5, అక్టోబర్ 2022, బుధవారం

శుభాకాంక్షలు

 *ॐ            విజయ దశమి శుభాకాంక్షలు* 


*అమ్మలగన్నయమ్మ ముగురమ్మల* 

          *మూలపుటమ్మ చాల బె* 

*ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి* 

          *పుచ్చినయమ్మ దన్ను లో I* 

*నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల* 

          *నుండెడియమ్మ దుర్గ, మా*  

*యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ* 

          *కవిత్వ పటుత్వ సంపదల్ ॥* 


    విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో, ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం వ్రాయబడి ఉంటుంది. 

    ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. 

    తెలిసికాని, తెలియకకాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సద్యఃఫలితాలని ఇస్తాయి. 

    అందరు కొన్ని  చదవకూడదు. కొన్ని  చేయకూడదు. పక్కన గురువు వుంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేరు. బీజాక్షరములను ఉపాసన చెయ్యడము కష్టం. 

    పోతనగారు ఈ దేశమునకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు. 


    అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో, అటువంటి అమ్మకు "మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్" - ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు. 

    మనం  చెయ్యలేని చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా ప్రమాదము లేని రీతిలో మనతో చేయించేయడానికి  ఇటువంటి ప్రయోగము  చేశారు.


*'అమ్మలగన్నయమ్మ’* 

 

    లలితాసహస్రము  'శ్రీమాతా’ అనే నామముతో ప్రారంభమవుతుంది. 

   'శ్రీమాతా’ అంటే ’శ’ కార 'ర’ కార ’ఈ’ కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ  ఆయమ్మ  'లలితాపరాభట్టారికా స్వరూపం’. 

    ఆ అమ్మవారికి,  దుర్గాస్వరూపానికీ భేదం లేదు. 


*'అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ’* 


    ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. 


*'చాల పెద్దమ్మ’* 


    ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతములోకి తీసుకువెడితే మహాశక్తి అండపిండ బ్రహ్మాండములనంతటా నిండిపోయిన శక్తిస్వరూపము. 

    ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదము లేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉన్నది. అలా ఉండడము  అనేదే మాతృత్వం. ఇది దయ. దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

    అండపిండ బ్రహ్మాండములనన్నిటినీ నిండిపోయి, ఈ భూమినీ లోకములనన్నిటినీ తిప్పుతూ, ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ "చాల పెద్దమ్మ". 


*'సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’* 


    సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ దితి. దితి ఏడిచేలా కడుపుశోకాన్ని మిగిల్చింది. 

    అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.


*'తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’* 


    ఇదొక గొప్పమాట. 

    మనకి సంప్రదాయములో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూంటాము. కొలుస్తూంటాం.

    అవి "బ్రాహ్మీ, మహేశ్వరీ, వైష్ణవీ, మహేంద్రీ, చాముండా, కౌమారీ, వారాహీ, మహాలక్ష్మీ. 

    వారి మనస్సులలో నిండియుండే అమ్మ. 


*’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’* 


    ఆవిడ దయతో మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలను, "అర్హత ఉన్నదని" ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చెయ్యాలి.


    అమ్మవారికి 'శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌః ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములని పిలుస్తారు. 

    బీజాక్షరము అంటే “Letter Pregnant with sound” అంటారు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు.  

    బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చెయ్యకూడదు, చేయలేము. 

    ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగము చేశారు. 

  - మహత్వానికి బీజాక్షరము 'ఓం’, 

  - కవిత్వానికి బీజాక్షరము 'ఐం’, 

  - పటుత్వానికీ భువనేశ్వరీ బీజాక్షరము 'హ్రీం”, 

  - సంపదలకు లక్ష్మీదేవి 'శ్రీం’. 

    ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రం ద్వారా, "మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద"లని పొందుతాం. 

    కాని, 'ఓం ఐం హ్రీం శ్రీం’ అనే బీజాక్షరాలతో ’శ్రీమాత్రే నమః’  అని అస్తమానము అలా అనడానికి వీలులేదు. 

    మనం రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, స్నానం చేసినా,  చెయ్యక పోయినా,  ఎక్కడ ఉన్నా  అమ్మలగన్నయమ్మ "ముగురమ్మల మూలపుటమ్మ" అనుకుంటుంటే, 

   మనం మరోరూపంలో 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’  'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేనమః’ అంటూ ఎప్పుడూ అమ్మను తలచుకున్నట్లే అవుతుంది. అమ్మవారు చాలా తొందరగా మనకు పలుకుతుంది. 

    అందుకే లలితా సహస్రం 'శ్రీమాతా’ అంటూ అమ్మతనముతో ప్రారంభమవుతుంది. 

    అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అయినా, ఆవిడముందు "అమ్మా! అమ్మా!" అనేసరికి ఆవిడ పొంగిపోతుంది. 

    ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మనం పిలుస్తుంటే, 

   "విసుక్కోవడము చేతకాని" దయాస్వరూపిణి అయిన అమ్మ మన కోరికను తీరుస్తుంది. 

   'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు. 

   'అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ అనడానికి కష్టం ఉండదు. 


    ఈవిధముగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి, ఆంధ్రదేశమునకు ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు. 

    ఆయన ఒక ఋషి కనుక ఆ పద్యమును ఇచ్చారు. 


          సర్వేజనాః సుఖినోభవంతు

                      శుభమస్తు.

కామెంట్‌లు లేవు: