13, మే 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*



       *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

               *87వ భాగం*


      *శ్రీరామావతారం-8*


       *రావణ సంహారం*```


లంకకు సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లి ఆశోకవనంలో 

బందీగా రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. సీత మనస్సు మార్చి తనను భర్తగా అంగీకరించేట్టు చేయడానికి రావణుడు అనేక విఫల ప్రయత్నాలు చేసాడు. సీతాదేవి రావణుని గడ్డిపోచగా తృణీకరించి “తనభర్తరాముడేనని, త్వరలో అన్వేషించి రావణుని సంహరించి తీసుకువెళ్ళతాడని, ప్రాణాలు కావాలంటే తనను మర్యాదగా రామునికి అప్పగించ మని" హెచ్చరించింది.


రావణుడు ఆగ్రహంతో సీతకు మనస్సు మార్చుకోవడానికి పన్నెండు మాసాలు గడువు ఇచ్చాడు. మనస్సు మార్చుకోక పోతే ఆమెను చంపి కాపలా ఉన్న రాక్షస స్త్రీలకు ఆహారంగా వేస్తానని హెచ్చరించి వెళ్లి పోయాడు.


సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులు శబరిమాతసూచించినట్లు ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరి వెళ్లారు. 


పర్వతంపైనుండి ధనుర్బాణములు ధరించివస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు "అన్న వాలి తనను చంపడానికి పంపించిన వీరులని" ఆందోళన చెందాడు. 


సుగ్రీవుని మంత్రి అయిన హను మంతుడు "నేనువిషయంతెలుసుకు వస్తానని" భరోసాఇచ్చి బ్రాహ్మణుని వేషంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు.


లక్ష్మణుడు "తాము అయోధ్య రాజకుమారులైన రామలక్ష్మణులమని, వనవాసంలోఉన్న తమను మోసం చేసి వదినగారైన శ్రీరాముని పత్ని సీతాదేవిని రావణుడు అపహరించాడని, సీతాన్వేషణలో శబరి మాత సూచన ప్రకారం సుగ్రీవుని సహాయం కోరుతూ వచ్చామని" చెప్పాడు.


ఆరాధ్యునిగా చిన్నతనం నుండి మనస్సులో కొలుస్తున్న శ్రీరాముడు ఎదురుగా కనపించేసరికి హనుమంతుడు మహదానంద భరితుడు అయ్యాడు. నిజరూపం దాల్చి "తనను సుగ్రీవుని మంత్రి హనుమంతుడిగా" పరిచయం చేసుకున్నాడు. 


కలలో కనిపించిన శ్రీరాముని బాల్యం నుండి ప్రభువుగా ఆరాధిస్తున్న సేవకుడనని, దర్శన భాగ్యం ఇన్నాళ్లకు కలిగిందని శ్రీరాముని పాదాలకు భక్తితో నమస్కరించాడు. 


రాముడు ఆంజనేయుని లేపి ఆలింగనం చేసుకున్నాడు.


హనుమంతుడు తన ఆకారం పెంచి రామలక్ష్మణులను భుజాల పై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం పైన గల సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. సుగ్రీవునితో మైత్రి కోసం వచ్చారని అయోధ్య రాజకుమారులు శ్రీరామలక్ష్మణులను పరిచయం చేసాడు. 


శ్రీరాముడు "రావణుడు తన భార్య సీతను మోసంతో అపహరించాడని, సీతాన్వేషణలో సహాయం చేయమని" సుగ్రీవుని అడగగా సుగ్రీవుడు "అన్నగారైన వాలి తనను అనుమానించి రాజ్య బహిష్కరణ చేసి, తన భార్య రుమను బలవంతంగా చెఱపట్టడమే కాకుండా తనను చంపడానికి ప్రయత్నం 

చేస్తున్నాడని" తన గురించి చెప్పాడు. 


అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులు మైత్రీబంధం ఏర్పరచుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రమాణం చేసారు.


రావణుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకువెళుతున్నప్పుడు రామునికి తన జాడతెలియజేయాలని జారవిడిచిన ఆభరణాల మూట ఋష్యమూక పర్వతం పైన పడ్డాయి. సుగ్రీవుడు ఆ మూట తెచ్చి ఆ ఆభరణాలను "ఒక స్త్రీని రాక్షసుడు బంధించి ఆకాశమార్గాన దక్షిణ దిశ వైపు తీసుకు వెళ్లుతునప్పుడు రక్షించ మని వేడుకుంటూ కిందకి పడ వేసింది" అని రాముడికి చూపించాడు.


రాముడు ఆ ఆభరణాలు సీతవేనని గుర్తు పట్టి బాధపడ్డాడు. సీతను ఎక్కడ దాచినా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ముందుగా సుగ్రీవుని సమస్య పరిష్కరిస్తానని వాలిని ద్వంద్వ యుద్దానికి పిలవమని చెప్పి పంపాడు. వాలి సుగ్రీవులు యుద్దం చేస్తుండగా సమయం చూసి చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని సంహరించాడు. లక్ష్మణుని సుగ్రీవుని వెంట కిష్కింధకు పంపి వానర రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. వానకాలం ముగిసిన పిమ్మట సీతాదేవి అన్వేషణ ప్రారంభించుదామని, అందుకు వానరులను సమీకరించి సిద్దం చేయమని చెప్పాడు.


వానకాలం తరువాత సుగ్రీవుడు సమీకరించిన వానర సేనలను నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు సీతాన్వేషణ నెలలోపు చేసి రమ్మని పంపారు. దక్షిణదిశ వైపు వెళుతున్న హనుమంతునికి రాముడు తన అంగుళీయకము గుర్తుగా సీతాదేవికి చూపించమని ఇచ్చి పంపాడు. 


సీతాదేవిని వెతుకుతూ దక్షిణ సముద్ర తీరం చేరిన హనుమంతుడి బృందానికి జటాయువు అన్న శంపాతి అక్కడకు సముద్రంలో వందయోజనాల దూరంలో ఉన్న లంకలో రావణుడు సీతను బంధించి ఉంచాడన్న సంగతి తెలిపాడు.


హనుమంతుడు గాలిలో ఎగిరి దక్షిణ సముద్రాన్నిఆకాశమార్గాన దాటి లంక చేరి సీతాదేవి జాడ కనుగొని ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి త్వరలో రాముడు వానర సేనలతో వచ్చి రావణుని సంహరించి ఆమెను తీసుకు వెళతాడని భరోసా ఇచ్చాడు. రామునికి గుర్తుగా చూపించడానికి సీతాదేవి నుంచి చూడామణి ని తీసుకున్న హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించి బందీగా రావణుని కలిసి బతికి ఉండాలంటే సగౌరవంగా సీతను రామునికి అప్పగించమని సలహా ఇచ్చాడు.


తిరస్కరించిన రావణుడు విభీషణుని సూచనపై చంపకుండా తోకకు నిప్పు పెట్టి హనుమంతుని వదిలి వేశాడు. హనుమంతుడు ఆ నిప్పుతో సగం లంకను ఆయుధాగారాలతో సహా కాల్చి వేసాడు. కిష్కింధకు తిరిగి వచ్చి రామునికి సీతజాడగురించి చెప్పి చూడామణి ఇచ్చాడు. రాముడు హనుమంతుని కౌగిలించుకుని భరతునితో సమానంగా సోదరుడిని చేసుకున్నాడు.


రామలక్ష్మణులు సుగ్రీవుడి వానర సేనలతో కలసి దక్షిణ సముద్ర తీరం చేరి సముద్రం పై వారధి నిర్మించి లంక చేరారు. సీతను అప్పగించి యుద్దం నివారించమన్న తమ్ముడు విభీషణుని రావణుడు ఆగ్రహంతో రాజ్యం నుండి బహిష్కరించాడు. విభీషణుడు రాముని వద్దకు వెళ్లి శరణు కోరాడు. విభీషణుని రాముడు ఆదరించి రావణ సంహారం తరువాత లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు.


ఆఖరి ప్రయత్నంగా చేసిన అంగద రాయబారం విఫలం అవ్వడంతో రామరావణ సంగ్రామం ఆరంభమైంది. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన కుమారులు, బంధువులు, సేనాధిపతులు, ఆశేష రాక్షస సైన్యం యుద్దంలో మరణించారు. చివరకు రావణుడు కూడా ఘోర యుద్దంచేసి రాముడి బాణానికి నేల కూలాడు. చని పోబోతున్న చివరి క్షణాలలో రాముని నారాయణుడుగా గుర్తించాడు. సనకసనందాది మునుల శాపానికి గురై నారాయణుని శత్రువులుగా జన్మించిన రెండవ జన్మ ముగిసినందుకు రామునికి మనస్సులో నమస్కరిస్తూ ప్రాణాలు వదిలేశాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: