27, ఏప్రిల్ 2021, మంగళవారం

హనుమజ్జయంతి

 _*హనుమజ్జయంతి ఎప్పుడు జరుపుకోవాలి ? హనుమజ్జయంతి రోజు ఆంజనేయ స్తోత్రాలను స్తుతిస్తే ?*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


హనుమజ్జయంతి చైత్రంలోనా , వైశాఖంలోనా.. ఎప్పుడు చేసుకోవాలనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. అలాంటి వారు ఈ కథనం చదివితే సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు. అదే రోజున హనుమజ్జయంతి చేసుకోవాలి. 


అయితే కొన్ని ఐతిహ్యాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమజ్జయంతిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. 

 

అలాగే చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని జయంతి జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున మళ్లీ హనుమజ్జయంతి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు. 

 

హనుమజ్జయంతిని వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. *"కలౌ పరాశర స్మృతి:"* అని శాస్త్రాలు చెప్తున్నాయి. 

 

*శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే* 

*పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||* అని చెప్పబడింది. దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమజ్జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా , ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

fb నుండి సేకరించబడినది

మహాభారత తాత్పర్యము

మహాభారత తాత్పర్యము

ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.

ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.

అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.

మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.

మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్‌ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్‌ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.

ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్‌ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్‌ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.

కోవెల సువ్రసన్నాచార్య

విశ్వం నాద మయం

 David Hawkins యొక్క అద్భుతమైన అధ్యయనం సారాంశం:

నేను చెప్పే విషయం ఆధ్యాత్మికులు అర్థం చేసుకో గలుగుతారు. మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని ఆశిస్తాను.


ఈ పూర్తి విశ్వం నాద మయం. సృష్టిలోని ప్రతీ వస్తువూ, జీవి ఒక నిర్దుష్టమైన ప్రకంపన సామర్థ్యాన్ని అంటే vibrating frequency కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనందరిని భయపెడుతున్న covid వైరస్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. దాని vibrating frequency 5.5 Hz ఉంటుంది. ఇది 25Hz vibrating frequency దగ్గర మానలేదు. 


ఇంతకు మించిన ప్రకంపన సామర్థ్యం కలిగిన వారిలో covid పెద్ద ప్రమాదకారి కాదు. కేవలం కాస్త ఆనారోగ్యం కలిగించ గలదు అంతే. చాలా త్వరగా కోలుకుంటారు. 

అంటే ఇప్పుడు అందరూ పెంచుకోవాల్సింది vibrating frequency. 


ముందు మనుషుల్లో vibrating frequency ఎందుకు తగ్గుతుందో తెలుసుకుందాం. 

భయం

ఫోబియా

అనుమానం

ఆందోళన

ఒత్తిడి

కోపం

ద్వేషం 

దురాశ

మోసం

బాధ

విపరీతమైన మోహం... 

వంటివి మనలోని ప్రకంపనా సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.


ప్రస్తుతం భూమండల సగటు vibrating frequency 27.4Hz. 

Hospitals, cellarls, జైళ్ల వంటి కొన్ని ప్రదేశాలు చాలా తక్కువ frequency లో ఉంటాయి. వీటి frequency దాదాపు 20hz ఉంటుంది.  లేదా అంతకంటే తక్కువ ఉంటుంది. ఇలాంటి చోటుల్లో వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. అలాగే తక్కువ vibrating frequency కలిగిన మనుషుల్లో వైరస్ ప్రాణాంతకం అవుతుంది. 


భావోద్వేగాల frequency

మనుషుల్లో ఉండే భావోద్వేగాలు ఎంత ఫ్రీక్వెన్సీ తో vibrate అవుతాయో ఒక సారి చూద్దాం

బాధ - 0.01 Hz

భయం - 0.2 - 2.2

చికాకు -  0.9 - 6.8

చప్పుళ్ళు - 0.6 - 2.2 

గర్వం - 0.8 

దర్పం - 1.9

ఇవ్వన్నీ తక్కువ స్థాయి frequency తో ఉండే భావోద్వేగాలు. 

వీటి వల్ల మనుషుల vibrating frequency చాలా పడిపోతోంది. ఫలితంగా నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. ప్రస్తుతం ఇది చాలా ప్రమాదకరం. 


ఏదీ మంచిది?

ఎక్కువ frequency కలిగిన ప్రవర్తన అలవరచుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఎటువంటి ప్రవర్తన ద్వారా అది సాధ్యమో చూద్దాం.

దయ - 95 Hz

కృతజ్ఞత -250

సహనుభుతి - 150

షరతులు లేని ప్రేమ - 250hz ప్రేమించటం, కృతజ్ఞత కలిగి ఉండటం, క్షమించడం, కళాసాధన, యోగ, ధ్యానం, సూర్య రష్మీలో నడవటం, ప్రకృతి ఆరాధన వంటి చిన్న చిన్న సాధనలతో మనం high frequency లో vibrate కావచ్చు. 


సహజమైన ఆహారం తీసుకోవడం ద్వారా, అంతెందు స్వఛ్చమైన నీటిని తాగడం ద్వారా మనం మన vibrating frequency ని పెంచుకోవచ్చు. కేవలం కొద్ది సమయం దైవ సాన్నిధ్యం లో గడపడం ప్రార్థన చెయ్యటం ద్వారా 120 నుంచి 35O Hz వరకు మన ఫ్రీక్వెన్సీ ని పెంచుకోవచ్చు. 


ఆలస్యం వద్దు ఇక ఆ పనిలో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. పదండి... నవ్వుదాం, నవ్విద్దాం, ప్రేమిద్దాం, ఆడుదాం, పాడుడాం, ధ్యానిద్ధాం, పూజిద్దాం, సకల సృష్టి తో అనుసంధానమై కృతజ్ఞత కలిగి మెలుగుదాం. మన vibrating frequency ని పెంచుకుందాం. 


(ఈ సమాచారం మొత్తం power vs force అనే పుస్తకం నుంచి సేకరించింది. ఇది డేవిడ్ హాకిన్స్ రాసిన doctoral thesis లోనిది. )

26, ఏప్రిల్ 2021, సోమవారం

మృత్యుంజయ మంత్రం*

 *మహా మృత్యుంజయ మంత్రం*

=======================


*ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* |

*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్* || *ఓం* ||

(శుక్ల యజుర్వేద సంహిత, 3.60)


సుగంధం వెదజల్లే అన్నాన్నిచ్చి పోషించేవాడు, త్రినేత్రుడూ అయినా పరమశివుడిని ఆరాధిస్తూ- 

ఈశ్వరా! తొడిమ నుంచి దోస పండులా సంసారబంధం నుంచీ, మరణం నుంచీ, అశాశ్వతం నుంచీ నన్ను విడిపించు ఆత్మస్థితి నుంచి మాత్రం వీడిపోకుండా చూడమని ప్రార్థిస్తుందీ మంత్రం. మహామృత్యుంజయమంత్రంగా చెప్పబడిన ఈ మంత్రంలో అద్భుత అంతరార్థం దాగుంది. 

మృత్యుంజయమంటే మరణాన్ని జయించడం అని అర్థం. జీవితం జనన మరణ బంధనం. *మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు.* శరీరం నుంచి ప్రాణం వీడిపోవడం మరణం. కానీ జీవించి ఉన్నప్పుడే బుద్ధిపూర్వకంగా ప్రాణం అశాశ్వతం అనీ, ఆత్మయే శాశ్వతమనే అనుభూతిని పొంది, తమతమ కర్తవ్యాలను నిర్వర్తించడమే మరణాన్ని జయించడం. భ్రమల్లో బతుకుతూ, కాలయాపన చేస్తూ జీవిత సత్యాన్ని మన అంతరాత్మ పదేపదే గుర్తుచేస్తున్నా పట్టించుకోకుండా అసంతృప్తితోనే జీవితమంతా బతుకుతాం. అశాంతితోనే మరణాన్ని ఆశ్రయిస్తాం. ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించగలిగితే తారతమ్యాలూ, విభేదాలకు తావుండదు. సర్వసమానత్వ భావనతో ప్రపంచమంతా ఏకమై జీవిస్తుంది.

కర్మకు బాధ్యులు

 **మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...


ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 

మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 


*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*


పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 

మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...

ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...


మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...


"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."


నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 

అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...


_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు...

                        *🌹శుభమస్తు🌹_*

       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అరచేతిలో తీర్ధాలు

 *🤲అరచేతిలో తీర్ధాలు🤲*



అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.

ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.


కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని


"ఓమ్ కేశవాయస్వాహా, "

"ఓమ్ నారాయణాయస్వాహా, "

"ఓమ్ మాధవాయస్వాహా ",

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 

ఈ సందర్భంలోని


ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.


చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే

బ్రహ్మతీర్థం అని అంటారు. 


చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.


అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 

దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 


చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ

కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.


ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.


ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము. కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.


సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 

పితృతీర్థం అనబడుతున్నది.


ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

🙏🏻

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*మాలకొండ లో తపస్సాధన..*


*(తొమ్మిదవ రోజు)*


"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం

అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ హస్తముద్రాం

శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"


"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 


అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..


శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..


ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..


పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..


కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..


మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..


"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..


చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..


చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

25, ఏప్రిల్ 2021, ఆదివారం

కరోనా వ్యాధి లో CT స్కాన్

 కరోనా వ్యాధి లో CT  స్కాన్ (సిటీ స్కాన్) గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి 👇


ఇవాళ  చాలామందికి కరోనా ఉన్నదా ? లేదా ? అని తెలుసుకోవడానికి మరియు 

కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది , ఎంత తీవ్రత వుంది అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్  చేస్తున్నారు.


ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి.


ఒకటి  CORADS

రెండు CT severity index


CORADS : దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటవి


CORADS ... 

అనేది సిటీ స్కాన్ ప్రకారము కరోనా ఉండే అవకాశాలు ఎంత ? అని మాత్రమే తెలుసుకోవడానికి వీలుంటుంది .


అంటే స్టేజ్ 1 నుంచి 6 వరకు పెరిగేకొద్దీ కరోనా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నది అని మాత్రమే చెబుతుంది ,  స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని మాత్రం కాదు.


CORADS 1... ఏమి ఇబ్బంది లేదు.

CORADS 2... సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది కానీ అది కరోనా వల్ల అయి ఉండకపోవచ్చు.

CORADS 3.. సిటీ స్కాన్ లో కొంచెం తేడా ఉంది లేదా నెమ్ము లక్షణాలు ఉన్నది కానీ అది కరోనా వల్ల లేదా వేరే జబ్బు వల్ల వచ్చిందా అని  తెలియడం లేదు.

CORADS 4.  సిటి స్కాన్ బాగాలేదు, సిటి స్కాన్ లో కనిపిస్తున్న ఈ లక్షణాలు చాలావరకు కరోనా వల్లనే అనిపిస్తుంది.

CORADS 5... ఇది ఖచ్చితంగా కరోనా అని సీటీస్కాన్ చెప్తుంది.

CORADS 6 ... సిటీ స్కాన్ లో నెమ్ము లక్షణాలు కనిపిస్తూ RTPCR లేక Rapid antigen test పాజిటివ్ ఉంటే అది stage 6 అవుతుంది.


So, ఈ CORADS క్లాసిఫికేషన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు వరకు సిటీ స్కాన్ చూసి కరోనానా? లేదా? అని చెప్పడానికి మాత్రమే పనికొస్తుంది , స్టేజ్ పెరిగితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది అని  ఏమాత్రం కాదు.


2 : CT severity index


మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటవి. ఒకటి కుడిపక్క ,  రెండవది ఎడం పక్క. ఈ కుడి పక్కన ఊపిరితిత్తిలో మూడు లోబులు ( మూడు భాగాలు ) ఉంటాయి అంటే మూడుగా విభజించబడి వుంటుంది, ఎడమ పక్క ఊపిరితిత్తిలో రెండు లోబ్స్ ఉంటాయి అంటే రెండు గా విభజించబడి ఉంటుంది.... మొత్తం రెండు ఊపిరితితతుల్లో  మనకు 5 భాగాలు గా ఉంటాయి.


ఈ సిటి సివియారిటి ఇండెక్స్ ( CT severity index ) 0 నుంచి 25 వరకు ఉంటుంది .అంటే ఒక్కొక్క లోబ్ లో 0 నుంచి 5 పాయింట్లు ఇస్తారు. 5 x 5... మొత్తం పాయింట్లు 25 అవుతుంది.


ఈ జీరో నుంచి ఐదు పాయింట్లు అనేది ఊపిరితిత్తులు ఎంత చెడిపోయింది అన్న దానిని బట్టి ఈ పాయింట్లు పెరుగుతాయి.


*0 : ఏమీ ఇన్ఫెక్షన్ లేదు

1 : 5% కన్నా తక్కువ గా ఉంది 

2 : 5 - 25  పర్సెంట్ 

3  :25 - 50% 

4 : 50-  75%

5 : 75 పర్సెంట్ కన్నా ఎక్కువగా దెబ్బతిన్నది*


సో ,  ఒక్కొక్క లోబ్ లో జీరో నుంచి ఐదు స్టేజి వరకు తీసుకొని 5 x 5 = 25 స్కోర్ అవుతుంది .

ఈ స్కోర్

8 కన్నా తక్కువ అయితే ...mild ( తక్కువగా వుంది )

 8 నుంచి 15 అయితే Modarate ( ఒకమొస్తరిగా)

15 కన్నా ఎక్కువ అయితే Severe ( ఎక్కవగా)


  ఊపిరితిత్తులు ఎంత దెబ్బతిన్నది అని తెలుసుకోవడానికి ఈ స్కోర్ ఉపయోగపడుతుంది .


కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అది ఆ రోజు సిటీ స్కాన్ చేయించిన రోజు ఎంత దెబ్బ తిన్నవి అని మాత్రమే తెలియజేసినది.

 వ్యాధి పెరుగుతున్నకొద్దీ ఈ స్కోరు  పెరుగుతుంది. 


అంటే డాక్టర్లు ఈ సిటీ స్కాన్ ని వ్యాధి పెరుగుతుందా లేదా అని మరియు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి మళ్ళీ చేయవలసి వస్తుంది.


కాని పెరుగుతుందా లేదా తెలుసుకోవడానికి డాక్టర్ని మాత్రమే సంప్రదించవలెను. సొంతంగా వెళ్లి సిటీ స్కాన్ చేయించుకున్న ఎడల డబ్బులు వృధా అవుతాయి , అనవసరంగా ఎక్కువసార్లు సీటీ స్కాన్ చేయించుకోవడం వల్ల రేడియేషన్ కూడా వస్తుంది.


 అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ pulse oximeter  చెక్ చేసుకుంటే మనం కూడా గమనించవచ్చు .


ఈ పల్స్ ఆక్సిమీటర్ లో SPO2 అనేది 93 కన్నా ఎక్కువ ఉండాలి, 


 93 శాతం కన్నా తక్కువ ఉంటే మన ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం లేదని అర్థం.


  సో , ఈ CORADS  క్లాసిఫికేషన్ స్టేజ్ 1 - 6   అనేది  కరోనా ఉండే అవకాశాలు ఎంత అని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అది వ్యాధి తీవ్రత తెలియజేయదు.


 CT Severity index ఊపిరితిత్తులు ఎంత దెబ్బ తిన్నవి వ్యాధి తీవ్రత ఎంత ఉంది అని తెలియజేస్తుంది.


ఈ సిటీ స్కాన్ లో  వ్యాది ఎలా వుంది ఎంత తీవ్రత వుంది అని చెప్పడానికి మరో నాలుగు పదాలు వాడుతూ ఉంటారు .


  ground glass appearance


   Crazy paving pattern


     Consolidation


      Gradual resolution 


  ఈ ground glass అనగా ఒక ఐదు రోజుల లోపు కరోనా అటాక్  అయివుంటుంది


 5 రోజుల నుంచి 10 రోజుల్లో ఈ క్రేజీ పేవింగ్ పేటరన్ కనిపిస్తుంది


 10 నుంచి 13 రోజులు లో కన్సాలిడేషన్ లాగా అనిపిస్తుంది 


14 రోజుల తర్వాత అయితే గ్రాడ్యువల్ రిజల్యూషన్ లా  CT స్కాన్ లో కనిపిస్తుంది.


ఇవన్నీ మనము కొంచెం సిటిస్కాన్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే ,పూర్తిగా అవగాహన కోసం డాక్టర్ ని సంప్రదించాలి.


copy post from whats app

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...  


*ఆశ్రమవాసం..ఆధ్యాత్మిక శిక్షణ..*


*(ఎనిమిదవ రోజు)*


వ్యాసాశ్రమం లో అడుగుపెట్టిన శ్రీ స్వామివారికి అక్కడి క్రమశిక్షణాయుత వాతావరణం నచ్చింది..తెల్లగా..సన్నగా ..తేజస్సు ఉట్టిపడుతున్న ముఖం తో ఉన్న ఆ బాల యోగి అందరినీ ఇట్టే ఆకర్షించాడు.. నియమిత ఆహారం..యోగ సాధన..నిరంతర భజనలు..భగవన్నామ సంకీర్తనమూ..సాధు సత్పురుషుల ఉపదేశాలూ..ఎటు చూసినా ఒకరకమైన భక్తి భావం తొణికిసలాడే ఆ ఆశ్రమం..శ్రీ స్వామివారికి అనువైన ప్రదేశం గా తోచడం లో ఆశ్చర్యం లేదు..


శ్రీ స్వామివారికి గురువులు బోధించే ఏ అంశమైనా క్షణాల్లో అవగతమైపోయేది..దానికి తోడు ఆయనకే స్వంతమైన ధారణ శక్తి తో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చే నేర్పు అలవడింది..శ్రోతలు మంత్ర ముగ్ధుల్లా వినేవారు..తనకు సందేహం వస్తే..గురువు దగ్గర వినయపూర్వకంగా అడిగి తెలుసుకునేవారు..చెరగని చిరునవ్వు తో ఉండటం..ఎటువంటి ప్రశ్నకైనా తడుముకోకుండా జవాబు చెప్పటం..గురువుల వద్ద వినయం తో ప్రవర్తించడం..తాను తెలుసుకున్న జ్ఞానాన్ని తోటి మిత్రులకు సులభ శైలిలో వివరించడం..మొదలైన గుణాల వలన అనతికాలంలోనే ఆశ్రమంలో ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోయారు..


సరిగ్గా ఆ సమయం లోనే..కొంతమంది ఆశ్రమవాసులు తదుపరి శ్రీ స్వామివారిని బోధగురువు గా నియమిస్తే బాగుంటుందని తలపోయసాగారు..ఆశ్రమానికి కూడా ఈ యువకయోగి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని ఆలోచన చేయ సాగారు..ఈ ఆలోచన వారి మదిలో ఎందుకు కలిగిందో తెలీదు కానీ..ఆనాటి నుంచి, శ్రీ స్వామివారిని ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించసాగారు..ఈ మార్పు శ్రీ స్వామివారి మనసుకు తోచింది..మూలకారణం ఏమిటో అని ఆరా తీశారు..ఆశ్రమవాసుల్లో కొందరు శ్రీ స్వామివారికి అసలు విషయం చెప్పారు..


శ్రీ స్వామివారు ఎంతో పరిణితి తో ఆలోచన చేశారు..తన జీవిత లక్ష్యం మోక్ష సాధన..అంతేకానీ ఆశ్రమ నిర్వహణ కాదు..మానవుని ఆధ్యాత్మిక పయనంలో అనేక బంధాలు అడ్డుపడతాయి..కీర్తి తో వచ్చే బంధాలు ("ఆయన లాంటి గురువు దొరకడం కష్టం అండీ..అంటూ ఆకాశానికి ఎత్తేసే రకం..)  కొన్ని..పదవుల తో (ఆశ్రమ నిర్వహణ, గురు పీఠం ఇత్యాదులు) వచ్చే బంధాలు కొన్ని..ఇలా వీటిలో చిక్కుకొని తన మార్గాన్ని తానే తప్పడం సుతరామూ ఆయనకు ఇష్టం లేకుండా పోయింది..క్రమంగా ఆశ్రమ వాసుల లో శ్రీ స్వామివారి మీద బాధ్యతలు మోపాలనే ఆలోచన బలపడసాగింది..ఈ ధోరణి శ్రీ స్వామివారి ధ్యానానికి అవరోధంగా మారింది..ఇక ఇక్కడ వుంటే..తనమీద ఏదో ఒక బాధ్యత పడక తప్పదు అని శ్రీ స్వామివారికి తేటతెల్లంగా తెలిసిపోయింది..


శ్రీ స్వామివారు ఆలోచన చేశారు..ముందుగా కొన్నాళ్ల పాటు వేరే ప్రదేశాలకు వెళ్లి వస్తానని ఆశ్రమవాసులకు చెప్పుకుని, గురువుల అనుమతి తీసుకొని బైటకు వచ్చారు..అలా చిత్తూరు జిల్లాలో "పాపానాయుడుపేట" అనే గ్రామానికి చేరారు..ఆగ్రామంలో "బాలబ్రహ్మం" అనే సాధువు శ్రీ స్వామివారిని చూసి.."ఈతడు సామాన్యమానవుడు కాదే..ఇలా తిరుగుతున్నాడేమిటి?.." అని తనలో తానే తర్కించుకుని, శ్రీ స్వామివారిని చేరదీసి..వాకబు చేశారు..బాలబ్రహ్మం ఏ నిమిషంలో శ్రీ స్వామివారిని కలిసాడో..శ్రీ స్వామివారికి అంతర్వాణి "ఇతడే నీ గురువు.." అని ప్రబోధించింది..శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసారు..


"లే నాయనా!..దారితప్పి, దిక్కుతోచక అల్లాడుతున్నావా?..ఇక నీకు భయం లేదు..నిత్యమూ, సత్యమూ అయిన సచ్చిదానంద స్వరూపాన్ని కనుక్కోవడానికి సాధన అవసరం..ముక్తి మార్గాన్ని తెలుసుకోవాలంటే ముందుగా నిన్ను నీవు శోధించుకోవాలి..పరమాత్మ తత్వాన్ని గ్రహించాలనే నీ తపన అర్ధమయింది..ఆత్మ ను గ్రహిస్తే..పరమాత్మ వశం అవుతాడు.." అని చెప్పి, తపస్సాధన చేయాల్సిన విధం చెప్పి..గురూపదేశం చేశారు..భగవన్నామ జపం చేసేటప్పుడు ప్రకృతి కల్పించే ఆటంకాలు, మాయా పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో వివరంగా తెలియచేసారు..


బాలబ్రహ్మం గారు చేసిన ఉపదేశం, శ్రీ స్వామివారిలో కొండంత మానసిక స్తైర్యాన్ని నింపింది..కొన్నాళ్ల పాటు ఆయనకు శుశ్రూష చేసి..తిరిగి ఎర్రబల్లె చేరారు..ఇక తపోసాధనకు అనువైన ప్రదేశం కావాలి..మోక్ష సాధన..మోక్ష సాధన..ఇదొక్కటే ఆయన మదిలో సుడులు తిరుగుతున్న ఆలోచన!..ఇదే తపన!..


భక్తుడు ఆర్తిగా తపిస్తుంటే..భగవంతుడు చూస్తూ ఊరుకోడు.. తన దగ్గరకు పిలిపించుకుంటాడు..మాలకొండ లో వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడు,  శ్రీ స్వామి వారి మొర ఆలకించాడు..శ్రీ స్వామివారికి అంతర్వాణి రూపంలో ఆదేశం వచ్చింది..ఒక్కక్షణం ఆలస్యం చేయలేదు.. పరుగు పరుగున మాలకొండ చేరారు..


మాలకొండలో తపోసాధన..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

Paata