25, నవంబర్ 2024, సోమవారం

కార్తిక పురాణము - ఇరవై ఐదవ అధ్యాయము

 *కార్తిక పురాణము - ఇరవై ఐదవ అధ్యాయము*

*బ్రాహ్మణ తిరస్కారం-ఫలితము*


బ్రాహ్మణులు, అంబరీష మహారాజా! నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి ఉరితాడు ప్రాప్తమైనది.ఇది నీ పూర్వ పాతకము వలన సంభవించినది.ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థులము గాము. పారణను ఆపితే హరిభక్తికి లోపము కలుగును.పారణ చేయించిన దూర్వాసుడు శాపమిచ్చును.కనుక ఎట్లైనను కీడు రాక తప్పదు. అందులకు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుమని బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పెను.

ఓ బ్రాహ్మణులారా! హరిభక్తిని విడుచుటకంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిపుడు కొంచెము జలము చేత పారణ చేసెదను.ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు.ఇచ్చట సృత్యర్థబోధక ప్రమాణము *"కర్తుంసాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్! కృతాపః ప్రాశనా త్పశ్చాద్భుంజీత్యేత్యపరేజగురితి!!"* కాబట్టి జల పారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు.బ్రాహ్మణ తిరస్కారమున్నూ ఉండదు.ఇట్లు చేసిన యెడల దుర్వాసుడు శపించడు.నా జన్మాంతర పాతకము నశించును. రాజిట్లు నిశ్చయించి జలముచేత పారణ చేసెను.

అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించు వాని వలె అంబరీష మహారాజును చూచి చెవులకు వినశక్యము గాని కఠినమైన వాక్యములను ఈవిధముగా పల్కెను.

ఓ రాజా! అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగ కారిణియైన దుర్భుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానమాచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించిన వాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించిన వాడు అందరికంటే అధముడు.వాడు ఆశుద్ధములో ఉండు పురుగు వలె మలాశియగును. ఆత్మార్థము వంట చేసికొన్న వాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించిన వాడు పాపముల పరంపరను భుజించుచున్న వాడగును.అగ్ని పక్వమైనది గాని, పక్వము గానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడనయిన అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్న ప్రతినిధియగు జలమును త్రాగితివి.బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా! ఎప్పుడైననూ బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా?నీకు హరి దేవుడెట్లగును? అతనియందు నీ భక్తి ఎట్టిది?బ్రాహ్మణ విషయమందును, హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడనైన నన్ను వదిలి భుజించితివి గాని బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారము తోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని గూడ తిరస్కరించినవాడవైతివి.

రాజా! ఇప్పడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరీ! నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గమునను నశింపచేయుచున్నావు.

ఓరీ పాపాత్మా! ఈ భూమియందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్నాశ్రయించ వత్తురు. నీవు దుర్మార్గుడవు.గనుక వారిని బాధించెదవు.నీవు ధర్మ కంటకుడగుదవు.

దూర్వాసుడు ఇట్లు పలుకగా విని అంబరీషుడు నమస్కరించి ఇట్లని ప్రార్థించెను.

అయ్యా! నేను పాపుడను.పాపకర్ముడను.పాప మానసుడను.నిన్ను శరణు వేడెదను.నన్ను రక్షించుమని కోరెను.నేను ధర్మ మార్గమును తెలియక పాపమను బురదయందు పడి దుఃఖించుచున్నాను.నిన్ను శరణు వేడుచున్నాను.నన్ను రక్షించుము.నేను క్షత్రియుడను.పాపములను చేసితిని.నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు.కనుక నన్ను తప్పక రక్షించుము.బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు. మీవంటి మహా బుద్ధిమంతులు దయావంతులై మావంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయును,అని పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసుడు తన ఎడమ కాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి,

రాజా! నేను దయ గలవాడను గాను.నాకు శాంతి లేదు.ఓర్పు లేనివారికి ఆలయమైతిని.గనుక దుర్వాసుడు శాంతి లేనివాడని తెలిసికొనుము.ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన యెడల శాంతులగుదురు.గానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించిన వానికి కఠినమైన శాపమివ్వక శాంతించు వాడను గాను.ఇట్లని పలికి అంబరీషుని ఉద్దేశించి శాపమిచ్చెను. 1. మత్స్యము 2. కూర్మము 3. వరాహము 4. వామనుడు 5. వికృత ముఖుడు 6. బ్రాహ్మణుడై క్రూరుడు 7. క్షత్రియుడై జ్ఞాన శూన్యుడు 8. క్షత్రియుడై రాజ్యాధికారి కానివాడు 9. దురాచారుడు - పాషండ మార్గవేడియు, 10. బ్రాహ్మణుడై రాజ్యాధికారి కానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు.నేను శాస్త్రార్థ వేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటె ముందు చేస్తినను గర్వముతో నున్న నీకు ఈ పదిజన్మలూ వచ్చును.అనగా పదింటియందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు.కనుక గర్వించిన వానికి గర్వ భంగకరములైన జన్మలను ఇచ్చితిని ఆనెను. ఇట్లు పది శాపములు ఇచ్చి నన్ను అవమాన పరచిన వానికి ఇంకా శాపమివ్వలయునని తలంచి దుర్వాసుడు నోరు తెరుచునంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మ వేద్యుడును, భక్తి ప్రియుడును, శరణాగత వత్సలుడునగు హరి తన భక్తుని కాపాడు తలంపుతోను, బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేయవలయునను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన పది శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలంచి తన చక్రమును పంపెను.

తరువాత ఆ చక్రము కోటి సూర్య కాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరుచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరుగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో మునివెంట బడెను. ముని ఆత్మ రక్షణమునకై భూమినంతయు తిరిగెను.దుర్వాసుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింప బడెను గానీ చక్ర భయము చేత మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులును, వసిష్ఠాది మునీశ్వరులు, బ్రహ్మాది దేవతలు, దుర్వాసుని రక్షింపలేరైరి.ఇట్లు తపస్సు చేసుకొను మునీశ్వరుని అతి కోపముచేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానము చేయుట వలన దుర్వాసునకు ప్రాణ సంకటము తటస్థించెను.


*ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే పంచవింశాధ్యాయ సమాప్తః!!*

చతురత జూప నొప్పును

 చ.చతురత జూప నొప్పును విచక్షణతో హితమొందు చొప్పు స

న్మతులు చరించు మార్గమె సమంచిత రీతిని మేలు చేయు దు

ర్గతుల చరింప నయ్యది సుఖమ్ముల గూర్చునొ? కొందరేల? దు

ర్మతి చరియింప నెంచెద రమానుష దుర్గతు లిఛ్ఛగించుచున్ ౹౹ 39


చ.ప్రతి నిమిషమ్ము జీవన మవారిత రీతిని సార్థకమ్మగున్

హితమతి ధర్మ మార్గము వహించెడు సజ్జన సాహచర్య వి

స్తృత మహనీయ యోచనల తీరు గ్రహింప, ముదమ్మొసంగు సం

గతుల విలోకనామృత సకార విశేష వివేక మబ్బినన్౹౹ 40

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - దశమి - ఉత్తరాఫల్గణి -‌‌ ఇందు వాసరే* (25.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchang


 

24, నవంబర్ 2024, ఆదివారం

శ్రీవారి ఆలయ నిర్మాణం..

 శ్రీవారి ఆలయ నిర్మాణం..


క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.


శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి.


ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి


1 వ ప్రాకారం :-

మహాద్వార గోపురం :- (ఇత్తడి వాకిలి)*


శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించడానికి శ్రీవారి ఆలయంలో ప్రవేశించే .... ప్రధాన ప్రవేశద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం.

*పడికావలి, సింహద్వారం, ముఖద్వారం*

అని ఈ ద్వారానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి. 

దీనినే తమిళంలో *”పెరియ తిరువాశల్‌”* అని కూడా అంటారు. *అనగా *పెద్దవాకిలి అని అర్థం.*


ఈ ప్రధాన ద్వార గోపురంతో అనుసంధింపబడుతూ నిర్మించిన ప్రాకారమే మహాప్రాకారం. వైకుంఠం క్యూకాంప్లెక్సుల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో మాత్రమే వెళ్లి స్వామివారిని దర్శించవలసి ఉంటుంది.


ఇక్కడే మనం క్రింద ఉన్న పైపుకు గల రంధ్రాల ద్వారా వచ్చే నీటితో కాళ్ళు కడుగుకొని లోపలికి ప్రవేశిస్తాం.


ఈ వాకిలి దక్షిణవైపున గోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గుణపం ఉంటుంది.


*శంఖనిధి - పద్మనిధి*

మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉంటాయి. వీరే శ్రీవేంకటేశ్వరుని సంపదలకు నవనిధులను రక్షించే దేవతలు. దక్షిణదిక్కున ఉన్న రక్షక దేవత రెండుచేతుల్లోనూ రెండు శంఖాలు ఉంటాయి ఈయన పేరు శంఖనిధి, కుడివైపున ఉన్న రక్షకదేవత చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి ఈయన పేరు పద్మనిధి.


*కృష్ణదేవరాయమండపం :-


మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్తంభాలతో 27' ×25' కొలతలు ఉన్న ఎతైన మండపమే కృష్ణరాయ మండపం. దీనినే *ప్రతిమా మండపం* అని కూడా అంటారు. 


ఈ మండపం లోపలికి ప్రవేశిస్తున్నపుడు కుడివైపున రాణులు తిరుమల దేవి, చిన్నాదేవులతో కూడిన శ్రీకృష్ణదేవరాయల నిలువెత్తు రాగి ప్రతిమలు ఉన్నాయి.


అలాగే ఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతిరాయల రాగి ప్రతిమ, ఆ ప్రక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలు, ఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు తిరుమల యాత్ర చేసి శ్రీ స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. అచ్యుతరాయలు తనపేరిట *అచ్యుతరాయ బ్రహ్మోత్సవాన్ని* నిర్వహించాడు.


*అద్దాలమండపం*


ప్రతిమా మండపానికి 12 అడుగుల దూరంలో, ఎతైన అధిష్టానంమీద నిర్మింపబడి ఉన్న దీన్నే అద్దాలమండపమని

 అయినామహల్ అని అంటారు. 43'×43' కొలతలున్న ముఖమండపంలో శ్రీవారి అన్నప్రసాదాలు అమ్మే అరలు ఉండేవి. ఈ అరల్లో అర్చకులు తమవంతుకు వచ్చే శ్రీవారి ప్రసాదాలను భక్తులకు తగిన వెలకు విక్రయించేవారు ఒకప్పుడు. ఈ అరల ప్రాంతాన్నే *ప్రసాదం పట్టెడ* అంటారు.


తులాభారం :-


శ్రీకృష్ణదేవరాయలు మండపానికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు తమ పిల్లల బరువుకు సరిసమానంగా ధనం, బెల్లం, కలకండ, కర్పూరం రూపేణ గాని తులాభారంగా శ్రీస్వామివారికి సమర్పిస్తారు.


రంగనాయక మండపం :-


కృష్ణరాయమండపానికి దక్షిణం వైపుగా 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగి ఎతైన రాతి స్తంభాలతో అనల్ప శిల్ప శోభితమై విరాజిల్లుతూ ఉన్నదే ”రంగనాయకమండపం”. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఈ మండపంలో భద్రపరిచారు. అందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు. ఒకప్పుడు నిత్యకల్యాణోత్సవాలు జరిగిన ఈ మండపంలో ప్రస్తుతం ఆర్జితసేవలయిన వసంతోత్సవం, బ్రహ్మోత్సవం, వాహనసేవలు జరుగుతున్నాయి.


రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి తదితర ప్రముఖులకు శ్రీవారి దర్శనానంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేస్తారు.


తిరుమలరాయమండపం:-


రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాలు, తిరుమలేశుడు భక్తులపై చూపుతున్న తరగని ఉదారత్వానికి మచ్చుతునక ఈ తిరుమలరాయ మండపం. 

ఈ మండపంలోని వేదిక భాగాన్ని తొలుత సాళువ నరసింహరాయలు నిర్మించాడు (సాళ్వ నరసింహ మండపం). శ్రీస్వామి వారికి *"అన్నా ఊయల తిరునాళ్ళ"* అనే ఉత్సవాన్ని నిర్వహించే నిమిత్తం క్రీ.శ. 1473 లో ఈ మండపం నిర్మించాడు. ఆ తర్వాతి కాలంలో సభాప్రాంగణ మండపాన్ని తిరుమలరాయలు నిర్మించాడు.

అణ్ణై అనగా తమిళంలో *హంస*.🕊 బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీస్వామివారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.


*రాజ తోడరమల్లు:-


ధ్వజస్తంభం మండపానికి 10 అడుగుల దూరంలో స్వామి వారికి నమస్కరిస్తున్నట్లు 3 విగ్రహాలు ఉంటాయి. సహజంగా కళ్యాణం ముగించుకున్న భక్తులు సాధారణ భక్తులతో కలిసే మార్గంలో ఉంటాయి.

 అవి రాజా తోడరమల్లు

అతని తల్లి మోహనాదేవి

అతని భార్య పితాబీబీ విగ్రహాలు. 

ఈయన అనేక సంవత్సరాలు తిరుమలను దుండగుల బారినుండి రక్షించారు.


*ధ్వజస్తంభ మండపం :-


ధ్వజస్తంభ మండపంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. వెండివాకిలికి ఎదురుగా బంగారు ధ్వజస్తంభం ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. 


ధ్వజస్తంభం:-*


వెండివాకిలి ఎదురుగా సుమారు15 అడుగుల దూరంలో చెక్కడపు రాతి పీఠంపై ధ్వజదండంవలెనున్న ఎతైన దారుస్తంభం నాటబడింది. అదే ధ్వజస్తంభం.


బలిపీఠము :-


ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. దీనికి కూడా బంగారు రేకు తాపబడింది. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు *బలిని (అన్నాన్ని )* ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.


క్షేత్రపాలక శిల (గుండు) :-


ధ్వజస్తంభం కు ఈశాన్య (north - east) మూలలో అడుగున్నర ఎత్తుగల చిన్న శిలాపీఠం ఉంది. దీనినే *క్షేత్రపాలక శిల* అంటారు.

ఇది రాత్రిపూట ఆలయానికి రక్ష. అర్చకులు ఇంటికి వెళ్ళేటప్పుడు గుడికితాళం వేసి తర్వాత ఈ శిలపై ఉంచి నమస్కరించి మరలా ఉదయం ఇక్కడి నుండే శిలకు నమస్కరించి తాళం చెవులను తీసుకువెళతారు.


సంపంగి ప్రాకారం :-


మహాద్వార గోపుర ప్రాకారానికి, నడిమి పడికావలి (వెండివాకిలి) ప్రాకారానికి మధ్యలో ఉన్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రాకారం. ప్రతి ఆలయానికి స్థల వృక్షాలనేవి ఉండడం పరిపాటి. తిరుమల ఆలయం *స్థలవృక్షం సంపంగి*. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతటా సంపంగి చెట్లు ఉన్నందువల్ల ఇలా పిలవబడుతోంది.


కళ్యాణ మండపం :-


సంపంగి ప్రదక్షిణం దక్షిణంవైపు మార్గంలో రేకులతో దీర్ఘచతురస్రాకారంగా కల్యాణమండపం నిర్మించబడింది. ఇందులో తూర్పుముఖంగా ఏర్పాటు చేయబడిన కల్యాణవేదికపై శ్రీమలయప్పస్వామి వారికి, శ్రీదేవి భూదేవులకు ప్రతినిత్యం ఉదయం కల్యాణోత్సవం జరుగుతుంది.


*ఉగ్రాణం :-


స్వామివారి పూజా సంభారాలు నిల్వ ఉంచేగది.

సంపంగి ప్రదక్షిణకు (north west) వాయువ్య మూలగా ఉంటుంది.


విరజానది :-


వైకుంఠంలోని పరమ పవిత్రమైన నది శ్రీవారి పాదాలక్రిందగా ప్రవహిస్తూ ఉంటుందని నమ్మకం.


ఆలయం లోపలి బావులలో ఈనది నీరు ప్రవహిస్తుందని అందుకే ఆలయ బావులలోని నీరు పరమ పవిత్రమైనవిగా భావించి స్వామివారి అభిషేకాదులకు మాత్రమే వాడతారు.


నాలుగు స్థంభాల మండపం :-


సంపంగి ప్రదక్షిణానికి నాలుగు మూలలా సాళ్వ నరసింహ రాయలు ఆయన భార్య , ఇద్దరు కుమారులు పేర స్థంభాలు కట్టించాడు.


పూలబావి :-


పూలగదికి ఉత్తరంగా ఉంటుంది. స్వామి వారికి ఉపయోగించిన పూల నిర్మాల్యాలన్నీ ఇందులో వేస్తారు.

దర్శనానంతరం ప్రసాదం తీసుకుని ముందుకు వెళ్ళేటపుడు ఎత్తైన రాతికట్టడం మాదిరిగా ఉంటుంది.


వగపడి :-


భక్తులు సమర్పించిన ప్రసాదాలు స్వీకరించే గది.


ముఖ మండపం :-


అద్దాల మండపంనకు ముందుభాగంలో ఉంటుంది.

కళ్యాణం చేయుచుకున్న భక్తులకు ప్రసాదాలు దీని ప్రక్కమార్గంలో అందచేస్తారు.


 2 వ ప్రాకారం :-


వెండి వాకిలి – నడిమి పడికావలి...


ధ్వజస్తంభానికి ముందు ఉన్న ప్రవేశద్వారమే వెండివాకిలి నడిమి పడికావలి అని పిలువబడే ఈ వెండివాకిలి గుండా వెళ్లి శ్రీస్వామి వారిని భక్తులు దర్శిస్తారు. ప్రవేశ ద్వారమంతటా వెండి రేకు తాపబడినందువల్ల దీన్ని వెండివాకిలి అని అంటారు. 

ఈ ద్వారంలో మహంతు బావాజీ, శ్రీ వేంకటేశ్వరస్వామి పాచికలాడుతున్న శిల్పం ఉంది.


విమాన ప్రదక్షిణం :-


వెండివాకిలి లోపల ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణం. దీనినే అంగప్రదక్షిణం అనికూడా అంటారు. సుప్రభాత సేవ జరిగేటపుడు వెలుపల అంగప్రదక్షిణం చేసే భక్తులు కూడా ఉంటారు.


ఈ ప్రదక్షిణ మార్గంలో వెండివాకిలికి ఎదురుగా శ్రీరంగనాధ స్వామి, వరదరాజస్వామి, ప్రధానవంటశాల,

పూలబావి,

అంకురార్పణ మండపం,

యాగశాల,

నాణాల పరకామణి,

నోట్ల పరకామణి,

చందనపు అర

విమాన వేంకటేశ్వర స్వామి,

రికార్డుల గది,

భాష్యకారుల సన్నిధి,

యోగనరసింహస్వామి సన్నిధి,

ప్రధాన హుండి

విష్వక్సేనుల వారి ఆలయం

మొదలగు ఉప ఆలయాలను దర్శించవచ్చు. వీటినే చుట్టుగుళ్ళుగా పేర్కొంటున్నారు.


శ్రీరంగనాథుడు :-


వెండి వాకిలి గుండా లోపలకు ప్రవేశించగానే ఎదురుగా ఆదిశేషునిపైన కనిపించేది శ్రీరంగనాథుడు. ఈయనకు పైన వరదరాజస్వామి క్రింద వెంకటేశ్వరస్వామి మూర్తులు చిన్న బంగారు ఫలకాలపై ఉంటాయి.

అంగప్రదక్షిణం ఇక్కడి నుంచే మొదలవుతుంది.

వీనినే పొర్లుదండాలు అంటారు.


శ్రీ వరదరాజస్వామి ఆలయం :-


విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయమూలన శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. ఈ గుడిలో (సుమారు 4 అడుగుల) నిలువెత్తు శ్రీ వరదరాజస్వామి వారి శిలామూర్తి ప్రతిష్ఠింపబడింది.


బంగారు బావి :-


దర్శనానంతరం వెలుపలకు రాగానే అద్దాల గదిలో బంగారు తాపడంతో ఉంటుంది. ఇందులోని నీటినే స్వామి వారి అభిషేకాలకు ప్రసాదాలకు వాడతారు. ఇందులో వైకుంఠం లోని విరజానది నీరు చేరుతుంది అని అత్యంత పవిత్రమైనది గా చెపుతారు.


వకుళాదేవి :-


బంగారుబావి ప్రక్కన మెట్లు ఎక్కి ఎడమవైపు పశ్చిమ అభిముఖంగా ఉంటుంది.

శ్రీవారి తల్లి (పెంచిన). ద్వాపరయుగంలో యశోదయే ఈ కలియుగంలో స్వామి వారి కళ్యాణం చూడడానికి వకుళాదేవిగా అవతరించింది.


అంకురార్పణ మండపం :-


బంగారుబావికి దక్షిణం వైపు ఉంటుంది. ప్రతి ఉత్సవాలకు నవధాన్యాలను భద్రపరుస్తారు.

ఇంకా గరుడ, విష్వక్సేనుల, అంగద, సుగ్రీవ, హనుమంత విగ్రహాలను భద్రపరుస్తారు.


యాగశాల :-


హోమాది క్రతువులు నిర్వహించే ప్రదేశం. కాని ఇప్పడు సంపంగి ప్రాకారంలోని కళ్యాణ వేదిక వద్ద చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడే యజ్ఞ యాగాదులు చేస్తారు.


సభ అర :-


కైంకర్యాలకై ఉపయోగించే బంగారు వెండి పాత్రలు కంచాలు గొడుగులు ఉంచే ప్రదేశం.


ఏకాంత సేవలో ఉపయోగించే బంగారు మంచం, పరుపు, విశనకర్రలను కూడా ఇక్కడే భద్రపరుస్తారు.


సంకీర్తన భాండాగారం :-


సభ అర ప్రక్కనే ఉన్న గది. దీనికి ఇరువైపులా తాళ్ళపాక అన్నమాచార్యులు ఆయన పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల విగ్రహాలు ఉంటాయి. ఇందులో తాళ్ళపాక వంశం వారు రచించిన దాదాపు 32000 సంకీర్తనలను భద్రపరిచారు.


సాధుసుబ్రమణ్యశాస్త్రి* గారి విశేష కృషి వలన ఈనాడు మనం వాటిని మననం చేసుకోగలుగుతున్నాము.


భాష్యకార్ల సన్నిధి :-


ఇందులో శ్రీమద్ రామానుజాచార్యులు గారి విగ్రహం ఉంటుంది. శ్రీవారికి ఏం ఏం కైంకర్యాలు ఏవిధంగా చేయాలో మానవాళికి అందించిన గొప్ప వ్యక్తి.


తన 120 సం.ల కాలంలో 3 పర్యాయాలు తిరుమలకు మోకాళ్ళ మీద వచ్చాడు. అలా వస్తున్నపుడు ఆయన ఆగిన ప్రదేశమే మోకాళ్ళ పర్వతం.


ఈనాటికి కాలినడకన వచ్చే భక్తులు ఈ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం గమనించవచ్చు.


ప్రధాన వంటశాల (పోటు) :-


విమాన ప్రదక్షిణంలో ఉన్న ప్రధాన వంటశాలను పోటు అంటారు. ఈ వంటశాలలో దద్దోజనం, చక్కెరపొంగలి, పులిహోర, ముళహోర, కదంబం, పొంగలి, సీరా, మాత్రాలతో పాటు కల్యాణోత్సవ దోశ, చిన్నదోశ, తోమాల దోశ, జిలేబి, పోలి, పాల్‌ పాయసం, అప్పం మొదలైనవాటిని తయారు చేస్తారు. ఆయా నియమాలను అనుసరించి వీటిని స్వామివారికి నివేదన చేస్తారు.


పరకామణి :-


స్వామి వారికి భక్తులు సమర్పించిన నగదు లెక్కించే ప్రదేశం.


చందనపు అర :-


స్వామి వారికి సమర్పించే చందనాన్ని భద్రపరిచే ప్రదేశం.


ఆనందనిలయ విమానం :-


ఆనందనిలయం పైన ఉన్న బంగారు గోపురాన్ని ఆనందనిలయ విమానం అంటారు.


గరుత్ముంతులవారే ఈ గోపురాన్ని వైకుంఠం నుండి భూమిమీదకు తీసుకు వచ్చారని చెప్తారు. దీనిమీద దాదాపు 64 మంది దేవతా ప్రతిమలు ఉన్నట్లు చెపుతారు.


విమాన వెంకటేశ్వరస్వామి :-


గోపురంపై వెండిద్వారంతో ప్రత్యేకంగా ఉండే స్వామివారు. 


రికార్డు గది :-


స్వామి వారి ఆభరణాలు వివరాలు, జమ ఖర్చులు భద్రపరచు గది.


వేదశాల :-


రికార్డు గది ప్రక్కనే వేద పఠనం చేసే పండితులు ఉండేగది. ఇక్కడే మనం వారి ఆశీర్వచనం తీసుకోవచ్చు.

  


శ్రీ యోగనరసింహస్వామి సన్నిధి :-


రామానుజాచార్యులుచే ప్రతిష్టితం చేయబడింది.


శ్రీ నరసింహాలయం క్రీ.శ 1330-1360 మధ్య నిర్మించబడిందని పరిశోధకుల అభిప్రాయం. క్రీ.శ 1469లోని కందాడై రామానుజయ్యంగారి శాసనంలో ఈ యోగనరసింహుని ప్రస్తావన ఉంది. 

*'అళగియ సింగర్‌' (అందమైన సింహం)* అని, *వేంకటాత్తరి (వేంకటశైలంపై ఉన్న సింహం)* అని ప్రస్తావన ఉంది.


చాలాచోట్ల ఈ విగ్రహం ఉగ్రరూపంలో ఉంటుంది. కానీ ఇక్కడ ధ్యాన ముద్రలో ఉండడం ప్రత్యేకం.

ఇక్కడ అన్నమాచార్యులు కొన్ని సంకీర్తనలు చేశారు.


శంకుస్థాపన స్థంభం :-


రాజా తోడరమల్లు ఆనందనిలయం విమాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతం.


పరిమళ అర :-


శంకుస్థాపన స్థంభంకు వెళ్ళే దారిలో ఉంటుంది. స్వామి వారి సేవకు ఉపయోగించే వివిధ సుగంధ పరిమళాలను భద్రపరిచే అర. ఈ గది గోడపై రాసిన భక్తుల కోరికలను స్వామి తీరుస్తాడని నమ్మకం.


శ్రీవారి హుండి :-


భక్తులు కానుకలు వేసే ప్రాంతం.

శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చాలా మార్పులు జరిగిననూ మార్పు చెందని ఒకేఒక స్థలం. దీని క్రింద శ్రీచక్రయంత్రం ధనాకర్షణ యంత్రం ఉందని నమ్మకం.


బంగారు వరలక్ష్మి :-


హుండి ఎడమగోడపై బంగారు లక్ష్మీ దేవి విగ్రహం కలదు. ఈవిడ భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని నమ్మకం.

 

కటహ తీర్థం :-


అన్నమయ్య సంకీర్తన భాండాగారం ఎదురుగా హుండీకి ఎడమవైపు ఉన్న చిన్న తొట్టి లాంటి నిర్మాణం. ఇందులో స్వామి వారి పాదాల అభిషేక జలాలు సంగ్రహిస్తారు.


విష్వక్సేన :-


హుండి ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చాక ఎడమవైపు ఉండే చిన్న ఆలయం. ఈయన విష్ణు సేనాధ్యక్షుడు. ప్రస్తుతం ఈ విగ్రహం అంకురార్పణ మండపంలో ఉంది.


ఘంట మండపం :-


బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశం. బ్రహ్మది సకల దేవతాగణాలు స్వామి వారి సందర్శనకు వేచిఉండే ప్రదేశం. దీనినే మహామణి మండపం అంటారు.


పూర్వం జయవిజయులకు ఇరువైపులా రెండు పెద్ద గంటలు ఉండేవి. హారతి సమయాలలో వీనిని మ్రోగించేవారు. దీనిని *ఘంటపని* అనేవారట. ఈ గంటలననుసరించే స్వామి వారి ఆహారసేవనలు పూర్తి అయ్యాయని భావించి తదనంతరం చంద్రగిరి రాజులు ఆహారం సేవించేవారట.


ఇప్పుడు రెండూ ఒకేచోటికి చేర్చారు. దర్శనానంతరం వెలుపలకు వచ్చే ద్వారం ప్రక్కనే ఉంటాయి.


గరుడ సన్నిధి :-


మూలవిరాట్ కు ఎదురుగా జయ విజయులకు వెలుపలగా గరుడాళ్వారులు గారు ఉన్న మండపం. బంగారు వాకిలి ఎదురుగా, గరుడాళ్వార్‌ మందిరం ఉంది. శ్రీస్వామివారికి అభిముఖంగా, నమస్కార భంగిమలో సుమారు 5 అడుగుల ఎత్తు ఉన్న గరుడాళ్వారు శిలాప్రతిమ ప్రతిష్టించబడింది. ఈ మందిరానికి వెలుపల అంతటా బంగారం రేకు తాపబడింది. ఈ శిలామూర్తి గాక శ్రీవారి ఆలయంలో గరుడాళ్వార్‌ చిన్న పంచలోహ ప్రతిమ, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి.


ద్వారపాలకులు :-


బంగారు వాకిలికి వెలుపలగా ఇరువైపులా ఉండే జయ విజయులు.

మహాలఘుదర్శనం ఇక్కడే చేసుకొంటారు.


3 వ మూడవ ప్రాకారం :-


బంగారువాకిలి :-


శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సన్నిధికి వెళ్లడానికి అత్యంత ప్రధానమైన ఏకైకద్వారం బంగారువాకిలి. వాకిలికి, గడపకు అంతటా బంగారు రేకు తాపబడినందువల్ల ఈ ప్రవేశద్వారానికి బంగారు వాకిలి అనే ప్రసిద్ధి ఏర్పడింది. ప్రతిరోజూ ఈ బంగారువాకిలి ముందు తెల్లవారుజామున సుప్రభాతం పఠనం జరుగుతుంది. ప్రతి బుధవారం భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ మలయప్పస్వామి వారికి ఇక్కడే సహస్ర కలశాభిషేకం జరుగుతుంది.


స్నపన మండపం :-


బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమంపం’. క్రీ.శ. 614 లో పల్లవరాణి రామవై ఈ మండపాన్ని నిర్మించి, భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందట. ఈ స్నపనమండపాన్నే *తిరువిలాన్‌కోయిల్‌* అంటారు. ఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.


ప్రతిరోజూ తోమాలసేవ అనంతరం కొలువు శ్రీనివాసునకు ఆరోజు పంచాంగం, చేయవలసిన పూజాదికాలు, క్రితంరోజు హుండీ ఆదాయాది జమ ఖర్చులు వివరిస్తారు.


దీనిలో కుడివైపున అనగా దక్షిణ దిక్కున హుండీ మరియు ఎడమవైపున అనగా ఉత్తర దిక్కున శ్రీవారి ఆభరణాలు భద్రపరిచే గది ఉంటాయి.


రాములవారి మేడ :-


స్నపనమండపం దాటగానే ఇరుకైన దారికి ఇరువైపుల ఎత్తుగా కనిపించే గద్దెలు. *”రాములవారిమేడ”*. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థం. 

ఇక్కడ రాములవారి పరివారమైన అంగద, హనుమంత, సుగ్రీవుల విగ్రహాలున్నాయి. ప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవని, అందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది.


శయనమండపం :-


రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపం. శ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపం. ప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.


కులశేఖరపడి :-


శయనమండపానికి, శ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉంది. అదే కులశేఖరప్పడి. 


పడి అనగా మెట్టు, గడప అని అర్థం.


 ఆనందనియం :-


కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయం. శ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయం. దీనినే ” *గర్భాలయం* ” అనికూడా అంటారు. ఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడింది. దీనినే ఆనందనిలయ విమానం అంటారు.


శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :-


గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న పవిత్ర శిలా దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి. నిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని *”స్థానకమూర్తి”* అంటారు.

అంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”.... *ధ్రువమూర్తి* ....” అని, *”ధ్రువబేరం”* అని కూడా అంటారు.


శ్రీ స్వామివారి మూర్తి అత్యంత విలక్షణమైన పద్ధతిలో దర్శనమిస్తూ భక్తులను ఆనందింపజేస్తున్నది. సుమారు 8 అడుగుల ఎత్తుగల స్వయంభూమూర్తి. 


ఈ మూలమూర్తికి ప్రతినిధులు గా 

కొలువు శ్రీనివాస మూర్తి

భోగ శ్రీనివాస మూర్తి

ఉగ్ర శ్రీనివాస మూర్తి

మలయప్ప స్వామి


అను ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి.


ఇంకా 

సీతారామలక్ష్మణులు

శ్రీకృష్ణ రుక్మిణి లు

చక్రతాళ్వారులు

శాలిగ్రామ శిలలు ఉన్నాయి.

(స్వామికి ప్రతిరుపాలుగా వీనికి నిత్య అభిషేకాలు జరుగుతాయి.)


ముక్కోటి ప్రదక్షిణం :-


రాములవారి మేడ చుట్టూ చేసే ప్రదక్షిణం.

వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశినాడు ఈ ద్వారం గుండా దర్శనం ఉంటుంది.


https://chat.whatsapp.com/ILPktCVcWuQ7IzA6iNkR3B


ఓం నమో నారాయణాయ నమః


✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩

హరి నామ జపం!*

 *తల రాతను కూడా మార్చగల.. హరి నామ జపం!*


🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🌾 *ఒక రైతు విత్తనాలను భూమిలో నాటినపుడు అవి నేలలో సరిగ్గా పడినా, తలక్రిందులుగా పడిన మొక్క మాత్రం పైకే మొలుస్తుంది.


🌾 *అలాగే, భగవన్నామాన్ని ఏ విధంగా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది.


🌾 *మంత్ర జపం ద్వారా అన్ని అవరోధాలు తొలగిపోతాయి.అయితే కర్మ అనేది ఉంది కాబట్టే కర్మ భూమిపైన జన్మించాము, భగవంతుడు ఎవరి కర్మను వారి చేతనే రాయిస్తారు, కారణం ఆత్మ పరమాత్మ అంశ.  దేహంతో ఉన్నంత వరకే జీవికి స్వార్థం, ఆశ,  నేను, నాది ,భయం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి.


🌾 *ఆత్మ వివేకం కలిగినది.. మనలో పంచ భూతాలు ఉంటాయి, నిద్రావస్థలో దేహానికి ఒక్క భూతం మటుకే కాపలాగా ఉంటుంది మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప పుణ్యాలకు పద్దు రాస్తుంది. అదే "చిత్రగుప్తుడు" చిత్ర మైన ఆత్మ గుప్తంగా దాగి ఉండి పాప పుణ్యాలు లెక్క రాస్తుంది.


🌾 *మిగిలిన మూడు భూతాలు మన ఆలోచన బట్టి ఎక్కువగా ఏది తలుస్తుంటామో దాన్ని చూస్తుంది..(నిద్రలో వెంటనే లేవగానే కాసేపు ఎక్కడ ఉన్నాము ఎటువైపు ఉన్నాము అర్థం కాదు!  కారణం మిగిలిన భూతాలు దేహంలోకి చేరాక మనకు పూర్తి సృహ వస్తుంది.


🌾 *అందుకే వెంటనే లేచి వెళ్ల కూడదు. రెండు నిముషాలు ఆగి భగవంతుడి నామాన్ని పలుకుతూ పడక దిగాలి. లేకుంటే ఒక్కోసారి  కాస్త అనారోగ్యంతో ఉన్నవారికి  ప్రాణం పోయే ప్రమాదం కూడా జరుగుతుంది.


🌾 *ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు అధికంగా  కృష్ణ నామ జపం చేసే వాళ్ళు స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవ దర్శనం పొందడానికి కారణం ఇదే! ఎక్కువగా వాళ్ళు తలచే బృందావనం మథుర, పండారి పురం,తిరుమల, అయోధ్య,శ్రీరంగ  క్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు.. అస్ట్రోల్ జర్నీ స్వప్నం తోనే మొదలై తర్వాత ఎరుకలో చేసే ధ్యానంలో కూడా అది సాధ్యం అవుతుంది.


🌾 *దేహాన్ని విడిచిన జీవుడు తిరిగి పరమాత్మలో   చేరలేక  అధికంగా రోధిస్తారు. విలువైన మానవ జీవితాన్ని పాప కర్మల ద్వారా వృధా చేసుకున్నందుకు  బాధ పడతాడు.


🌾 *అయితే ఆ కర్మలలో    పుణ్య కార్యాలు, కూడా చేసుకొని ఉంటే మళ్ళీ మానవ జన్మ లభిస్తుంది, కానీ వారు చేసుకున్న పాపము, పుణ్యం ఆధారంగా స్వర్గం నరకం చేరుకొంటారు కానీ వైకుంఠ ప్రాప్తి లభించదు,  వైకుంఠ    ప్రాప్తి లేదా గోలోక ప్రాప్తి  కలగాలంటే గురుపరంపరంలో గురువుని స్వీకరించి, గురువు ఇచ్చిన హరినామాన్ని  జపించి భక్తి యుక్త సేవ చేసి ,గురువు చెప్పిన మార్గంలో వెళ్తే తప్ప  గోలోకం చేరుకొంటారు.

 

🌾 *ఏ విధమైన జీవితం గడిపితే వారికి విముక్తి లభిస్తుందో ఆ విధంగా రాసుకుంటారు, తమ తల రాత కాబట్టి ఎక్కడ రాసేటప్పుడు స్వార్ధం కలుగుతుందో అని చై వెనక్కి పెట్టి చూడకుండా తలరాతను నుదిటి గీతలుగా రాసుకుంటారు..


🌾 *"నీ తల రాత నీచే రాయబడినది, నువ్వు అనుభవిస్తున్న జీవితం నీ కర్మాను సారం నువ్వు కోరుకున్నదే... అందుకనే.. దేవుడు నాకు ఎందుకు ఇలాంటి జీవితం ఇచ్చాడు అని భగవంతుని నిందించ కూడదు.


🌾 *ఎటువంటి పాప పుణ్యం చేసిన వారు అయినా ఎంత నీచులు దౌర్భాగ్యులు అయినా, రాక్షస స్వభావం ఉన్న వారు అయినా   ఎవరైనా దైవ ఆరాధనకు అర్హత ఉన్న వాళ్లే నేను ఇది చేయవచ్చా అని ఎవరూ సందేహించాల్సిన పని లేదు! కారణం భగవంతుడికి బేధ భావం లేదు.


🌾 *బ్రతికి ఉన్నంత కాలం మళ్ళీ మళ్ళీ అవకాశం భగవంతుడు ఇస్తూనే ఉంటాడు మారడానికి! అలాగే ఒక బాధ తో పాటు మంచిని, మంచి అవకాశాన్ని కూడా ఇస్తూనే ఉంటాడు!   అది గుర్తించాలి!  అంటే నీ బుద్ది కి వివేకం ఉండాలి, అది కలగాలి అంటే...


🌾 *ఆధ్యాత్మిక సాధన, హరే కృష్ణ మహామంత్రం జపం, సేవ, పారాయణం, సత్సంగం, గురు సేవ, ఆలయ దర్శనం, వైష్ణవుల సేవ, ….     ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే తక్కినవన్ని వెన్నంటే వస్తాయి.


🌾 *మనసు నిలకడకు ముందు కలియుగంలో హరి నామ జపమే ముఖ్య ఆయుధం, ఆధారం, గొప్ప మార్పుకి అవకాశం..! 🙏🙏🙏


 *~టిండీస్*

కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము

 కార్తిక పురాణము - ఇరవై నాలుగవ అధ్యాయము

ద్వాదశి తిథి-మహిమ



అత్రి ఇట్లు పల్కెను. అగస్త్య మునీంద్రా! నీకు కార్తికవ్రతమందును, హరిభక్తి యందును ఆసక్తి ఉన్నది. కాన కార్తికమహాత్మ్యమును చెప్పెద వినుము. సావధానముగా విన్న ఎడల పాపములు నశించును.

కార్తికమాసమందు శుక్ల ద్వాదశి హరి బోధిని, ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమును ఇచ్చును.అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చునది.సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని యగు ద్వాదశి ఇచ్చును.ఇది కాక ఈ ద్వాదశి హరియందును, ఏకాదశియందును, భక్తినిచ్చును. కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది.ద్వాదశి సూర్య చంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము. ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది.సమస్త పుణ్యమును ఇచ్చునది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును.ద్వాదశి పుణ్యదినము గనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలెను.కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. ఇతర నియమములన్నింటిని విడిచి ద్వాదశి స్వల్ప కాలమందు పారణ చేయవలెను.కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడువ కూడదు.

ఏకాదశియందు ఉపవాస మాచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము చేయవలెను.

ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును.ఈ విషయము తెలిసియె పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు.ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నం భుజించుటకై సంసిద్ధుడయ్యెను. అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమను వంక చేత భోజనమును యాచించెను. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు దుర్వాసుని రమ్మనెను.దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను. ఆనాడు ద్వాదశి అతిస్వల్పముగా ఉండెను.దుర్వాసుడు రాకపోయెను. ద్వాదశి పోవుచున్నది.ఇట్టి సంకటము సంభవించినది.అపుడు హరిభక్తుడైన అంబరీషుడు విచార పడసాగెను.ఈ దుర్వాసుడు ముని శ్రేష్ఠుడు.పారణ కొరకు అంగీకరింపబడినాడు. ఇంతవరకు రాలేదు. ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును.

బ్రాహ్మణుని కంటె ముందు భుజించిన యెడల కోపించి అగ్నితో సమానుడైన ముని శాపమిచ్చును గనుక ఇప్పుడు ఏది కుశలము? ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు.ద్వాదశిని విడిచిన యెడల హరిభక్తిని విడిచిన వాడనగుదును. ఏకాదశినాడు ఉపవాసము చేయక ఏ దోషమునకు పాత్రుడనగుదునో ద్వాదశిని విడిచినయెడల అట్టి దోషమే సంభవించును.ఇదిగాక ద్వాదశీ పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పౌగొట్టును.కాన ద్వాదశిని విద్వాంసుడు విడువకూడదు. హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు అసలే విడువరాదు. దానిని విడిచెనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు.అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరమును విడిచిన యెడల నశించును.అందువలన గలిగెడి పాతకమునకు నివృత్తి లేదు. ఒక్క ద్వాదశి అయినను విడువకూడదు.దీనికి ప్రతీకారము లేదు. ఇది నిజము.

హరిభక్తిని విడుచుట యందు నాకు మహా భయమున్నది.కాబట్టి యట్టి సంకటమందు హరిభక్తిని విడుచుట కంటే పారణమే ముఖ్యము.బ్రాహ్మణ శాపమువలన నాకేమియు భయములేదు. శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము. ద్వాదశిని విడిచినచో హరివాసరము (ఏకాదశులు) 10 విడువబడినవి యగును.హరివాసరమును విడిచిన యెడల హరిభక్తి లోపించును. గనుక హరిభక్తిని విడుచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది. కాబట్టి హరిభాక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్ద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది. అట్లయిన యెడల హరియే కష్టాలు రాకుండా కాపాడును. అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఓ బ్రాహ్మణోత్తములారా! దుర్వాసుడు భోజమునకు వచ్చెదననెను. నేనట్లంగీకరించితిని.ఇప్పటికినీ రాలేదు.ద్వాదశి పోవుచున్నది.గనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున భ్రాహ్మణాతిక్రమణము, ద్వాదశిలో పారణము చేయకపోతే ద్వాదశ్యతిక్రమణము గలుగును.గనుక మీరు బలాబలమును విచారించి రెండింట్లో ఏది యుక్తమో చెప్పుడు అని అడిగెను.

ఆమాట విని ఆ బ్రాహ్మణులు ధర్మ బుద్ధితో ద్వాదశికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని గౌరవ లాఘవములను విచారించి సమస్త భూతములయందును అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు. ప్రాణ వాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరెడి ఆకలి కలుగుచుండును. ప్రాణ వాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును.కాబట్టి ప్రాణ సహితముగా అగ్ని సర్వ సుర పూజితుడగుచున్నాడు. సర్వ భూతములయందున్న అగ్నిని నిత్యమూ పూజించవలెను. తన ఇంటికి వచ్చిన శూద్రుని గానీ, చండాలుని గానీ విడిచి భుజించ రాదు. సాక్షాత్ ప్రథమ వర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసినది ఏమున్నది? గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథికంటే ముందుగా తాను భుజించిన యెడల బ్రాహ్మణావమానమగును. బ్రాహ్మణావమానము చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము, ఇవన్నియూ నశించును. ఇది ఏమి, అది ఏమి మనస్సులో ఉండే కోరికై అనగా సంకల్పితమంతయూ నశించును.

బ్రాహ్మణులందరూ స్వర్గమందుండెడి దేవతలే అని చెప్పబడుడురు. దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును. జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దుర్వాసుడు తపోవంతుడు. ఇతని విషయమందు చెప్పునదేమున్నది? ఓ రాజా! ఈ బ్రాహ్మణుడు కోపము చేయక పోయిననూ బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు.ఈ బ్రాహ్మణునకును ద్వాదశి పారణకు వచ్చెదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది. ద్వాదశీ పారణను విడిచి పెట్టిన ఏకాదశ్యుపవాసమునకు భంగము వచ్చును. ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు.బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి ఈ రెండునూ సమానములుగా నున్నవి.ఇందు గురుత్వము, లఘుత్వము మాకు కనిపించుట లేదు. ద్వాదశి కాలమందు పారణ చేయని యెడల హరి భక్తి లోపించును. పారణ చేసిన దుర్వాసుడు శపించును.ఎట్లైనను అనర్థము రాక తప్పదు.అదియు కొద్దిది కాదు.గొప్ప కీడు కలుగును.బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యదార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి.


ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తిక మహాత్మ్యే చతుర్వింశాధ్యాయ సమాప్తః

బాలింతలలో పాలు

 బాలింతలలో పాలు ఉత్పత్తి కావడానికి సులభయోగాలు - 


 * బొప్పాయి కాయని కూరగా వండుకొని తినుచుండిన యొడల పాలు ఉత్పత్తి అగును.


 * ముళ్లతోటకూర చెట్టు ఆకులని పప్పులో వేసుకొని వండుకుని తినుచున్న యొడల పాలు ఉత్పత్తి అగును. 


 * తెల్లజీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం ఈ రెండు వస్తువులు సమభాగాలుగా కలిపి ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకుని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 10 గ్రాముల చూర్ణముని అరకప్పు మంచినీటిలో కలిపి తాగుచున్న రెండు మూడు వారాలలో స్త్రీకి చనుబాలు వృద్ది అగును. 


 * వాము కషాయం ఇచ్చిన పాలు చేపు వచ్చును. 


 * ఆకుపత్రి కషాయం ఇచ్చిన చనుబాలు వృద్ధి అగును. 


 * ఆవుపాలలో బియ్యం వేసి వండి అందులో పటికబెల్లం పొడిని కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. 


 * గోధుమ పిండిని పూరిలు లా చేసి నేతితో ఉడికించి తీసి పాలల్లో నానబెట్టి కడుపునిండా తినియుచున్న బాలింతలకు పాలు ఎక్కువ అగును.


 * యష్టిమధూకం చూర్ణంని 5 గ్రాములు అరకప్పు ఆవుపాలలో కలిపి అందులో 20 గ్రాములు పటికబెల్లం చూర్ణం కలుపుకుని త్రాగుచుండిన చనుబాలు వృద్ది అగును. ప్రతినిత్యం తాగవలెను. 


 గమనిక - పైన చెప్పిన యోగాలలో మీకు సులభం అయినవి పాటించగలరు. 


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

24.11.2024,ఆదివారం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

24.11.2024,ఆదివారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

కార్తీక మాసం -  బహుళ పక్షం

తిథి:నవమి రా11.37 వరకు

వారం:భానువాసరే (ఆదివారం)

నక్షత్రం:పుబ్బ రా12.20 వరకు

యోగం:వైధృతి మ3.17 వరకు

కరణం:తైతుల ఉ10.53 వరకు

తదుపరి గరజి రా11.37 వరకు

వర్జ్యం:ఉ7.01 - 8.45

దుర్ముహూర్తము:మ3.51 - 4.35

అమృతకాలం:సా5.25 - 7.09

రాహుకాలం:సా4 30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి: సింహం

సూర్యోదయం:6.13

సూర్యాస్తమయం:5.20




ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్​ను స్థాపించిన దార్శనికుడు..

డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జయంతి ..! 


స్వాతంత్ర్య సమరయోధుడిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడిగా చెరగని ముద్ర వేశారు. అంతకుమించి వైద్యుడిగా, తెలుగు భాషాభిమానిగా, స్వాతంత్య్ర సమరశీలిగా మన్ననలు అందుకున్నారు. మహాత్ముడికి ఆప్తుడిగా, ప్రజా సేవకుడిగా, ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ప్రజలకు బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు... ఆంధ్రా బ్యాంక్​ను స్థాపించి దార్శనికుడిగా నిలిచారు. వైద్యవృత్తిని ప్రజా శ్రేయస్సుకోసం ఉపయోగించడమే కాదు, ఆర్థిక వ్యవహారాలను ఆమూలాగ్రం అధ్యయనం చేశారు.


పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను గ్రామంలో 1880 నవంబర్ 24న పట్టాభి సీతారామయ్య జన్మించారు. రఘుపతి వేంకటరత్నం నాయుడు లాంటి గురువుల శిక్షణలో పట్టాభి రాటుదేలారు. విద్యార్థి దశ నుంచే స్వాతంత్య్రోద్యమ కాంక్ష కలిగిన పట్టాభికి మద్రాస్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలు, ఆనందమోహన్‌ బోస్‌ ఉపన్యాసం ఉత్తేజం కలిగించాయి. 1905లో బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు వంటివారితో కలసి అవిశ్రాంతంగా పోరాడారు.


నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీలేని నాయకుడు. జన్మభూమి, అమ్మభాష అంటే ఎనలేని మమకారం. అభిప్రాయ భేదాలొస్తే పార్టీలో ఎంతటి వారితోనైనా ఢీ అంటే ఢీ అనగల ధీశాలి. తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయ సేవలు అందించిన గొప్పనేతగా ఖ్యాతి గడించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య....1959 డిసెంబర్ 17న తుదిశ్వాస విడిచారు...

సంకల్ప బలం

 సంకల్ప బలం మరియు జ్ఞాన దీపం

( కార్తీకదీపం సందర్భంగా మనం కూడా ఇలాంటి దీపాన్ని వెలిగించాలి)

రామానుజుల వారు జీవించి ఉన్నకాలంలో, విజయనగరంలో ఒక ముసలి బిచ్చగత్తె ఉండే(ది. ఆమె అసలు పేరు ఏంటో ఎవ్వరికీ తెలీదు కానీ, ఆమె ఎప్పుడూ సంతోషంగాఉండటం చూసి అందరూ ఆమెను ‘కళావతి’ అని పిలిచేవాళ్ళు.


ఒకనాడు కళావతి నగర వీధుల్లో అడుక్కుంటుంటే వినబడింది- "భగవానుడైన రామానుజుల వారు త్వరలోనే నగరానికి రానున్నాడు" అని. ఆమె పెద్దగా చదువుకున్నదీ కాదు, ఏమంత తెలివితేటలు ఉన్నదీ కాదు. రామానుజుల గురించి ఆమె అంతవరకూ ఏనాడు విని ఉండలేదు కూడా. అయినా 'రామానుజులు రావటం' అనే సంగతి మటుకు ఆమెకు ఎందుకో చాలా నచ్చింది.


తర్వాతి రోజుల్లో‌ ఆమె రామానుజుల గురించి అనేక విషయాలు విన్నది- నగర పెద్దల నుండి, పెద్ద పెద్ద వర్తకులనుండి, అతి సామాన్యుల వరకూ- అందరూ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు! ఆయన కోసం ఎవరి తాహతుకు తగినట్లు వాళ్ళు ఏవేవో‌ బహుమతులు తీసుకు వెళ్తారు. ఆయన మటుకు ఎవ్వరు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. అసలైతే ఆయనకు భక్తి తప్ప మరేమీ అక్కర్లేదట.." ఇట్లా ఏవేవో చెప్పుకుంటున్నారు జనం.


కళావతి తనకు తెలియకుండానే రామానుజుల రాక కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.ప్రతిరోజూ అడుక్కుంటూ నగర శివార్ల వరకూ పోయి, అక్కడే సాయంత్రం వరకూ ఉండి, వెనక్కి తిరిగి వచ్చేది. 

కొన్ని రోజుల తర్వాత రామానుజులు వచ్చాడు. కళావతి ఆ సమయానికి నగరం శివారులోనే ఉన్నది. రామానుజుని వెంట అనేకమంది భక్తులు- అందరూ చకచకా నడచుకొంటూ కళావతిని దాటుకొని పోయారు. రామానుజుడు తనని చూసి చిరునవ్వు నవ్వినట్లు, "నా వెంట రా" అని చెప్పినట్లు అనిపించింది కళావతికి. ఆమె మనసు పులకరించి, ఆయన వెంటే పోయింది. ఆమె కాళ్ళు మటుకు ఆయన్ని అనుసరించలేక వెనుక పడ్డాయి.


తెలివి వచ్చి చూసుకునేసరికి కళావతి నగరంలో ఉన్నది. సాయంత్రపు చీకట్లు ముసురుకుంటున్నాయి. రామానుజుని దర్శించుకునేందుకు వచ్చిన వాళ్ళతో నగర వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.


ఎక్కడ చూసినా స్వాగత తోరణాలు, సందడి. అందరి చేతుల్లోనూ పూలు, పళ్ళు, ధూపాలు, వస్త్రాలు, రక రకాల తినుబండారాలు- అన్నీ‌అతని అనుచరులకు బహుమానంగా ఇచ్చేందుకు!


వాటిని చూసేసరికి కళావతికి అకస్మాత్తుగా తను ఏమీ తేలేదని గుర్తుకొచ్చింది. 'అంత గొప్ప భగవానుడిని ఒట్టి చేతుల్తో దర్శించటం ఏం బాగుంటుంది' అనిపించింది. తన దగ్గర ఏమున్నదో వెతుక్కున్నది. ఒక చిన్న నాణెం మాత్రం ఉంది. ఆ నాణాన్ని పట్టుకొని ప్రక్కనే కనబడ్డ శెట్టి దుకాణానికి పోయింది. నాణానికి సరిపడ నూనె ఇమ్మన్నది.


ఆ నాణెం ధరకు అసలు ఏ కొంచెం‌ నూనె కూడా రాదు. కళావతి తన కొంగును కొంచెం చింపి ఇచ్చింది- "ఇదిగో, ఈ పీలిక తడిసేంత నూనె ఇవ్వు చాలు. భగవానుడి ముందు దీపం వెలిగిస్తాను" అని ప్రాధేయపడ్డది.


'భగవానుడికోసం' అనేటప్పటికి శెట్టి మెత్తబడ్డాడు. పీలికని నూనెలో తడిపి ఇచ్చాడు. కళావతి దాన్నిపట్టుకొని పోయి, రామానుజుడు బస చేసిన మందిరానికి చేరుకున్నది. అక్కడ ఇసకేస్తే రాలనంత మంది జనం. అక్కడ ఓ మూలగా మట్టి ప్రమిద ఒకటి కనబడితే, దానిలో ఈ ఒత్తిని వేసి వెలిగించింది ఈమె.


దానిముందు మోకరిల్లి, "స్వామి! నీకిచ్చేందుకు నా దగ్గర ఈ చిన్న దీపం తప్ప వేరే ఏదీ లేదు. అయినా నేను వెలిగించిన ఈ దీపం చీకట్లను ప్రారద్రోలాలి. ఇక్కడున్న వీళ్లందరికీ అంతులేని జ్ఞానం లభించేందుకు ఇది సాయపడాలి. అజ్ఞానపు పొరలన్నీ నశించి, అంతటా వెలుగు పరచుకోవాలి" అనుకున్నది.


ఆరోజు రాత్రి ఆలయంలోని దీపాలన్నీ ఒక్కటొక్కటిగా కొడిగట్టాయి. కానీ బిక్షగత్తె వెలిగించిన దీపం మటుకు తెల్లవారవచ్చినా ఇంకా వెలుగుతూనే ఉన్నది.


తెల్లవారు జామున దీపపు ప్రమిదలనన్నిటినీ సేకరించి ఒకచోట పేర్చేందుకు వచ్చిన ఒక శిష్యుడు దాన్ని చూసి "దీపంలో‌ఒత్తి ఇంకా కొత్తగానే ఉన్నది. ఉదయంపూట దీనితో పనిలేదు. ఇవాల్టి రాత్రికి మళ్ళీ వెలిగించుకోవచ్చు" అని దాన్ని ఆర్పివేయబోయాడు. అతను ఎన్ని సార్లు ఆర్పివేసినా ఆ దీపం మళ్ళీ మళ్ళీ వెలుగు అంటుకున్నది! దీన్ని గమనించిన స్వామి నవ్వి, అతన్ని వారిస్తూ "ఇది ఇప్పట్లో ఆరదు. కళావతి వెలిగించిన ఈ జ్ఞాన దీపం ఆమెకే కాదు, అనేకమందికి ఆసరా అవుతుంది. ఈ జ్ఞానాగ్నిలో అనేక జీవుల కర్మలు సమూలంగా నశించనున్నాయి. పవిత్రమైన హృదయంతో, బలమైన సంకల్పంతో వెలిగించిన ఈ దీపంవల్ల ఆమె ఈ సరికే పరిశుద్ధురాలైంది. తన సొంత తపస్సు ఫలితంగా ఆమె రానున్న కాలంలో 'దీపకాంతి' అనే పేరు గల మహా భక్తురాలు అవుతుంది" అన్నాడు.


మనం చేసే పనులకు బలాన్ని చేకూర్చేది మన మనసులోని పవిత్రతే!