3, ఫిబ్రవరి 2021, బుధవారం

అమరఫలం

 *అమరఫలం -- చందమామ కథలు*


*పూర్వం ఒక ముని సర్వసంగపరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా, ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై, మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, ‘‘నీ తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా సిద్ధిస్తుంది,'' అని చెప్పి అంతర్థానమయింది.*

*మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని ఇచ్చి ఉంటుందని ఆయన భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు చేయ నిశ్చయించి, ఆయన ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు.*


*రాజు మునికి తగిన మర్యాదలు చేసి, ఆయన వచ్చిన పని అడిగాడు.*


*"రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెలఇచ్చి కొన్నవారికి ఒక్క కోరిక సిద్ధిస్తుంది. ఆ తరవాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారంరోజుల కన్న ఎక్కువకాలం దగ్గిర ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపాయం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను. దీనికెంత వెల ఇస్తావో చెప్పు,'' అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది.*


*ఆయనకూ, పొరుగురాజుకూ చాలాకాలంగా యుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా ఎవరికీ విజయం చేకూరటం లేదు. ఇరుపక్షాలకూ బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది. అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజయం సాధించాలనుకుని, ఆ పండును లక్షవరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, ‘‘నీ కోరిక తీరిన వారం రోజుల లోపల, కొన్న ధర కంటె తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా అమ్మాలి.*


*నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి,'' అని లక్షవరహాలూ రాజు నుంచి పుచ్చుకుని, వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి, తన దారిన తాను అరణ్యానికి తిరిగి వెళ్ళి, ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు.*


*అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునాయాసంగా కోరిక సిద్ధించింది. మళ్ళీ యుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపోయాడు. ఆ రాజ్యం కూడా ఈ రాజుదే అయింది. విజయం లభించిననాడే రాజు నిండు కొలువులో పరమానందంతో అమరఫలాన్ని అందరికీ చూపి, దాని మహిమ గురించి వివరించి, కావలిసిన వారికి దాన్ని విక్రయిస్తానన్నాడు*


*దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతుడొకడు దాన్ని అమితాసక్తితో తొంభైవేల వరహాలిచ్చి కొని, తన దీర్ఘ వ్యాధి నివారణ చేసుకున్నాడు.*


*వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేకమందికి అనేక రకాల కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసివచ్చింది, కొందరు విద్యావంతులయ్యారు, అనేకమంది వ్యాధుల నుంచి విముక్తులయ్యారు. కోరికలు తీర్చుతున్నకొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది.*


*చాలాకాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యు ముఖం నుంచి తప్పించాడు. ఆ అమర ఫలం ఇప్పు డెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది. రెండుకాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి నయమయ్యాక దాన్ని మరొకరికి ఒకకాసుకే అమ్మాలి.*


*ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక, వైద్యుణ్ణే నమ్ముకుందామనుకున్నాడు*


*కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలియకుండా రెండుకాసు లిచ్చి, తమ నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి,తన భర్త వ్యాధి నయం కావాలని కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు నయమయింది. తాను తీసుకున్న మందులే పనిచేశాయినుకున్నా డతను.*


*ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరి కన్నా ఒక కాసుకు అమ్మాలి. కాని ఎవరికని అమ్మటం? అమ్మితే ఆతరవాత కొన్నవాళ్ళ గతేమిటి? బాగా ఆలోచించి అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గిరే ఉంచుకుని ఏ అపాయం వచ్చినా భరించటానికే ఆమె నిశ్చయించుకున్నది. తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో నన్న బెదురుతో మాలిని రోగిష్ఠిదానిలాగా అయిపోసాగింది.*


*నౌకరు ఒకనాడు, ‘‘ఏమండి, అమ్మగారూ? వంట్లో బాగా లేదా?'' అని అడిగాడు.*


*"ఇక నేను ఎంతోకాలం బతకనురా!'' అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది.*


*"ఎందుకండీ అమ్మగారూ, మీరు చావటం?'' అన్నాడు నౌకరు. ‘‘దాన్ని ఎవరికి అమ్మనురా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకర్ని చంపటం దేనికి? నేనే చస్తాను,'' అన్నది మాలిని.*


*నౌకరు నవ్వి, ‘‘ఎవరూ చావొద్దు! ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు అమ్మెయ్యండి,'' అన్నాడు. ‘‘ఇంకానయం! నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా అమ్ముతావు?'' అన్నది మాలిని.*


*"నే నసలు కోరిక కోరితేగద! దాన్ని పెట్టెలో దాస్తాను,'' అంటూ నౌకరు ఒక కాసు తీసి మాలిని కిచ్చి, అమరఫలాన్ని తీసుకుపోయి, తన ఇంట్లో కొయ్యపెట్టె అడుగున భద్రంగా దాచాడు.*


*అటుతరవాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలమయ్యాక చూస్తే దాని జాడ కనిపించలేదు.*

కామెంట్‌లు లేవు: