30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

మోక్షద్వారాలు

 #మోక్షద్వారాలు తెరిచే... ఈ దానాలు తప్పక చేయండి!

పూర్వ జన్మలో మనం చేసిన దాన ధర్మాల ఫలితమే ఈ జన్మ అనేది, చాలా మంది విశ్వాసం. ఈ జన్మ లో చేసిన దాన ధర్మాలు వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడతాయి అనే మాటలు మనం వింటూ ఉంటాము. అయితే, శాస్త్రాలు, పురాణాలు కూడా, దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలూ ప్రాప్తిస్తాయని చెబుతున్నాయి. ఈ కారణంగానే చాలా మంది గుడిలో దైవ దర్శనం చేసుకున్న తరువాత, గుడి దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మాత్రమే అర్హులుగా భావించి, తమకి తోచిన విధంగా బియ్యం, డబ్బులు, పళ్ళు, వస్త్రాలు, ఇలా దాన ధర్మాలు చేస్తుంటారు. అయితే, పేదవానికి మీ శక్తి కొలదీ చేసే ద్రవ్య సహాయము కానీ, వస్తు సహాయము కానీ, ‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం, ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మనకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, ఏదైనా దానంగా ఇవ్వడానికి వీలు లేదు. దానం చేయడానికి కొన్ని పరిధులున్నాయి. ఏది పడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్ర నియమానుసారంగా, దాన యోగ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు. ఇవి మొత్తం 10 దానాలు: 1. దూడతో కూడుకున్న ఆవు: ఇదే గోదానం, 2. భూ దానం, 3. నువ్వులు, 4. బంగారము, 5. ఆవునెయ్యి, 6. వస్త్రములు, 7. ధాన్యము, 8. బెల్లము, 9.వెండి, 10. ఉప్పు.. ఈ పదింటినీ దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్ర పూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. అన్నదానం, వస్తద్రానం, జలదానం గోదానం, కన్యాదానం, సువర్ణదానం, భూదానం మొదలైనవన్నీ చాలా విశిష్టమైనవి. మనిషిని సంతృప్తి పరచేది అన్నదానము. దాహార్తిని తీర్చేది జలదానం. ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుల దాహార్తిని తీర్చటం ద్వారా, వారికి మనమెంతో మేలుచేసిన వారమౌతాం. వస్త ద్రానం చేస్తే, సాక్షాత్తూ ఆ భగవంతుడికే వస్త్రాన్నిచ్చిన పుణ్యం కలుగుతుంది. ఎండా, వానా, చలినుండి, పేదలను కాపాడిన తృప్తి మనకు దక్కుతుంది. ఇక కన్యా దానం చేయటం ద్వారా, ఆ కన్య ద్వారా ఒక వంశం వృద్ధి చెందుతుంది. తద్వారా కొన్ని తరాల పరంపర కొనసాగుతుంది. గోదానం మహిమ, చెప్పనలవికానిది. గోవునూ దూడనూ కలిపి దానం చేస్తే, మన పితృదేవతలను వైరతరణీ నదిని దాటించి, స్వర్గలోక గతులను చేసిన పుణ్యం దక్కుతుంది. దానాలన్నింటిలోకీ ఉత్కృష్టమైనది, భూదానం. భూమిని మన పెద్దలు రత్నగర్భ అని పిలిచేవారు. సువర్ణ, జల, నవరత్న ఖచిత మణి మణిక్యాదులన్నీ, భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి, భూమిని దానం చేయటంవల్ల, భూమితోపాటుగా, పైవాటినన్నింటినీ కూడా దానం చేసిన ఫలితం ఉంటుంది. ఆ భూమిలో పొందే పంటల వలన మానవులకే కాక, పశు పక్ష్యాదులకన్నింటికీ ఆహారం చేకూర్చిన వాళ్లమవుతాం. పేదలకు జీవన భృతి దొరుతుంది. చేసిన దాన ధర్మాల వలన, ఆజన్మాంతరం అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రత్యుపకారమునాశింపక చేసే దానము పుణ్యప్రదము. కానీ, ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తే, అది దానంగా గ్రహించబడదు. అంటే, ఇదిగో ఈ దానం చేస్తున్నాంగనుక, ఈ ఫలం తప్పక రావాల్సిందే.. అనిగాక, ఎదుటివారి అవసరాన్ని ఎరిగి, వారికి కావలసిన వస్తువులను దానం చేయడం, ఉత్తమం. దాని వల్ల మంచి ఫలితమే వస్తుందని, మన పురాణాలు చెబుతున్నాయి. ఏమి చేస్తామో, ఏమి ఆలోచిస్తామో, అవే ఎదురవుతుంటాయి. ఆకలిగొన్నవారినీ, అనాధలనూ, రోగులనూ, అసమర్థులనూ, అన్న, వస్త్ర, ఓషధులు మొదలైనవి లేనివారినీ, విద్వాంసులనీ, బ్రాహ్మణులనీ, ధనాదులచే ఆదుకొనుటా, సత్కరించుట కూడా దానమనే చెప్పవచ్చు...

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

కామెంట్‌లు లేవు: