10, మార్చి 2026, మంగళవారం

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 9 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                

                *20వ భాగం*


            *కాల గణనం*```


శివుడు “భూలోకంలో నీకు విగ్రహాలు, ఆలయాలు, పూజలు ఉండవు” అని చెప్పి వెళ్లిపోయిన తరువాత బ్రహ్మ నిశ్చేష్టుడయ్యాడు. తపస్సుకని వెళ్లిన మానస పుత్రులు తిరిగి రాలేదు. సమయం గడచిపోతోంది. 

బ్రహ్మకాలమానం ప్రకారం బ్రహ్మకు పగటి కాలం గడచిపోసాగింది. రాత్రి సమీపిస్తోంది. మార్గదర్శనం కోసం శ్రీహరి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.


శౌనకాది మునులు సూత మహర్షిని కాలగణనం గురించి వివరించమని అడిగారు. బ్రహ్మదేవుని కాల గణనం గురించి కూడా చెప్పమని కోరారు.


*సూత మహర్షి ఇలా కాల గణనం వివరించి చెప్పాడు..


‘బ్రహ్మ కాలమానం ప్రకారం బ్రహ్మకు పగలు ఏడు మన్వంతరాలు, రాత్రి ఏడు మన్వంతరాలు కలిపి బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. మూడు వందల అరవై రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుష్యు వంద సంవత్సరాలు.


*ఇక భూలోక కాలమానం: ఒక లఘువు పలికే కాలం లేదా కనురెప్ప మూసి తెరిచే కాలం ఒక నిమిషం అవుతుంది. పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట అవుతుంది. ముఫై కాష్టలు ఒక కళ. ముఫై కళలు ఒక క్షణం. పన్నెండు క్షణాలు ఒకముహుర్తం. ముఫై ముహుర్తాలు ఒక పగలు, 

ఒక పగలు, ఒక రాత్రి అనగా ఒక రోజు.


పదిహేను రోజులు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. రెండు నెలలు ఒక ఋతువు. మూడు ఋతువులు అనగా ఆరు నెలలు ఒక ఆయనం. రెండు ఆయనాలు అనగా ఉత్తరాయనం, దక్షిణాయనం కలిపి ఒకసంవత్సరం. దేవతలకు మానవుల ఒక సంవత్సరం ఒక రోజు ఔతుంది (పగలు, రాత్రి). దీనిని సౌరమానం అంటారు.


ఇక యుగాల గురించి చెప్పుకుంటే నాలుగు లక్షల ముఫై రెండు వేల సంవత్సరాలు(4,32,000) కలియుగం యొక్క సమయం. 

ద్వాపరం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు (8,64,000 కలియుగానికి రెట్టింపు 4,32,000 x2). 

త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరువేల సంవత్సరాలు (12,96,000 అనగా కలియుగ కాలానికి మూడింతలు 4,32,000 x3), కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు (17,28,000 అనగా కలియుగానికి నాలుగింతలు 4,32,000 x4). 


నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. మహాయుగ కాలం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు. వేయి మహాయుగాలు బ్రహ్మ ఒక దినము (పగలు+ రాత్రి) అవుతుంది.


బ్రహ్మ పగలు సృష్టి,, రాత్రి ప్రళయం. దీనిని నైమిత్తిక సృష్టి, నైమిత్తిక ప్రళయం కలిపి నైమిత్తిక కల్పము అంటారు. ఇటువంటి ముప్ఫై దినములు బ్రహ్మకి ఒక నెల. పన్నెండు నెలలు ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుఃపరిమాణం నూరు సంవత్సరాలు. దీనిని మహాకల్పం అంటారు. మహాకల్పానికి పూర్వార్థాన్ని పద్మ కల్పం, ఉత్తరార్ధానికి వరాహ కల్పము అని సంజ్ఞలు.


అధిదేవతల ననుసరించి ఏర్పడిన కల్పములు నాలుగు ఉన్నాయి:


*బ్రహ్మ కల్పము : పరబ్రహ్మ స్వయంభువుడై సృష్టి స్థితి లయములు చేసిన కాలము.


*విష్ణు కల్పము : పరబ్రహ్మము నుండి అవతరించిన మహావిష్ణువు ప్రధాన అధిదేవతగా సృష్టి స్థితి లయ కార్యాలు చేసిన కాలము.


*రుద్ర కల్పము : పరబ్రహ్మము రుద్రుడిగా ప్రధాన అధిదేవత అయి సృష్టి స్థితి లయ కార్యాలు చేసిన కాలము.


*దేవి కల్పము లేదా పద్మ కల్పము : పరబ్రహ్మమునకు అర్థశరీరమైన నారి శక్తిరూపిణిగా అనగా పరాశక్తి అధిదేవతగా సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వర్తించిన కాలము.


పరబ్రహ్మము సంకల్పించిన సృష్టి సంపూర్ణంగా మహాశూన్యంలో లీనమవ్వడాన్ని మహాలయం అంటారు. మహాలయము జరిగినప్పుడు సృష్టి అనేది ఉండదు. సమస్తము పరబ్రహ్మంలో లయమై మహాశూన్యం ఏర్పడుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మము ఒక్కడే ఉంటాడు. మహాలయ కాలము పరబ్రహ్మానికి ఒక రాత్రి. పరబ్రహ్మము తిరిగి సృష్టికి సంకల్పం చేసినపుడు పగలు ఆరంభమవుతుంది. పరబ్రహ్మ తత్త్వమునకు కాలగణనము వర్తించదు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: