24, డిసెంబర్ 2025, బుధవారం

అది నువ్వే


అది నువ్వే


ఒకరోజు సాయంత్రం 7 గంటల సమయంలో సీతాదేవి తన ఇంట్లో ఏదో పాత బట్ట చేత్తో కుట్టుకుంటున్నది. దారాన్ని తెంపి కొత్తదారం సూదిలోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తుండగా కరంటు పోయింది చేతిలోంచి సూది జారీ పడింది. ఇల్లంతా చీకటి సూదిని ఎలా వెతకాలి అని ఒక కొవ్వొత్తి వెలిగించి కొవ్వొత్తి కాంతిలో వెతకటానికి ప్రయత్నించింది. కానీ సూది ఎక్కడ  పడ్డదో ఆమెకు ఎంతవెతికిన కనిపించటం లేదు. ఇంతలో ఆమె భర్త రామారావు ఇంట్లోకి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా వుంది తన భార్య కొవ్వొత్తి వెలుగులో ఏదో వెతుకుతుండటం చూసి ఏమి వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె జరిగినది మొత్తం చెప్పి సూదికోసం వెతుకుతున్నాను అని అన్నది. పిచ్చిదానా ఇంట గుడ్డి వెలుతురులో నీకు సూది కనపడుతుందా ఏమిటి బైట చూడు వీధి దీపం ప్రకాశమానంగా వెలుగుతున్నది రోడ్డుమీద వెతుకుదాం పద అని ఆమెను వీధిలోకి రమ్మని పిలిచాడు. ఏమండీ మీకు మాతికాని పోయిందా సూది నా చెతిలొనుంచి జారీ ఇంట్లో  పడ్డది బయట వెతికితే ప్రయోజనం ఏమిటీ అని ఆమె అంటే. పిచ్చిదానా బైట వెలుతురు బాగా వుంది కాబట్టి అక్కడ మనం వెతికితే వెతకటం తెలుస్తుంది తరువాత మనం అక్కడ దొరకక పొతే ఇంట్లో వెతుక్కోవచ్చు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయ్యింది మీ తెలివి ఎలా పనిచేస్తున్నదో అని ఆమె అని. మీకు చాతనయితే ఒక ఎక్కువ వెలుతురు ఇచ్చే దీపాన్ని తీసుకొని రండి అప్పుడు నేను సూదిని వెతుక్కోగలను. వెలుతురు బైట ఉండవచ్చు కానీ వెలుతురు కావలసింది పోయిన వస్తువు వున్నచోట మాత్రమే. ఇదికూడా మీకు తెలియకపొతే యెట్లా అని భర్తతో అన్నది. 


నిజానికి ఈ దృష్టాంతరం చదివితే హాస్యాస్పదంగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం అక్షర సత్యం. మనం దాదాపు కోఠిలో ఏవక్కరో తప్ప అందరం సూది ఇంట్లో ఉంటే వీధిలో వెతికే వారమే అంతేకాదు అక్కడ వెలుతు రూ ఎక్కువగా వుంది ఇక్కడ ఇంకా వెలుతురువుంది అని చెప్పే వాళ్ళ మాటలు విని అక్కడ ఇక్కడ మనం వెతుకుతూ వున్నాం కానీ సూది మాత్రం దొరకటం లేదు కేవలం కాలం గడుస్తుంది, జీవితం అయిపోతున్నది. ఇక విషయానికి వస్తే మిత్రమా 


ఈ రోజుల్లో ఆ గుడికి వెళ్ళండి, ఈ క్షేత్రానికి వెళ్ళండి అక్కడ దేవుడిని దర్శించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం ఇక్కడి క్షేత్రంలో దేవుడు చాలా శక్తివంతుడు అని మనలను తప్పు త్రోవ పట్టించే వారు సమాజంలో అనేక మంది తయారుఅవుతున్నారు. దానితో సామాన్యుడు ఏది నిజమో ఏది కాదో తెలుసుకోలేక వారి మాటల గారడితో ప డి కాలాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పటానికి బాధపడుతున్నాను. నిజానికి ఏ గుడికి వెళ్లినా ఏ తీర్థానికి వెళ్లినా నీకు మోక్షం రాదు కేవలం నీ సాధనకు మనస్సు కొంత తోడ్పడుతుంది. దానివల్ల నీకు కలిగే ప్రయోజనం చాలా తక్కువ. 


ఇది ఇలా ఉండగా ఈ రోజుల్లో అనేకమంది స్వామీజీలు, బాబాలు తమకు తామే దేవుళ్లమని పేర్కొనటమే కాకుండా ఇంకా కొంతమంది ఎప్పుడో గతించిన వారికి గూళ్లుకట్టి, పూజలు చేస్తూ మనలను కూడా పూజలు చేయమని ప్రోత్సహించటమే కాక నీవు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే నీతో స్పర్ధకు దిగి వారి వాదనే సరైనదని అయన ఫలానా దేవుడి అవతారం, ఈయన ఫలానా దేవుడి అవతారం అని అయన ఆ మహిమలు చూపెట్టారు, ఈయన ఈ మహిమలు చూపెట్టారని మనలని మభ్యపెడుతూ మన జీవితాలను లక్ష్యంనుంచి విముఖులను చేస్తున్నారు. 


మన సాంప్రదాయంలో వక్తి పూజా ఆరాధనా ఎప్పుడు చెప్పలేదు. కేవలం అంటే కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం సిద్ధిస్తుందని మన ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. మానిషి కొంతకాలం తపస్సు చేస్తే కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తం అవుతాయి. వాటిని అణువాది అష్టసిద్ధులు అంటారు అట్లా సిద్ధులను పొందినవారిని సిద్దులు అంటారు. సిద్ధులను పొందటం అంత అసాధ్యం ఏమీకాదు. కొంతకాలం తపస్సు చేస్తే చాలు వారు ఏవైతే మహిమలు అన్నారో అవి చాలామంది తాపసులు పొంది వున్నారు. మీరు కూడా పొందగలరు. అది ఏమి విశేషం కాదు.


వీళ్ళు చెప్పే బాబాలు, స్వామీజీలు మన మహర్షులముందు చాలా స్వల్పులు. వసిష్ఠ మహర్షి ఒక దర్భను జీవమున్న బాలునిగా చేసాడు, విశ్వమిత్ర మహర్షి స్వర్గాన్నే సృష్టించగలిగాడు. వీళ్ళు చెప్పే ఈ బాబాలు, స్వామీజీలు అంతకన్నా గొప్పవాళ్ళా ఆలోచించండి. 


ఇక వారు సద్గురువులని వారిని ఆరాధిస్తే మోక్షం వస్తుందని కొందరు అభిప్రాయపడుతుంటారు. మిత్రమా నిజానికి మోక్షాన్ని ఏ సద్గురువు కూడా యివ్వలేదు అది సాధకుడు తనకు తానుగా కఠోర దీక్షతో సిద్దించుకోవలసరైంది. గురువు పాత్ర చాలా చిన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే నీవు ఒక రోడ్డు మీద వెళుతున్నావు అడవిలో ఆ రోడ్డు రెండుగా చీలింది. ఇప్పుడు నీవు ఏ రోడ్డుమీద వెళ్ళాలి అని అనుకుంటే అక్కడ నీకు ఒక మార్గదర్శిని (బోర్డు) కనిపించింది అది ఆ రెండు రోడ్లు ఎటువైపుకు వెళతాయో చూపిస్తుంది. దానిని అనుసరించి నీవు నీ గమ్యాన్ని చేరుకోవటానికి నీ కారును నీవే నడుపుకుంటూ వెళతావు. ఆ రోడ్డు దాటిన తరువాత అక్కడి సైను బోర్డు సంగతే మరచిపోతావు. నీ గురువు స్తానం కూడా అటువంటిదే నీకు మార్గదర్శనం చేస్తాడు. నీ మార్గంలో నీవే వెళ్ళాలి. ఆలా వెళ్లక గురువునే పూజిస్తూవుంటే కాలయాపన కాక వేరొకటి కాదు.  


కాబట్టి సాధక మిత్రమా నీవు ఎవరి మాటలు వినక నీకు నీవుగా నీ మార్గాన్ని (మోక్ష మార్గాన్ని) ఎంచుకో ఆ దిశగా నీవు ప్రయత్నం చేసి నీలో నీ హృదయాంతరాలలో నిగూఢంగా వున్న పరమాత్మను దర్శించుకో నీవు ఏ దేముడిగూర్చి గుడులకు వెళుతున్నావో ఆ దేవుడు గుడులలో కాదు నీహృదయంలోనే వున్నాడని మన వేదం మంత్రాలు గోషిస్తున్నాయి. 


పైన కధలో సీతాదేవి ఇంట్లో పారేసుకున్న సూదిని వీధిలో వెతుకుదామని రామారావు చెప్పినా నిరాకరించి ఇంట్లోనే వెతకటానికి నిర్ణయించుకుందో అదే మాదిరిగా నీవుకూడా నీలోనే దేవుడిని వెతకటానికి ప్రయత్నించు వెలుతురూ తక్కువైన వెలుతురూ ఎక్కువ చేసుకొని (ఇక్కడ వెలుతురూ అంటే జ్ఞ్యానం సరిపడిన జ్ఞ్యానం లేకపోతె జ్ఞ్యానులనుండి అంటే గురువులనుండి జ్ఞ్యానాన్ని పొంది నీవే వెతుకు )


ప్రతిరోజూ అన్ని దేవాలయాలలో పఠించే మంత్రపుష్పంలోని ఈ మంత్రాలను చుడండి 


యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా ।


అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ॥ 5 ॥


మనకు కనిపించేది వినిపించేది అది యెంత సూక్ష్మ  మైన కానీ అది పూర్తిగా నారాయణుడితో వ్యాపించి వున్నది. అటువంటప్పుడు భగవంతుని ఒక దేవాలయానికి పరిమితం చేయటం ఎంతవరకు సబబు. మీరే చెప్పండి. విశ్వమంతా వ్యాపించి వున్న దేవుడు దేవాలయాలలో కూడా వున్నాడు,  ఉండి  భక్తుల కోరికలను తీరుస్తున్నాడు. అంటే కేవలం ఐహిక వాంఛలను తీర్చుకోవటానికి మాత్రమే దేవాలయాలకు వెళ్ళాలి కానీ మోక్ష సిద్ధికి మాత్రం కాదు. ఇక బాబాలను, సాధువులను దేవుళ్లుగా కొలవటం ఔచుత్యం అనిపించుకోదు. 


అనన్తం అవ్యయం కవిం సముద్రేన్తం విశ్వశంభువమ్ ।


పద్మ కోశ ప్రతీకాశం హృదయం చ అపి అధోముఖమ్ ॥ 6 ॥


అధో నిష్ఠ్యా వితస్త్యాన్తే నాభ్యామ్ ఉపరి తిష్ఠతి ।


జ్వాలామాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్ ॥ 7 ॥


సన్తతం శిలాభిస్తు లమ్బత్యా కోశసన్నిభమ్ ।


తస్యాన్తే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్ ॥ 8 ॥


తస్య మధ్యే మహానగ్నిః విశ్వార్చిః విశ్వతో ముఖః ।


సోఽగ్రవిభజంతిష్ఠన్ ఆహారం అజరః కవిః ॥ 9 ॥


హృదయంలో (నీ) బంగారు కాంతులు విరజిమ్ముతూ వడ్ల గింజ కొసపరిమాణంలో భగవంతుడు వసించి వున్నాడు. ఆయనే సర్వాంతర్యామి, అది తెలుసుకొని నీకు నీవే దేవుడవు కమ్ము. 


మోక్ష మార్గం యెంత కఠినమైనదో ఉపనిషత్తు తెలుపుతున్నది. 




ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా .

క్షురస్య ధార నిశితా దురత్యయా

దుర్గాం పాఠస్తత్కవయో వదంతి .. ౧౪.. 

 

14 లేవండి! మేలుకో! గొప్పవారిని సంప్రదించి నేర్చుకోండి. రేజర్ యొక్క పదునైన అంచు వంటిది ఆ మార్గం, కాబట్టి తెలివైనవారు నడవడం కష్టం మరియు దాటడం కష్టం.  

ఒక రేజర్ బ్లేడు మీద నడవటం యెంత కష్టమో అంత కష్టం మోక్షమార్గంలో పయనించటం అని ఈ మంత్రం చెపుతున్నది. కాబట్టి సాదాకా కఠినాతి కఠినమైన మోక్షమార్గాన్ని ఎంచుకొని నీ శాయశక్తుల పణంగా పెట్టి మోక్షసిద్ది పొందు మోక్షం అంటే నిన్ను నీవు నీకుగా తెలుసుకోవటమే, అది తెలుసుకో చాందోగ్యఉపనిషత్‌లోని ఆరవ అధ్యాయంలో తత్ త్వం అసి మహావాక్యాన్ని వ్యక్తం చేసింది దీని అర్ధం ఏమిటంటే నీవు దేనినిగూర్చి వెతుకుతున్నావో అది నీవే అని తెలుసుకో. 

శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన శ్రీమత్ భగవత్గీత, ఆది శంకరులు రచించిన అనేక ఆధ్యాత్మిక గ్రంధాలూ, మన మహర్షుల నుండి ఉద్బవించిన ఉపనిషత్తులను నిత్యం చదివి ఆకళింపు చేసుకొని, అనుసరించే సాధకునికి భగవంతుని గూర్చి, మోక్షాన్ని గూర్చి నిశీత , నిశ్చిత అభిప్రాయం ఏర్పడుతుంది. తెలిసి తెలియక బోధించెడి అజ్ఞ్యానుల మాటలు తేలికగా కనిపించి నిత్యము సత్యము, అనంతము అయిన పరబ్రహ్మ గూర్చి పరుగులిడతాడు.

ఓం తత్సత్ 


ఇట్లు 


మీ భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: