29, డిసెంబర్ 2024, ఆదివారం

ఆనందం,సంతోషం కోసం

 అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ... 

ఇప్పటికీ అర్ధం కాదు...

#పనిచేయటానికి #బ్రతుకుతున్నానా?

లేక #బ్రతకటానికి #పని #చేస్తున్నానా అని !?

జవాబు మాత్రం బ్రతకటానికి అనే మాట నిజమే కదా.


బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...

పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?

ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!

మళ్ళీ బాల్యం కావాలని!

మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని

మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది

వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని


ఔను...

లోకం లాజిక్కుని చూపింది వాళ్ళే మరి!

 జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...

జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!

డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....


నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని


 నవ్వాలని అనిపించినా ...

నవ్వలేని పరిస్థితి...

ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---

ఓహ్ !

నాకేం బ్రహ్మాండంగా వున్నా!!

అని అనక తప్పనప్పుడు.

ఏడవాలన్నా ఏడవలేని పరిస్థితి!

వాడికేందిరా....

దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు

ఇది జీవిత నాటకం...

ఇక్కడ అందరూ నటులే...

నటించక తప్పదు....

అవార్డుల కోసం కాదు...

బ్రతకటం కోసం !!

కాదు.. కాదు....

బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.


రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....

ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ... 

ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...


సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట.... 

బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....


మరి మానవ జీవితంలో ఆనందం, తృప్తి, సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!


ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం 

పెరుగుతుందని ఆందోళన ...

ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...


పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !


మట్టిలో మొక్కలు నాటాలి...

మనసులో మానవత్వం నాటాలి

ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....


మళ్ళీ ఒక్క క్షణం...

నాకెందుకులే అని !

సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!


నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి

పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!

నా పని...

నా ఇల్లు...

నా పిల్లలు...

నా...నా.. నా... 

నాతోనే నలిగిపోతున్నా...!

ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!


జీవితమన్నది 

తనంత తానుగా...

నడచి పోతుంది…

గడచి పోతుంది.... 

మనకళ్ళముందే.....

మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.


చేయడానికి చాలా టైం వుందని

చావు దగ్గర కొచ్చేదాకా చోద్యం చూస్తున్నా!

చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...


ఎవరినో అడిగాను ...

అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?

ఎవరో మహానుభావుడు ఎంతో అందంగా సెలవిచ్చాడు !!!

నిద్ర, సగం మృత్యువట! 

మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!


ఆనందం లేని అందం...

తృప్తి లేని జీవితం.... 

ప్లాస్టిక్ పరిమళం..

సెల్ ఫోను సోయగం...

వెరసి ఇదీ నా నాగరిక జీవనం!

 తెల్లారి పోతున్నది...

 రోజుమారుతున్నది..

మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....


ఏంటో జీవితం....

రైలు బండి లా తయారయింది!

ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి

చేరే గమ్యం మాత్రం ఎండమావి లా అనిపిస్తుంది!


ఒకడు శాసించి ఆనందిస్తాడు

మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు.


ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....

అది లక్ష ఎప్పటికీ కాదు... 

ఆ లక్ష సంపూర్ణం కాదు...


అందుకే...

*మనిషి* లో *మనీ* కోసం కాకుండా,తృప్తి, ఆనందం,సంతోషం కోసం బతకటానికి ప్రయత్నిస్తే !


అదే నిజమైన జీవితమౌతుంది!

From the wall of other person.

శివుడు మన ఇంటికి వస్తాడా

 🪔🙏🪔🙏🪔🙏🪔🙏


శివుడు మన ఇంటికి వస్తాడా??? అంటే 'అవును, వస్తాడు' అనే చెప్పాలి.


ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు, ఇలా జీవిస్తేనే, శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ సమస్త జీవుల పట్ల భూతదయతో మెలిగితే, "వృషభవాహనుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ తల్లీదండ్రులను పూజిస్తూ జీవనం సాగిస్తే, అమ్మ పార్వతిని వెంట తీసుకొని "జగత్పితయై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ గురువులను గౌరవిస్తూ మసలుకుంటే, బ్రహ్మజ్ఞాన ప్రదాతయైన "శ్రీ దక్షిణామూర్తిగా" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ విడదీయలేని అన్యోన్యతతో భార్యభర్తలు కాపురం చేస్తే, శివుఁడు "అర్ధనారీశ్వరుడై" మన ఇంటికి వస్తాడు.


☞ మనసులో ఉన్న విషపూరిత భావనలను విసర్జిస్తూ నడుస్తుంటే, "నాగాభరణభూషితుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ పిల్లలకు మానవత్వ విలువలను నేర్పుతూ జీవిస్తే, జగజ్జననిని వెంటపెట్టుకొని "గౌరీశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ఆకలైనవారికి పట్టెడు మెతుకులను వడ్డిస్తూ ముందుకి సాగితే "శ్రీ అన్నపూర్ణాసమేతుడై"శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ దాహమైన వారికి దప్పికను తీరుస్తూ ప్రయాణిస్తే "గంగాధరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ బాహ్య సౌందర్యం మీద ధ్యాస తగ్గించి మనో సౌందర్యాన్ని ఉపాసిస్తూ జీవిస్తే "శ్రీమీనాక్షి అమ్మను వెంటపెట్టుకొని సుందరేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ప్రకృతిని ప్రేమిస్తూ పచ్చదనాన్ని కాపాడుతూ జీవిస్తే "శ్రీకామక్షి అమ్మను వెంటపెట్టుకొని ఏకామ్రేశ్వరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ పరమాత్ముడిచ్చిన కన్నులను పెద్దవిగా చేసుకుని ప్రపంచంలో ఉన్న మంచిని చూస్తూ జీవిస్తే "శ్రీవిశాలక్షి అమ్మను వెంటపెట్టుకొని విశ్వనాథుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ అసూయా ద్వేషాలను వదిలి జీవిస్తే భళా అంటూ మెచ్చుకుని "భోళాశంకరుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ తోటివారిపైన చల్లటి చూపులను వెదజల్లుతూ జీవిస్తే "కైలాస వాసుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ కాలం కలిసిరాకున్నా ఖచ్చితమైన ఆత్మ విశ్వాసంతో జీవీస్తే "కాలభారవుడై" శివుఁడు మన ఇంటికి వస్తాడు.


☞ ప్రపంచం మనల్ని చిరిగిన చీటీగా వల్లకాడులో వదిలివెళ్ళిన నాడు "రుద్రుఁడై" శివుఁడు తనలో కలుపుకుంటాడు.


🔱 అనంతాన్ని ఆవరించిన శివుఁడు అందరి మొరను వినగలడు.


🔱 శివుడంటే నాగరికత, శివుడంటే జీవన విధానం, శివుడంటే సర్వం, శివుడంటేనే పర్వం.


🔱 సముద్రాన్ని ఆయనపై ఒలకబోయలేకున్నా, ఆయనపై సముద్రమంత నమ్మకాని పెట్టుకుని నాలుగు గంగనీటి తుంపరలు చల్లినా సరే సంతసిస్తాడు.


🔱 శివుడు కేవలం విగ్రహంలో మాత్రమే కాదు , మన మనో నిగ్రహంలో ఉంటాడు.


🔱 తాను సృష్టించిన వస్తువులను తనకివ్వడంతో శివారాధన పూర్తికాదు, మనది అనుకున్న తనదాన్ని(నేను అనే అహాన్ని) తనకివ్వడంతోనే శివారాధన పరిపూర్ణం.


🕉 ఇలాచేస్తే శివుఁడు మన ఇంటికి వస్తాడు , ఇలా జీవిస్తేనే శివుఁడు మన ఇంటికి వస్తాడు.

ఇంటికి రావడమేంటి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాడు.


🙏 అప్పుడు జన్మకో శివరాత్రి కాదు, జన్మమే శివరాత్రి. ప్రతి రోజూ శివరాత్రి 🙏


🪔🪔🪷🪷🪷🪔🪔🪔

పితాధర్మః

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


  శ్లో|| *పితాధర్మః పితాస్వర్గః*

        *పితా హి పరమంతపః*

        *పితా ప్రీతి హి మాపన్నే* 

       *సర్వాః ప్రీయన్తి దేవతాః*


*తా|| తండ్రిని సేవించడమే ధర్మము. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం. ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు. తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు*.


✍️🌹🌺🌷🙏

నేటి తిరుప్పావై ప్రవచనం‎ - 14 వ రోజు*_

 _*నేటి తిరుప్పావై ప్రవచనం‎ - 14 వ రోజు*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*వేదమే ప్రమాణం*



☘☘☘☘☘☘☘☘☘




*14. వ పాశురము*




*ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్*

*శెంగరునీర్ వాయ్ నెగిర్* *అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్*

*శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్*

*తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్*

*ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్*

*నంగాయ్ ! ఎరుందిరాయ్ నాణాదాయ్ ! నావుడైయాయ్*

*శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం*

*పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్*



మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది.  ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం , అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం , ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట , చేత , మన ఆచారం , మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం , మహా భారతం , పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా , అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది. 


*"శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్"* ఎర్ర కలవలు వికసిస్తున్నాయి *"ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్"* నల్ల కలువలు ముకిళించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి , రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకుళించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోప బాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు , నల్ల కలువల్ని ముడుచుకొనేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టిచ్చుకోలేదు.  లేదమ్మా అయితే , *"ఉంగళ్ పురైక్కడై"* నీ ఇంటి పెరటి *"త్తోట్టత్తు వావియుళ్"* తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి కావల్సిస్తే చూసుకో. అంటూ ఇక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ *"నీ"* అని సంభోదించినా లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది , నీ అన్నా లోపల పరమాత్మ వరకు భావించి , పెద్దగా పట్టిచ్చుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగముగా ప్రయోగించారు , ఏమిటంటే లోపల తోటలో గోప బాలిక శ్రీకృష్ణుడికోసం ఎదురుచూస్తుంటే వెనకనుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని , శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు , గోప బాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు.  పెద్దగా పట్టిచ్చుకోలేదు లోపల గోపబాలిక. 


*"శెంగల్పొడి క్కూరై"* కాషాయాంభరధారులు *"వెణ్బల్ తవత్తవర్"* తెల్లటి పలువరుసలు కల్గిన యోగులు *"తంగళ్ తిరుక్కోయిల్ "* ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి *"శంగిడువాన్"* తాళాలు తెరువడానికి *"పోగిన్ఱార్"* వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూసాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు.  తాళం తీయడం జ్ఞానముద్రలా ఉంటుంది , అందుకే ఇక్కడ ఆండాళ్ తల్లి , లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి , తమకూ జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది. 


అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం , అంటూ   *"ఎంగళై"* మమ్మల్నందరిని *"మున్నం ఎరుప్పువాన్"*  ముందే లేపుతాను అని *"వాయ్ పేశుమ్"* వాగ్దానం చేసావు. *"నంగాయ్!"* పెద్ద పరిపూర్ణురాలివే !  *"ఎరుందిరాయ్"* లేవమ్మా *"నాణాదాయ్!"* నీకు సిగ్గు అనిపించటంలేదా *"నావుడైయాయ్"* పెద్ద మాటకారిదానివి. 


జ్ఞానులు తమ హృదయంలో  భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండేస్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విధ్య అంటారు వేదాల్లో.  లోపల గోపబాలిక దహరవిధ్యలో పరినిష్నాత అయి ఉండచ్చేమో *" శంగోడు చక్కరం ఏందుం తడక్కైయన్ పంగయ క్కణ్ణానై ప్పాడ"* 

ఆమె హృదయం , దానిలో దహరాకాశం , అందులో స్వామి , ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం , నీవు ఆ యోగ్యత కల్గిన దానివి , నీవూ లేచి మాతో కలిస్తే అందరం కల్సి స్వామిని పాడుదాం అంటూ లోపల గోప బాలికను లేపారు.

శ్రీ గజేంద్ర వరధ పెరుమాళ్ ఆలయం- (కపిస్థలం)

 🕉 108  శ్రీ వైష్ణవ దివ్య దేశాలు : 

      28వ దివ్యదేశం.


🛎గజేంద్ర మోక్షణ ఘట్టo ప్రదేశం :


శ్రీ గజేంద్ర వరధ పెరుమాళ్ ఆలయం- (కపిస్థలం)

కుంభకోణం 🙏


@ ప్రధాన దైవం : గజేంద్ర వరదన్ (విష్ణుమూర్తి)

@ ప్రధాన దేవత : రమామణి వల్లి (లక్ష్మీదేవి)

@ పుష్కరిణి : గజేంద్ర పుష్కరిణి

@ విమానం : గగనాకార విమానము


👉 శ్రీ రామావతారమున ఆంజనేయునకు చిరంజీవి పదమును అనుగ్రహించిన పరమాత్మ స్థలమును మరొక్కసారి ఆంజనేయులు ప్రార్థనకు, భక్తికి, ప్రేమకి, సేవకి,.. ప్రసన్నత చెంది భుజంగశయన మూర్తిగా దర్శన మిచ్చెను . 


👉కప్పి (ఆంజనేయుడు ) ని అనుగ్రహించిన కారణమున ఈ స్థలమునకు కపిస్తలం   అని పేరు వచ్చినది. 


   🛎స్థల పురాణం : 🛎


👉 పురాణాల ప్రకారం, విష్ణువు ఆరాధనలో మునిగిపోయిన ఇంద్రద్యుమ్నుడు, ఒక రోజు ఆరాధన చేస్తున్నప్పుడు, ఇంద్రద్యుమ్నుడును చూసేందుకు వచ్చిన దుర్వాస మహర్షిని గమనించలేదు. 

మహర్షి కి  చిరాకు వచ్చి రాజు తన తదుపరి జన్మలో ఏనుగుగా పుట్టమని శపించాడు. క్షమాపణ చెప్పిన తరువాత, దుర్వాసుడు  ఇంద్రద్యుమ్నుడు మీద జాలిపడి, తాను ఏనుగులాగా విష్ణు భక్తుడిగా కొనసాగుతాడని , విష్ణు అతన్ని శాపం నుండి ఉపశమనం  మరియు మోక్షాన్ని కలగాచేస్తాడని ఇంద్రద్యుమ్నుడుని ఆశీర్వదించాడు.


👉 ఒక రోజున కొలను లోనికి కమలములకై దిగగా ఒక మొసలి ఆ గజేంద్రుడు కాల్ నోటితో పట్టుకొనేను.

 మొసలి పట్టు నుండి తన కాలును విడిపించుకొనుటకై తన సర్వ శక్తి యుక్తులు నిష్ఫలము కాగా సంపూర్ణ శరణాగతితో హృదయమున శ్రీహరిని కించిత్తు వెలితి కూడ లేక నిండుగా స్థిరీకరించుకుని తలను పైకెత్తి శ్రీహరిని పిలుచుచూ తన బాధను విన్నవించుకొని రక్షణకై ప్రార్థించగా.... శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాలును మొసలి నోటి నుండి సుదర్శన చక్రాయుదము తో ఉద్ధరించి కరుణించి రక్షించెను .

 ఆ గజేంద్రునకు భుజంగశయనునిగా దర్శనముచ్చి అనుగ్రహించి మోక్షమును ప్రసాదించెను .

 

👉ఈ సందర్భమున ఒక విషయమును ప్రస్తావించుకొన వలయును . ఈ గజేంద్ర మోక్షపురాణమును మనము మరి కొన్ని ప్రదేశములలో కూడ గమనించగలము.


👉 ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తిరుపతి సమీపవర్తి ( 25 కి.మీ. ) కార్వేటి నగరం శ్రీవేణుగోపాలస్వామి ఆలయమునకు చేరువలో ఉన్న స్కంధ పుష్కరిణి కూడా  గజేంద్రోద్ధరణ పుష్కరిణి అని , మకరవేటి నగరము కార్వేటి నగరములు అని అందురు . 

 

👉బీహారు రాష్ట్రమున గండకినది గంగా నదిలో సంగమించిన ప్రదేశము ఉన్న సోన్ పూర్ కూడ గజేంద్రోద్ధార క్షేత్రముగా ప్రసిద్ధి పొందియుని విన


👉 ప్రస్తుతము నేపాలు దేశములో ఉన్న - పోఖరా , నారాయణ మాల్ లు మీదుగా పోయిన త్రివేణి ఘాట్  వచ్చును . ఆ త్రివేణి ఘాట్ లో శ్రీమహావిష్ణువు గజేంద్రమోక్షం  కావించిన ప్రదేశము అని కూడా ఒక నమ్మకం.


🙏జై శ్రీమన్నారాయణ🙏

ఏకాకి అయిపోతున్నాడు

 ఏకాకి అయిపోతున్నాడు

మనిషి

తల్లడిల్లిపోనున్నాడు

ఏదో ఒక రోజున...


ఉదయమే

మేల్కొల్పడానికి

అమ్మ అక్కర్లేదు

-Alaram app ఉంది!


నడక వ్యాయామానికి

మిత్రుడి తోడక్కర్లేదు

-Step counter ఉంది!


వండి పెట్టడానికి

అమ్మ అక్కర్లేదు

- Zomoto, Swiggy app ఉన్నాయి!


ప్రయాణం చేయడానికి

బస్సు అక్కర్లేదు

-Uber, ola app ఉన్నాయి!


అడ్రెస్ కనుక్కోవడానికి

టీ కొట్టోడో

ఆటో డ్రైవరో అక్కర్లేదు

 - Google map ఉంది!


పచారీ సామాన్లు 

కొనడానికి

ఇంతకాలమూ అందుబాటులో

ఉన్న కిరాణా దుకాణంతో

పని లేదు 

- big basket ఉంది!


బట్టలు కొనుక్కోవడానికి

దుకాణానికి వెళ్ళక్కర్లేదు

-Amazon, flipkart app ఉన్నాయి!


వెళ్ళి ప్రత్యక్షంగా కలిసి

నవ్వుకుంటూ మాట్లాడుకోవడానికి

మిత్రుడక్కర్లేదు

-Whatsapp, facebook వంటివి ఉండనే ఉన్నాయి!


అప్పిమ్మని అడగడానికి

సన్నిహితుడో దగ్గరి బంధువో

ఉండక్కర్లేదు

-Paytm app ఉంది!


మరిన్ని విషయాలు

తెలుసుకోవడానికి

-Google ఉండనే ఉంది!


ఇలా

ఏకాకిగా బతకడానికి

అన్ని రకాల వసతులూ

ఉన్నాయి

app అనే భూతం రూపంలో.


చిక్కుకుపోతున్నాం

app వలలో

ఇవతలకు రాలేనంతగా


అప్పుడప్పుడైనా

సన్నిహితులను 

కలవడానికీ

కబుర్లాడడానికీ

మనసారా నవ్వుకోవడానికీ

వీధులోకొద్దాం...


app రాకాసి గుప్పెట్లో నుంచి

ఇవతలకొచ్చి కాస్సేపైనా 

నలుగురి మధ్యా

సరదా సరదాగా

గడుపుదాం


ఎప్పటికీ

ప్రేమతో

28, డిసెంబర్ 2024, శనివారం

తెలుగు భాషానిర్వచనం -చరిత్ర🙏

 🙏తెలుగు భాషానిర్వచనం -చరిత్ర🙏

                మొదటి భాగం

స్పష్టమైన ఉచ్చారణ గల భాష తెలుగు. కారణం అజంత భాష కాబట్టి.తేనెలొలుకు తీయని భాష తెలుగు.అందువలననే పాశ్చాత్యులు కూడా కొనియాడారు. సంగీతానికి అనువైన భాష తెలుగు మాత్రమే అన్నా ఆశ్చర్యం లేదు.అంత గొప్ప భాష పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుందాం. భాష అంటే ఏమిటి? ఆవిర్భావం ఎల్లా జరిగింది స్థూలంగా పరిశీలిద్దాం.

ఇండో-యూరోపియన్ భాషలకు పూర్తి భిన్నంగా ఉన్న దక్షిణాది ప్రాంత భాషలు వేరే కుటుంబానికి చెందినవని మొదట గుర్తించి.. ఆ భాషా కుటుంబానికి 'ద్రవిడియన్' అని పేరు పెట్టిన భాషాశాస్త్రవేత్త రాబర్ట్ కాల్డ్‌వెల్. 

ఆ తర్వాత.. రాబర్ట్ కాల్డ్‌వెల్ 12 ద్రవిడ భాషలను పోల్చుతూ ద్రవిడ భాషల మీద మొట్టమొదటి విప్లవాత్మక పరిశోధనను 1856లో ప్రచురించారు. దక్షిణాది వారిని, వారి భాషలను - ముఖ్యంగా తమిళులను - సంస్కృత భాషా పరిశోధకులు 'ద్రవిడ' అనే పదంతో ఉటంకించేవారని.. ఆ పదాన్నే దక్షిణ ప్రాంత భాషా కుటుంబానికి పేరు పెట్టటానికి ఉపయోగించానని ఆయన వివరించారు.

ద్రవిడ భాషల మీద శాస్త్రీయ పరిశోధన చేసిన వారిలో తెలుగువాడైన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ప్రముఖులు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ద్రవిడ భాషాశాస్త్ర పరిశోధనలో ఆయన రాసిన ‘ద ద్రవిడియన్ లాంగ్వేజెస్’ను ఉద్గ్రంధంగా పరిగణిస్తారు. భారతీయ భాషలను ఈ భాషాపరిశోధనల ఆధారంగా వివిధ కుటుంబాలుగా వర్గీకరించారు.ఇది ద్రావిడ శబ్ద పరిచయం.

మనసులోని భావనను బహిర్గతపరచే సాధనం భాష. స్పష్టమైన ఉఛ్చారణతో అభిప్రాయాన్ని ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేట్లు చెప్పగలగడమే భాషకు నిర్వచనం.( కొన్నిధ్వనుల సముదాయం భాష అని కూడా నిర్వచనం ఉంది )భాషకు మాటలతో అవసరం లేదు. సైగల ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయడం కూడా భాషే అవుతుంది. ఐతే మానవ జాతి ఆవిర్భావం నాటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం నాటికీ మనిషి అవసరాలలో పెరిగిన మార్పులు, అభిప్రాయ వ్యక్తీకరణలో చోటుచేసుకున్న ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగాల సమ్మేళనం మాటల ఆవిర్భావానికి కారణభూతమయింది. విశ్వావిర్భావ క్రమంలో ఇదో అద్భుతం. భాష పుట్టకముందున్న మనిషి మనుగడకీ,భాషల ఏర్పాటు తర్వాత మనిషి మనుగడకీ చేతల్లో కొలవలేనంత వ్యత్యాసముంది. అది ఆధునిక మానవునిచే అత్యద్భుత విన్యాసాలు చేయించింది. సరికొత్త ప్రపంచం ఏర్పాటుకు కారణమయ్యింది.మనిషి రూపంలో కూడా అంతే కనబడుతుంది. ఆదిమ మానవ రూపం ఆధునిక మానవుని రూపం ఎంత వ్యత్యాసం ఉంది,?

నియాండర్తల్ మానవుడు, క్రొమాన్యూన్ గుహల్లో ఉన్న మానవుడు ఎలావున్నాడు? ఇది అద్భుతమైన పరిణామం ఆదిమ మానవుని భుజముల మధ్య తల కూరుకుపోయి ఉండేది మెడ భాగం దాదాపు లేనట్లే తలను ప్రక్కకు త్రిప్పలేడు మనిషి పూర్తిగా ప్రక్కకు తిరగాలి చేతి వ్రేళ్ళ మధ్య వ్యవధానం కూడా బాగా తక్కువ ( ఆ చరిత్ర ఇక్కడ వ్రాయలేను చాలా విస్తార విషయం.సమయం చూసుకొని ప్రత్యేకంగా వ్యాసం వ్రాస్తాను ఇది చరిత్ర + సైన్స్ )

భాష ఎలా పుట్టిందనడానికి సరియైన నిర్వచనం లేదు. సమగ్రమైన సిద్ధాంతం కూడా లేదు. కాని ప్రపంచంలో ఇప్పటివరకు దాదాపు 2900 భాషల వరకు ఉన్నాయి. ఒక్క భారతదేశంలోనే 200 వరకు భాషలున్నాయి. వాటిలో ఉత్తర భారత దేశంలోని భాషలను ఆర్య భాషలనీ, దక్షిణ భారతదేశంలోని భాషలను ద్రావిడ భాషలనీ అంటారు.


తెలుగు భాష ఆవిర్భావము 

సంస్కృత త్రిలింగ శబ్దభవమైన ప్రాకృత తిరిలింగ నుండి లేదా సంస్కృత త్రికళింగ శబ్దభవమైన తి అలింగ (ప్రాకృతం) పదం నుండిగానీ లేదా రెండు విధాలుగానూ వచ్చి ఏకరూపతనొందడంవలన కాని “తెలుగు” శబ్దం ఏర్పడి ఉండవచ్చని గంటి జోగి సొమయాజి గారు తెలిపారు. “తెలుగు” దిగ్వాచి అని వీరు నిరూపించారు. తెలుగు శబ్దమునుండి తెనుగు శబ్దంగాని, తెనుగు శబ్దం నుంది తెలుగు శబ్దం గానీ ఏర్పడి ఉండవచ్చని భాషా వికాసకర్తలు తెలిపారు.ఇందులో తెనుగు ప్రాచీనం తరువాత తెలుగు వచ్చింది మునుగు --- ములుగు అయినట్లు తెనుగు -- తెలుగు అయింది ఇలాగని కొంత మంది భాషా శాస్త్రవేత్తలు సిద్ధాంతీకారించారు.

“తలైంగు” జాతి వారి భాష కాబట్టి తెలుంగు అని కొందరి అభిప్రాయం. “తలైంగు” అంటే తల స్థానాన్ని ఆక్రమించినవారు అనగా నాయకులు అని అర్థం.

“తెలుంగు” అంటే తెల్లగా, స్పష్టంగా ఉండే భాష అని మరో భావన ఉంది. “తెన్ను” అంటే దారి కాబట్టి తెనుంగు అంటే దారిలో ఉండే వారి భాష; దారి అంటే ఆర్యులు దక్షిణాపథం అని వ్యవహరించే ప్రాంతం.

“తెన్” నుంచి తెనుగు వచ్చిందని కొందరి అభిప్రాయం. “తెన్” అంటే దక్షిణ దిక్కు. దక్షిణ ప్రాంతానికి చెందిన భాష కాబట్టి “తెనుగు” అయ్యిందని ఎక్కువమంది అంగీకరిస్తున్నారు.

ఐతే “త్రినగ” నుంచి తెనుగు ఏర్పడిందని మరికొందరంటారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహేంద్రగిరి అనే మూదు కొండలు గల ప్రదేశంగా “త్రినగ” శబ్దం ఏర్పడిందంటారు.

మరికొందరు మన ప్రాంతనికి పూర్వం త్రిలింగ దేశం అనే పేరుండేదనీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, దక్షారామం అనే మూడు పుణ్య క్షేత్రాల్లో గల మూడు శివ లింగాల ఆధారంగా త్రిలింగ-తి అలింగ-తెలింగ, తెలుగు అయ్యిందని చెబుతారు.

విద్యానాధుడు అను సంస్కృత కవి మొట్టమొదటిసారిగా “త్రిలింగ” పదాన్ని వాడారు. త్రికళింగ నుంచి తెలుగు పదం వచ్చిందని చిలుకూరి నారాయణరావు గారు అనగా తేనె + అగు = తెనుగు అని గ్రియర్సన్, తలైంగ్ జాతినుంచి తెలుగు ఏర్పడిందని ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగు శబ్దమే త్రిలింగగా సంస్కృతీకరణకు లోనైందని కొమర్రాజు లక్ష్మణరావు పేర్కొన్నారు. తెళ్+గు = తెలుగు అనే అభిప్రాయం కూడా ఉంది. నన్నెచోడుడు, పాల్కురికి సోమనలు తెనుగును భాషాపరంగా వాడారు.

ఐతే తెలుగు శబ్దం తెనుగు శబ్దానికి రూపాంతరమే అనీ ఈ తెలుగు శబ్దం త్రిలింగ లేదా త్రికళింగ శబ్ద భాగం కాదనీ జి.ఎన్. రెడ్డి నిరూపించారు.

పొర్చుగీసు వాళ్ళు 16, 17 శతాబ్దాలలో హిందువును జెంతూ అని పిలిచేవారు. జెంతూ అంటే అన్య మతస్థుడు. అంటే క్రైస్తవేతరుడు అని అర్ధం. మొట్టమొదట్లో వీళ్ళ వ్యాపారాలు ఎక్కువగా తెలుగువాళ్ళతోనే జరిగేవి కాబట్టి జెంతూలంటే తెలుగు వారు అని స్థిరపడిపోయింది. తెలుగుభాషను వాళ్ళు జెంతూ భాష అని పిలిచేవారు. తమిళ, కన్నడ పుస్తకాల్లోనూ, శాశనాల్లోనూ “వడుగ”, “వడగ”, “తెలింగ”, తెలుంగు” అనే విధంగా పేర్లు కనిపిస్తాయి. ఐతే ఎక్కువగా వాడే పేర్లు మాత్రం ఆంధ్ర, తెలుగు, తెనుగు.


క్రీ.శ. 1వ శతాబ్దం నాటి శాతవాహన రాజైన హాలుని “గాధా సప్తశతిలో తెలుగు పదాలున్నాయి. కాబట్టి 1వ శతాబ్దం నాటికే తెలుగు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. నన్నయకు ముందు వెయ్యి సంవత్సరాలనాటికే తెలుగు ఒక స్వతంత్ర భాషగా విరాజిల్లిందనడానికి శాసనాధారాలున్నాయి. ఐతే నన్నయ ఆ వ్యవహార భాషను సంస్కరించి తెలుగు భాషకు ఓ రూపాన్ని ఇవ్వగలిగాడు.

భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది. 

    ఆంధ్రప్రదేశ్ తరవాత తెలుగువాళ్లు ఎక్కువగా యానాం (పుదుచ్చేరి), తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిసా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనూ కనిపిస్తారు. తెలుగు మాతృభాషగా కలిగున్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తెలుగువాళ్లు ప్రపంచంలోని ఏ దేశానికెళ్లినా కనిపిస్తారనడం అతిశయోక్తి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఎనిమిదన్నర కోట్ల జనాభాతో తెలుగు భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో (హిందీ, బెంగాలీల తరవాత) మూడో స్థానంలోనూ, ప్రపంచవ్యాప్తంగా పదిహేనో స్థానంలోనూ నిలిచింది. 


    తెలుగు ద్రావిడ భాష. ద్రావిడ భాషావర్గంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, గోండీ మొదలైన 85 భాషలుండగా, అత్యధికంగా మాట్లాడుతున్న ద్రావిడభాష తెలుగే. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందనీ, తెలుగుకు మాతృక సంస్కృతమేననీ జనబాహుళ్యంలో బలమైన అపోహ ఉన్నది. కానీ సంస్కృతం, హిందీ, బెంగాలీ మొదలైన ఉత్తర భారతదేశ భాషలు “ఇండో-ఆర్యన్” భాషావర్గానికి చెందినవి కాగా, దక్షిణ భారతదేశ భాషలు ద్రావిడ భాషలనీ భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగుతో పాటు ప్రస్తుతం ఉనికిలో ఉన్న ద్రావిడభాషలన్నీ ఒకే మూలద్రావిడ మాతృక నుంచి క్రమంగా విడివడి, వేరువేరుగా స్థిరపడ్డాయని పరిశోధకుల అంచనా. 

    తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు తెలుకున్నాము . ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు. 


 తమిళం, గోండీ భాషల్లో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కదనం, “ంగ” అనేది బహువచన సూచకం. ఆవిధంగా చక్కనివారు, తెల్లనివారు అనే అర్ధంలో తెలింగ, తెలుంగ అనే పదాలు ఉద్భవించాయని మరో వాదన. తమిళనాడులోనూ, కేరళంలోనూ ఇప్పటికీ తెలుగును “తెలుంగు” అనే పిలవడం మనం గమనించవచ్చు. 

    భాషాశాస్త్రవేత్తల అంచనా మేరకు తెలుగు భాష కనీసం 2,400 సంవత్సరాల పూర్వం మూలద్రావిడ భాష నుంచి వేరుపడి ప్రత్యేకభాషగా స్థిరపడింది. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజుల పాలనలో రచించిన “గాధాసప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్యసంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. తెలుగు పదాలు లిఖితరూపంలో దొరికిన ఆనవాళ్లలో ఇదే ప్రాచీనమైనది. తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి శిలాశాసనం క్రీ.శ. ఏడవ శతాబ్దానికి చెందినది. తెలుగు భాష చరిత్ర క్రీ.శ. పదకొండో శతాబ్దం నుండి గ్రంధస్థం చెయ్యబడింది

               సశేషం

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మితభాషణ పొగరు కరణి

 *2093*

*కం*

మితభాషణ పొగరు కరణి

యతిభాషణ మతిభ్రమమని యనిపించునయా/యనిపించదగున్.(యనిపించునిలన్/భువిన్).

హితభాషణ సమ్మతమగు

సతతము మృదుభాషణమ్మె సరసము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తక్కువ గా మాట్లాడితే పొగరనీ,ఎక్కువగా మాట్లాడితే  పిచ్చి యనీ అనిపించవచ్చు. నచ్చే విధంగా మాట్లాడితే అందరికీ ఆమోదమవుతుంది. మృదువుగా మాట్లాడటం ఎల్లప్పుడూ మనోహరంగా ఉంటుంది.

*సందేశం*:-- తక్కువగానూ, ఎక్కువగానూ,మాట్లాడటం కన్నా ఇతరులకు నచ్చేవిధంగానూ,మృదువుగా నూ మాట్లాడటం అందరికీ అన్నివిధాలుగానూ మంచిది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*.

తిరుప్పావై 13 వ పాశురము

 తిరుప్పావై 13 వ పాశురము

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


పుళ్ళిన్‌వాయ్‌ కీణ్డానైప్పొల్లా వరక్కనై,

క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్‌,

ప్పిళ్ళైగళెల్లారుమ్‌ పావైక్క ళమ్బుక్కార్‌,

వెళ్ళియెళు న్దువియాళముఱఙ్గిత్తు,

పుళ్ళుమ్‌ శిలుమ్బిన్‌ గాణ్‌ పోదరి క్కణ్ణినాయ్‌,

కుళ్ళక్కు ళిరక్కుడైన్దు నీరాడాదే,

పళ్లిక్కిడత్తియో వాపాయ్‌ నీనన్నాళాల్‌,

కళ్ళమ్‌ తవిర్‌న్ధు కలన్డేలో రెమ్బావాయ్‌


⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️


ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కల్గిస్తుంది ఆండాళ్. అందరిని చిలిపి తనంతో ఏడిపిస్తూ ఆనందిస్తున్న శ్రీకృష్ణున్నా పాడటం అంటూ నిన్న గోకులంలో రామనామం పాడారు, దానితో గోకులం అంతా కలకలం మొదలైంది. కొంతమంది రాముడే సరి అని మరి కొందరు లేదు కృష్ణుడే సరి అనిరెండు జట్టులుగా విడిపోయారు.


వారి అల్లరి విని ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి, వారి మద్య నిలిచి వాళ్ళకొక విషయం చెప్పింది. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్ళితే అక్కడ ఆమె శ్రీకృష్ణున్ని కథ చెబుతూ పడుకోబెడుతుంది. అనగనగా రాముడు, భార్య సీత వాల్లు అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు... అని యశోదమ్మ చెప్పిన వెంటనే కృష్ణుడు లేచి " సౌమిత్రే ధనుః" అని అరిచాడు. ఆ తల్లికేమి అర్థం కాక కంగారు పడిపోయింది. మరి కృష్ణుడెందుకు లక్ష్మణున్ని ధనస్సు తెమ్మని పిలిచాడు, ఎందుకంటే ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడిగా వచ్చాడు ఇప్పుడుండే అవసరాలకోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడు, ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ గోప బాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసి కట్టుగా మరొక గోప బాలికను లేపడం ప్రారంభించారు.


కృష్ణుడి జట్టు వారు "పుళ్ళిన్ వాయ్ కీండానై" ఒకనాడు కొంగ వేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేసాడు కృష్ణుడు అన్నారు. అంతలో రాముని జట్టువారు "ప్పొల్లా అరక్కనై" రావణాసురుడిని గిల్లి పారవేసాడు రాముడు అని అన్నారు. "కిళ్ళి క్కళైందానై కీర్-త్తిమై పాడి ప్పోయ్" ఇలా స్వామి కళ్యాణగుణాలను పాడుకుంటూ అంతా బయలుదేరారు.


"పిళ్ళైగళ్ ఎల్లారుమ్" గోపబాలికలందరూ "పావైక్కళం పుక్కార్" వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపల గోప బాలికతో అన్నది. లోపల గోప బాలిక వాళ్ళంతా చిన్న పిల్లలు కదా తొందర పడుతున్నారు ఇంకా తెల్లవారలేదు అన్నట్లుంది, వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులు చెప్పుతున్నారు. "వెళ్ళి యెరుందు" శుక్రోదయం అయ్యింది, "వియారమ్" బృహస్పతి "ఉఱంగిత్తు" అస్తమిస్తోంది అని గుర్తులు చెప్పారు. మనం ఇంతవరకు భగవంతుణ్ణి చేరలేక పోయామంటే మనలో ఉండే వ్యతిరిక్త భావనలే అవరోదంగా ఉన్నాయి, ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి, అందుకని భగవంతుణ్ణి చేరటానికి ఇది సరియైన సమయం. 


"పుళ్ళుం శిలమ్బిన కాణ్" పక్షులు మాటలాడుకుంటున్నాయి "పోదరి క్కణ్ణినాయ్" తుమ్మెద వాలిన పుష్పంవంటి కళ్ళు కలదానా. తనను గుర్తించిన వాన్ని భగవంతుడు శిరస్సున ధరిస్తాడు అందుకే లోపల ఉండే గోప బాలిక తను వెళ్ళడం ఎంటీ కృష్ణుడే తన దగ్గరకు రానీ అంటూ పెద్దగా పట్టిచ్చుకోవడం లేదు. "కుళ్ళ కుళిర" చల చల్లటి ఆనీటిలో "క్కుడైందు" నిండా మునిగి "నీరాడాదే" అవగాహన స్నానం మనం చేయ్యాలి కదా , లేకుంటే శ్రీకృష్ణుడి ఎడబాటు, ఒక విరహాగ్నిగా మనల్ని దహించి వేస్తుంది. "పళ్ళి క్కిడత్తియో" ఇంకా పడుకుని ఉన్నావా "పావాయ్!" ముగ్దత కల్గిన దానా, " నీ నన్నాళాల్" సమయం అయిపోతుంది, "కళ్ళం తవిరుందు కలంద్" మాకు చెందాల్సిన నీవు మమ్మల్ని దూరం చేసుకోవద్దు మాతో కలువు అంటూ అందరూ ఆ గోపబాలికను లేపి తమలో చేర్చుకున్నారు.


*ఆండాళ్ తిరువడిగళే శరణం..శరణం...🙏🙏


🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పూర్వజన్మలో ఎవరు?

.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



        *పూర్వజన్మలో ఎవరు?*

               ➖➖➖✍️


*శ్రీ కృష్ణుణ్ణి కన్నతల్లిదండ్రులూ పెంచిన నందయశోదలూ పూర్వజన్మలో ఎవరు ?*

*వాళ్ళ వృత్తాంతం మనము తెలుసుకుందాం..*



*శ్రీకృష్ణునికి జన్మనిచ్చినతల్లిదండ్రుల పెంచిన నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతాలు సంస్కృత భాగవతం లోనూ పోతన భాగవతంలోనూ మరికొన్ని పురాణాలలోనూ ఉన్నాయి.*


*ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర భాగవతాల్ని బట్టి తెల్పుతున్నాయి*


*కన్నతల్లిదండ్రులు  దేవకివసుదేవులు పెంచినతల్లిదండ్రులు యశోద నందుడు*


*దేవకీవసుదేవుల పూర్వజన్మవృత్తాంతాలు :*


*స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి  వివరించాడు.*


*”అమ్మా! స్వాయంభువ మన్వంతరంలో  పూర్వజన్మలో నీవు పృశ్నివి వసుదేవుడు పరమ పవిత్రుడు. దైవసుతుడు అనే ప్రజాపతి ప్రజాసృష్టికోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్రతపస్సు చేశారు, నన్ను12 వేలదివ్యసంవత్సరాలు ఆరాధించారు.*


*నేను వరం కోరుకోండని మిమ్ము అడిగాను.*

*మీరు నావంటి పుత్రుణ్ణి కావాలని కోరారు॥*

*వరం అనుగ్రహించి వెళ్ళాను॥*


*పిదప నేను నీ గర్భంలో జన్మించాను.*

*పృశ్నిగర్భుడనే పేరొందాను.*

*తర్వాతియుగంలో 

*అదితికశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను.*


*అప్పుడు పొట్టిగా ఉన్నందున వామనుడనీ ఇంద్రుని తమ్ముణ్ణి కనుక ఉపేంద్రుడనీ పేరొందాను.*

*ఈ యుగంలో మూడవమారు మీగర్బంలో పుత్రుడుగా అవతరించాను ఇది సత్యం!*


*నా పూర్వజన్మల్ని మీకు గుర్తు చేయడానికే ఈ విష్ణురూపాన్ని చూపాను అని వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు ఇతనిభార్యలు అదితి, సురస, ఈ యిద్దరే దేవకిగా, రోహిణిగా, జన్మించారు.*


*ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని హోమధేనువును తెచ్చాడు.*


*సముద్రుడు తిరిగి ఇమ్మని కోరితే కశ్యపుడు నిరాకరించాడు. కోపించిన సముద్రుడు కశ్యపుణ్ణి గోపాలకుడుగా జన్మింతువు గాక అని శపించాడు.*


*అందువల్ల వసుదేవుడు కంసుని గోసంపదకు పాలకుడయ్యాడు.*



*నందయశోదల వృతాంతం :*


*వసువులు అనే దేవతలలో ధర, ద్రోణుడు, అనేవారు దంపతులు బ్రహ్మదేవుడు వీరిని భూలోకంలో జన్మించండని ఆదేశించారు.*


*అందుకు వాళ్ళు … “దేవా ! విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి సేవించేభాగ్యం ప్రసాదిస్తే అట్లేజన్మిస్తాము!” అని ప్రార్థించారు.*


*బ్రహ్మదేవుడు ఆమోదించాడు.*


*ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ దర యే ఈ యశోద!*


*శ్రీహరికూడా బ్రహదేవునిమాట మన్నించి ఈ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తిశ్రద్దలతో గౌరవించాడు.*


*భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా కొడుకుగా ఒకయింట పెరగాలన్నా ఆ దంపతులు తపస్సంపన్నులూ మహాభక్తులు అయి ఉండాలి. అట్టివాళ్లని భగవంతుడు ముందుగానే ఎంచుకొని వారికి పుత్రుడై పుట్టి  వాళ్లవద్ద పెరిగి వాళ్ల ఆశయాన్ని తన ఆశయాన్ని సఫలం చేస్తాడు, సఫలం చేసుకొంటాడు.*


*’జన్మాంతర పుణ్యసంస్కారం లేనివాళ్ల గర్భంలో   భగవంతుడు పుట్టడు! భగవంతునికి జన్మయిచ్చే యోగ్యత వాళ్ళకు ఉండి తీరాలి!’ అనే గొప్పసందేశం  ఇదియే!*


*శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పూర్వజన్మ వృత్తాంతాల ద్వారా లోకానికి అందించబడింది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖