26, జులై 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆపత్కాలం..అన్నదానం..*


"ఒక ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందీ?.." పోయిన సంవత్సరం మార్చి నెల మధ్యలో..

ఎటువంటి ఉపోద్ఘాతమూ లేకుండా..నేరుగా నేను కూర్చున్న చోటికి వచ్చి అడిగాడు మధ్యవయసులో ఉన్న ఆ వ్యక్తి..ఆ వచ్చినతన్ని ముందు కూర్చోమని చెప్పి..కుర్చీ చూపించాను..


"మీ పేరు?.." అన్నాను..


"నా పేరు చంద్రశేఖర్..నెల్లూరు దగ్గర మా ఊరు.." అన్నాడు.."ఒకప్పుడు బాగా సంపాదించానండీ..రొయ్యల సాగు చేసి మంచి లాభాలే గడించాను..కానీ గత మూడేళ్ళుగా కలిసి రాలేదు..సంపాదించిందంతా నష్టపోవడమే కాకుండా..పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాను..ఈ మధ్యనే మళ్లీ అప్పుచేసి చెరువుల్లో సీడ్ వేసాను..ఈ పంట చేతికొస్తే నేను నిలబడతాను..లేకుంటే మరణమే శరణ్యం..అంత ఇబ్బందుల్లో వున్నాను.." అన్నాడు..


అంత కష్టం లో వుండి కూడా అన్నదానం చేయిస్తానంటున్నాడు..అదే అర్ధం కాక.."మీరు స్వామివారికి మ్రొక్కుకొని వెళ్ళండి..మీ కష్టాలు తీరిన తర్వాత వచ్చి అన్నదానం చేయించవచ్చు..ఇప్పుడు ఎందుకు?.."అన్నాను..


"గత ఐదు వారాలుగా నేను ఈ మందిరానికి వస్తున్నాను..శ్రీ స్వామివారికి నా కష్టం చెప్పుకున్నాను..ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరగడం చూస్తున్నాను..నేనుకూడా ఒకవారం అన్నదానం చేయిస్తే..నా కష్టాలు తీరుతాయేమోనని ఒక భావన నిన్నరాత్రి కలిగింది..ఇంట్లో మా ఆవిడ కూడా ఒక వారం అలా చేయించండి..మంచి జరగొచ్చు అని చెప్పింది..అందుకోసం అడుగుతున్నాను..ఎంత ఖర్చు అవుతుందీ?.."అన్నాడు..


మళ్లీ కూడా చెప్పి చూసాను..తన కున్న కష్టాలు తొలిగిన తర్వాతే అన్నదానం చేయించమని..అంతవరకూ శ్రీ స్వామివారిని నమ్మకంతో కొలవమని కూడా చెప్పాను..కానీ చంద్రశేఖర్ పట్టు బట్టాడు..వచ్చే ఆదివారం నాడు తాను ఆ ఖర్చు భరిస్తాననీ..చెప్పడమే కాకుండా ఆ ప్రక్క ఆదివారం నాటి అన్నదానపు ఖర్చంతా తానే భరించాడు..


సరిగ్గా మూడు నెలల అనంతరం ఆ చంద్రశేఖర్ సంతోషం తో మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..వనామీ సాగులో మంచి లాభాలే వచ్చాయనీ..తనకున్న అప్పుల్లో ఎనభై శాతం తీరిపోయాయని..చెప్పుకొచ్చాడు..


అన్నదానం చేయించినందువల్ల చంద్రశేఖర్ కష్టాలనుంచి గట్టెక్కాడా?.. శ్రీ స్వామివారిని నమ్మినందుకు లబ్ది పొందాడా?..ఏమీ అర్ధం కాలేదు నాకు..అదే మాట అడిగాను..


"నా కష్టాలు తీరాలంటే..నా చేత అన్నదానం చేయించాలని శ్రీ స్వామివారే నాకు ఆ బుద్ధి పుట్టించాడని మీరెందుకు ఆలోచన చేయలేదు?.." అని ఎదురు ప్రశ్నించాడు..


నిజమే..ఎవరికి ఏది ఎప్పుడు ఎలా నిర్దేశించాలో శ్రీ స్వామివారికే తెలుసు..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం...లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: