26, మార్చి 2022, శనివారం

సుబ్రహ్మణ్యస్వామి

 ఈ గుడిలో ప్రార్థన చేస్తే చదువులో రాణిస్తారు!




పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. 

ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్‌ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు. సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. అవి పళని, తిరుచెందూర్‌, స్వామిమలై, తిరుపరన్‌కుండ్రం.


తిరుత్తణి, పళముదిరి కొలయ్‌. సూరపద్ముడి సంహారం అనంతరం స్వామి తిరుత్తణిలోని కొండపై విశ్రాంతి తీసుకుని, శ్రీవల్లిని ఇక్కడే వివాహం చేసుకున్నారు. అందుకే అన్ని మురుగన్‌ ఆలయాల్లో జరిపే స్కంద షష్టిని ఇక్కడ నిర్వహించరు. దీనికి బదులుగా యుద్ధ ఉత్సవం జరుగుతుంది. 


ఆ రోజున వేయి కిలోల పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తారు. 

ఇక్కడ స్వామివారి వాహనంగా మయూరం స్థానంలో ఏనుగు ఉంటుంది. 


దీనికి సంబంధించి ఒక పురాణగాథ ప్రచారంలో వుంది.


 సుబ్రహ్మణ్యస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించి ఐరావతాన్ని కానుకగా ఇచ్చాడు.


ఈ ఆలయంలో స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైంది. చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. అయితే ముఖ్యమైన పండుగ సమయాల్లోనే ఈ చందనాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉంటాడు. ఇవి నాలుగు వేదాల పరిరక్షణకే అని తెలుస్తోంది. భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు, వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి.


 ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనేది నమ్మకం.


అరుణగిరినాథర్‌ అనే మహాభక్తుడు స్వామివారిని కొలుస్తూ ఇక్కడే తనువు చాలించాడు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు ఈ ఆలయానికి వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతుండగా ఒక వృద్ధుడు వచ్చి స్వామివారి ప్రసాదాన్ని ఇచ్చారు. ఆ ప్రసాదం తినగానే ముత్తుస్వామి నోరు పవిత్రమై ఆశుధారగా గానం చేశాడు. అమృతప్రాయమైన ఆ ప్రసాదాన్ని సాక్షాత్తు కార్తికేయుడే వృద్ధుని రూపంలో వచ్చి ముత్తుస్వామికి అందజేశాడట.

కామెంట్‌లు లేవు: