20, నవంబర్ 2022, ఆదివారం

ఏకముఖి రుద్రాక్ష

 ఏకముఖి రుద్రాక్ష గురించి సంపూర్ణ వివరణ  - 1


      దీనినే శివరుద్రాక్ష అంటారు. దీనిని శివుని ప్రతిరూపంగా భావిస్తారు . ఇది అసలైనది దొరుకుట మహాదుర్లభం. ఈ ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నం.  ఈ ఏకముఖి రుద్రాక్షని సూర్యుని స్వరూపముగా భావిస్తారు . దీనిని ధరించటం వలన సూర్యగ్రహ అనుగ్రహం లభించును. ఈ రుద్రాక్ష మాల ధరించటం వలన ఆధ్యాత్మిక శక్తులు వశం అగును. అత్యంత అరుదుగా లభించే ఈ అద్భుత రుద్రాక్ష జీడిపప్పు ఆకారంలో (అర్ధ చంద్రాకారంలో ) లభించును.  మంత్ర , తంత్ర ప్రయోగాలు తిప్పికొట్టబడును. 


                ఏకముఖి రుద్రాక్ష ధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును . మనస్సులో భక్తి పెరుగును . ఆర్థికాభివృద్ధి జరుగును. జీవితంలో ఉన్నతస్థితి కలుగును. ఈ మాలను ధరించు సమయమున రుద్రాక్ష మంత్రమును 11 సార్లు జపించవలెను . దీని ధారణ వలన బ్రహ్మహత్యా దోషం నివారణ అగును. ఇంద్రియ నిగ్రహం కలుగును.  టీబీ మరియు ఆస్తమా వంటి మొండివ్యాధులను తగ్గించును . తలనొప్పి , కంటి సమస్య , లివర్ సమస్యలకు కూడా అద్భుతంగా పనిచేయును .  ఈ రుద్రాక్షను పూజామందిరంలో ఉంచుకుని పూజించుచున్న సంపదలు తరలివచ్చును . సుఖసంతోషాలు కలుగును.


           రాజకీయ నాయకులు ఈ రుద్రాక్ష ధారణకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. రాజకీయ నాయకులలో శ్రీమతి ఇందిరాగాంధీ , n .t .రామారావు గారి వద్ద మాత్రమే ఈ ఏకముఖి రుద్రాక్ష ఉండేది. కాని ఇందిరా గాంధీ మరణానికి కొన్ని రోజుల ముందే ఈ రుద్రాక్ష ఆమె దగ్గర నుంచి మాయం అయ్యింది . అది ఇప్పటివరకు ఏమైందో ఎవ్వరికి తెలియదు. 


                         ఏకముఖి రుద్రాక్ష పరమతత్వాన్ని బోధిస్తుంది. అలాంటి ఆలోచన ఉన్నవారు మాత్రమే దీనిని ధరించవలెను . దీని దర్శనం కూడా దుర్లభమే .శివరాత్రి పర్వదినమున ఈ రుద్రాక్షను పూజించిన సాక్షాత్తు శివుడ్ని పూజించిన ఫలితం వచ్చును.  


     ఈ ఏకముఖి రుద్రాక్షలో 4 రకాలు కలవు. ఒక్కోరకం ధరించటం వలన ఒక్కో రకమైన ఫలితాలు వస్తాయి. వాటి గురించి వివరిస్తాను.


 1 -  శ్వేత వర్ణ ఏకముఖి  -


           వ్యాధుల నుండి విముక్తి.


 2 -  రక్తవర్ణ ఏకముఖి  -


           బ్రహ్మహత్యా పాతకం నుండి దూరం చేయును .


 3 -  పీతవర్ణ ఏకముఖి  -


         భోగము మరియు మోక్షమును ప్రసాదించును.


 4 -  శ్యామవర్ణ ఏకముఖి  -


         ఆరోగ్య లాభము , సాత్విక ప్రసన్నత కలిగించును. 


          పైన చెప్పినవిధముగా ఒక్కో రంగు ఏకముఖి రుద్రాక్ష ధరించటం వలన ఒక్కొ రకమైన ఫలితాన్ని పొందవచ్చు.


        ఇప్పుడు మీకు అసలు మరియు నకిలీ రుద్రాక్షల మధ్య బేధం ఎలా కనుగొనాలో మీకు వివరిస్తాను. 


 *  రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షని ఉంచినట్లయితే అది తనచుట్టూ తానే సవ్యదిశలో తిరుగును. అపసవ్య దిశలో తిరిగిన అశుభ ఫలితాలు కలుగును. కావున సవ్య దిశలో తిరగవలెను.


 *  ఒక చిన్నగిన్నెలో మంచినీరు పోసి దానిలో రుద్రాక్షని వేసినట్లు అయితే నకిలీది మునగకు తేలుతుంది. అంతేగాక రంగు వెలిసిపోయినట్లు ఉన్నచో అది నకిలీదిగా గుర్తించవలెను .


 *  ఆవుపాలలో అసలైన రుద్రాక్షని వేసి ఉంచిన ఆ పాలు 48 గంటల నుండి 72 గంటల వరకు చెడిపోకుండా విరగకుండా ఉంటాయి.


 *  ఒక చిన్న గ్లాసులో రుద్రాక్ష మునిగేంత ఎత్తుటి వరకు చల్లని నీరు నింపి రుద్రాక్షని ఉంచి ఒక అరగంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతని ధర్మామీటరుతో  కొలిచినట్లైతే కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ఉండును.


 *  రుద్రాక్షలలో అర్ధనారీశ్వర రుద్రాక్షలు ఉంటాయి. వాటిని నకిలీలుగా తయారుచేయుటకు రెండు రుద్రాక్షలను శిలపైన  అరగదీసి అతికిస్తారు. కావున జాగ్రత్తగా గీతను గమనించవలెను .


 *  రెండు పాత్రల మధ్య రుద్రాక్షని ఉంచినప్పుడు రుద్రాక్ష తిరుగును.


 *  పురుగులు తిన్నవి , పగిలినవి ధరించరాదు .


 *  రుద్రాక్షని బాగా వేడిగా ఉన్న నీటిలో వేస్తే  మునిగిపోతే అది నిజమైనదిగా భావించాలి . కొంతమంది ఇరుగుడు చెట్టు కొయ్యతో రుద్రాక్షలు తయారుచేస్తారు. కావున జాగ్రత్తగా ఉండవలెను .


 *  రుద్రాక్షని ఒక వారంపాటు నూనెలో ముంచి ఉంచాలి. అవి ఏరంగు రుద్రాక్ష అయిన దాని రంగు ప్రభావితం అగును. ఆ తరువాత కాగితం లేక దూదితో శుభ్రపరచి బావినీటితో కడిగించాలి. అతరువాత ధరించినచో రంగు ప్రభావితం కానిచో అవి అసలైన రుద్రాక్షలు .


 *  రుద్రాక్షలు ఎక్కువుగా కాశి , హరిద్వార్ లలో లభ్యం అగును. అసలైన రుద్రాక్ష నీటిలో మునుగును. ఒక నిజమైన రుద్రాక్షను ధరించినచో మంచి ఆరోగ్యం మరియు ఉన్నతస్థితిని ఇచ్చును. రుద్రాక్షలో ప్రకృతి సిద్ధముగానే రంధ్రం ఉండును. చిన్న రుద్రాక్షమాల గొప్ప ఫలితాన్ని ఇచ్చును.  


    

               తరవాతి పోస్టులో రుద్రాక్ష గురించి మరిన్ని విషయాలు మీకు తెలియచేస్తాను .


   

      మరింత విలువైన సమాచారం మరియు  సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     

కామెంట్‌లు లేవు: