19, జులై 2020, ఆదివారం

ఒక చెడు ఒక మంచికే - కధ

*సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నావ అకస్మాత్తుగా ప్రమాదానికి గురయింది.*

*అందులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తూ బతికి బయటపడి ఒక కొయ్య దుంగ మీద తేలుతూ జన సంచారం లేని ఒక దీవిలోకి వచ్చి పడ్డాడు.*

*ఆ ప్రమాదం నుంచి రక్షించమని రోజూ భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు.

 *ఎవరైనా తనను రక్షించడానికి వస్తారేమోనని సముద్రం వైపు ఆశగా ఎదురు చూసేవాడు. కానీ ఎవరూ కానరాలేదు. చూసి చూసి విసిగి పోయాడు.*

*ప్రకృతి శక్తుల నుండి రక్షణ కోసం తేలుతూ వచ్చిన చెక్కలతో ఒక చిన్న గుడిసె నిర్మించుకున్నాడు. ️ఆ గుడిసెలో అలల తాకిడికి కొట్టుకువచ్చిన కొన్ని పనికొచ్చే వస్తువులు దాచుకున్నాడు.*

*ఇలా ఉండగా ఒక రోజు ఎంత తిరిగినా ఏమీ ఆహారం దొరకలేదు.* 

*తిరిగి గుడిసె దగ్గరకు వచ్చేసరికి అది తగలబడిపోయి పొగలు పైకి లేస్తున్నాయి.*  🔥

*తనకున్న ఒక్క ఆధారం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. అతనికి ఏం చేయాలో తోచలేదు. బాధతో కుంగిపోయాడు.*  

*తనకు పట్టిన దుర్గతిని తలుచుకుని దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు.

*తరువాత కొంతసేపటికి లేచి చూసేసరికి ఒక నావ అతనుండే దీవిని సమీపిస్తూ కనిపించింది.*

*అది అతన్ని రక్షించడానికే వచ్చిందని తెలిసింది. అతని ఆనందానికి అవధుల్లేవు.* 

*ఆ నావలోని వాళ్ళలో ఒకర్ని “నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది?” అని అడిగాడు.*

*“నువ్వు మంట పెట్టి  పొగ ద్వారా మాకు సంజ్ఞలు చేశావు కదా! దానిని గుర్తు పట్టే ఇక్కడికి రాగలిగాం” అన్నాడు.*

*ఒక్కోసారి మన ఆశల సౌధాలు ఇలాగే ఉన్నట్టుండి ఒక్కసారిగా తగలబడిపోవచ్చు. కానీ అదే మంటలు ఏ మంచికో సంకేతమూ కావచ్చు ............* 

 *ఎంత గొప్పవాళ్లకైనా వాన ఎప్పుడు వస్తుందో, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అలా తెలిస్తే మనిషి భయానికి, నిరాశకు లోనవుతాడు.* *ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మంచి - చెడు, సుఖం - దుఃఖం, కష్టం - నష్టం వస్తూ ఉంటాయి. ఏది జరిగినా, ఎప్పుడు జరిగినా అంతా మన మంచికే అనుకొని మనుషులు ఆటుపోట్లను తట్టుకొని జీవించాలి..........*      

కామెంట్‌లు లేవు: