🙏*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *56వ భాగం*``
*వామనావతార కధ - శ్రీహరి వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి వద్దకు బయలుదేరి వెళ్ళుట!*```
శ్రీహరి దేవతలతో కలసి సాగర మధనం చేయాలని చెప్పాడని అన్న నారదుడి మాట విని ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి దానవుల అధిపతిగా క్షీర సాగర మధనంలో దేవతలతో కలసి పాల్గొన్నాడు.
తాత ప్రహ్లాదుని వలె బలి చక్రవర్తి అసురుడైనా మహావిష్ణువు పై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు.
శ్రీహరి కూర్మావతారం ధరించి మంధర పర్వతము సముద్రంలో మునగకుండా సహకరించినందుకు బలి చక్రవర్తి సంతోషించారు. కానీ అమృతం పుట్టగానే జగన్మోహిని అవతారం ధరించి కేవలం దేవతలకే పంచి దానవులను మోసం చేయడంతో బాధపడ్డాడు. శ్రీహరిని "దేవ దానవులను సమానంగా చూడకుండా దేవతల పక్షపాతి అయినందుకు" నిందించాడు.
మహావిష్ణువు భక్తుడి నిందను భరిస్తూ చిరునవ్వుతో "బలి చక్రవర్తీ! నీవు నా ప్రియ భక్తుడివి. మీ తాతగారైన ప్రహ్లాదుని వలె నాకు అత్యంత ఇష్టుడివి. ఒక్క విషయం గమనించు. దానవులు, అసురులు నీ లాగే మంచివారు కాదు. అనుక్షణం దాయాదిద్వేషంతో దేవతలను అన్యాయంగా ఓడించడానికి ప్రయత్నిస్తుంటారు. అమృత కలశం వెలువడగానే దానవులు తీసుకుని పారిపోవటం ఎందుకు? అలా చేయకపోతే నేనే దేవదానవులకు సమంగా పంచి వుండేవాడిని.
ధర్మరక్షణ కోసం ఆనాడు మీ తాత ప్రహ్లాదునియొక్క తండ్రి హిరణ్య కశిపుని సంహరించక తప్పలేదు. ఈనాడు అదే ధర్మ రక్షణ కోసం అమృతం దానవులకు దక్కకుండా చేసాను. ధర్మ పరిరక్షణలో నేను తన పర భేదం చూడను. అందరూ నాకు సమానులే. ధర్మం పాటించే నిన్ను త్వరలో ఉద్ధరిస్తాను" అని అదృశ్యమయ్యాడు.
దేవతల చేతిలో ఓడి పాతాళానికి పరిమితమైన బలి చక్రవర్తికి విజయం చేకూర్చడం కోసం రాక్షస గురువు శుక్రచార్యుడు బలి చక్రవర్తి చేత విశ్వజిత్యాగం చేయించాడు. యాగసమాప్తిలో అగ్ని భట్టారకుడు ప్రత్యక్షమై బలికి సూర్యుని గుర్రాలు వంటి గుర్రాలు కలిగిన దివ్య రథం, అక్షయ తూణీరం కల దివ్య ధనుస్సు, దివ్య కవచం ఇచ్చాడు.
ధర్మ పరిపాలన చేసే బలి చక్రవర్తి దివ్య ఆయుధాలతో అమిత బలసంపన్నుడైనాడు. శుక్రాచార్యుడి ఆశీస్సులు, మార్గదర్శనంతో అపార సైన్యంతో అమరావతి పై దండయాత్ర చేసాడు.
దేవగురువు బృహస్పతి బలిచక్రవర్తి అపార శక్తి, దైవానుగ్రహం కలిగివున్నాడని, అతనిని ఓడించటం ఆసాధ్యం అని గ్రహించి ఇంద్రాది దేవతలను స్వర్గం వదలి
పారిపోమన్నాడు. సమయం వచ్చేవరకు భూలోకపు అడవులలో దాక్కుని ఉండమన్నాడు.
ఇంద్రాది దేవతలు పారిపోవడంతో స్వర్గం బలిచక్రవర్తి హస్తగతమైంది. పాతాళం, భూమండలం, స్వర్గం జయించి బలిచక్రవర్తి ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. భూమి పైరాజ్యం, రాజధాని ఏర్పరచుకుని ముల్లోకాలను ధర్మబద్దంగా పరిపాలించ సాగాడు. దానవులు, అసురులు ఎవరు దుష్కర్మలు చేయకుండా జాగ్రత్త వహించాడు. యజ్ఞయాగాదులు చేస్తూ దేవాధిదేవులైన త్రిమూర్తులను సంతృప్తి పరిచాడు.
ఇంద్రాది దేవతలకు తమ స్వర్గం తిరిగి పొందే అవకాశం కనిపించక తల్లి అదితికి తమ బాధ చెప్పు కున్నారు. దేవతలు దీనులై అడవుల్లో జీవించడం చూసి అదితి దుఖ పడింది. భర్త కశ్యపునితో తన కుమారులు పడుతున్న కష్టాలు చెప్పి వారికి తిరిగి స్వర్గం, పూర్వ వైభవం లభించే ఉపాయం చెప్పమంది.
కశ్యపుడు "ఆనాడు దానవులను మోసం చేసినందుకు ఈనాడు దేవతలు అనుభవిస్తున్నది కర్మఫలం. పుత్ర వ్యామోహం విడిచి పెట్టుము. ఇదంతా విష్ణు మాయా విలాసం." అని చెప్పాడు.
అదితి వదలకుండా దేవతలకు స్వర్గం లభించే మార్గం చెప్పమని ప్రాధేయ పడటంతో కశ్యపుడు "అదితీ! శ్రీహరిని భక్తితో పూజించు! ఆయనే నీ కుమారుల కష్టాలు తీర్చగలడు. ఇందుకు కేవలం వాయుభక్షణ చేస్తూ నారాయణ వ్రతం చేయమని" మార్గదర్శనం చేశాడు.
అదితి భర్త కశ్యపుడు చెప్పినట్లు నియమ నిష్టలతో నారాయణ వ్రతం చేసింది.
శ్రీహరి ప్రత్యక్షమై "అదితి మాతా! నీ కుమారుల కష్టాలు తీర్చడానికి వారికి సోదరుడిగా నీ కడుపున జన్మించి
నీ కోరిక తీరుస్తాను" అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు.
అన్నట్టే కశ్యప మహర్షి తేజస్సుతో అదితి గర్భవతి అయ్యింది.
నవమాసాలు పూర్తి అయిన తరువాత భాద్రపద శుక్ల ద్వాదశి రోజున శ్రవణా నక్షత్రంలో అభిజిన్ముహుర్తంలో వామన రూపంలో విష్ణువు అదితికి జన్మించాడు. బాలునిగా పుట్టిన నారాయణుని చూసి సకల జగత్తు ఆనందించింది ప్రకృతి పరవశించింది. దేవతలు, మహర్షులు, దేవర్షులు విచ్చేసారు.
ఉపనయన వయస్సులో ఉన్న వామనునికి బృహస్పతి యజ్ఞోపవీతం ధరింపచేశాడు. సూర్యుడు గాయత్రీ మంత్రం ఉపదేశించాడు. తండ్రి కశ్యపుడు మేంజిని, మొల త్రాడు, తల్లి అదితి కౌపీనం ధరింపచేశారు. భూదేవి జింకచర్మం, చంద్రుడు దండం, ఆకాశదేవత ఛత్రము, బ్రహ్మ కమండలం, సరస్వతి జపమాల, సప్త ఋషులు దర్భలు, పవిత్రాలు ఇచ్చారు.
కుబేరుడు భిక్షాపాత్ర ఇవ్వగా అన్నపూర్ణ భవానీదేవి పూర్ణ భిక్ష పెట్టింది. వామనుడు అందరికి నమస్కరించి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. వచ్చిన మహర్షులు బలి చక్రవర్తి నర్మదానది ఉత్తర తీరంలో గురువు శుక్రా చార్యుడి ఆదేశంతో, ఆధ్వర్యంలో మహాయాగం చేస్తున్నాడని వామనునికి చెప్పారు.
వామనుడు తల్లిదండ్రులకు నమస్కరించి, తల్లి కోరిక తీర్చడానికి బలి చక్రవర్తి వద్దకు వెళ్లి వస్తానని అనుమతి, ఆశీర్వాదం తీసు కున్నాడు. దేవతలు, మహర్షులు సంభ్రమాశ్చర్యాలతోచూస్తుండగానే వామనుడు బలి చక్రవర్తి వద్దకు బయలుదేరాడు.
*తరువాత కధ రేపటి భాగంలోో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి