22, అక్టోబర్ 2022, శనివారం

జ్వరము లక్షణాలు

 జ్వరము లక్షణాలు - నివారణా యోగాలు .


    శరీరం వణుకుట, పెదవులు , నోరు ఆరిపోవుట, నిద్రపట్టకపోవుట, తుమ్ము రాకుండా ఉండటం, తల ఇతర భాగాలు నొప్పులుగా ఉండటం, నోటికి రుచి తెలియకపోవటం , మలబద్దకం, కడుపునొప్పి, కడుపుబ్బరం, ఆవులింతలు ఇటువంటి లక్షణాలు అన్నియు వాతం వలన కలుగు జ్వర లక్షణాలు .


     బాగా వొళ్ళు కాలుట, అతిసారం, సరిగ్గా నిద్రపట్టకపొవుట, వాంతులు , నోటిలో పుండుపడుట, నోరు చేదుగా ఉండటం, మూర్చ, తాపము , దాహము , మలమూత్రాలు, కళ్లు పచ్చగా ఉండటం వంటి లక్షణాలు అన్నియు పిత్త సంబంధ జ్వర లక్షణాలు .


     శరీరం బాగా చలిగా ఉండటం, సోమరితనం, నోరు తియ్యగా ఉండటం , చర్మం పాలిపోవుట , మూత్రం తెల్లగా రావటం, శరీరం బిగుసుకుపోయినట్టు ఉండటం, పొట్ట, శరీరం బరువుగా ఉండటం , అతినిద్ర, మలము కొద్దిగా వచ్చుట, నోటిలో ఎక్కువ నీరు ఊరట, మూత్రం ఎక్కువుగా రావటం, వాంతులు , అరుచి , జీర్ణం కాకుండా ఉండటం, దగ్గు, జలుబు , కళ్లు తెల్లగా ఉండటం ఈ లక్షణాలు అన్నియు కఫ సంబంధ జ్వర లక్షణాలు .


         పైన చెప్పిన విధముగా జ్వరం వచ్చినపుడు లక్షణాన్నిబట్టి దేని సంబంధమైన జ్వరమో నిర్ణయించుకొని దానికి తగ్గ ఔషథాన్ని నిర్ణయించుకుని వాడవలెను.


 నివారణా యోగాలు  -


 *  తిప్పతీగ , మోడి , శొంటి మూడు సమాన బాగాలుగా తీసుకుని కషాయం చేసుకుని సేవిస్తున్న వాతజ్వరం నశించును.


 *  దురదగొండి వేర్లు, పర్పాటకం, ప్రేంఖనం , నేలవేము , అడ్డసరం, కటుకరోహిణి వీటి కషాయం ఎక్కువుగా చక్కర కలిపి తీసుకుంటే దాహము , రక్తపిత్తం, జ్వరం, తాపం నివారిస్తాయి.


 *  పర్పాటకం , చందనం,వట్టివేళ్ళు , ధనియాలు  వీటి కషాయం తీసుకుంటే పైత్య జ్వరం వెంటనే నివారణ అగును.


 *  వాము , వస, శొంటి, పిప్పళ్లు , నల్ల జీలకర్ర సమాన చూర్ణాలను తీసుకుని కలిపి కొంచం నీరు కలిపి శరీరానికి మర్దన చేయుచున్న టైఫాయిడ్ జ్వరములో వచ్చు శరీరపు మంటలు తగ్గును.


 *  బెత్తెడు వేపచెక్క దంచి గ్లాసున్నర నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడు లోపలికి ఇచ్చి పడుకోపెట్టి లొపలికి గాలి చొరబడకుండా నిండగా దుప్పట్లు కప్పవలెను. లోపల అంత చెమట పట్టి జ్వరం తగ్గును. ఈ విధముగా మూడుపూటలా చేయుచున్న అన్నిరకాల జ్వరాలు నశించును.


 *  నిమ్మకాయ రసంలో పంచదార కలిపి తాగించుచున్న జ్వరం వల్ల వచ్చు తాపం తగ్గును.


 *  కృష్ణ తులసి ఆకులు 50 గ్రాములు , మిరియాలు 10 గ్రాములు రెండూ కలిపి నూరి బటాణిగింజ అంత మాత్రలు చేసి పూటకి ఒక మాత్ర చొప్పున ఇచ్చి వేడి నీరు తాగించవలెను . చలిజ్వరం నందు పూటకి రెండు మాత్రలు చొప్పున ఇవ్వవలెను.  దీనివలన సాధారణ జ్వరములు, మలేరియా జ్వరములు కూడా నశించును.


 *  గుంటగలగరాకు జ్వరం ఉన్నవారు కొంచం కొంచం నమిలి మింగుచున్న జ్వరం తగ్గును.


 *  రావిచెట్టు ఆకులు 5 , మారేడు ఆకులు 15 , తులసి ఆకులు 45 ఈ వస్తువులను మెత్తగా నూరి అర లీటరు నీళ్లలో కలిపి కషాయం కాచి పావులీటరులో సగం వచ్చేంత వరకు మరిగించి దింపి వడపోసుకొని ఉంచుకుని గంట గంటకు 10ml చొప్పున తాగించుచున్న రెండు రోజుల్లొ టైఫాయిడ్ జ్వరం నశించును.


 *  గుంటగలగర చిగుళ్లు 7 , మిరియాలు 7 కలిపి నూరి ఒక్క మోతాదుగా రోజూ రెండుపూటలా ఇచ్చుచుండిన యెడల చలిజ్వరం తగ్గును.


 *  5 తులసి ఆకులు , 5 మిరియపు గింజలు కలిపి నూరి 60ml నీరు , 15ml తేనె కలిపి భోజనానికి గంట ముందుగా ఉదయం , సాయంత్రం కలిపి ఇచ్చుచుండిన టైఫాయిడ్ జ్వరం తగ్గాక వచ్చు బలహీనత నివారించబడును.


 *  వరిపేలాలు చూర్ణం చేసి కషాయం పెట్టి ఆ కషాయంలో కొంచం పటికబెల్లం పొడి కలిపి తాగించున్న పైత్యం వలన వచ్చు జ్వరం తగ్గును.


 * గోధుమల కషాయం లో పటికబెల్లం పొడి కలిపి తాగించుచున్న పైత్యజ్వరం నశించును.


      జ్వరం తగ్గుటకు పథ్యం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. సరైన పథ్యమును పాటిస్తూ ఔషధాలను తీసుకొనుచున్న ఎటువంటి జ్వరం అయినా నశించును.


        మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: