19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఎవరో కొందరు చేసిన దానికి

 ఎవరో కొందరు చేసిన దానికి


 ఎవరో కొందరు చేసిన దానికి మొత్తం ముస్లిమ్లనందరినీ ఎలా నిందిస్తారు, అని ఈరోజున ముస్లిం సమాజం బాధపడుతోంది. వారి బాధ అర్ధం చేసుకోదగినదే. అయితే మరీ ఎప్పుడో ఎవరో చేశారు అనే అనుమానంతో ఇప్పటికీ బ్రాహ్మణులను బాపనోడు, పిలక పంతులు అని వారి వేషాలను, భాషని, అలావాట్లని ఇలా వారికి చెందిన అన్నిటినీ దాదాపు వంద సంవత్సరాలుగా అవమానిస్తున్నారే మరి వాళ్ళని ఏమనాలి? 


ఎప్పుడో 3500 సం. ల క్రితం ఆర్యులు అని ఎవరో వచ్చారని, వాళ్ళేదో చేశారని, వాళ్లే బ్రాహ్మణులు అని ఒక కట్టుకథని సృష్టించి, వాళ్ళ పిలకలు లాగి, పంచలు లాగి, యజ్ఞోపవీతాలు తెంపి, వందల, వేల సినిమాలలో బ్రాహ్మణులను వారు వృత్తులను, వారి భాషను, పనిగట్టుకుని అవమానించారు కద? దానికి వారెంత బాధపడి ఉండాలి? 


పోనీ ఈ ఆర్యన్ సిద్ధాంతం కథ ఏమైనా నిజమా అంటే అదీ కాదు. ఏ ఆధారమూ లేకుండా సృష్టించబడిన ఒక కట్టు కథ. అయినా సరే, కేవలం తమకి అది నచ్చింది కనుక కొందరు దానిని నిజం అని నమ్ముతున్నారు. పోనీ కొంతసేపు అదంతా నిజమే అనుకుందాం. నిజమే అయినా, ఎప్పుడో 3500 సం. ల క్రితం ఎవరో చేసిన దానికి మీరు ఇప్పటి వారిని ఎలా బాధ్యులను చేస్తారు? 


బ్రాహ్మణుల మీద ఇంతలా గత రెండు వందల సంవత్సరాలుగా దాడి జరగడానికి ఒక్కటే కారణం. బ్రాహ్మణ్యం పోతే హిందూత్వం కూడా నాశనం అవుతుంది అని మన ప్రత్యర్థులకు స్పష్టంగా తెలియడం. అందుకే వారి మీద ఇన్నిరకాల దాడులు. వారు అనుకుంది కొంత మేర సాధించారు కూడా. ఆ కారణం వల్లనే తెలివైన బ్రాహ్మణులలో చాలా వరకూ ఎవ్వరూ బ్రాహ్మణ వృత్తులు స్వీకరించడం లేదు. అటు డబ్బూ లేక, ఇటు గౌరవమూ లేకపోతే మాకెందుకు ఈ కంచి గరుడ సేవ అనుకుని చాలా మంది సుబ్బరంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.


బ్రాహ్మణుల పట్ల సమాజంలో గౌరవం పెరగడం చాలా అవసరం. అప్పుడే వారు మళ్లీ బ్రాహ్మణ వృతులైన వేదాధ్యయనం, పౌరోహిత్యం, ప్రవచనం వంటి వృత్తులను స్వీకరిస్తారు. హిందూ ధర్మం బలపడాలి అంటే అది చాలా ముఖ్యం. ఈ విషయాలు ఏ బ్రాహ్మణుడూ చెప్పలేడు, నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలుసు అనికూడా నేను అనుకోను.  డబ్బు రాకపోయినా, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని తెలిసినా ఎందరో బ్రాహ్మణులు మన సంస్కృతికి ఆధారమైన విద్యలు కాపాడారు అంటే కారణం, అది ఈశ్వరుడు తమకు అప్పగించిన బాధ్యత అని వాళ్ళు నమ్మడమే. అలా వారు నమ్మకపోయి ఉంటే, అది అందరి బాధ్యత అని వారు అనుకుని ఉంటే, అంటే మన దేశంలో వర్ణ వ్యవస్థ లేకపోయి ఉండి ఉంటే, భారతదేశానికి కూడా ఇస్లాం, క్రైస్తవాలు అడుగుపెట్టిన తరువాత వర్ణవ్యవస్థ లేని మిగిలిన దేశాలకి ఏ గతి పట్టిందో, అదే గతి పట్టేది. ఆ రెండు మతాలూ అడుగుపెట్టిన తరువాత కూడా తమ సంస్కృతిని, ధర్మాన్ని, నాగరికతని నిలువుకున్న ఏకైక దేశం మనదే. నాకు తెలిసినంత వరకూ ఆఫ్ఘనిస్తాన్ అంత త్వరగా ఇస్లామీకరించబడింది అంటే అందుకు కారణం అక్కడ బౌద్ధం ఎక్కువ అవ్వడమే (ఈ విషయంలో నాది పొరపాటు అయితే తెలియచెయ్యగలరు) 


కనుక బ్రాహ్మణ్యం మన బలం. అజ్ఞానంతో దానిని మనం పోగొట్టుకుంటున్నాం. నిజంగా బ్రాహ్మణ వ్యవస్థ మన బలహీనత అయితే ముఘలులు, బ్రిటిష్ వాళ్ళు, తరువాత వచ్చిన కాంగ్రెస్/కమ్యూనిస్టులు బ్రాహ్మణ వ్యవస్థని బలపరచాలే కానీ బలహీనపరచ కూడదు. 


ఒక బ్రాహ్మణుడు ఈ పోస్ట్ లైక్ చెయ్యాలి అన్నా, షేర్ చెయ్యాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని అంతలా తూట్లు పొడిచారు. ఒక్కసారి ఈ విషయాన్నీ అందరూ కొంత విశాల దృక్పధంతో ఆలోచించండి

కామెంట్‌లు లేవు: