30, జులై 2020, గురువారం

రామాయణమ్ 15

అస్త్రప్రయోగము తెలియటం ఎంత ముఖ్యమో ,ఉపసంహారము తెలియటం అంతే ముఖ్యము! ప్రయోగ,ఉపసంహారాలు రెంటినీ ముని వద్ద నుండి ఉపదేశము పొందాడు రామచంద్రుడు!
ఆయనతో పాటు లక్ష్మణుడు కూడా ఉపదేశం పొందాడు.
.
అలా మునితో నడుస్తూ నడుస్తూ ప్రయాణం సాగించారు!
వారికి అత్యంత మనోహరంగా ,ప్రశాంతంగా ,దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్న ఒక ఆశ్రమము కనపడ్డది .అది చూడగనే రాముడు మునితో ఇన్ని కాంతులు వెదచల్లుతూ ప్రకాశమానంగా ఉన్న ఈ ప్రాంతము ఇలా ఉండటానికి కారణమేమిటి? అని ప్రశ్నించాడు!.
.
మహర్షి అందుకు ప్రతిగా ,రామా ! ఇది పూర్వము విష్ణువు వామానావతారంలో నివసించిన పుణ్యభూమి ,ప్రస్తుతం నేను ఉంటున్నాను ,దీని పేరు సిద్ధాశ్రమము.
.
ఆశ్రమంలో ప్రవేశించగనే అచట నివాసముండే మునులందరూ మహర్షికి ఎదురేగి స్వాగతం పలుకారు.
 ,రాముడు మహర్షితో స్వామీ మీరు యాగ దీక్షాస్వీకారం గావించండి మేము రక్షణబాధ్యతలు ఈ క్షణం నుండే స్వీకరిస్తున్నాము అని పలికి మహర్షి యాగ శాల చుట్టూ తిరుగుతూ వేయికళ్ళతో కాపలా కాస్తున్నారు!
.
యాగము ఆరురోజులు కొనసాగుతుంది! అయిదురోజులు ఏవిధమైన విఘ్నము లేకుండా గడచిపోయింది !
.
ఆరవ రోజు అన్నదమ్ములిద్దరూ ఏమాత్రము అజాగ్రత్త లేకుండా కళ్ళలో వత్తులేసుకొని కాపలా కాస్తున్నారు. తమ్ముడిని రాముడు హెచ్చరించాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని!
.
ఇంతలో అందరూ చూస్తూ ఉండగనే ఒక్కసారిగా యజ్ఞకుండంలోనుండి భగ్గుమని ఒక్కసారిగా అగ్నిజ్వాలలు పైకి లేచినవి! ఆ విధంగా జ్వలించటం రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నది!.
.
యజ్ఞం సాగుతున్నది మంత్రపూర్వకంగా ,శాస్త్రానుసారంగా యజ్ఞనిర్వహణగావిస్తున్నారు విశ్వామిత్రునితో కూడిన ఋత్విక్కులు. ఇంతలో ! ఆకాశం బ్రద్దలయినంత చప్పుడు !
ఒక్కసారిగా ఆకాశమంతా నల్లని మేఘాలావరించినట్లుగా మిడతలదండులాగా రాక్షస సైన్యం యాగశాల పయిన ఆకాశాన్ని కప్పివేసింది! చిమ్మచీకట్లు కమ్మినట్లున్నది! .
.
పెద్దపెద్ద కడవలు పట్టుకొని మారీచ,సుబాహులు యజ్ఞకుండంలోకి రక్తధారలు కురిపిస్తున్నారు రక్తంతో ఆ వేదిక నిండిపోయింది!.
.
((మారీచసుబాహులు నానారాత్రించరులతోడ నభమున మాయా
నీరదములుపన్ని యసృగ్ధారలు వేదిపయి గురిసి గర్జనలెసగన్
( భాస్కర రామాయణం నుండి)
.
లక్ష్మణ చూడు నా "లా" వంచు విజయ లక్ష్మీ ధనుర్ఘోష లక్షణం బెసగ నెలకొని వినువీధి నిజదృష్టి నిలిపినాడట..
(ఇది గోనబుద్ధారెడ్డిగారు వ్రాసిన రంగనాధరామాయణంలోని వాక్యము).)
.
వీరు చేస్తున్న దుష్కార్యాన్ని గమనిస్తూనే ఒక్కసారిగా విల్లు ఎక్కుపెట్టి నారిసారించి మానవాస్త్రం మంత్రించి విడిచిపెట్టాడు !
అది రయ్యిన దూసుకుంటూ వెళ్ళి మారీచుడికి తగిలి వాడిని తోసుకుంటూ తీసుకెళ్ళి నూరుయోజనాల దూరంలోని సముద్రంలో పడవేసింది! ఆ దెబ్బకు వాడిదిమ్మతిరిగి కళ్ళు బైర్లుగమ్మి మూర్ఛపోయాడు.
.
మరల క్షణం కూడా వ్యవధి లేకుండా ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి సుబాహుడిమీదకు వదిలాడు అది వాడి గుండెల మీద పిడుగులా కూలి శరీరాన్ని చీల్చి ఛిద్రం చేసి వాడిని నేల కూల్చింది !
మిగిలిన రాక్షసులందరూ రాముడు ప్రయోగించిన వాయవ్యాస్త్రం దెబ్బకు ఎక్కడివారక్కడ చెల్లాచెదురయై చెట్టుకొకరు పుట్టకొకరుగా నేల కూలారు!
.
యజ్ఞం నిర్విఘ్నంగా పరిసమాప్తమయ్యింది.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: