2, ఏప్రిల్ 2024, మంగళవారం

మాస్టారు* మారిపోయాడు.

 *మాస్టారు* మారిపోయాడు...కాదు కాదు మార్చేశారు.


*గురువు* గగ్గోలు పెడుతున్నాడు, డీలా పడి ఆర్తనాదం చేస్తున్నాడు.


*టీచర్* గారు చాక్ పీస్,పుస్తకం వదిలి పిల్లల అడ్రస్సులు, అడ్మిషన్ అప్లికేషన్లు చేతపట్టాడు.


నల్ల బోర్డు మీద తెల్ల సుద్ద ముక్క తో విజ్ఞానం రంగులు పూయించాల్సిన *అయ్యవారు* కాళ్ళ కి బలపాలు కట్టుకుని రోడ్ల మీద తిరుగుతు కొంప కొంప దేవురిస్తున్నాడు.


బెత్తం చేత పట్టి పిల్లల్ని గదమాయించాల్సిన *అయ్యవారు* అడ్మిషన్ల *కాష్టం* లో రగులుతు కాలుతున్నాడు.


తనని నమ్మి వచ్చిన భార్య,పిల్లల్ని 

సాకటానికి,తనని తాను అర్పించుకుని మనస్సు చంపుకొని కన్నీళ్ళ తో తలాడిస్తు సాగుతున్నాడు *మాస్టారు*.


యాజమాన్యం నుండి వచ్చే ప్రతి అడ్మిషన్ ఫోను కి సమాధానం చెప్పలేక తనని తాను తిట్టుకుని తల బాదు కుంటున్నాడు *పంతులు గారు*.


ఎర్ర ఇంకు పెన్ను తో పిల్లల పరీక్ష పేపర్లు దిద్ది మార్కులు వేయగల *మాస్టారు* తనకి ఏన్ని మార్కులు వేస్తారో అని గాభరా పడుతున్నాడు.


మండుటెండల్లో నెత్తి కాలుతున్న,గొంతు తడారుతున్న,దప్పిక తో నాలుక పిడచ కట్టుకు పోతున్న ఆ నాలుగు అక్షరాలు *అడ్మిషన్* కోసం తహ తహ లాడుతు పరిగెడుతున్నాడు *అమాయకపు బతకలేని బడి పంతులు*



(*నా టీచర్ మిత్రులకు ఏ దేవుడు అడ్మిషన్ల  నుండి విముక్తి ప్రసాదిస్తాడో,ఆ దేవ దేవుడికి అంకితం*)


సత్యనారాయణ మూర్తి,సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ,కాలమిస్ట్,9985617100

నింద - స్తుతి*

 *నింద - స్తుతి*

~~~~~~~~


మన శాస్త్రములలో చెప్పిన విషయములు వినటానికి కొంచెం కఠువుగా ఉన్నప్పటికీ నిర్దుష్టంగా సత్యం చెప్తాయి. 


ఇప్పుడు అటువంటి నిర్వచనముల గురించి తెలుసుకుందాం!


అవి నింద మరియు స్తుతి. వీనిని నిర్వచించు శ్లోకము చూడండి.


గుణేషు దోషారోపణం యసూయ అధవా దోషేషు గుణారోపణ యసూయ 

 తధా గుణేషు గుణారోపణం దోషేషు దోషారోపణం స్తుతిః 


పైన చెప్పిన శ్లోకం ప్రకారం 


*నింద:* ఒక వ్యక్తి గుణములను దోషములుగా, దోషములను గుణములుగా చెప్పటం నింద.

 

*స్తుతి:* ఒక వ్యక్తి గుణములను గుణములుగా, దోషములను దోషములుగా చెప్పటం స్తుతి. 


*విశ్లేషణ:*


వినటానికి అర్ధం చేసుకోవటానికి కొంచెం విపరీతంగా ఉన్నా ఒక వ్యక్తి దోషములను దోషములుగా చూపటం కూడా స్తుతి అని చెప్పారు. 


అలా ఎత్తి చూపటం వలన ఆ వ్యక్తి తన దోషములను దూరం చేసుకునే అవకాశం పొందగలుగుతాడు.


నింద అంటే అతని దోషములను కూడా గుణములుగా చెప్పినప్పుడు అతనికి అతనిలోని లోపం తెలుసుకునే అవకాశం ఉండదు. 


అతని దోషమును తెలుసుకోలేని వారు, ఆ దోషమును దూరం చేసుకునే అవకాసం కూడా ఉండదు.


గుణములను దోషములుగా చూపినప్పుడు బలహీన మనస్సుకల వారయితే వారి గుణములను వదిలే అవకాశం కూడా ఉండవచ్చు. 


మరో విధంగా చుస్తే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం స్తుతి, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కల్పించి చూపుట నింద.

Sivaalayam


 

మంగళవారం, ఏప్రిల్ 2,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


మంగళవారం, ఏప్రిల్ 2,2024

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - బహుళ పక్షం

తిథి:అష్టమి మ3.26 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే) 

నక్షత్రం:పూర్వాషాఢ సా6.33 వరకు

యోగం:పరిఘము మ2.46 వరకు

కరణం:కౌలువ మ3.26 వరకు తదుపరి తైతుల రా2.40 వరకు

వర్జ్యం:రా2.16 - 3.48

దుర్ముహూర్తము:ఉ8.24 - 9.12 & రా10.52 - 11.39

అమృతకాలం:మ1.51 - 3.25

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి: ధనుస్సు 

సూర్యోదయం:5.58

సూర్యాస్తమయం:6.09


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

బన్నేరుగట్ట - బెంగళూరు*

 🕉 మన గుడి : నెం 274


⚜ కర్నాటక  : *బన్నేరుగట్ట - బెంగళూరు*


⚜ శ్రీ హులిమావు రామలింగేశ్వర గుహా ఆలయం



💠 హులిమావు శివ గుహ దేవాలయం లేదా కేవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు , ఇది హులిమావు , బన్నెరఘట్ట రోడ్ , కర్ణాటక , BGS నేషనల్ పబ్లిక్ స్కూల్‌కు చాలా సమీపంలో ఉంది .


💠 బెంగళూరులోని రెండు గుహ దేవాలయాలలో ఇది ఒకటి, మరొకటి గవి గంగాదరేశ్వర దేవాలయం.


💠 గుహ దేవాలయం శ్రీ బాల గంగాదరస్వామి మఠంచే నిర్వహించబడుతుంది.

 ఒక సాధువు శ్రీ రామానంద్ స్వామీజీ చాలా సంవత్సరాలు గుహలో తపస్సు చేసారని మరియు అతని సమాధి కూడా లోపల ఉందని పేర్కొనబడింది .


💠 లోపల మూడు ప్రధాన దేవతలు ప్రతిష్టించారు. మధ్యలో ఒక శివలింగం , ఒక వైపు దేవి విగ్రహం మరియు మరొక వైపు గణేశ విగ్రహం ప్రతిష్టించబడ్డాయి. 

గుహకు అవతలి వైపున చాలా పురాతనమైన ధ్యాన మంటపం కూడా ఉంది. 


💠 ఈ గుహను 2000 సంవత్సరాల నాటి సింగిల్ రాక్ గుహగా ప్రకటించారు. 

ఈ ఆలయం రాళ్ళ లోపల సహజమైన గుహలో ఉంచబడింది. అయితే ఆలయానికి సంబంధించిన వివరణాత్మక చరిత్ర అందుబాటులో లేదు, అయితే ఈ ఆలయం శ్రీశ్రీశ్రీ బాలగంగాదర స్వామి స్థాపించిన 4-5 వందల సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. 


💠 ఆలయ స్థాపనకు సంబంధించి ఒక అందమైన చరిత్ర ఉంది. 

నందిహిల్స్‌లోని శ్రీ విశ్వనాథ ఆలయంలో మారియప్ప స్వామీజీ అనే సివిల్ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. బెంగుళూరు గుహలలో తపస్సు చేస్తున్న ఇలాంటి ఋషిని గుర్తించే పనిని అతను తరచుగా సందర్శించే ఒక ఋషి అతనికి అప్పగించాడు. 

చివరగా, చాలా పరిశోధనల తర్వాత, మారియప్ప హులిమావు గుహలో ధ్యానం చేస్తున్న శ్రీ రామానంద్ స్వామీజీని కనుగొన్నాడు. 

సాధువు మరణం తరువాత, మిగిలిన పురాతన కట్టడాలు చెక్కుచెదరకుండా గుహలోంచి ఒక దేవాలయం చెక్కబడింది. 



💠 ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు.

గుహ దేవాలయం ఒక ఏకశిలా నిర్మాణం.


💠 ఆలయ ప్రవేశం చిన్నది కానీ చాలా సుందరమైనది.

మార్గం ఇరువైపులా రామాయణ ఇతిహాసంలోని దృశ్యాల యొక్క ఇటీవలి రంగురంగుల పెయింటింగ్లతో ఉంటుంది.

ఆలయ లోపలి భాగం పురాతన రాతి నిర్మాణంలో చెక్కబడింది. 


💠 ఈ ఆలయంలో రెండు మందిరాలు ఉన్నాయి, ఒకటి శివుడు మరియు మరొకటి సీతా దేవి, శ్రీ లక్ష్మణుడు మరియు శ్రీ హనుమంతుడు ఉన్న శ్రీరాముని మందిరం. అందంగా చెక్కబడిన ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి: 2 మందిరాల మధ్య గణేశ విగ్రహం, ఎడమ చివర శివ పార్వతి మరియు కుడి చివర శ్రీ రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రాల పక్కనే ఋషి రామానంద్ స్వామీజీ జీవ సమాధి ఉంది


💠 కుడివైపున 100 మంది కూర్చునే సామర్థ్యమున్న ధ్యాన మంటపం (ధ్యాన మందిరం) ఉంది.


💠 హులిమావును గతంలో అమ్రపురా అని పిలిచేవారు, (అమ్ర లేదా అమ్రు మామిడి లేదా పులుపు అని అనువదిస్తుంది). 

కొన్నేళ్లుగా, ఈ పేరు కన్నడలో "పుల్లని మామిడి" అనే అర్థం వచ్చే ప్రస్తుత పేరు హులిమావుగా పరిణామం చెందింది. 

అప్పటి సారకేయ పాలకుడు (17వ శతాబ్దం) అమ్రాపురలో కోదండరామ స్వామి ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు . 

1850లో ఆలయం పునరుద్ధరించబడింది మరియు ఇతర దేవతల విగ్రహాలను ప్రతిష్టించారు.


💠 తెలియని కారణాల వల్ల, ఆలయానికి తగిన ప్రజాదరణ లేదు. అయితే, ఇది బెంగుళూరు ప్రధాన నగరానికి సమీపంలో ఉన్నందున సమీప బస్సు మార్గాలు, రైలు మార్గాలు మరియు విమానాశ్రయాలు వంటి పర్యాటకులకు అనుకూలమైన అన్ని సౌకర్యాలను కలిగి ఉంది.

1, ఏప్రిల్ 2024, సోమవారం

ఇడ్లీ సూక్తమ్

 18:59


చక్రాకారం ధవళమృదులం చారురూపం సుభక్ష్యం చట్నీయుక్తం ఘృతవిరచితం క్షారచూర్ణాత్


విభూష్యం | సూపే సిక్తం రసభరమిదం సర్వదా సంప్రయుక్తం


ఇడ్లీ నామ్న్యాం ఉదరశుభదం పూర్ణతః భోక్తుమీడే |


ఇడ్లీ సూక్తమ్ !



చమత్కార పద్యం.

చమత్కార పద్యం. 

ఇది ఒక అజ్ఞాతకవి వ్రాసిన కంద పద్యం.


కం.

అంచిత చతుర్ధ జాతుడు

పంచమ మార్గమున నేగి

ప్రధమ తనూజన్ గాంచి, తృతీయంబక్కడ నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!


భావం:

గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు ఐదవ మార్గంలో వెళ్ళి మొదటి కుమార్తెను చూసి, మూడవ దానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను...


ఏమీ అర్థం కాలేదు కదా!? 


ఈ పద్యం అర్థం కావాలంటే పంచ భూతాలతో అన్వయించి చెప్పుకోవాలి. పంచభూతాలు

1) భూమి

2) నీరు

3) అగ్ని

4) వాయువు

5) ఆకాశం. 


ఇప్పుడు పద్యం చాలా సులభంగా అర్థం అవుతుంది చూడండి.


చతుర్థ జాతుడు అంటే వాయు నందనుడు,

పంచమ మార్గము అంటే ఆకాశ మార్గము,

ప్రధమ తనూజ అంటే భూమిపుత్రి సీత,

తృతీయము అంటే అగ్ని , ద్వితీయము దాటి అంటే సముద్రం దాటి 

ఇప్పుడు భావం చూడండి...


హనుమంతుడు ఆకాశమార్గాన వెళ్ళి సీతను చూసి లంకకు నిప్పు పెట్టి సముద్రం దాటి వచ్చాడని భావం. 


ఇటువంటి పద్యాలే తెలుగుభాష గొప్పతనం నిలబెట్టేవి. 

వ్రాసిన కవికి నమస్సుమాంజలి.!!! 🙏🙏


... బడే రాము, బెంగుళూరు.

కర్మ సిద్ధాంతం

 కర్మ సిద్ధాంతం - 22

కాయికమైనవి అంటే దేహ సంబంధమైనవి, శరీరంతో చేసే పాపాలను మూడుగా వర్గీకరించారు.

1) మనది కాని వస్తువును, అనుమతిలేకుండా తీసుకొనుట. ఇతరుల వస్తువులను దొంగిలించుట.

ఇందులో దొంగతనం ఒకరకమైన పాపం. అది మనకు తెలిసిందే. అలాగే మనం నిత్యజీవితంలో చేసే పాపాలు కొన్ని ఇక్కడ చెప్పుకుందాము. ఉదయాన్నే వ్యాహాళి (మార్నింగ్ వాక్) పేరుతో ఓ చేతిలో పాలబుట్ట, ఇంకో చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని బయలుదేరుతారు. ఇకవారికి మాత్రమే భక్తి ఉన్నట్లు, రోడ్డున కనబడిన ప్రతి పువ్వును కోసేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే కనిపించిన ప్రతి చెట్టు మీద ఒక్క పువ్వు కూడా లేకుండా దులిపి వదిలిపెడతారు. ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి పూజిస్తారు. అప్పుడు ఎంత పుణ్యం వస్తుందో తెలీదు గానీ ఆ మొక్క నాటిన వాడి అనుమతి తీసుకోకుండా పువ్వులు కోసినందుకు దొంగతనం చేసిన పాపం వస్తుంది. దానిఫలితంగా మేక జన్మ ఎత్తవలసి వస్తుంది. పోని రోడ్డు పక్కన సహజంగా పెరిగిన మొక్క పువ్వులు, కాయలు కోసినా అంతే. అసలు నీకు దాని ఫలం తీసుకునే అధికారం ఎక్కడ ఉంది. నారు పోయలేదు, నీరు పోయలేదు, దానికి చీడ పడితే కనీసం మందు కొట్టలేదు. ఇప్పుడు ఉచితంగా ఫలాలు తీసుకోవడం తప్పు గనక పాపం వస్తుంది. ఇక గుళ్ళకు వెళ్ళి అక్కడి పూలను, ఆకులను ఎత్తుకొచ్చేవారి పాపం దీనికి వందరెట్లు ఉంటుంది. అది పుణ్యక్షేత్రాల్లో చేస్తే వెయ్యి రెట్లు.

నిత్యం భగవంతునికి అర్పించకుండా స్వీకరించినది ఆహారం కాదని, అది పాపమని గీతలో భగవానుడు చెప్పాడు. నువ్వు ఏదైనా ఆహారం స్వీకరిస్తున్నావంటే దానివెనుక ఎంతోమంది కష్టం ఉంది, ప్రకృతి వనరుల వినియోగం ఉంది. ఆహారం నీదాకా రావాడానికి కారణమైన వ్యక్తులకు/ సమాజానికి, ప్రకృతికి నువ్వు ఏ విధమైన మేలు చేయకుండా, దీనికి కారణమైన భగవంతునికి అది అర్పించకుండా తినుట పాపమని భగవానుని మాట.

మీకు ఇది ఆయుర్వేదంలో కనిపిస్తుంది. ఒక ఔషధ మూలికను సేకరించే ముందు ఆ మొక్కను పూజించాలి. పసుపుకుంకుమలు వేసి, దాని పెరికి వేస్తున్నందుకు లేదా దాని శరీర భాగాలను సేకరిస్తున్నందుకు గానూ దానికి క్షమాపణ చెప్పాలి. "నా రోగం నయమవుటకు నీ శరీర భాగాన్ని తీసుకుంటున్నాను" అని చెప్పి, వినయంతో స్వీకరించాలి. అలా తీసుకున్న మూలిక మాత్రమే పూర్తి రోగ నివారణ చేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం పేరుతో బయట జరుగుతున్నదంతా వ్యాపారం తప్ప అసలైన శాస్త్రం కాదు. ఉన్నది మొత్తం ఖాళీ చేయాలనే చూస్తున్నారు తప్పించి అసలు ఆయుర్వేద మూలికలను, వృక్షాలను రక్షించాలి, పెంచాలన్న ఆలోచన ఏది?

అంతెందుకు నీటిని ఇష్టం వచ్చినట్లు వాడేస్తారు. పొదుపుగా వాడాలన్న ఆలోచన ఉండదు. పోని మనం నీటిని వాడుకుంటున్నందుకు ఇంకుడు గుంతల ద్వారా తిరిగి భూమిలోకి వర్షపునీటిని లేదా వాడుకున్న నీటిని ఇంకిస్తామా అంటే అదీ లేదు. ఉన్నదంతా వాడేయాలి, ఆ తర్వాత తరాలు ఏమైతే ఏంటి? అనే భావన కనిపిస్తుంది. మన పక్కన ఒక నది పారుతున్నా, నీ అవసరాలకు ఎంత సరిపడతాయో, అంత నీటిని వాడుకునే 'అవకాశం' మాత్రమే ప్రకృతి (ప్రకృతి రూపంలో ఉన్న భగవంతుడు) నీకు ఇచ్చింది. నీకున్నది అవకాశమే గానీ అధికారము కాదు, హక్కు అంతకంటే కాదు. ఈ విశ్వంలో ఉన్న సమస్తానికి ఇది వర్తిస్తుంది. అలాగాక నీ ఇష్టం వచ్చినట్లు నీవు వనరులను వినియోగించడం దోపిడి / దొంగతనమవుతుంది.

ఇదంతా ఎందుకు - తగిన ప్రతిఫలం ఇవ్వకుండా తీసుకున్నా, ఉచితం తీసుకున్నా, అదంతా పాపమే అవుతుంది. అది అనేకమైన నీచజన్మలకు కారణమవుతుంది. 


To be continued ..

ప్రయాణంలో

 నేను రైలు ప్రయాణంలో 

ఓ ఊరు వెళుతుండగా నేను కూర్చున్న భోగీలో నాసీటు కింద కాళ్లదగ్గర ఒక పాత నలిగిపోయిన పర్సు కనిపించింది.


దానిని పైకి తీశాను. అందులో కొద్దిపాటి నోట్లు ఒక *కృష్ణుడిఫోటో* తప్ప ఏమీ లేవు. ఎవరిదో తెలిపే ఆనవాళ్ళు ఏమీ లేవు.

ఎలా తిరిగి ఇవ్వడం?

ఈ పర్స్ ఎవరిదండీ? అంటూ అడిగా, అక్కడ ఉన్నవాల్లలో అందరూ పర్స్ కేసి చూశారు, తమ జేబులు తడుముకున్నారు.


ఇంతలో పక్కబెర్తులో కూర్చుని *భగవద్గీత* చదువుకుంటున్న ఒక పెద్దాయన నెమ్మదిగా వచ్చి అది తన పర్స్ అని చెప్పాడు.

మీ పర్సు అని నమ్మకం ఏమిటీ? ఏదైనా ఆనవాలు ఉంటే చెప్పండి అన్నాను. "అందులో కృష్ణుడి ఫోటో ఉంటుందండీ"అన్నాడాయన. 

"ఆ ఒక్క ఆనవాలు చెబితే ఎలాగండీ? ఇంకా ఏదైనా చెప్పండి. మీ ఫోటో పెట్టుకోవచ్చు కదా!" అని అడిగాను.

అప్పుడు ఆ పెద్దాయన చెప్పిన సమాధానం మన అందరికీ ఒక పాఠమే.


బాబూ..! అది చిన్నప్పుడు నాకు మా నాన్న ఇచ్చిన పర్సు, అప్పుడు నాకు మా అమ్మానాన్న అంటే చాలా ఇష్టం, అందుకని నేను వాళ్ళ ఫోటో అందులో పెట్టుకున్నాను.

కాలం గడిచేకొద్దీ నేను చాలా అందంగా ఉన్నాను అని నాకు అభిప్రాయం కలిగింది. అందుకని నేను అప్పుడు పర్సులో నా ఫోటో పెట్టుకున్నాను.


నాకో ఉద్యోగం వచ్చి పెళ్లి అయ్యింది. నా భార్య చాలా అందగత్తె. నాకు ఆమె అంటే చాలా ప్రేమ. అపుడు ఆమె ఫోటో పర్సులో పెట్టుకునే వాడిని.


ఇంకో రెండు సంవత్సరాలకి నాకు కొడుకు పుట్టాడు. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడి కోసం ఆఫీసు వదలగానే ఇంటికి వచ్చి వాడితోనే లోకం అన్నట్టుగా గడిపేవాడిని.

వాడిని భుజాల మీద మోస్తూ రోజంతా గడిపేవాడిని. వాడిని నా పక్కనే పడుకోబెట్టుకునే వాడిని. వాడే నా లోకం. అప్పుడు పర్సులో వాడి ఫోటో పెట్టుకునే వాడిని. వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు.


నా భార్య మూడు సంవత్సరాల క్రితం చనిపోయింది.

కొడుకు నన్ను మరచిపోయాడు. నాకెవ్వరూ లేరు. ఇపుడు భయం వేస్తోంది. ఈ వయసులోనేగా తోడు కావాలి. అందుకని నాకు తోడుగా కృష్ణుడిని పెట్టుకున్నాను. ఆయనే నాకు ఇపుడు తోడు.


నా సంతోషానికి ఆయన సంతోషిస్తాడు.

నా విచారానికి ఓదారుస్తాడు.

నాతో ఎప్పుడూ ఉండే ఆయనను ఎప్పుడో పర్సులో పెట్టుకోవలసిన నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. ఇప్పుడు నేను ఆయనతో గడుపుతున్నాను.


*భగవద్గీత* చదువుతుంటే స్వయంగా ఆ జగద్గురువే నాతో మాట్లాడుతున్న అనుభూతి, ఆనందం కలుగుతున్నాయి. చిన్నతనం నుంచీ నన్ను విడిచిపెట్టిపోయే అశాశ్వతమైన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చాను తప్ప, శాశ్వతమైన పరమసత్యం 

ఈ భగవద్గీత అనే నిజాన్ని విస్మరించాను. జీవితం అర్ధభాగం పైగా గడిచిపోయిన తరువాత ఈ *బ్రహ్మవిద్యపై* శ్రద్ధ కలిగినదుకు సంతోషించాలో, కనీసం నూటికి 90 మందికిపైగా ఇప్పటికీ దేవుని ఉవాచపై శ్రద్ధ లేనందుకు విచారించాలో తెలియడం లేదు అన్నాడు 

ఆ పెద్దాయన.


ఆయన మాటల్లో ఆవేదన, ఆయన కళ్ళల్లో పలుచటి నీటిచెమ్మ లీలగా కనిపించాయి.

నేను మారు మాట్లాడకుండా పర్సు ఆయనకు ఇచ్చేశా.

పక్క స్టేషనులో రైలు ఆగింది, నేను దిగవలసినది అక్కడే. రైలు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నా ఆలోచనలు మాత్రం వేగంగానే సాగుతున్నాయి. బయటకు రాగానే ఎదురుగా గోడపై

*భగవద్గీత చదవండి,*

*శ్రీ కృష్ణుని నిజభావం తెలుసుకొనండి"* అని వ్రాసి ఉన్న బోర్డు చూసి, దానిపై ఉన్న నెంబర్ కి కాల్ చేసి నాకు భగవద్గీత కావాలని అడిగాను. ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి నేనున్న రైల్వేస్టేషన్ కు 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నానని, మీకు ఆలస్యం అవుతుందంటే మీ అడ్రస్ కు తెచ్చి ఇస్తామని చెప్పాడు. గంట సమయమైనా నేను ఇక్కడే వేచి ఉంటాను వెళితే భగవద్గీత గ్రంథంతోనే ఇంటికి వెళ్తాను అని చెప్పాను.

సుమారు 25 సంవత్సరాల వయసున్న వ్యక్తి అర్ధగంటకి బైకుపై వచ్చి నా నెంబర్ కి కాల్ చేసాడు. అతనిని చూసి చెయ్యి పైకెత్తి పిలిచాను. అతను దగ్గరకు వచ్చి *"భగవద్గీత"* నా చేతిలో పెడుతూ ఆలస్యం అయ్యింది ' క్షమించాలి అన్నాడు. 

ఆ మాటల్లో మర్యాద..... నిజంగానే "భగవద్గీత" ఇంత సంస్కారం నేర్పుతుందా అని చిరునవ్వు నవ్వి, ఆ గ్రంథం యొక్క వెల చెల్లించి, ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పి, ఆటోని పిలిచాను. ఆ పెద్దాయన చెప్పింది నిజమే., భగవద్గీత పట్టుకుని అడుగులు వేస్తుంటే స్వయంగా ఆ దేవదేవుడే నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది.

 

*భగవంతుడు తప్ప నిన్ను కాపాడేవాడే లేడు...* నిత్యం మనకు ఎన్ని పనులు వున్నా భగవంతునికి , భగవంతుడు చెప్పిన భగవద్గీతకు కాస్త సమయం కేటాయిస్తే ఆయన మన కోసం జీవితకాలం తోడు వుంటాడు. ఆయన్ని అర్జునుడిలా శరణు వెడితే!

నీ జీవితమంతా అదే అర్జునుడికి తోడుగా ఉన్నట్టే ఉండి.. నిన్ను నడిపిస్తాడు


🙏జై శ్రీ కృష్ణ🙏జై శ్రీ కృష్ణ🙏


 🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు🙏🌹

సంసారం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

సంసారం 17-03-24


నేను నాభార్య వెళ్లి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని - అందులోనికి గృహ ప్రవేశం చేసాము . ఆమె వెళ్లి ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి - ఫైవ్ స్టార్ చాకోలెట్ ఇచ్చి - నవ్వి వచ్చింది .


రొండో రోజు ఉదయం - ఒక పెద్దావిడ - మా ఇంటికి కి వచ్చింది మాతో పరిచయం కోసం మరియు కాలక్షేపం కోసం అనుకుంటాను .. మేము వీపులు గోడలకి ఆనించి - చతికల పడి కూచొని విశ్రాంతి తీసుకొంటూ వున్నాము . రాండి .. పెద్దమ్మా - రండి కూచోండి -అని ఆమెను ఆహ్వానం చేసి - మాపక్కనే చతికిల పడమన్నాము. సామాను రాలేదా ? ముందుగా కుర్చీలు తెచ్చుకోవాల్సింది " అని ఆమె కూడా మాతో పాటు కూచుంది [] 

" మాకు సామాను ఉండదు - వున్నా సామాను తెచ్చేసాము. మేమిద్దరమూ - యిల్లాగే కూచుంటాము . సంసారం సింపుల్ చేసుకున్నాము- అని చెప్పాను . 

" సామాను లేకపోతే కాఫీ టీలు యెట్లా ?

" ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తాము - వెళుతూ టీ - టిఫిన్లు కానించేసి వెడతాము . మాకు పాలు టీ పొడి చెక్కర డబ్బాలు వుండవు "

" బట్టలు వేసుకోవటానికి - తాడు కూడా కట్టలేదు " అన్నది ఆమె 

" మాకు బట్టలు ఉతుక్కునే పని ఉండదు . ఆమెకూ నాకూ వేరు వేరు మెడికల్ లాబ్ లో పని . వెళ్ళగానే మా ఒంటి మీద బట్టలు విప్పి కంపెనీ వాళ్లకి ఇచ్చి - వాళ్ళిచ్చిన - శానిటైజ్ చేసిన డ్రెస్సులు వేసుకుంటాము. కంపెనీ వాళ్ళు - మేము విప్పి ఇచ్చిన మాడ్రస్సులు ఉతికి - శానిటైజు చేసి అక్కడపెట్టేస్తారు .అవి అక్కడనే ఉంటవి . మరునాడు వెళ్లి వేసుకుంటాము . అందువల్ల మాకు బట్టల తాడూ , బట్టల కోసం అలమరాలు - కలరా ఉండలు - సబ్బు బిళ్ళలు వుండవు . అని నేను చెప్పాను .

" టీవీ తేలేదా ? అని ఆ పెద్దామె అడిగింది .

" ఎవరి ఫోన్లు వాళ్ళకున్నాయి . అవ్వే మాటీవీలు . మాకు డిష్ లక్కరలేదు . కేబుల్ అక్కరలేదు "

" మంచి నీళ్ల బిందె కూడా లేదు "

" వారానికి సరిపడా వాటర్ ప్యాకెట్లు - కొని గూట్లో పెట్టుకుంటాము . మాకు బిందెలు కడవలు - చెంబులు బక్కెట్లు కూడా వుండవు . మా కంపెనీ రూలు ప్రకారం లాబు నుండి బయటకు వస్తూనే - తల దగ్గరనించీ - వళ్ళంతా శుభ్రం గా కడుక్కోవాలి . వాళ్ళే మెడికేటెడ్ సోపు షాంపూ ఇస్తారు .ఇహ అదే మా స్నానం. అక్కడే మాటాయిలెట్ - అట్లాగే అలవాటు చేసుకున్నాము.మరీ ఏదన్న ఎమర్జెన్సీ వస్తే పనికొస్తాయి లెమ్మని - నాలుగు ఎడల్ట్ డైపర్లు వుంచుకుంటాము"  

" ఒక్క గిన్నె కానీ - గ్లాస్ గాని - స్టవ్ గానీ కనపడదేంటి ?''

" ఇద్దరమూ క్యాంటీన్లలో తింటాము . అక్కడ నచ్చక పోతే స్విగీ లో ఆర్డర్ ఇచ్చుకుంటాము. రాత్రిళ్ళు ఇంటికి వస్తూ బండి దగ్గర చపాతీలు తిని లస్సీ తాగుతాము . "మాకు గిన్నెలు - కుక్కర్లు - పాలగిన్నెలు - అంట్ల సబ్బులు వుండవు "

" బండి తెచ్చుకున్నారా ?

" లేదు - అరకిలో మీటర్ మార్నింగ్ వాక్ చేస్తే - అక్కడికి కంపెనీ బస్సు వస్తుంది .అట్లాగా జాబుకి వెళ్లి వస్తాము . ఇంకా ఎక్కడికన్నా వెళ్లాలంటే ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే ఎక్కి పోతాము - వస్తాము. కాదంటే షేర్ ఆటో ఎక్కుతాము. లేదంటే నడుస్తాము . మాకు బండ్లు - దానికి మెకానికు - అందులోకి పెట్రోల్ - టైర్లలోకి గాలీ అవసరం ఉండదు .

" అసలు మీకున్న సామాను ఏమిటి ?

" మూడు పెద్ద ట్రాలీ బ్యాగ్లు .. ఒక దాంట్లో మెత్తటి బొంతలు - ఎయిర్ పిల్లొలు - పక్క దుప్పట్లు - కప్పుడు దుప్పట్లు - టవల్స్ పెట్టుకుంటాము . సాధ్యమైనంత వరకూ నేలమీద న్యూస్ పేపర్ పరుచుకొని - తలకింద పుస్తకం పెట్టుకొని పడుకుంటాము . మాకు మాసిన గలీబులు - దుమ్ము పట్టిన దుప్పట్లు వుండవు . జిడ్డు పట్టిన దిండ్లు గూడా వుండవు .అందుకని ఏదీ ఉతుక్కోవటం అనేది కూడా ఉండదు "

" మిగతా రొండింటిలో - ఏముంటాయి ?

"నీలం రంగు దాంట్లో ఆమె బట్టలు - నల్ల రంగు దాంట్లో నా బట్టలు ఉంటాయి .ఎవరిదీ వాళ్లు సర్దుకుని రెడీ గా వుంచుకుంటాము . ఆమెకు పోవాలనిపించినపుడు - బ్యాగు లాక్కుంటూ వెళ్లి - వాళ పుట్టింటి కి బస్సు ఎక్కు తుంది .నేను అంతే . ఇద్దరం కలిసి ఏదన్న యాత్రకు వెళ్లినా అంతే . విడిగా వెళ్లినా అంతే .. మాకు ప్రయాణపు హడావుడి - బట్టలు సర్దుకోవటం వుండవు ". 


" చివరికి చీపిరి కూడా లేనట్లుంది ? ''  

" ఒక పనమ్మాయికి పురమాయించాము .మా ఒప్పందం ప్రకారం దాని సొంత చీపురు - సొంత మాపు - ఒక బకెట్ నీళ్లు తెచ్చుకొని - ఇల్లు తుడిచి వెళ్లి పోతుంది [] మాకు డెట్టాలు - లైజాల్ , విమ్ము - రిమ్ములు వుండవు "

" ఏందో నాయనా ? అంతా కలికాలం లాగుంది . ఏమీ సామాన్లు లేని - ఏ కస్టాలు నష్టాలు లేని మిమ్మల్ని చూసి - మీది ఓ సంసారం అనాలని పించటం లేదు . ఏమనుకోవద్దు నాయనా . పెదముండను అడుగుతున్నాను .మీరు నిజంగా పెళ్లి అయినా వాళ్లేనా ? లేక లేచి పోయి వచ్చిన వాండ్రా ? అని అడిగింది పెద్దామె . 

మాఆవిడ వెంటనే తన ఫోను ఓపెన్ చేసి - మా పెళ్లి ఫోటోలు చూపింది .  

ఆమె సంతృప్తి పడలేదు - ఏందో నాయనా ఫొటోల్లో మ్యాజిక్ ఉంటుందంటగా ? అని నోరు చప్పరించింది .

మా ఆవిడా కు స్పోర్టివ్ నెస్ ఎక్కువ నే . వెంటనే పర్సులో వున్నా తాళి తీసి " "దీన్ని - ఈ పెద్దమ్మ ఎదురుగా ఇంకో సారి కట్టండి ... ఏమవుతుంది ? ఆమె మూలకంగా - మనము నిజమైన భార్య భార్య భర్తలమని - మనదీ సంసారమే నని ఈ సమాజానికి రుజువు అవుతుంది " అన్నది. 


మా కోరిక మీద మా నూతన వధూ వరులను దీవిస్తూ, ఆ పెద్దావిడ ఒక సెల్ఫీ దిగింది - అట్లాగే ఆమెను మా మధ్యన పెట్టుకొని మేమూ ఒక సెల్ఫీ దిగాము [] మీకు షేర్ చేస్తాను . చూద్దురు గాని .

 *ఇట్లు వారణాసి శ్రీ రామకృష్ణ అమరావతి.* 

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹