15, జులై 2020, బుధవారం

కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంత మేలు జరుగుతుందా

ఒక పక్షి రెక్కలు లేక  తినడానికి  తిండి దొరక్క  తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది  
అటుగా ఓ పావురం  వెళ్లడం  చూసి  ఎక్కడకు  వెళ్తున్నావ్  అని అడిగింది

స్వర్గానికి వెళ్తున్నాను  అని చెప్పడంతో నాగురించి  దేవుడికి  విన్నవించావా  అని వేడుకుంది  
అలాగే అని చెప్పిన  పావురం అక్కడ స్వర్గపు  ద్వారపాలకులతో  పక్షి గురించి చెప్పగా  

ఆ పక్షి అదే స్థితిలో ఇంకా  ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా 

పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను  అని అడగగా
 "నువ్వు ఇచ్చిన  ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క  మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు 

అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి  వెళ్ళిపోయింది 

సరిగ్గా వారం తరువాత   పావురం దారిలో  వెళ్తూ  పక్షిని చూసింది 

చెట్టు చిగురించింది 
ఎడారిలో నీటి కొలను  వచ్చింది 
రెక్కలు వచ్చింది పక్షికి 
ఇప్పుడు హాయిగా  ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది  

ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని  మళ్ళీ స్వర్గం  వైపు  వెళ్లి అక్కడ వారిని అడిగింది 
ఏడేళ్లు కష్టపడుతుందని  అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది 

పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దాహంతో ఉండగా   దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
ఆకలితో ఉండగా  దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దేవుడు చలించిపోయాడు  జాలి చూపెట్టాడు ఏడేళ్ల  తన కష్టాన్ని ఏడురోజులకు  తగ్గించేసాడు 
అందుకే  ఇలా అని 

నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం  ఉందా  
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి  కృతజ్ఞత దేవుడా
***************

 "ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి"

సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు... దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

సేకరణ:డాక్టర్.యం.ప్రసాద్  
***********

ఆభరణం - కధ 
 ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లు నెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహకర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును' అన్నాడు. 

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. 

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. 

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. 

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 

'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. 

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. 

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం 
 రూపస్యాభర ణం గుణమ్‌ 
 గుణస్యాభరణం జ్ఞానమ్‌ 
 జ్ఞానస్యాభరణం క్షమా 

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. 

అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. 

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. 

కొందరు ఓటమి చవి చూసినప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. 

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. 

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనమయిన పనులు చేయడం తగనిది. 

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.

కామెంట్‌లు లేవు: