పురంలో చేరుట*```
ద్రౌపది సైరంధ్రి వేషానికి తగినట్లుగా తలకు కొప్పు పెట్టుకుంది. మాసిన చీర కట్టుకుంది. దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాటనగర రాజవీధిలో నడుస్తూ అంత:పురం చేరుకుంది. ఆ సమయంలో విరాట రాజపత్ని సుధేష్ణాదేవి విహారనిమిత్తం రాజప్రాసాదం పైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరంధ్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకు రమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుధేష్ణ సముఖానికి తీసుకు వచ్చారు. సుధేష్ణ ద్రౌపదితో “మానినీ నీవు ఎవరు? ఏమి కులం? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు?” అని అడిగింది.
ద్రౌపది “అమ్మా! సైరంధ్రీ జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింప బడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. నాకు ఇంకొక్క వ్రతం ఉంది. మీరు ధర్మ వర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్దా, పాండవ పత్ని ద్రౌపది వద్దా పనిచేసాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను ముడువ గలను” అన్నది.
ఆమెను అంతఃపురంలో చేర్చుకోవడానికి సుధేష్ణకు కొంత సందేహం ఉంది “సైరంధ్రీ! నీవు అందగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏమి చేయాలి? ఆడవాళ్ళే నీపై చూపు మరల్చలేక పోతున్నారే ఇక మగవాళ్ళ విషయం చేప్పేదేముంది. నిన్ను అంతఃపురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే” అన్నది సుధేష్ణ.
ద్రౌపది “అమ్మా! తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు వారిని సంహరిస్తారు. కనుక ఎవరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచ బుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కాని నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను. నీచపు పనులు చేయను” అని పలికింది.
సైరంధ్రి మాటలకు సుధేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు,ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.```
*విరాట పర్వము*
*ప్రథమాశ్వాసము సమాప్తం*
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి