28, ఏప్రిల్ 2021, బుధవారం

కనువిప్పు

 *కనువిప్పు*


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధుర్యొధనుడు భంగమైన వూరువులతో తన మృతువుకై ఎదురుచూస్తున్నాడు . పాండవులు ధుర్యొధనుణ్ణి ఆ తటాకంవద్దే వదిలిపెట్టి తమ తమ రధాలపై తిరుగు ప్రయాణమయ్యారు. బలరాముడు అక్కడ జరిగిన అధర్మ గధాయుద్దాన్ని ఖండిస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు.


కురుక్షేత్రం మొత్తం రక్తంతో తడిసిపోయినట్లుందక్కడ. కనుచూపుమేరలో అన్నీ శవాలే కనిపిస్తున్నాయి. ఎన్నో అక్షౌహిణీల సైన్యం, అశ్వాలు, రధాలు, గజములు.. అంతా విగతమై పడివున్నాయి. ఆ రోజే మరణించిన శకుని శల్యాదుల శవాలను తీసుకెళ్ళేవారులేక అనాధల్లా పడున్నాయి. అవన్నీ చూస్తుంటే అర్జునుడి మనసు విజయోత్సాహంతో వుప్పొంగుతోంది. అప్రయత్నంగా తన మీసాలమీద చెయ్యివేసి -


"బావా చూసావా.. కౌరవులు ఎలా నశించారో..?" అన్నాడు. శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు.


అర్జునుడు తన గాండివాన్ని ఒక్కసారి తడుముకున్నాడు. ఒక్కసారి భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా ఎలా తన అస్త్రాలకి బలైంది కళ్ళముందు కనపడినది. తను జయించాడు...కర్ణ వధానంతరం ఇక తనని ఎదిరించగలిగిన విలుకాడే ఈ భూమి మీదే లేడు..!!


అన్నిరధాలు రణరంగం మధ్యలో వున్న భీష్ముడి అంపశయ్య దగ్గరకు చేరాయి. ధర్మరాజు ఒక్క వుదుటన రధం కిందకు దూకి - "పితామహా.. పితామహా.. మేము జయించాం... కౌరవులందరూ నిహతులైనారు.." అన్నాడు.


భీష్ముడు దుఖ్ఖం పొంగుతుండగా కళ్ళు మూసుకున్నాడు.


"అయితే నాయనా నూర్గురు సోదరులని చంపినట్టేనా.." అన్నాడు. భీమసేనుడు వెంటనే అందుకున్నాడు -


"అవును పితామహా... సుయోధనుడి వూరువులను ఇప్పుడె భంగపరిచాను... గదా యుద్ధంలో తనకు ఎదురు లేదనుకున్న సుయోధనుడు నా చేతిలో హతుడైనాడు. నా ప్రతిజ్ఞలు నేరవేర్చుకున్నాను.. ఇక రాజ్య లక్ష్మి మా వశమైంది.."


"కురురాజ్యం అయితే ఇప్పుడు పాండవరాజ్యం అయ్యిందన్నమాట"


"అవును పితామహా.. ఇప్పుడు పాండవుల పరాక్రమాలు ప్రపంచానికి విదితమయ్యాయి.." నకులుడన్నాడు.


"నాడు కురురాజ్యసభలో చేసిన ప్రతిజ్ఞలు అన్నలు నెరవేర్చారు పితామహా.." సహదేవుడాన్నాడు.


భీష్ముడు నలుదిక్కులా కలయజూశాడు. "అర్జునా..." పిలిచాడాయన నెమ్మదిగా.


"చెప్పండి పితామహా.."


"నీవేమి చెప్పవేం..??"


"చెప్పేదేముంది పితామహా... నేను గెలిచాను.. మిమ్మల్ని పడగొట్టాను, కర్ణుణ్ణి వధించాను, ద్రోణుణ్ణి కూలగొట్టాను... ఇక రాజులమై అఖండ కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాము.."👍


"మంచిది నాయనా.. అవును వాసుదేవుడేడి..?" ఆ మాట వింటూనే శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి శాంతనునికి నమస్కరించాడు.


"పరంధామా.. నాకెందుకయ్యా నమస్కరిస్తావు.. ధర్మ పక్షాన నిలిచావు, ఆయుధంపట్టకుండా యుద్ధాన్ని నడిపావు. ఈ గెలుపంతా నీదే ముకుందా... నీకే మేమంతా నమస్కరించాలి."


ఆ మాటలువింటూనే అర్జునిడికి కోపం వచ్చింది. ఇదేమిటి పితామహుడు ఇలా అంటున్నాడు.


"యుద్ధం చేసిందంతా నేను.. నా ధనుర్విద్యతో ఎంతమంది సైనికులు మట్టిగరిచారు. ఎంతటి మహావీరులు నేలకొరిగారు. శ్రీకృష్ణుణ్ణి పొగిడితే పొగిడాడు నా గురించి ఒక్క మాటైనా అన్నాడా తాత." అనుకున్నాడు.


అంతా భీష్ముడికి నమస్కరించి తమ గుడారాల వద్దకు చేరారు. అందరు తమ తమ రధాలు దిగారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పార్ధసారధి స్థానం నుంచి దిగకుండా అర్జునుణ్ణి దిగమని సైగ చేసాడు. అర్జునుడు దిగగానే వాసుదేవుడు ఒకసారి రధం పైన వున్న ధ్వజం వైపు చూసాడు. జండా పై వున్న కపిరాజు హనుమంతుడు ఒక్కసారిగా దూకి రధమ్ముందు నమస్కరిస్తూ నిలబడ్డాడు.


"శ్రీరామచంద్రా... వాసుదేవా.. నాకెంతటి భాగ్యాన్ని ప్రసాదించావయ్యా... పార్ధుడి రధంపై ధ్వజమై నిలిపి నీ నోటివెంటవచ్చే భగవద్గీత విని నీ విశ్వరూప సదర్శనం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చావు. నీకు నా భక్తి పూర్వక ప్రణామాలు దేవదేవా.." అంటూ ప్రణమిల్లాడు హనుమంతుడు.


శ్రీకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూనే అర్జునుడి రధంపైనుండి దిగాడు. నెమ్మదిగా కొంతముందుకి వచ్చి రధంవైపు చూసి తన పిల్లనగ్రోవినెత్తి సైగచేసాడు.


అంతే... ఫెళ ఫెళ మంటూ రధం కుప్పకూలిపోయింది... రధ చక్రాలు తునాతునకలైయ్యాయి. రధాశ్వాలు భీకరమైన అరుపు అరుస్తూ నేలకొరిగాయి. అందరూ భయకంపీతులై చూస్తుండగానే రధం అశ్వాలతోసహా భస్మమైపోయింది. ఆ భయానకమైన చప్పుడు విని ధర్మరాజు "అర్జునా అర్జునా" అంటూ పరుగున వచ్చాడు.


అర్జునుడు భయపడుతూ "బావా వాసుదేవా.. " అంటూ కృష్ణుడి వద్దకు చేరాడు. "నీకేమికాలేదు కదా బావా.. ఏమిటిలా జరిగింది.." అన్నాడు ఖంగారుగా.


ఆ మాటలువింటునే కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. పక్కనే వున్న హనుమంతుడు గట్టిగా నవ్వాడు.


"ఆంజనేయా.. నా ఖంగారు నీకు పరిహాసంగా తోస్తున్నదా.." అన్నాడు అర్జునుడు. హనుమంతుడు మరింత గట్టిగా నవ్వి అన్నాడు -


"పార్థా.. నవ్వక ఏమి చెయ్యమంటావు. నిన్ను కాపాడిన పరమాత్ముణ్ణి నీవు పరామర్శిస్తుంటే నాకు నవ్వొచ్చింది."


"నన్ను కాపాడాడా..?"


"అవును అర్జునా... ఈ రధం ఇప్పుడుకూలిపోలేదు... భీష్మ బాణ ధాటికి నీ రధ చక్రాలు కూలాయి... కర్ణ అస్తాలకి నీ అశ్వాలు ఎప్పుడో మరణిచాయి.. నీ గురువు ద్రోణుడు ఆగ్రహజ్వాలల్లో నీ రధం ఎప్పుడో తునాతునకలయ్యింది... బ్రహ్మాస్త్ర ధాటికి నీ రధం యావత్తూ బూడిదయ్యింది..."


"మరి..?"


"నీ

రధంపైన సాక్షాత్తు ఆదివిష్ణువున్నాడు... ఆ పర్మాత్ముడి ఆజ్ఞలేక అన్నీ అలాగే నిలిచివున్నాయి. ఇప్పుడు వాసుదేవుడు అవరోహించడంతో ఆ అస్త్రాలు పనిచేసాయి. నీ రధం ముక్కలైంది. నువ్వు గెలిచాను గెలిచాను అని అనుకుంటున్న మహావీరుల అస్త్రాలు నీ పైన పనిచెయ్యలేదంటే దానికి కారణం తెలుసా.. అవి నిన్ను చేరాలంటే నీ కన్నా ముందు ఆసీనుడైన ఆ పరంధాముణ్ణి దాటి రావాలి కాబట్టి.."


హనుమంతుడు ఈ మాటలనగానే పాండవులకు తమ అజ్ఞానం బోధపడింది. పితామహుడు భీష్ముడు విజయాన్ని శ్రీకృష్ణుడి ఎందు ఎందుకు ఆపాదించాడో అర్థం అయ్యింది. అయిదుగురూ ఒక్కసారిగా శ్రీకృష్ణుడి పాదాలపై పడ్డారు.


"పరమాత్మా.. మా అజ్ఞానాన్ని మన్నించు తండ్రి.." అన్నాడు అర్జునుడు మనస్ఫూర్తిగా.

శ్రీకృష్ణుడు మళ్ళి మనోహరంగా చిరునవ్వు నవ్వాడు.


              💥 సర్వేజనా సుఖినోభవంతు💥

కామెంట్‌లు లేవు: