1, జనవరి 2023, ఆదివారం

ఇంత త్వరగానా

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

కామెంట్‌లు లేవు: