30, జనవరి 2023, సోమవారం

మాఘ పురాణం*_ _*8 వ అధ్యాయము*

 🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*ఆదివారం*_

    _*జనవరి 29, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*8 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


🌹🌷🕉️🔔🕉️🌷🌹


దత్తాత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు  ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు  కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి  నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహాత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరం ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మము లాచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణెములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి  వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును  కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.


_*ఎనిమిదవ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*


🌴🌹🌷🕉️🛕🕉️🌷🌹🌴

          _*సోమవారం*_

    _*జనవరి 30, 2023*_


       _*మాఘ పురాణం*_

     _*9 వ అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*గంగా జలం మహిమ*


🕉️🌹🌷🕉️🔔🕉️🌷🌹🕉️

ఓ కార్తవీర్యార్జునా ! శివపూజ గురించి శివమహత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి , వారధిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి , మహా బలమును సంపాదించి సముద్రమునుదాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగములో ప్రవేశించెను. మరెందరో  మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి. కనుక , పూజలో శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా , గంగాజలము విష్ణుపాదములనుండి పుట్టినదియు , శివుని శిరస్సునుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది ఏమనగా యే నీళ్ళనుగాని , *"గంగ గంగ గంగ"* అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్ళు గంగాజలముతో సమానమయినవగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతి రూపము కనుక , మాఘమాసములో అంగస్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్మ్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను.


కొంత కాలము క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నలుగురికి నలుగురు కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను , బ్రాహ్మణ కన్యలాయువకుని అందము చూచి , మోహించి , అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచానివి కమ్మని శపించగా , ఆ విధ్యార్థియూ , మీరుకూడ పిశాచాలగుదురుగాక అని ప్రతి శాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే వుండి , అందరిని  భాదించి , ఆహారము దొరికితే వాటాలకై పెనుగులాడు కొనుచుండిరి.


కొంతకాలమునకు ఒక సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా పిశాచముల తల్లి దండ్రులు , తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్దుడు వారందరిచేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగావారట్లు చేయుటచే అయిదుగురికి యధా రూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే కారణము. మాఘమాస మందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు , గంధర్వులకు కూడ పవిత్రమైనది.


ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచి పెట్టి ఆ గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి , యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే యిద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా , మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా , విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా యిలా కామతృష్ణ కలవాడవైనందున , నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగియుండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి , *"విశ్వామిత్రా ! క్షణభంగురమైన తుచ్ఛకామ వాంఛకులోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి , నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము",* అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి , విష్ణువును ధ్యానించి , కమండలముతో నీరు తెచ్చి , పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ శ్త్రీ రూపమును పొంది , గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.


_*తొమ్మిదివ అధ్యాయము సమాప్తం*_

    🌹🌷🕉️🛕🔔🕉️🌷🌹


      🙏🙏 *సేకరణ*🙏🙏

        *న్యాయపతి వేంకట*  

       *లక్ష్మీ నరసింహా రావు*

కామెంట్‌లు లేవు: