15, ఆగస్టు 2022, సోమవారం

సరస్వతీ రాజమణి '..

 15 ఏళ్ళకే దేశం కోసం వజ్రాల నగలు త్యాగం చేసి నేతాజీ దగ్గర గూఢచారిణి గా చేసిన 

' ధీరమణి సరస్వతీ రాజమణి '..


అది ఒక విశాలమైన రాజభవనం లాంటి మందిరం ! అడుగడుగునా వైభవం తొణికిసలాడుతున్నది ! ఆ భవనం ఉన్నది రంగూన్ లో 

.

ఆ భవనపు హాలులో గాంధీగారు ఆసీనులయి ఉన్నారు ! ఆ కుటుంబ యజమాని తదితర సభ్యులంతా చాలా శ్రద్ధగా గాంధీగారు చెప్పే విషయాలు వింటున్నారు ! 

.

ఎందుకో గాంధీగారి చూపు ఆ హాలు కిటికీ దాటి ఆ ఇంటి ఆవరణలో గల ఒక విశాలమైన మైదానంలో తుపాకీతో సాధన చేస్తున్న ఒక పది సంవత్సరాల బాలికమీదకు‌ ప్రసరించింది ! 

ఆ అమ్మాయి ని తన వద్దకు పిలిపించుకున్నారు 

..

అమ్మా ! నీవు ఈ తుపాకీతో సాధన చేస్తున్నావుకదా ఎందుకు ?...అడిగారు గాంధీగారు 

..

నా తుపాకీతో కనీసం ఒక్క బ్రిటీష్ వాడినైనా చంపెయ్యాలని నా కోరిక ...బదులిచ్చింది బాలిక 

..

"హింసా మార్గము తప్పుకదా" అని అంటూ అహింస యొక్క విశిష్టత గాంధీ గారు చెప్పటం మొదలుపెట్టారు ! 

..

వెంటనే ఆ బాలిక " నాకు మీ అహింసా మార్గము నచ్చదు ,అహింసవలన బ్రిటిష్ వాడు మనకు స్వతంత్రం ఇవ్వడు " అని నిర్మొహమాటంగా చెప్పింది ! ...నిరుత్తరుడయ్యారు గాంధీగారు 

.

ఆ బాలిక పేరు రాజమణి ఆమె తండ్రి చాలా గొప్ప సంపన్నుడు భారతదేశంలో ఒక బంగారుగనికి యజమాని ! బ్రిటిష్ వారి అణచివేతకు తట్టుకోలేక కుటుంబ సమేతంగా రంగూన్ లో నివాసం ఏర్పరచుకున్నాడు ...

..

ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికి నేతాజీ రంగూన్ వచ్చి తన సైన్యానికి కావలసిన నిధులు సేకరిస్తున్నారు ! అప్పటికి రాజమణికి 15 సంవత్సరాలు వచ్చాయి ! 

.

అందరూ తమ వంటిమీది ఆభరణాలు వలిచి ఇస్తుంటే చూసిన బాలిక తానుకూడా తను ధరించిన అతిఖరీదైన వజ్రాలతో కూడిన నగలను వలిచి మూటగట్టి నేతాజీకి ఇచ్చివేసింది ! గమనించారు నేతాజీ అప్పుడు ఏమీ మాట్లాడలేదు .

.

మరుసటి రోజున రాజమణి ఇంటిముందు ఆగిన వాహనం నుండి నేతాజీ దిగారు నేరుగా ఇంటిలోనికి వచ్చి తన చేతిలోని అత్యంత ఖరీదైన నగలమూటను ఆ బాలిక తండ్రికి ఇచ్చి తెలిసీ తెలియని వయస్సులో తన నగలు దానం చేసింది ఈ బాలిక కావున ఇవి నాకు వద్దు అని తిరిగి ఇచ్చి వేశారు .

.

తండ్రి చేతిలోని మూటను అలాగే తీసుకొని మరల నేతాజీకి ఇచ్చి "నేను తెలిసే ఇచ్చాను ! అవి నా నగలు ,నా సొమ్ము భారత స్వతంత్ర పోరాటానికి ఉపయోగ పడాలి ...అని స్థిరంగా గొప్ప పరిణతితో పలికింది .. ఆ బాలిక విజ్ఞతకు ముగ్ధుడైన నేతాజీ ఆమెకు సరస్వతి అని నామకరణం చేశారు ! 

.

అప్పటినుండి ఆవిడ

 " సరస్వతి రాజమణి ""

.

ఇంకొక రెండేళ్ళు గడిచాయి నేతాజీ మరల రంగూన్ వచ్చినప్పుడు సరస్వతి తన నలుగురు స్నేహితులతో కలిసి INA లో చేరతామని నేతాజీని అభ్యర్ధించారు ! వారి తల్లిదండ్రుల అనుమతితో వారిని తన గూఢచారిదళంలో చేర్చుకున్నారు నేతాజీ ! 

.

వారి బాధ్యత ఏమిటంటే బ్రిటిష్ సైనికాధికారుల ఇండ్లలో పని చేస్తూ సైనిక రహస్యాలను I.N.A కు చేరవేయడం ! 

.

కొంతకాలం వారి పని సజావుగా నడిచింది ...ఒకరోజు ...సరస్వతి స్నేహితురాలు దొరికిపోయింది ! 

.

బ్రిటిష్ వారు ఆమెను బంధించారు ! 

.

బంధింపబడిన తన స్నేహితురాలిని విడిపించడానికి సరస్వతి పథకరచన చేసింది ! ...ఆ కారాగారంలో ఒక వేడుక జరుగుతున్నప్పుడు తాను నృత్యకళాకారిణిగా వెళ్ళింది ! నాట్యం చేస్తూ బ్రిటిషు వారికి మత్తుమందు ఇచ్చి సమయం చూసి తన నెచ్చెలిని తప్పించి పరుగెత్తుతూ బుల్లెట్ దెబ్బతిని మూడు రోజులు చెట్టుమీద దాక్కొని బయటపడింది ..

..

తదనంతర కాలంలో ఆ గాయం తనను కుంటిగా మార్చినా చలించలేదు ఆ ధీర వనిత ! 

.

స్వతంత్ర వచ్చిన తరువాత భారత్ తిరిగి వచ్చి సరి అయిన గుర్తింపులేక పోషణకోసం పాతబట్టలు కుట్టు కుంటూ పొట్ట పోసుకుంటూనే తనకు ఉన్నంతలో సమాజసేవ చేస్తూ దుర్భరదారిద్ర్యంలో జీవనయానం సాగించింది ఆ ఆగర్భశ్రీమంతురాలు ! 

.

ఈ వీరవనిత పరిస్థితి ఎవరి ద్వారానో విన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈవిడ ఉండటానికి అద్దెలేకుండా ఒక మంచి ఫ్లాటు ,5 లక్షల నగదు 2006 సంవత్సరంలో ఇచ్చారు ....

..

ఎందరో ధీరవనితలు ,వీరసైనికుల త్యాగఫలం మన స్వతంత్రం ! కేవలం అహింసవలననే వచ్చింది అంటే ....????

courtesy : వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: