27, ఫిబ్రవరి 2023, సోమవారం

స్వాతంత్ర్యం వచ్చేదే

 అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే పార్ట్ 1


అమెరికాలోని 'మేడిసన్' నగరంలోవున్న విస్కాన్సిస్ విశ్వవిద్యాలయ సామాజికశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జె.డబ్ల్యు. ఎల్టర్ కూ, స్వామివారికీ మధ్య 1963వ సంవత్సరం జులై 23వ రోజు నారాయణపురంలో జరిగిన సంభాషణ ఇది.

స్వామివారు చాలావరకు తెలుగులోనే మాట్లాడారు. మధ్య మధ్య కొన్ని పదాలు మాత్రమే ఇంగ్లీషు. డాక్టర్ ఎల్టర్ ఇంగ్లీషులోనే మాట్లాడారు. శ్రీ జి. వేంకటేశ్వరన్ ఉభయుల మధ్య "ద్విభాషి”గా పనిచేశారు. 


డాక్టర్ ఎల్టర్ : గత 15, 20 ఏళ్లలో భారతదేశంలో చాలా మార్పులు వచ్చాయి. దేశం స్వతంత్రమై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల చైనా దండయాత్ర చేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు హిందూ మతంలోని ఏయే అంశాలను నొక్కి చెప్పవలసిన అవసరం వుందనుకుంటున్నారు? 


స్వామివారు : స్వాతంత్ర్యం రావటానికి ముందు నిజాయతీ లేనివారు భారతదేశంలో నూటికి పదిమంది కూడా వుండేవారు కారు. గ్రామీణుల్లో - అంటే కష్టంచేసి జీవించేవారిలో - ఎక్కువమంది అసలు మాట తప్పేవారు కాదు. వారి కోరికలు చాలా సామాన్యంగా వుండేవి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో స్వాతంత్ర్యం రాకమునుపు నిజాయతీపరుల శాతం ఎక్కువ. స్వాతంత్ర్యం వచ్చాక ఒక వయస్సు వచ్చిన వారందరికీ ఓటు హక్కు వచ్చింది. ఓటు హక్కు వచ్చిన జనంలో చాలామంది చదువురానివారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు వారికి లంచాలిచ్చేవారు. లంచాలు పుచ్చుకుని ఓటర్లు మరెవరికో కూడా ఓటు వేసేవారు. 


"దేశంలో విద్యుదీకరణ జరిగాక ప్రతి రైతుకూ తన మెట్టభూమిని మాగాణి భూమిగా మార్చుకోవాలనే కోరిక పుట్టింది. వారు ఎలక్ట్రిక్ మోటార్లు కొనుకున్నారు. పంపుసెట్లు కొనుకున్నారు. క్రమంగా మెట్టభూములు మాగాణి భూములయాయి. మాగాణి భూములకు అవసరమైనంతగా మెట్టభూములకు నీరు అవసరంలేదు. అంతకు మునుపు ప్రజలు మెట్టభూముల్లో పండే జొన్నలు, రాగులూ తింటూవుండేవారు. కాయధాన్యాలు, పప్పు దినుసులూ పండించేవారు. ఐతే సేద్యం మొదలెట్టారు. కాయధాన్యాల ధరలు కొంత పెరిగిన మాట వాస్తవమేకాని వరిలో వచ్చినంత లాభం వాటిలో రాదు.


“మాగాణి సేద్యం వృద్ధి చెందిన కొద్దీ ఉన్న నీటివనరుల మీద ఒత్తిడి ఎక్కువైంది. దీనికితోడు ప్రతివాడూ వున్నవారిలాగా జీవించటానికి తాపత్రయ పడ్డాడు. అందువల్ల సామాన్యజనంలో చాలామంది అప్పులపాలయ్యారు. నిరుపేదలకు కూడా బ్రౌజరు కావలసి వచ్చింది. ఏది ఆడంబరమో, ఏది అవసరమో తెలుసుకునే విచక్షణ పోయింది.


“ఇవి ఆడంబరాలనీ, ఇవి అవసరాలనీ ధర్మశాస్త్రాలు స్పష్టంగా నిర్దేశించాయి. కాఫీగానీ, టీగానీ త్రాగకపోయినా మనిషి బ్రతకగలడు. అతడికి వుండటానికి ఇల్లూ, కట్టటానికి బట్టా, తినటానికి తిండీ వుంటే చాలు.


“స్వాతంత్ర్యం రాకముందు సామాన్యుని జీవనస్థాయి ఎలా వుందో స్వాతంత్ర్యం వచ్చాక అలాగే నిలిచివుంటే చాలు. ఏది ఆడంబరమో, ఏది అవసరమో సామాన్యులు గ్రహించేవరకూ జీవనస్థాయిలో మార్పు అవసరం లేదు. స్వయంసమృద్ధి సాధించాక ఆడంబరాలు వదులుకుని అవసరాలు మాత్రమే సమకూర్చుకునే విజ్ఞత సామాన్య జనానికి కలిగి ఉంటే, అమెరికా, రష్యాల్లాగా మిగులు సంపదను పేదదేశాలకు సరఫరా చేసివుండే వారమే.


“వర్తకులు విదేశాలకు సరకులు పంపించేటప్పుడు దగా చేస్తూవుంటారు. ముందు మేలిసరకు చూపి తరువాత నాసిసరకు పంపిస్తున్నారు. ఒక్కొక్కప్పుడు సరకులు కల్తీచేసి పంపించటం కూడా కద్దు. అందువల్ల సత్యసంధత, నిజాయతీ, అవసరాల నుండి ఆడంబరాలను వేరు చేయగల విచక్షణ, ఇతరులను దగాచేయరాదనే న్యాయబుద్దీ అనేవి ప్రస్తుతం ప్రజలకు పదే పదే నొక్కి చెప్పవలసిన ధర్మాలు.” 


డాక్టర్ ఎల్టర్ : ఇటీవల మధురై మీనాక్షీ దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది. దాని కెందరో, ఎన్నాళ్లో శ్రమపడ్డారు. ఇరవై లక్షలకు పైగా వ్యయమయింది. ఈ కుంభాభిషేకాలను గురించి, వాటికయ్యే ఖర్చుల గురించీ మీ అభిప్రాయం ఏమిటి? 


స్వామివారు : ప్రతి మతానికి దాని ప్రత్యేక నిర్మాణాలున్నాయి. మహమ్మదీయులకు మసీదులున్నాయి. క్రైస్తవులకు చర్చిలున్నాయి. హిందువులకు దేవాలయాలున్నాయి. దేవాలయాలకు ఎత్తైన గోపురాలున్నాయి. ఆ గోపుర శిఖరాలు చూచినప్పుడు తాత్కాలికంగానైనా భగవంతుడూ, భగవంతుని సమున్నతత్వమూ గుర్తొస్తుంది. శాస్త్రాలకన్నా లేదా తాళపత్ర గ్రంథాలకన్నా గాలిగోపురాలకే భగవంతుణ్ణి గుర్తుచేసే శక్తి యెక్కువ. ఈ గోపురాలను స్థూలలింగాలని శాస్త్రాలు పేర్కొన్నాయి. చివరి క్షణాల వరకూ మనిషికి వెంటవచ్చే పుణ్యమేదైనా వుంటే అది భగవంతుని స్మరించినక్షణంలో సంపాదించుకున్న పుణ్యమే. ఈ గోపురాలు శిథిలావస్థలో వున్నప్పుడు వాటిని బాగుచేసి పదిలపరుచుకోవాలి. పునర్నిర్మింపబడిన గోపురాలకు అభిషేకాలు జరగాలనీ, ఆ అభిషేకాలకు కొన్ని నియమాలున్నాయని శాస్త్రాలూ, మతధర్మాలూ నిర్దేశిస్తున్నాయి. ఇలా అభిషేకంచేసే ఉత్సవాన్ని 'కుంభాభిషేకం' అంటారు. బంధువులందరూ కలసి ఒక వివాహం జరిపినట్లు ప్రజలందరూ కలసి కుంభాభిషేకం జరుపుతారు. 


ఈ సంభాషణ జరుగుతూవుండగా వాన మొదలైంది. అందరూ వీథి చివర స్వామివారి విడిదిలోకి చరచరా నడిచివెళ్లారు. 


డాక్టర్ ఎల్టర్ : దక్షిణాదిని అనేక పట్టణాల్లో కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి, పునరుజ్జీవనానికి చిహ్నాలుగా మీరు భావిస్తున్నారా? 


స్వామివారు : కొన్ని దశాబ్దాల కొకసారి ప్రతిదేవాలయానికి కుంభాభిషేకం జరుగుతూనే వుంటుంది. ఆవిధంగా కొన్ని దశాబ్దాలుగా ఎన్నో దేవాలయాలకు ఎన్నో కుంభాభిషేకాలు జరిగాయి. దక్షిణాదిని ముఖ్యమైన దేవాలయాలకు కుంభాభిషేకాలు జరగటం మూలాన జీర్ణాలయ పునరుద్ధరణ కార్యక్రమం ఇటీవల ముమ్మరంగా జరుగుతున్న ట్లనిపిస్తుంది. కాని ఇది శతాబ్దాలుగా జరుగుతున్న ఆచారకాండే అయితే 1947కు పూర్వం దేశ ప్రజలందరూ బ్రిటిష్ పాలనను తుదముట్టించే యత్నంలో నిమగ్నులై వుండే వారు. ఆపని పూర్తి అయ్యాక వారి దృష్టి శిథిలదేవాలయాల మీదికి మళ్లింది. 


స్వాతంత్ర్యం  వచ్చాక నాస్తికవాదం ప్రబలింది. ద్రవిడ కజగం, ద్రవిడమున్నేట్రకజగం, కమ్యూనిజం మొదలైన భగవద్ వ్యతిరేక ధోరణులూ, ఉద్యమాలూ సామానం కటుకున్నాయి. బహుశా ఆ ఉద్యమాలు కొంతకాలంగా విఫలమైనందువల్ల ప్రజలు భగవంతుని వైపు ఆకర్షింపబడుతున్నారు.

దవ్యోల్బణం పెరిగి ఇదివరలో రూపాయికి అమ్మేవస్తువు పదిరూపాయలకు అమ్ముడుపోతోంది. అందువల్ల ఆలయ పునరుద్ధరణకు ఇదివరక్కన్నా పదింతలు ఖర్చౌతోంది. ఐనా ప్రజలు ధారాళంగా విరాళాలిస్తూనే వున్నారు.


డాక్టర్ ఎల్టర్ : హిందూమత సిద్దాంతాల్లో అహింస ఒకటి, ఇటీవల జరిగిన చైనా దండయాత్ర దృష్ట్యా ప్రస్తుతం దాన్ని ఎలా ఏమేరకు ఆచరించవలసి వుంది? 


స్వామి : మీరంటున్నది గాంధీగారి అహింసను గురించి అనుకుంటాను. గాంధీగారి అహింసకు మూలం బుద్ధుని అహింసా సిద్ధాంతం. 


నా దృష్టిలో బుద్ధుడూ గాంధీ యిద్దరూ అహింస విషయంలో విఫలులయ్యారు. నెహ్రూ 1947లో కాశ్మీరుకు భారత సైన్యాలను గాంధీతో సంప్రదించాకే, వారు ఆదేశించాకే, పంపారు. ఆ విషయం వారే చెప్పారు. అహింసాసూత్రాన్ని ఆచరణలో పెట్టటంలో గాంధీ కృతకృత్యులు కాలేకపోయారు. బుద్ధుడు సూకరమాంసం తిని దానిమూలంగా చనిపోయారని కొందరంటారు. మలయా, చైనా, సిలోన్, బర్మాల్లో వున్న బౌద్ధపరివ్రాజకుల్లో దాదాపు అందరూ మాంసాహారులే. అందువల్ల బుద్దుని అహింసా ధర్మం కూడా విఫలమైనట్లే! నా ఉద్దేశంలో అహింసావ్రతాన్ని పాటించగలవా డొక్కడే. సర్వసంగ పరిత్యాగి అయిన బ్రాహ్మణ సన్న్యాసి. సర్వసంగాలూ పరిత్యజించిన వాడు చెట్టునున్న ఆకును కూడా త్రుంచడు. తన్నెవరైనా కొడితే సంతోషంగా దెబ్బలు తింటాడే తప్ప సౌమ్యంగా నైనా ప్రతిఘటించడు. ఒకరు మరొకరిని కొట్టినప్పుడు కూడ కొట్టిన వాడిని చూచి జాలిపడతాడు. వాణ్ణి క్షమించమని దేవుణ్ణి వేడుకుంటాడు. అంతేకాని వాడి మీద చెయ్యిచేసుకోడు.


(సశేషం)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే పార్ట్ 2


అహింసాసిద్ధాంతాన్ని జాతులకుగానీ, జాతినేతలకుగానీ, అన్వయించటం తప్పు. భారతదేశానికి స్వాతంత్ర్యం అహింసవల్లనే వచ్చిందని కొందరనుకుంటారు. కాదు. భారతదేశాన్ని వదలిపోవాలని అంగ్లేయులు నిశ్చయించుకున్నారు, వదలిపోయారు. అలా వదలిపోవటానికి వారి కారణాలు వారికున్నాయి. వారు వదలి పోవటం మూలాన్నే మనకు స్వాతంత్ర్యం వచ్చింది. అహింసను పాటించినా, పాటించకపోయినా మనకు స్వాతంత్ర్యం వచ్చేదే. పరిపాలనకు గానీ, పరిపాలకులకుగానీ అహింసాసూత్రం అన్వయించదని శాస్త్రాలు చెబుతున్నాయి. తన రాజ్యాన్ని రక్షించని రాజు ధర్మభ్రష్టుడని శాస్త్రం.


తన్ను తాను రక్షించుకోవాలనే నియమం ఒక్క చైనాకు మాత్రమే అన్వయించదు. అన్ని జాతులకూ అన్వయిస్తుంది. ఒకదేశం మీద మరొకదేశం దండెత్తటం తప్పు. అలాగే ఒకరు దండెత్తివస్తే దేశాన్ని రక్షించుకోక పోవటం కూడా తప్పు.


ఒకడు మరొకడి మీద దాడి చేస్తే, దెబ్బతిన్న వాణ్ణి ఆదుకోవటం ప్రభుత్వధర్మమనీ, తన ధర్మాన్ని నిర్వర్తించటంలో దాడి చేసిన వాడికి ఉరిశిక్ష విధించవలసివచ్చిన ప్రభువు వెనుకాడరాదనీ శాస్త్రం నిర్దేశిస్తున్నది. అంతే కాదు. ఏ మేరకు అహింసా ధర్మాన్ని పాటించదగునో కూడా రాజనీతి శాస్త్రం స్పష్టంగా విధించింది. 


అగర్వాల్ : ఇందాక మీరు అహింసావ్రతాన్ని పాటించగలవాడు బ్రాహ్మణ సన్న్యాసి ఒక్కడే అన్నారు. అంటే సన్న్యాసి అయ్యే యోగ్యత పుట్టుకవల్లనే సంక్రమిస్తుందని మీ భావమా, లేక ఏకులంలో పుట్టినా యోగ్యతవల్ల బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని మీ అభిప్రాయమా? 


స్వామివారు : శాస్త్రాలు హిందువులను అనేక కులాలుగా విభజించి ప్రతి కులానికీ కొన్ని కొన్ని విధులు నిర్దేశించాయి. బ్రాహ్మణునకు నిర్దేశించిన విధి అవిరళంగా జ్ఞానాన్ని సముపార్జించటం. అన్ని కులాలవారికి ఉపయోగపడే జ్ఞానాన్ని సముపార్జిస్తూ వుంటాడు బ్రాహ్మణుడు. అతణ్ణి పోషిస్తూ కని పెట్టి వుండటమే యితర కులాల వారి విధి. అందువల్లే గోదాన భూదానాది దానాలన్నీ బ్రాహ్మణుడే స్వీకరిస్తాడు. నిరంతరం జ్ఞాన సముపార్జన చేసే బ్రాహ్మణుణ్ణి కాపాడుకోవటం ఇతరకులాల కర్తవ్యం. తాను ఆర్జించిన జ్ఞానం పరిపూర్ణ మయాక బ్రాహ్మణుడు సన్న్యాసాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడతడికి ఏ సంబంధాలూ ఉండవు. ఎవరినీ సంరక్షించనక్కర లేదు. ఆధ్యాత్మికంగా సమున్నతుడౌతాడు. కేవలం ఉదరపోషణ కోసమే భిక్షాటనం చేస్తాడు. 


ఒకవేళ బ్రాహ్మణుడు తన ధర్మాన్ని నెరవేర్చడనుకోండి. అతనికి 'వెలి' తప్పదు. ఏ కులం వారూ అతణ్ణి తమలో చేర్చుకోరు. ఏ కులంవాడైనా జీవితాన్ని తన ధర్మానికే అంకితం చేస్తే, అతడూ పరమగమ్యం చేరుకుని జ్ఞాని అవుతాడు. బ్రాహ్మణులు సహా అన్ని కులాలవారూ అతడి జ్ఞానం వల్ల లాభపడతారు. బ్రాహ్మణులతణ్ణి ఆరాధిస్తారు. ఈ విధంగా బ్రాహ్మణసన్న్యాసి లాగానే ఇతరకులాల్లోని జ్ఞాని కూడా ఉత్తమజ్ఞానాన్ని సంపాదించుకుంటాడు.


రాముడూ, కృష్ణుడూ క్షత్రియులుగా పుట్టారు. వారిని బ్రాహ్మణులతో సహా అందరూ ఆరాధిస్తారు. తమ కులధర్మాన్ని ఆచరించి వారు మహాపురుషులయ్యారు. సన్న్యాసి లాగానే జ్ఞాని అయిన ప్రతివాడూ ప్రతి ప్రాణిలోనూ అభివ్యక్తమయ్యే ఆత్మను దర్శించి అత్యున్నతాలైన అహింసాధర్మాలు పాటిస్తాడు. 


డాక్టర్ ఎల్టర్ : నాయకులైనవారు శాస్త్రనియమాలు పాటించాలని తమరు సెలవిచ్చారు. రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవాలని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతున్నది. ఇప్పటి నాయకులు కూడా నియమం పాటించవచ్చునా? లేక ఏ శాస్త్రంలో ఏ విధిని ఏ మేరకు పాటించవచ్చునో తెలిపే మార్గదర్శక సూత్రాలేవైనా వున్నాయా? 


స్వామివారు : మెకెవిల్లి ఒకటి చెబితే క్రీస్తు మరొకటి చెప్పినట్లు శాస్త్ర నియమాల్లో కూడా పరస్పర వైరుధ్యాలున్నాయి. అర్థశాస్త్రం విధించిన ధర్మంతో నేనేకీభవించాను. ఆధర్మం ధర్మశాస్త్రాల్లోని ధర్మాలకు విరుద్ధంగా వుంది. 


కాని ఏదేశంలోనైనా ప్రజలు నిరంకుశత్వానికీ, దుర్భర దారిద్ర్యానికీ దారుణ నైచ్యానికి గురై బాధామయమైన జీవితాలు గడుపుతున్నప్పుడు, ఆ రాజును దించి, ప్రజలకు శాంతినీ, సుఖాన్నీ, అభ్యుదయాన్ని ప్రసాదించటం పొరుగు దేశాన్నేలే రాజు నిర్వహించవలసిన బాధ్యత, ఆచరించాల్సిన కర్తవ్యం!


అలాటి పరిస్థితులలో మాత్రమే రాజ్యం విశాలం కావచ్చు. అలాంటి పరిస్థితులలో మాత్రమే రాజు తన రాజ్యాన్ని విస్తరించుకోవచ్చు అలా విస్తరించుకోవటం పొరుగు దేశంలోని ప్రజలను ఆదుకోవటం కోసమే.


ప్రజల అవసరాలను ప్రభువు గుర్తించాలి. శాస్త్రవిహితంగా వారిని పరిపాలించాలి. 


డాక్టర్ ఎల్టర్ : అంటే, భారతదేశంలోని ప్రస్తుత నాయకులందరూ ధర్మశాస్త్రాల ననుసరించి పరిపాలన సాగించాలనా మీరనేది? 


స్వామివారు: భారతదేశం మతాతీతమైన రాజ్యం. ధర్మశాస్త్రాల నుసరించిని పరిపాలన సాగించటం ఈనాడు సాధ్యం కాదు. అందుకు సంస్థలు పూనుకుని ధర్మశాస్త్రాల్లోని విషయాలు ప్రజల దృష్టికి తెచ్చి, ప్రజలకు మనోవికాసం కలిగిస్తే, వారు ఎన్నుకునే నా నడిపే ప్రభుత్వాలు కూడా ధర్మం తప్పక శాస్త్రానుగుణంగానే నడుస్తాయి. నాయకులు ధార్మిక విషయాలు పట్టించుకోరు కాబట్టి నైతికంగా సమాజాన్ని సముద్ధరించే బాధ్యత మత సంస్థల మీద మతాభిమానుల మీద వుంది. 


డాక్టర్ ఎల్టర్ : అయితే, భారతదేశంలోని నాయకులందరూ శాస్త్రాల ననుసరించాలి. శాస్త్రాల్లో వైరుధ్యాలు కనబడితే ధర్మశాస్త్రాల ననుసరించాలి. ధర్మశాస్త్రాలకూ, రాజ్యాంగానికీ వైరుధ్యం కలిగినప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. అప్పుడు రాజ్యాంగమే నాయకులకు తుది శాస్త్రమవుతుందన్న మాట! 


స్వామివారు : (నవ్వుతూ) నిజమే, నాయకులననుసరించవలసిన వర్తమానశాస్త్రం భారతరాజ్యాంగమే అనిపిస్తున్నది. 


డాక్టర్ ఎల్టర్ : నా కోసం చాలా కాలం వెచ్చించారు. మిమ్ములనిలా కలుసుకునే అవకాశం కలిగించినందు కెంతో కృతజ్ఞుణ్ణి. నే నడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పి అనుగ్రహించారు. మీకు ధన్యవాదాలు. 


స్వామివారు : అమెరికన్లు, ఇంగ్లండునుండి అమెరికాకు వలసపోయిన మాట వాస్తవం. అమెరికాలో స్థిరపడ్డాక వారెన్నో కష్టాలు పడ్డారు. బాధలనుభవించారు. బ్రిటిషువారితో యుద్ధం చేశారు. చివరికి శాంతి, అభ్యుదయం సాధించారు. సహజంగా కష్టజీవనం అంటే యేమిటో తెలిసిన ఒక అమెరికన్ ఈ దేశానికి వచ్చి యీ దేశప్రజల కష్టాలూ బాధలూ అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నందుకు ఎంత సంతోషంగా వుంది.


మీ అందరికి భగవానుని అనుగ్రహం కలగాలని నా ఆశంస.


--- డాక్టర్ జె.డబ్ల్యు. ఎల్టర్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం


కామెంట్‌లు లేవు: