23, డిసెంబర్ 2023, శనివారం

ఉత్తర ద్వార దర్శనం

 🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷


*ఉత్తర ద్వార దర్శనం అంటే!*


*నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా...*


శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకొనేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్తంభములతో నిర్మించబడిన మహా మణిమండపమున మధ్యలో అన్నిటి కంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహాపద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహా సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆది శేషుడు విరాజిల్లుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు.


వైకుంఠానికి వెళ్లినవారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహాకూర్మాన్ని చూస్తారు, మరి కొందరు అష్టదిగ్గజాలను చూస్తారు, ఆపైన మరి కొందరు మహాపద్మాన్ని, మరి కొందరు పరమాత్మ సింహా సనాన్ని చూస్తారు. ఆపైన చేరుకు న్నవారు పరమాత్మను సేవించినా వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యా న్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శిం చలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు. మాత్రమే భగవంతుడిని దర్శించు కోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనం లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడమా? చూడ డమా? భగవంతుడిని స్తోత్రం చేయడమా? భగవంతునికి సేవలు చేయడమా? భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు.


వైకుంఠం చేరుకోగలగాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు, వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరి కొందరు వైకుంఠం వెళ్లాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు, వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తుతించాలి అని మరి కొందరు కోరతారు, వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాకతాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకొనే వారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించే ఆండాళ్లమ్మ అంటే గోదాదేవి తిరుప్పావులో ఉనక్కే నామ్ ఆట్ చెయ్ వోమ్ అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని. అలాగే మత్తనమ్ కామంగళ్ మాత్తు అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళ్లమ్మ కోరింది. ఆండాళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుం ఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమా క ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి, అంతో ఇంతో జ్ఞానం ఉంది.


వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠ లోకం వెళితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒక సారి చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనని అతుక్కుని ఉండటం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్లిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటిమీదనే ఉంటుంది. చందనం పూసినవారు వెళ్లిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది.


పరుపు ఇచ్చిన వారు వెళ్లిపోతారు కానీ పరుపు స్వామికి శయ్యగా ఉండిపో తుంది. అలాగే పాదుకలు ఇచ్చినవారు వెళ్లిపోతారు కానీ పాదు. కలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా?, చందనం పూయాలనా లేక చందనం అవ్వాలని కోరుకుంటా మా? ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి. అని కోరుకోవాలి. అందుకే యామున మిశ్రులు స్తోత్ర రత్నంలో 


*నివాస శయ్యా ఆసన పాదుక అంశుక ఉపధాన శీతాతప*

*వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాం గతః*


అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకల య్యాడు, తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు, కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు, చలికి దుప్పటి అయ్యాడు, ఎండకి గొడుగు అయ్యాడు. అందుకే అతనని ఆది శేషుడు అంటారు. అంటే మొదటి  సేవకుడు. చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం.

కామెంట్‌లు లేవు: