22, నవంబర్ 2023, బుధవారం

కర్కటేశ్వరస్వామి

 కార్తీకమాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం..!!


🌹 ఈరోజుఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చే కర్కటేశ్వరస్వామి...గురించి తెలుసుకుందాం...!!🌹


🌸నల్లమల అటవీప్రాంతంలో అత్యంత మహిమాన్వితమైన శివాల‌యం....


🌸కార్తీకమాసంలో తప్పక దర్శించుకోవలసిన శైవక్షేత్రం....

ఎటు చూసినా జలం, ఆకాశం కుండ పోత గా వర్షిస్తోంది... చుట్టూ జీవం నింపుకుని ఆకుపచ్చ గా కళ కళలు ఆడుతున్న భూమి... కుంభ వృష్టిలో తడిసి ముద్దవుతున్న నేలని చూస్తుంటే, ఆ నేల ఆసాంతం ఒక పెద్ద శివ లింగం లాగా, ఆకాశం పూజారి గా మారి నిండు గా అభిషేకం చేస్తున్నట్టు గా ఉంటుంది... 


🌸చుట్టూ పచ్చిక బయళ్లు... ఆపై జలజల పారే సెలయేళ్లు... కడప జిల్లాలోని గుండాలకోనలో ....

కొట్రాల గుండాలు, చెంచమ్మకోన, వాననీళ్ళగుట్టలు, మలిట్లకోన, పెద్ద కంజులు, చిన్న కంజులు, ముంతతువ్వ బండలు, జాలకోన, యానాది ఊట్ల, దొంగబండలు, ఊరగాయకుంట, కమ్మపెంట, కుందేలుపెంట, ఈతకాయ బండలు, కోటమారుకుంట, ఏనుగలబావి, స్వామి వారి పాదాలు, (ఆ పాదాలు కొలిచే వీలులేని ఎత్తులో అద్భుతంగా ఉంటాయి)  కోతులకుప్ప, నెప్పోడిసెల, కందిరేవులు, మట్లకోన, సలీంద్రకోన.. మొదలైన ప్రాంతాలు ప్రకృతి అందాలకు చిరునామాగా వెలుగొందుతుంటాయి. గుండాలకోనలో గుంజన జలపాతం,  ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.


🌸హరహర మహదేవ శంభోశంకర,

ఓం నమఃశ్శివాయ అంటూ... శివనామస్మరణలతో  మారుమోగిపోయిన.. గుండాల మల్లేశ్వరుడు ....ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాలోని చిట్వేలి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుండాలకోనలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో ప్రత్యక్షంగా దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. చిట్వేలి మండలం వెంకటరాజు పల్లి,పెద్దూరు, అనుంపల్లె గ్రామాల నుంచి దాదాపు 8కిలోమీటర్ల దూరంలో రిజర్వుఫారెస్టులో కొండ కోనల నడుమ దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ గుండాలకోన ఉన్నది. 


🌸వెంకటగిరి కొండలమీదుగా 6గుండాలను దాటుకుని 7వ గుండంలోనికి సుమారు 30 అడుగుల ఎత్తునుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తున్నది. గుండాల కోనలో వర్షాకాలంలో అతి ఉధృతంగాను, వేసవికాలంలో కూడా బాగానే నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న గుండం లోతు చూసిన వారు లేరని స్థానికుల కథనం. కార్తీకమాసంలోనూ, శివరాత్రి పర్వదినాలలోనూ భక్తులు ఈ క్షేత్రాన్ని విశేషంగా దర్శిస్తారు. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించిన గుండాలేశ్వరస్వామి ఆలయ ప్రాంతమే గుండాలకోనగా ప్రసిద్ధి చెందింది. 


🌸ఈ గుండంలో మునిగితే సర్వపాపాలు తొలగిపోతాయని, దెయ్యాలు వదులుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండం పక్కనే గుహ (పేటు)వుంది. 

ఈ గుహలో గుండాల ఈశ్వరుడు ఎండ్రకాయ రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. గుహ ద్వారంలో భక్తులు పూజలు, ఫలాలు ఉంచుతారు. వాటిని ఎండ్రకాయ లోనికి తీసుకుపోతే తమ కోర్కెలు నెరవేరినట్లుగా భక్తులు భావిస్తారు.


🌸 సంతానం లేని స్ర్తిలు గుండం సమీపంలోని వృక్షాలకు మొక్కుబడిగా ఊయలలు కడుతారు. ఎతె్తైన కొండల మధ్యలో భీకర శద్ధం చేస్తూ నీటి ప్రవాహం, సెలయేళ్ల గలగలలు ఆకాశాన్ని తాకినట్టుండే మహావృక్షాలు, పచ్చదనంతో ఈ ప్రాంతమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. 

ప్రకృతి అందాలకు నెలవైన ఈ గుండాలకోన దాదాపు 3వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి మనుమరాలైన ఈశ్వరమ్మను వివాహం చేసుకోగోరి నిరాకరణకు గురైన రంగరాజు (నగరిపాడు రంగనాయకుల స్వామి) కొంతకాలం ఈ గుండాలకోనలోనే తపస్సు చేశాడట. 


🌸అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎండ్రకాయరూపంలో భక్తులకు దర్శనమిస్తానని చెప్పాడని చెబుతారు. అయితే స్వామిని దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలకోర్చి భక్తులు 8కిలోమీటర్లు నడవాల్సిందే. కాని దట్టమైన అడవుల్లో దారి తప్పి క్రూరజంతువులకు బలైన సంఘనటలు కొన్ని జరిగాయి. అందుకే అటవీ అధికారుల అనుమతి, సహాయంతో ప్రయాణం సాగించటం మంచిదంటారు అధికారులు.


🌸శివరాత్రి పర్వదిన సందర్బంగా వందల మంది భక్తులు స్వామి వారిని దర్శిస్తారు... వారి కోసం స్వామి సేవకులు అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు.

*కార్తిక పురాణము - 10*


*కార్తిక పురాణము - 10*


*_కార్తిక పురాణము - పదవ అధ్యాయము_*


జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వ జన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను. ఆయూరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియగు భార్యగలదు. ఆబ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నముకొరకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యాన్యాదికమును శిరస్సుననుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ! నాకుఆకలి కలుగుచున్నది. త్వరగా వంటచేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్త యిట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటను లెక్కచేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యనుగొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యసంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికిపోయెను. సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆమాటవిని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి. అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు గొప్పకులమునందు బుట్టినవారు. మేము నిందుతులము. కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా? ఈప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను కొట్టెను. ఆమెయు వానిని కొట్టి వానిని విడిచ రాజమార్గమున బోవుచుండగా పైనజెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆస్త్రీ వానిని పట్టుకుని రతికేళికి రమ్మనమని పిలుచుకొనిపోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమునుబొంది భర్తవద్దకు బోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తీకపున్నమినాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ గలిగినది. ఆ హేతువులచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనే యాతనలనొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదాయని యొక బ్రాహ్మణునియడిగెను. అతడు ఈమె తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాటవిని చండాలుడు ఆశిశువును దీసుకొనిపోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును దీసికొనిపోయి తన ఇంటిలో దాసీగానున్నయొక స్త్రీకి నప్పగించెను. ఆదాసీది ఈమెను పెంచెనది. తరువాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరి పాదపద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు యెట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియములేదు. కార్తీకధర్మమునకు పాపములను నశింపజేయి సామర్ధ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరమునొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయి ఈకథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు. ఈకథను వినిపించువారు పాపవిముక్తులై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.


ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః


 రుద్రనాథ్ ఆలయం:- హిమాలయాలలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఐదు ఆలయాల సమూహాన్ని పంచ కేదార్ అని పిలుస్తారు. వాటిని పాండవులు మరియు వారి వారసులు నిర్మించారని నమ్ముతారు. వీటిలో, కేదార్‌నాథ్ II కేదార్ మధ్యమేశ్వర్ III కేదార్ తుంగనాథ్ మరియు IV కేదార్ రుద్రనాథ్ ధామ్ తలుపులు శీతాకాలంలో మూసి ఉంటాయి. రుద్రనాథ భగవానుడు నాల్గవ కేదార్ గా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈ ఆలయం చమోలి జిల్లాలో సముద్ర మట్టానికి 11808 అడుగుల ఎత్తులో ఒక గుహలో ఉంది. బుగ్యాల్ మధ్యలో ఉన్న గుహలో శివుని ముఖారబింద్ ముఖం కనిపిస్తుంది.భారతదేశంలో శివుని ముఖాన్ని పూజించే ఏకైక ప్రదేశం ఇదే. ఇండోనేషియాలో ఏకానన్ రూపంలో రుద్రనాథుడు, నేపాల్‌లో చతురానన్ రూపంలో పశుపతినాథుడు మరియు పంచనన్ విగ్రహ రూపంలో శివుడు కనిపిస్తారు. రుద్రనాథ్ ధామ్ కు చాలా మంది యాత్రికులు గోపేశ్వర్ సమీపంలోని సాగర్ గ్రామం నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. గోపేశ్వర్‌లో ఉన్న గోపీనాథ్ ఆలయంలో రుద్రనాథ్ స్వామిని పూజిస్తారు, శీతాకాలంలో తలుపులు మూసివేస్తారు.

నవగ్రహా పురాణం🪐*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *83వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ చరిత్ర - 10*


బ్రహ్మ మానస పుత్రుడైన వశిష్ఠ మహర్షి తపస్సు అచిరకాలంలోనే ఫలించింది. పరమశివుడు ఆయన ముందు సాక్షాత్కరించాడు. 


*"వశిష్ఠా! వరం కోరుకో !"* శివుడు చిరునవ్వుతో అన్నాడు.


*"పరమేశ్వరా ! నీకు తెలియదా ? మీ శాపం మూలంగా వైవస్వతుడి ఏకైక పుత్రుడు సుద్యుమ్నుడు స్త్రీగా మారిపోయాడు.”* 


*"ఇలా సుందరి బుధుణ్ణి భర్తగా స్వీకరించి , పుత్రుణ్ణి పొందింది కద !"* శివుడు నవ్వుతూ అన్నాడు.


*"లేక లేక కలిగిన ఏకైక పుత్రుణ్ణి కోల్పోయిన వైవస్వత దంపతులు నిరంతర విచారంలో మునకలు వేస్తున్నారు. రాజ్యానికి వారసుడు లేడు. కరుణామయా ! శాపాన్ని ఉపసంహరించి , వైవస్వతుడికి పుత్రభిక్ష ప్రసాదించు. గతంలో పుత్రికను పుత్రుడిగా మార్చి వైవస్వతుడి కోరిక తీర్చిన నా సహాయాన్ని సార్ధకం చేయి !"* వశిష్ఠుడు చేతులు జోడించి ప్రార్ధించాడు.


*"ఆ శాపం మా దంపతులది. అందులో ఈ అర్ధ నారి ఈశ్వరుడి భాగం అర్ధమే సుమా !"* శివుడు చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు. *“అందువల్ల శాపాన్ని సగం మాత్రమే. ఉపసంహరిస్తాను...”*


*"సగమా ?"* వశిష్ఠుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"వైవస్వతుడికి అన్యాయం జరగకూడదు. బుధుడికీ అన్యాయం జరగరాదు. అక్కడ తనయుడు కావాలి. ఇక్కడ ధర్మపత్ని కావాలి. ఒక మాసం సుద్యుమ్నుడుగానూ , ఒక మాసం ఇలగానూ జీవితాంతం కొనసాగేలా అనుగ్రహిస్తున్నాను."*


*"పరమేశ్వరా !”*


*"సుద్యుమ్నుడు సుద్యుమ్నుడుగా ఒక నెల పాటు రాజ్యం చేస్తాడు ! ఇలగా ఒక నెల పాటు బుధుడి ఆశ్రమంలో గృహిణీపదం నిర్వర్తిస్తాడు. శుభం భూయాత్ !"* అంటూ పరమశివుడు అంతర్ధానమయ్యాడు.


సూర్యోదయ సమయం. సరస్సులో వికసించిన పద్మాలు... నీటిలోంచి పైకి తేలిన బుధుడు , ఇల చేతుల్లోంచి పురూరవుణ్ణి అందుకుని , గట్టు వైపు వెళ్ళాడు.


పురూరవుణ్ణి నేల మీద నిలుచోబెట్టి , పొడి గుడ్డతో తేమను తుడిచాడు బుధుడు. తండ్రి చేస్తున్న పని తనకు పట్టనట్టు పురూరవుడు కొలనులో ఈదుతున్న తల్లినే చూస్తున్నాడు. పురూరవుడి వైపు నవ్వుతూ చూసింది. పురూరవుడు నవ్వుతున్నాడు. రెండు తామర పువ్వుల మధ్య మెరుస్తూ కనిపిస్తున్న అమ్మ ముఖాన్ని ఆనందంగా చూస్తూ.


*"నాన్నగారూ ! రెండు పద్మాల మధ్య అందమైన పద్మం ! ఎవరో చెప్పుకోండి !"* అన్నాడు పురూరవుడు.


బుధుడు సరస్సు వైపు తిరిగాడు. రెండు తామర పువ్వుల మధ్య ఆ రెండింటిని అందంలో వెక్కిరిస్తూ ఇల ముఖపద్మం దర్శనమిచ్చిందాతనికి.


ఇల నవ్వుతూ నీటిలో మునిగింది. పద్మాల మధ్య మళ్ళీ ప్రత్యక్షమయ్యే ఆమె ముఖారవిందం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు బుధుడు. పురూరవుడు కూడా అటే చూస్తున్నాడు.


ఉన్నట్టుండి రెండు పద్మాల మధ్య ముఖం పైకి లేచి , ప్రత్యక్షమైంది. ఆ ముఖం ఇలది కాదు ! ఆ ముఖం స్త్రీది కాదు ! ఆ ముఖం పురుషుడిది !


*"నాన్నగారూ ! అమ్మ...అమ్మ ఏదీ ?”* పురూరవుడు మెల్లగా అడిగాడు కొత్త ముఖాన్ని చూస్తూ.


బుధుడు సమాధానం చెప్పే స్థితిలో లేదు. ఇల ఏమైంది ? ఆ పురుషుడు ఎవరు ? పురుషుడు ఇద్దర్నీ చిరునవ్వుతో చూస్తూ , వాళ్ళ వైపు ఈదుతూ వస్తున్నాడు. బుధుడి చూపులు జంటతామరలవైపూ , ఆ పురుషుడి వైపూ చూస్తూ ఉండిపోయాయి.


కొలను గట్టును సమీపించిన ఆ పురుషుడు , నీళ్ళలోనే నిలుచున్నాడు , బుధుడి వైపు చిరునవ్వుతో చూస్తూ. *"ఎవరు నువ్వు ? నా భార్యను ఏం చేశావ్ ?"* బుధుడు తీక్షణంగా చూస్తూ అడిగాడు.


ఆ పురుషుడు అర్ధం కానట్టు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. *"ఏమిటి స్వామీ...”* ఏదో అనబోయిన అతను , తన కంఠస్వరం విని నిర్ఘాంతపోతూ , మౌనం ధరించాడు. మెల్లగా తలవాల్చి తనను తాను చూసుకున్నాడు. బుధుడు ఆశ్చర్యంతో ఆలోచనలలో మునిగిపోయాడు.


ఇల , తన ప్రేయసి , తన ఇల్లాలు - పురుషుడిగా మారిపోయిందా ? ఆ వశిష్ఠమహర్షి అన్నంత పనీ చేశాడా ? తాను పత్నీ విహీనుడయ్యాడా ? పురూరవుడు మాతృ విహీనుడయ్యాడా ?


*"స్వామీ ! ఇది నా పురుష రూపం ! ఇది - ఇప్పుడు మీరు చూస్తోంది నా పూర్వరూపం...”* అంతసేపూ తన శరీరాన్ని పరిశీలనగా చూసుకున్న పురుషుడు ఆశ్చర్యంతో అన్నాడు.


*"ఇలా..."* బుధుడు అప్రయత్నంగా అన్నాడు.


*"స్వామీ ! వశిష్ఠమహర్షి ప్రయత్నం ఫలించి నట్లుంది... స్వామీ..."* సుద్యుమ్నుడిగా మారిపోయిన ఇలా విచారంతో అంది.


బుధుడు బలహీనంగా నేల మీద కూర్చుండి పోయాడు.


*"నాన్నగారూ... అమ్మ ఏదీ ?"* పురూరవుడు ఏడుపును ఆపుకుంటూ అడిగాడు. 


బుధుడు పురూరవుణ్ణి హృదయానికి హత్తుకుని , బరువుగా నిట్టూర్చాడు. *"అమ్మ... లేదు నాయనా..."*


ఆశ్రమం ముందు అరుగు మీద ముగ్గురూ విచార వదనాలతో కూర్చున్నారు. బుధుడి చూపులు సుద్యుమ్నుడి మీదే ఉన్నాయి. బలిష్టమైన , ఎత్తైన విగ్రహం , గంభీరంగా అగుపించే ముఖం. పౌరుషాన్నీ , దర్పాన్ని వ్యక్తం చేస్తున్న మీసాలు...


బుధుడు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. అమ్మ గురించి అడిగి , అడిగీ అలసిపోయిన పురూరవుడు తండ్రి వొడిలో వాలాడు. పరిస్థితి తమకు కూడా అర్థమైనట్టు ఆశ్రమ జంతువులు స్తబ్దంగా పడుకున్నాయి.


*"నాయనా , సుద్యుమ్నా !"* ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ , ఆశ్చర్యంగా పిలిచిన వశిష్ఠుడి కంఠస్వరం వాళ్ళను ఉలిక్కిపడేలా చేసింది. వశిష్ఠుడు రథం దిగి వస్తున్నాడు.


*“గురుదేవా !”* సుద్యుమ్నుడు కూర్చున్న చోటు నుంచి లేచి , వశిష్ఠునికి ఎదురువెళ్ళాడు. 


వశిష్ఠ మహర్షి ఆగి తను చెక్కిన శిల్పాన్ని తృప్తిగా చూస్తున్నట్లు సుద్యుమ్నుడిని చూస్తూ ఉండిపోయాడు. సుద్యుమ్నుడు , ఆయనకు పాదాభివందనం చేశాడు.


*"సుఖీభవ !"* వశిష్ఠుడు దీవించాడు. విజయోత్సాహంతో సుద్యుమ్నుడి ముఖంలోకి చూశాడు. *"ఎన్నాళ్ళయింది సుద్యుమ్నా , నిన్ను చూసి !".* 


*“గురుదేవా...”*


*"మళ్ళీ ఇన్నాళ్ళకు ఆ పరమేశ్వరుడి కృపతో నిన్ను నిన్నుగా చూస్తున్నాను. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో ఊహించలేను సుమా!"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు. 


*“ఒకరికి సంతోషం...మరొకరికి సంతాపం...”* సుద్యుమ్నుడు నిరుత్సాహంగా అన్నాడు.


*“ఒక్కసారి ఆ తండ్రీ కొడుకులను చూడండి."*


వశిష్ఠుడు బుధుణ్ణి , పురూరవుణ్ణి చిరునవ్వుతో చూస్తూ , వాళ్ళ వైపు నడిచాడు. బుధుడు లేచి , మౌనంగా నమస్కరించాడు. పురూరవుడు కూడా లేచి , దగ్గరగా వచ్చిన వశిష్ఠ మహర్షికి పాదాభి వందనం చేశాడు.


*“చిరాయుష్మాన్భవ ! పురూరవుడు తల్లిదండ్రులకు తగ్గ తనయుడు.”* అంటూ కుర్రవాడి తల నిమిరాడు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

పెరియ పురాణం⚜️* . *నాయనార్ల చరిత్ర - 06*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 06*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 *6. అమర్నీతి నాయనారు*


‘ఏళైయారై’ అనే నగరంలో ఒక వైశ్య కుటుంబంలో అమర్నీతి

నాయనారు అనే శివభక్తుడు జన్మించాడు. ఒక పర్యాయం పరమేశ్వరుడు

కౌపీన మహిమను అమర్నీతి నాయనారుకు తెలియజేసి అతన్ని తన కరుణా

కటాక్షాలచే అనుగ్రహించాలనే తలంపుతో బ్రాహ్మణ బ్రహ్మచారి వేషాన్ని

ధరించి వచ్చాడు. 


బ్రహ్మచారి వేషధారిని చూడగానే అమర్నీతి నాయనారు వేగంగా వచ్చి బ్రహ్మచారికి నమస్కరించి అతన్ని తన మఠానికి

ఆహ్వానించాడు. "మీరు ఈ రోజు మా మఠంలో భోజనం ఆరగించి మమ్మల్ని

ధన్యులను చేయాలి” అని నాయనారు ఆ మాయాబ్రాహ్మచారిని అర్ధించాడు.

బ్రహ్మచారి దానికి అంగీకరించి "నేను కావేరినదిలో స్నానం చేసివస్తాను.


ఈ కౌపీనాన్ని మీరు భద్రంగా దాచి ఉంచి నేను స్నానం చేసి తిరిగి వచ్చినపుడు మీరు నాకు ఇవ్వండి" అని చెప్పి కౌపీనాన్ని నాయనారు

చేతుల్లో పెట్టి స్నానానికి బయలుదేరాడు. నాయనారు ఆ కౌపీనాన్ని తీసుకొని

దానిని ఒక భద్రమైన స్థలంలో జాగ్రత్తగా ఉంచాడు. మాయా బ్రాహ్మణుడు

ఆ కౌపీనాన్ని మాయ మయ్యేటట్లుగా చేశాడు. 


కొంత సమయమైన తరువాత

కావేరినదిలో స్నానంచేసి మాయా బ్రాహ్మణుడు మఠానికి తిరిగి వచ్చాడు.

“నదిలో స్నానం చేయడం వలన నా శరీరం తడిసిపోయింది నేను నీ

దగ్గర ఇచ్చిన కౌపీనాన్ని తెచ్చి ఇవ్వు" అని బ్రాహ్మణుడు నాయనారుతో

చెప్పాడు. నాయనారు వేగంగా లోపలికి వెళ్లి తాను పూర్వం కౌపీనాన్ని

భద్రపరిచిన స్థలంలో చూడగా అది కనిపించలేదు. ఎంత వెతికినా ఆ

కౌపీనం వారికి దొరకలేదు. 


అప్పుడు నాయనారు బ్రాహ్మణుని దగ్గరికి

వెళ్లి "స్వామీ! మీరు నాదగ్గర ఇచ్చి వెళ్లిన కౌపీనం నేను పెట్టిన చోటులో

కనిపించలేదు. నేను వేరొక మంచి కౌపీనం తీసుకువచ్చాను. దానికి

 బదులుగా మీరు దీనిని ధరించి నా తప్పులను క్షమించండి" అని ప్రార్థించాడు.


 బ్రాహ్మణుడు కోపంతో "నేను నీ దగ్గర ఇచ్చి వెళ్లిన కౌపీనాన్ని

అపహరించి దానికి బదులుగా వేరొక కౌపీనాన్ని తీసుకోండి అని చెప్పడం

న్యాయమా?” అంటూ కోపంతో ఎగసి పడ్డాడు. నాయనారు "స్వామీ! ఈ

దాసుడు చేసిన అపరాధాన్ని క్షమించండి. ఈ కౌపీనానికి బదులుగా మీకు

ఇష్టమైన పట్టువస్త్రాలను, మాణిక్యాలను తీసుకొని నన్ను అనుగ్రహించండి"

అని ఆ బ్రాహ్మణుని తిరుచరణాలపై భక్తితో వాలిపోయాడు. 


బ్రాహ్మణుడు కోపాన్ని ఉపశమించుకొన్న వాడివలె "బంగారం, మాణిక్యాలు, నూతన వస్త్రాలు నాకెందుకు? కౌపీనం బరువుకు సమానంగా ఒక కౌపీనం నాకు

ఇస్తే చాలు” అన్నాడు. నాయనారు త్రాసును తీసుకురాగా బ్రాహ్మణుడు

తన కౌపీనాన్ని ఒక తట్టలో ఉంచాడు. నాయనారు శివభక్తులకు ఇవ్వడం

కోసం తన దగ్గర ఉన్న కౌపీనాలన్నింటిని తట్టలో పెట్టినప్పటికీ అవి

బ్రాహ్మణుని కౌపీనానికి సమానం కాలేక పోయాయి. 


నాయనారు తన

దగ్గరున్న బంగారం, వెండి, అపూర్వములైన రత్నాలు, ధన ధాన్యరాశులు

త్రాసుతట్టలో పెట్టినప్పటికీ ఆ త్రాసుపైనే నిలిచింది. అప్పుడు నాయనారు

"స్వామీ! నా సిరి సంపదలన్నింటినీ ఏ ఒక్కటీ వదలక త్రాసులో పెట్టాను.

ఈ దాసుడు, దాసుని భార్య, కుమారుడు అర్హులుగా భావిస్తే ఈ త్రాసులో ఎక్కడానికి అనుమతించండి" 


అని బ్రాహ్మణుని ప్రార్ధించగా బ్రాహ్మణుడు

దానికి సమ్మతించాడు. భగవంతుని విభూతికి నిజమైన దాస్యభక్తిని గల

మేము భక్తిలోను, ప్రేమలోను కళంకం ఏదీ చేయనట్లేతే మేము ఎక్కిన

వెంటనే ఈ త్రాసు సరిసమానంగా తూగాలి" అని తిరునల్లూరులో నెలకొని

ఉన్న కళ్యాణ సుందరేశ్వర స్వామికి ప్రణమిల్లి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ

అందరితో కలసి త్రాసు ఎక్కాడు. ఆ బ్రాహ్మణుడు ధరించిన కౌపీనము,

 అమర్నీతి నాయనారు శివునికి భక్తితో చేసిన దాస్యం రెండూ సమానంగా

ఉండడంవల్ల రెండూ తట్టలూ సరిసమానంగా తూగాయి.


ప్రజలందరూ అద్భుతాశ్చర్యాలతో నాయనారుకు నమస్కరించారు.

కళ్యాణసుందరేశ్వరస్వామి జగన్మాత అయిన కళ్యాణసుందరితో కలసి

ఆకాశంలో ప్రత్యక్షమై అమర్నీతి నాయనారుకు దర్శన భాగ్యంతో పాటు

అక్షీణమైన శివలోక పదవిని అనుగ్రహించాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

      *ఆరవ చరిత్ర సంపూర్ణం*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 . *భాగం 93*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 93*


*ఆస్తుల విషయంలో తలెత్తిన బేధాభిప్రాయాలు...*


1886 ఆగస్ట్ 31వ తేదీతో కాశీపూర్ ఉద్యానగృహ బాడుగ గడువు తీరి పోయింది. ఇల్లు ఖాళీచేసి ఇవ్వవలసిన అగత్యం ఏర్పడింది. ఆ యువకులు ఎక్కడకు పోగలరు? వారిలో పలువురు అక్కడ నివసించి శ్రీరామకృష్ణుల అస్థికలను ఆరాధించుకొంటూ తపోమయ జీవితం గడపాలని ఆశించారు. కాని అద్దె ఎవరు చెల్లిస్తారు?. బలరాంబోసు, సురేంద్రనాథ్ మిత్ర, గిరీశ్ ఘోష్ ప్రభృతులు యువ శిష్యులు నివసించడానికి ఒక మఠం ఏర్పాటు చేయవచ్చుననే అభిప్రాయానికి ఆమోదముద్ర వేశారు. కాని రామచంద్రదత్తా, మరి ఒకరిద్దరు ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించి ఆ యువకులతో, 


"ఈ విధంగా మీరు ఇల్లూవాకిలీ త్యజించి సన్యాసులు కావాలని గురుదేవులు చెప్పలేదు. మీ మీ ఇళ్లకు తిరిగి వెళ్లిపోండి. గురుదేవులు చెప్పినట్లు సంసారంలోనే ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని రూపొందించుకోండి. అస్థికలను పూజించే విషయం గురించి మీరు ఆందోళన చెందనక్కరలేదు. కాంకూర్ గాచ్ఛి లో నాకు ఒక తోట ఉంది. అక్కడ ఆయన అస్థికలను ప్రతిష్ఠించి నిత్యారాధన చేసేలా ఏర్పాట్లు చేశాను. దానిని గురించి మీరు ఏమాత్రం ఆందోళన చెందనవసరం లేదు" అని చెప్పాడు.. 


యువకులలో ఎవరూ రామచంద్ర దత్తా యోచనను సమ్మతించలేదు. గంగాతీరంలో ఒక అనువైన స్థలంలో అస్థికలను ప్రతిష్ఠించి నిత్యార్చనకు ఏర్పాట్లు చేయాలని వారు అభిలషించారు. ఇలాంటి భావననే ఒకసారి శ్రీరామకృష్ణులు మునుపు వ్యక్తం చేశారు. కాని ప్రస్తుతం అందుకు మార్గం లేనట్లు కనిపించింది.. తక్షణమే ఒక స్థలం ఏర్పాటు చేసుకోవడం కుదరని పని. నెమ్మదిగా ఆ పని చేయవచ్చు. కనుక అస్థులను తమ వద్దే ఉంచుకోవాలని యువకులు భావించారు. ఈ అభిప్రాయభేదం పాకానపడి ఒక సమస్యగా పరిణమించింది. 


ఇదంతా విన్న మాతృదేవి, "సాటిలేని మహాపురుషుణ్ణి కోల్పోయి నిలబడి ఉన్నాను. వారేమో ఆయన అస్థికల కోసం పోట్లాడుకొంటున్నారు” అన్నారు. ఆవేదనతో.


చివరికి నరేంద్రుడు జోక్యం చేసుకొని, "సోదరులారా! మనం ఇలా పోట్లాడుకోవడం సబబు కాదు. పరమహంస శిష్యులు అస్థికల కోసం పోట్లాడుకొంటున్నారని లోకులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వకండి. అంతేకాదు; ఇకపై మనం ఎక్కడ నివసించాలో కూడా నిర్ణయించుకోలేదు. ‌ఇది ఇలావుండగా అస్థికలను ఎలా పదిలపరచగలం? రాంబాబు తన ఉద్యాన గృహంలో అస్థికలను  ప్రతిష్ఠించి, దానిని శ్రీరామకృష్ణుల పేరిటే కదా ఏర్పాటు చేయబోతున్నాడు! 


 మనమూ అక్కడకు వెళదాం, ఆయనను ఆరాధించుకొందాం. గురుదేవులు చూపిన ఆదర్శం ప్రకారం జీవించి చూపితే అది ఈ అస్థికలను పూజించడం కన్నా మహత్తరమయినది" అన్నాడు. నరేంద్రుడు చెప్పిన తరువాత అందరూ అందుకు అంగీకరించారు. ఆగస్ట్ 23వ తేదీ కృష్ణజయంతి పర్వదినం నాడు అస్థికలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు.


ఈ ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ యువశిష్యులలో ఏదో చెప్పరాని వెలితి ఉండనే ఉంది. చివరికి నరేంద్రుణ్ణి సంప్రతించి యువకులందరూ ఇలా తీర్మానించారు: ఆగస్ట్ 22వ తేదీ అస్థులలో అధిక భాగం ఎవరికీ తెలియకుండా మరొక కలశంలో మార్చి తమ కోసం ఉంచుకొన్నారు.


కృష్ణ జయంతి రోజు ఉదయం శశి అస్థికల కలశాన్ని తన తల మీద పెట్టుకొని రాగా, అందరూ కాంకూర్ గాచ్చికి వెళ్లి విధివిహితంగా అక్కడ అస్థులను ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తించారు. కాని యువశిష్యులు అస్థికలు విభజించిన విషయం త్వరలోనే అందరికీ తెలియవచ్చింది. అప్పుడు గృహస్థ భక్తులు, "గురుదేవుల సంకల్పం అదే అయితే, అట్లే జరగనీ” అని చెప్పి మౌనంగా ఉండిపోయారు.🙏

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సౌందర్యలహరి🌹* . *శ్లోకం - 83*

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

.          *🌹సౌందర్యలహరి🌹*

.                   *శ్లోకం - 83*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷

    

   *పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే*

 *నిషంగే జంఘే తే విషమవిశిఖో బాఢ మకృత |యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ*  *నఖాగ్రచ్ఛద్మానస్సురమకుటశాణైకనిశితాః ‖*


ఇక అమ్మవారి వర్ణన పాదములు,నఖముల వద్దకు వెళ్తున్నది. అయితే ముందుగా ఆమె కాలి పిక్కలను వర్ణిస్తున్నారు. మన్మధుడిని శివుడు తన త్రినేత్రంతో భస్మము చేయటం, రతీదేవి ప్రార్థనపై అమ్మవారు అతడిని అనంగుడిగా (అంగములు లేనివాడుగా) అదృశ్యుడుగా రతీదేవికి మాత్రమే కనబడునట్లుగా తిరిగి బ్రతికించటం మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం.

ఇప్పుడు మన్మధుడు ఎలాగైనా శివునికి పార్వతీదేవికి పరిణయం చేయించవలెననే పట్టుదలతో మళ్లీ తన పుష్పబాణ ప్రయోగం చేయటానికి వచ్చాడు .


పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే = ఆ విధంగా ముందు పరాజితుడైన మన్మధుడు ఈసారి రెండు అమ్ములపొదులు ఇరుభుజాల ధరించి వచ్చాడట. ఒక్కొక్కదానిలో అయిదు పుష్పబాణాలు పెట్టుకొని.


నిషంగే జంఘే తే  విషమవిశిఖో బాఢ మకృత = అమ్మవారి కాలిపిక్కలు ఈ అమ్ములపొదులవలె వున్నాయట .


యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ = ఆ అమ్ములపొదులనుండి బయటకు వచ్చి కనబడుతున్న ఆ బాణాగ్రములు, అమ్మవారి సుకుమారమైన పాదముల వ్రేళ్ళ వలె వున్నాయట .


నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితాః = ఆ వ్రేళ్ళకు వున్న నఖములు నునుపుగా మెరుస్తున్నాయట. ఎందువల్లనంటే ముక్కోటి దేవతలు నీకు నమస్కరించినప్పుడు వారి కిరీటములు నీ నఖములకు తాకి అవి నిశితములై మెరుస్తున్నాయమ్మా అంటున్నారు శంకరులు.


           🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పంచాంగం 22.11.2023 Wednesday

 ఈ రోజు పంచాంగం 22.11.2023  Wednesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస శుక్ల పక్ష: దశమి తిధి సౌమ్య వాసర: పూర్వాభాద్ర  నక్షత్రం హర్షణ యోగ: తైతుల తదుపరి గరజి కరణం ఇది ఈరోజు పంచాంగం.


దశమి రాత్రి 11:04 వరకు.

పూర్వాభాద్ర సాయంత్రం 06:37 వరకు.

సూర్యోదయం : 06:28

సూర్యాస్తమయం : 05:35

వర్జ్యం : రా.తె 03:40 నుండి 05:11 వరకు.

దుర్ముహూర్తం : పగలు 11:39 నుండి 12:24 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00  నుండి 01:30 వరకు.


యమగండం : పగలు 07:30 నుండి 09:00 వరకు


శుభోదయ:, నమస్కార:

అనాది ఆచారానికి వివరణ..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*అనాది ఆచారానికి వివరణ..*


*(ముప్పై ఐదవ రోజు)*


ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని  చెపుతూ శ్రీ స్వామివారు..


"తల్లీ ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా..ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది..అది చెపుతాను శ్రద్ధగా వినండి..ఇందాక మీరు అపవిత్రం అన్నారు గదా..అది ఎందువల్ల వచ్చింది?..మల మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగా.. ఈ బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది కాబట్టి..అప్పుడు ఆ స్ర్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక..ఎక్కువ విశ్రాంతి కలుగ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని పెట్టారు..అలాగే.. ఆ సమయంలో దైవ విగ్రహాలు స్పృశించటం..దైవారాధన గదిలోకి..అదేనమ్మా పూజా గృహం లోకి ప్రవేశించడం నిషేధించారు..ఆ మూడురోజులూ పిల్లలకు భర్తకు దూరంగా వుండమని కూడా చెప్పారు..ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఆ ఏర్పాటు చేశారు..పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయగూడదనే ఆ నియమం పెట్టారు..శిరస్సు ద్వారా..నోటి ద్వారా..చెవి, ముక్కు, కళ్ల ద్వారా ప్రాణం పోయిందనుకో..అది ఊర్ధ్వ లోకాల ద్వారా పోయినట్లు..నాభి క్రింద రంధ్రాల ద్వారా ప్రాణం పోతే..అది అధో లోకాల ద్వారా వెళ్లిందని అర్ధం.."


"అమ్మా!..ఒక విషయం గుర్తుపెట్టుకో..భగవన్నామోచ్చారణ అనేది అగ్ని లాటిది..అది నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి..అలా చేయగా చేయగా..ఆ అగ్ని మన మనసునూ..శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి..ఏ మలినమూ అంటకుండా చేస్తుంది..ఆ భగవన్నామోచ్చారణానికి ఒక ప్రదేశం..ఒక బహిష్టు..ఒక అపవిత్రత అనేవి లేవు గాక లేవు!..అందుచేతే సద్గురువులు కోటి జపం..నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి..ఆ భగవంతుడి నామోచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు.."


"ఇప్పుడర్ధమైందా తల్లీ!..నీవు నీ సాధారణ పనులు చూసుకో..నాకు ఆహారం ఎవరిచేతనైనా ఇప్పించు..నేను స్వీకరిస్తాను..నిరంతర నామోచ్చారణ అనే సూర్యడు వెలుగుతుండగా..ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా?..నీ మానసిక జపం నీవు చేసుకుంటూ వుండు!..ఇక పూజ గదిలోకి నీవు ఎలాగూ వెళ్లవు.. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు..శ్రీధరరావు గారూ మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి.." అన్నారు..


శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికీ సందేహాలు తొలగిపోయాయి..శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్లి..ధ్యానం చేసుకోసాగారు.. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద..వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి..


బొగ్గవరపు చిన మీరాశెట్టి గారి దంపతులు కూడా..వారం లో మూడురోజుల పాటు..శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగుచేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి పోతున్నారు...ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయింది.. 


అది నవంబరు నెల చివరి రోజులు..శ్రీ స్వామివారు మొగలిచెర్ల లోని శ్రీధరరావు గారింటికి వచ్చి రమారమి ఇరవై రోజులు దాటిపోయాయి..చలి కూడా బాగా పెరిగింది..అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుఝామున లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు..వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజూ ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉన్నది..శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తరువాత..ప్రభావతి శ్రీధరరావు గార్లు..శ్రీ స్వామివారు చెప్పిన విషయాల గురించి తర్కించుకోవటం అలవాటుగా మారింది..


శ్రీధరరావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు..తమ పూర్వపుణ్యం కొద్దీ..ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగుపెట్టాడనీ..ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఇక్కడే బస చేస్తారు కనుక..మరిన్ని మహాద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చనీ..భావించారాదంపతులు..


కానీ...


దైవ లీలలు మరోలా ఉంటాయి..


శ్రీ స్వామివారు ఆశ్రమ స్థలానికి తరలి వెళ్లడం..రేపు..



*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx




సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - శుక్ల పక్షం  -‌ దశమి - పూర్వాభాద్ర -‌  సౌమ్య వాసరే* *(22-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/uOsXIDMRnNU?si=P4c1dQ3IhPkmX-nc


🙏🙏

21, నవంబర్ 2023, మంగళవారం

GarikapaaTi pravachan