🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*గురువారం 9 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *52వ భాగం*``
*అనసూయ కోరిక పై సుమతి శాపం ఉపసహరించుట: మరణించిన కౌశికుని త్రిమూర్తులు బ్రతికించుట*```
సూర్యుని గమనం ఆగిపోవడంతో ముల్లోకాలు అంధకారంలోనే ఉన్నాయి. పద్నాలుగు భవనాల ప్రజలు భయంతో ఉన్నారు. సృష్టి సంతులనం తప్పింది. ఆందోళన చెందిన ఇంద్రుడు "సుమతి శాపం వలన ఇలా జరిగింది" అని తెలుసుకుని దేవతలతో కలసి వేగంగా భూమి మీద సుమతి ఉన్న ప్రదేశానికి వచ్చారు.
సతీ సుమతికి నమస్కరించి ఇంద్రుడు "అమ్మా! సుమతీ! నీ శాపంతో సూర్యుడి చలనం ఆగిపోయింది. సృష్టి నిలిచి పోయింది. పద్నాలుగు లోకాలు అంధకారంలోఉండిపోయాయి. అల్లకల్లోల పరిస్థితులువచ్చాయి. సృష్టి సమతుల్యత తప్పుతోంది. శాపం ఉపసంహరించుకుని సూర్యోదయం అయ్యేటట్టు చేయి తల్లీ!" అని కోరాడు.
సుమతి "మాండవ్య మహాముని శాపం వలన నా భర్త కౌశికుడు సూర్యోదయం కాగానే మరణిస్తాడు. ముని శాపం ఆపితే నా శాపం ఉపసంహరిస్తాను" అని చెప్పింది.
ఇంద్రుడు ఆమెతో "నీకు తెలియదా తల్లీ! మహామునుల శాపాలు ఆపే శక్తి నారాయణుడికి కూడా లేదు. నీవే కరుణించి సూర్యోదయం కానివ్వాలి" అని వేడుకున్నాడు.
"నా భర్త ప్రాణాలు కాపాడలేని ఈ దేవతలు,లోకాలు ఏమైనా పర్వాలేదు. నేను సూర్యోదయం కానివ్వను. నా భర్తను చనిపోనివ్వను" అని తెగేసి చెప్పింది.
ఇంద్రాది దేవతలు ఏమి చేయాలో తోచక బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఆపద నుండి గట్టెక్కే మార్గం చెప్పమని అడిగారు.
బ్రహ్మదేవుడు ఆలోచించి "పతివ్రత శాపం నుంచి రక్షించగలిగే శక్తి మరో మహా పతివ్రతకే ఉంటుంది. మీరు వెళ్ళి మహాపతివ్రత అయిన అత్రి మహర్షి భార్య అనసూయాదేవిని శరణు వేడండి. తగిన మార్గం లభిస్తుంది" అని ఇంద్రునికి చెప్పాడు.
ఇంద్రాది దేవతలు పరుగున అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లి అనసూయను శరణు వేడారు. అనసూయ వారికి అభయమిచ్చి దేవతల వెంట బయలుదేరి సుమతి వద్దకు వచ్చింది. సుమతి అనసూయాదేవికి నమస్కరించింది. అనసూయ సుమతితో "తల్లీ! నీ పరిస్థితి నాకు తెలుసును. నీ మాంగల్యానికి ఏమి హానీ జరుగకుండా నేను అభయం ఇస్తున్నాను. సూర్యోదయం కాకపోవడంతో లోకాలన్ని తల్లడిల్లి పోతున్నాయి. నన్ను నమ్మి నీ శాపం ఉపసంహరించు! లోకానికి శాంతి ప్రసాదించు!" అని పలికింది.
సుమతి అనసూయ పాదాలకు నమస్కరించి "తల్లీ! నీవు నా సౌభాగ్యం నిలబెట్టగల సమర్థు రాలివి. నీ మాట ప్రకారం నా శాపం ఉపసంహరిస్తున్నాను. సూర్యోదయం అవుగాక" అని ప్రకటించింది.
తక్షణమే సూర్య రథం కదిలింది. చీకట్లు తొలగి సూర్యోదయం కాసాగింది. ముల్లో కాలలో వెలుగు కిరణాలు వ్యాపించాయి. మాండవ్య ముని శాపం ప్రకారం కౌశికుడి తల వెయ్యి ముక్కలై నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు.
త్రిమూర్తులు ముగ్గురూ అనసూయ, సుమతి ముందు ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడు "సతీమ తల్లులారా! మీ వలన లోకాలకు శాంతి లభించింది. అనసూయాదేవి మాట గౌరవిస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నాను" అన్నాడు.
విష్ణువు చిరునవ్వుతో "కౌశికుడు నిరంతరం హరి నామస్మరణ చేసే నా భక్తుడు. పూర్వజన్మ కర్మల ఫలం వలన కుష్ఠురోగం, అకాల మృత్యువు పొందాడు. సుమతి పాతివ్రత్యంతో పాపాలు తీరి పునర్జీవుతుడు అవుతున్న కౌశికునికి దివ్య దేహసౌందర్యం, ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదిస్తున్నాను" అని వరమిచ్చాడు.
కౌశికుడు దివ్య సుందర శరీరంతో పునర్జీవితుడు అయ్యాడు. కౌశికుడు సుమతి ఆనందాశ్రువు లతో త్రిమూర్తులకు ప్రణమిల్లారు.
మహాదేవుడు వారిని "అమ్మా! సుమతీ! ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై సుఖసంతోషాలతో గడిపి శ్రీహరి పాదసన్నిధి చేరుకుంటారు"అని
ఆశీర్వదించాడు.
త్రిమూర్తులు అనసూయను ప్రశంసిస్తూ "తల్లీ! భూలోకంలోనే కాదు సమస్త విశ్వములో నిన్ను మించిన పతివ్రత లేదు. నీ పాతివ్రత్య మహిమ సకల లోకాలకు వ్యాపిస్తుంది. మీ మనోభిష్టం త్వరలో నెరవేరి మిమ్మల్ని తరింపచేసే పుత్రులు మీకు కలుగుతారు" అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు.
నారదుడు సరస్వతి లక్ష్మి మహేశ్వరికి సతీ సుమతి కథ వివరించి "మాతల్లారా! నాకు మీ నాథులైన త్రిమూర్తులు పలికిన మాటల్లో ఒక్కటి అర్థం కాలేదు. సూర్యోదయం ఆపిన సతీ సుమతి మహా పతివ్రత. ఆవిడ శాపాన్ని ఉపసహరించి తను గొప్పదనం తెలియజేసింది. ఆమెను మీ నాథులు ప్రశసించడం సరియైనదే. కానీ అక్కడకు ఇంద్రుడు పిలిస్తే వచ్చిన అనసూయాదేవిని మీ నాథులు విశ్వంలో సర్ అనసూయను మించిన పతివ్రత లేదు అని పొగిడారు.
త్రిమూర్తుల భార్యలు, త్రిలోక మాతలు మీరు పతివ్రతా శిరోమణులు అన్న విషయం విస్మరించారా లేక వేరే ఉద్దేశం ఉందా? అసలు అనసూయాదేవి పాతివ్రత్యాన్ని ఎవరు ఎప్పుడు పరీక్షించారు? లేదు కదా? ఎంత మహాపతివ్రతలైనా మీ నుంచే అంశలుగా జన్మిస్తారు కదా! మరి అనసూయాదేవి మీ కన్నా మహా పతివ్రతా? అంటూప్రశ్నించాడు.
సరస్వతి లక్ష్మి మహేశ్వరిలు ఒకరి నొకరు చూసుకున్నాడు. నారదుడు అడిగింది నిజమే కదా! తమను మించిన మహా పతివ్రతలు ఎవరున్నారు సృష్టిలో! తమ పతులే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అనసూయ తమ కన్నా మహా పతివ్రత అని త్రిమూర్తులే పరీక్షించి తేల్చాలి."ఈ పరీక్ష అనసూయకి కాదు మన భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి" అని ఉమాదేవి చెప్పడంతో సరస్వతి లక్ష్మి అవునన్నారు. నారదుడు తన వచ్చిన పని అయ్యిందని నారాయణ నారాయణ అనుకుంటూ వెళ్లి పోయాడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ నివాసాలైన సత్యలోకం వైకుంఠం, కైలాసం రాగానే సరస్వతి లక్ష్మిదేవి ఉమాదేవి భర్తలను అనసూయాదేవి పాతివ్రత్యం పరీక్షించి తమ కన్నా మహా పతివ్రత అని నిరూపించ మని చెప్పారు. త్రిమూర్తులు ముగ్గురు భార్యల కోరిక తీర్చ డానికి అత్రి మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్లారు.
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి