30, ఆగస్టు 2021, సోమవారం

శ్రీ కృష్ణ జననం

 శ్రీ కృష్ణ జననం


శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.


మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. 

మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.స్వాయంభువ మన్వంతరంలో మీరిద్దరూ (దేవకీ వసుదేవులు) ఒక ప్రజాపతి, ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు. ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ పన్నెండు వేల దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షం అయి ‘ఏమి కావాలి?’ అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. ‘నీలాంటి కొడుకు కావాలి’ అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేదు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకమారు అడిగితే నేను మూడుమార్లు పుట్టాను. ఒకసారి నేను పృశ్నికి పృశ్నిగర్భుడుగా, రెండవమారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా ఇప్పుడు కృష్ణభగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉన్నది. అంతరార్ధం తెలిసినా తెలియకపోయినా నా కథ విని, నన్ను స్మరిస్తూ, నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షమును పొందండి’ అన్నాడు.


ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయములు వసుదేవునకు అంతరమునందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయమును బాహ్యమునందు చెప్పలేదు. ‘ఇదే సమయమునందు యమునానదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా శక్తి స్వరూపమయిన యోగమాయ యశోదాదేవి గర్భమునందు ఆడపిల్లగా జన్మించింది. నీవు నన్ను తీసుకువెళ్ళి ఆ యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరల అక్కడనుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి ప్రక్కన పడుకోబెట్టు’ అన్నాడు.


వెంటనే వసుదేవుని కాళ్ళు, చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెలమీద పెట్టుకున్నాడు. చాలామంది తలమీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడనే ఉన్నది. ద్వారం దగ్గరకు వెళ్ళాడు. ద్వారమునకు ఉన్న ఇనుప గొలుసులు, తాళములు, మేకులు అన్నీ ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడపట్టి శేషుడు వస్తున్నాడు. బయటకు వచ్చాడు ఆకాశం అంతా నల్లటి మబ్బుపట్టి ఉన్నది. గాఢాంధకారము. శ్రావణమాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. విపరీతమయిన వేగంతో ప్రవహిసస్తున్న యమునానది దగ్గరికి వెళ్ళాడు. వసుదేవుడు పరమాత్మను గుండెలమీద పెట్టుకుని యమున వంక చూశాడు.


కృష్ణభగవానుని గుండెలమీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటు యిచ్చిన సముద్రములా యమున చోటిచ్చింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టినా ఎవరికీ తెలియదు. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకుని మళ్ళీ తిరిగివచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ద్వారములు మూసుకున్నాయి. ఇనుపసంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆ ఆడపిల్లను దేవకీదేవి ప్రక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణపరమాత్మను గుండెలమీద ధరించాడు. అనగా వసుదేవుడు లోపల ఉన్న ఆత్మస్వరూపమును తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకియందు ఉన్నది. తల్లి కాబట్టి ఉండాలి లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది.

ఈ ఆడపిల్ల ఏడ్చింది. అక్కడ వున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని అనుకున్నారు. ముందుగా తాళం కప్పలమీద రాజముద్ర ఉన్నదీ లేనిదీ చూశారు. రాజముద్ర ఉన్నది. లోపలి వాళ్ళు ఎక్కడికీ వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చుని ఉన్నాడు. భటులు పిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరుగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్న వాడు పరుగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళములు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీ దేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్లే తనపిల్లే, తానే రక్షించుకోవాలని అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టుకున్నది. ‘అన్నయ్యా! ఇది చంపివేయడానికి మేనల్లుడు కాదు మేనకోడలు. నన్ను నమ్ము ఆరుగురిని చంపేశావు. ఏడవది గర్భస్రావము అయింది ఇది ఆడపిల్ల. ఇంటికి ఆడపడుచు నీకు కోడలు. నువ్వు మన్నన చేయాలి. పసిపిల్లయిన దానిని చంపాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనయినా బ్రతకనివ్వు. చంపవద్దు ’ అని ఏడుస్తూ వేడుకున్నది.

కంసుడు మహోగ్రంగా సోదరిని నిందించి పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకు లాగేసి గిరగిర త్రిప్పి బండకు వేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలడం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమునందు ఆరూఢయై కూర్చుంది. అటునుంచి విమానములలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరం ఇచ్చాడు. ‘నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అనే పదునాలుగు నామములతో పిలుస్తారు. భాగవతాంతర్గతంగా ఎవరైతే ఈ నామములు వింటున్న వాళ్ళందరినీ దేశంలో ఎక్కడెక్కడ వున్నా నీవు రక్ష చేస్తావు’ అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు వచ్చి పాటలు పాడుతూ తల్లికి అగరుధూపములు సమర్పిస్తున్నారు. నైవేద్యములు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకుని క్రింద ఉన్న కంసుని చూసి ‘ఓరీ దుర్మార్గుడా! పిల్లలందరినీ రాళ్ళకు వేసి కొట్టి చంపావు. నన్నుకూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతోపాటు పుట్టి నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నీవు చనిపోవడం ఖాయం’ అని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది.


వెంటనే కంసుడు పరుగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు.

అవతల నందవ్రజంలో ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. కృష్ణపరమాత్మ అక్కడ ఆవిర్భవించి ఉన్నారు. పిల్లవాడేమీ ఏడవలేదు. యశోద పొంగిపోయింది. నంద వ్రజం భగవద్భక్తులతోనూ, గోవులతోను నిండి ఉంటుంది. గోపకాంతలు మహా సంతోష పడిపోతు చూచివద్దామని యశోద గృహమునకు వెళ్ళారు. బయటకు వచ్చి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ‘అబ్బ పిల్లవాడు ఎంత బాగున్నాడే!’ అని పరవశించిపోతున్నారు. బయట నందప్రభువు పొంగిపోతున్నాడు. బ్రాహ్మణులను పిలిపించి గోవులను దానం ఇచ్చాడు. గొప్ప గొప్ప మేలిమి వస్త్రములు దానం ఇచ్చాడు. పిల్లవాని జాతకము చూసి ఎలా ఉంటాడో చెప్పవలసింది అని వారిని అడిగాడు. ఆ పిల్లవాని జాతకం చూసి ‘లేక లేక పుట్టిన నీ కుమారుడు గొప్ప లక్ష్మీ సంపన్నుడవుతాడు లక్ష్మీదేవి వీనిదే. ఎటువంటి వీరులనయినా ఓడిస్తాడు. గొప్ప దీర్ఘాయుర్దాయమును పొందుతాడని చెప్పారు. పిదప ఆ బ్రాహ్మణులందరూ ఆశీర్వచనం చేశారు. అక్కడకు వచ్చిన వాళ్ళలో వృద్ధ స్త్రీలను పిలిచి కృష్ణ పరమాత్మకు నీళ్ళు పోయమని అడిగారు. లోకములన్నింటిని ప్రళయం చేసేయ్యాలనుకున్నప్పుడు నీళ్ళలో ముంచేసి తాను మాత్రం ఒక మర్రి ఆకుమీద ఏమీ తెలియనివాడిలా బొటనవ్రేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకునే వటపత్రశాయి ఏమీ తెలియని వాడిలా ఈ వృద్ధ గోపకాంతల తొడల మీద పడుకొని నీళ్ళు పోయించుకొని ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్లు పడుకున్నాడు దొంగకృష్ణుడు. ఆఖరుకి ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఓ ఉయ్యాలలో పడుకోపెట్టారు.

కామెంట్‌లు లేవు: