20, మార్చి 2023, సోమవారం

శ్రీ మహాభారతం

 .


               శ్రీ మహాభారతం 

                ➖➖➖✍️

                 300 వ భాగం

    శ్రీ మహాభారతంలో చిన్ని కథలు:



 #మహానుభావులు:


#విష్ణువుని_దర్శించిన_నారదుడు


భీష్ముడు ధర్మరాజుతో “ధర్మనందనా! నేను నీకు శ్వేతద్వీపంలో ఉండే మహా పురుషులగురించి చెబుతుండగా ప్రసంగవశాత్తు ఉపరిచరమనువు గురించి చెప్పాను. ఇక ఆ మహానుభావుల గురించి చెప్తాను…. 


‘నారదుడు శ్వేతద్వీపముకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించాడు. వారుకూడా నారదుడిని ఆదరించారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. 


నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. 


అప్పుడు విష్ణుమూర్తి ‘నారదా ! నన్ను చూడడం అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైనా అహంకారము లేనంత మాత్రాన అనన్య భక్తివలన నీవు నన్ను చూడగలిగావు. నీకు కావలసిన వరము కోరుకో’ అన్నాడు. 


నారదుడు ‘పరాత్పరా ! నీ దివ్యదర్శనం కంటే నా కేమీ వద్దు’ అన్నాడు. 


విష్ణువు ‘ఎవరు ఇంద్రియనిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి, అజుడు, నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు, జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షుణుడు అతడే. మనస్సు, అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నా మాయ. నేను 24 తత్వములకు అధినాధుడనైన 25వ తత్వమును. పరమపురుషుడను నాకంటే వేరు పరము లేదు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తుంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకలభూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తంగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకలో చైతన్యము లేదు. జీవుడు వేరు శరీరము వేరు జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయవిలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. అదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతా గణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యము అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్త మాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను.’



#లోకరక్షణ:


‘ఒక్కోసారి జగద్రక్షణార్ధమై అవతారం ఎత్తుతుంటాను. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నరసింహరూపంలో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియకులాన్ని, దశరధపుత్రుడిగా రావణుడిని సంహరించాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సాయంతో భూభారాన్ని తగ్గించాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసాను. తరువాతి కాలంలో మానవరూపంలో అవతరించి లోక కంటకులైన కాలయవనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించాను. బాణాసుర వధసమయంలో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణిచాను. అంతకు ముందు మత్సత్వము, కూర్మత్వము పొంది దేవతలను వేదములను రక్షించాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసినది చేసాను. నేను చేయవలసిన కార్యము పూర్తికాగానే నేను తిరిగి నా మూల ప్రకృతిలో చేరిపోతాను. నారదా ! నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పాను’ అని విష్ణువు భోదించాడు. 


తరువాత నారదుడుకి శ్వేతద్వీపంలోని మహాపురుషులను చూపి ‘నారదా కాంతి దేహధారులై నిరంతరం నన్నే ధ్యానించే ఈ మహాపురుషులకు నీ ఉనికి భంగము కలిగిస్తుంది కనుక నీవు ఇక ఇక్కడ నుండి వెళ్ళు’ అని చెప్పాడు.


#బదరికావనము:

విష్ణుమూర్తి ఆదేశంతో నారదుడు శ్వేతద్వీపము నుండి బదరికావనము వెళ్ళి అక్కడ ఉన్న నరనారాయణులను దర్శించుకున్నాడు. అక్కడ తాను సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖతః విన్న వేదార్ధసారమును, యోగము, సాంఖ్యముల సారమును మునులందరికీ ఉపదేశించాడు. అక్కడి నుండి బ్రహ్మసభకు వెళ్ళి అక్కడి వారికి విష్ణుమూర్తి సందేశం వినిపించాడు. అలా ఆ ఉపదేశం క్రమంగా ముల్లోకాలలో వ్యాపించింది. దానిని నేను నా తండ్రి శంతనుడి ద్వారా విని ఇప్పుడది నేను నీకు చెప్పాను. ఈ ఉపదేశమును దేవతలు మునులు ఎంతో శ్లాఘిస్తారు. వారు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు, శ్రద్ధతో జపిస్తారు, ఏకాగ్రతతో ధ్యానిస్తారు. ధర్మనందనా ! నీవు కూడా విష్ణుమూర్తిని అనన్య భక్తితో పూజించి తరించు. నీవు దీనిని విష్ణుభక్తులకు, నీతిపరులకు, ఇంద్రియ నిగ్రహము కల వారికి మాత్రమే ఉపదేశించు. నీవిప్పటి వరకు విన్న కథలేవి ఈ ఉపదేశముకు సాటి రావు. ఇది విన్న వారికి, తెలుసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు తప్పక సిద్ధిస్తాయి.” అని భీష్ముడు నారదుడికి స్వయంగా విష్ణుమూర్తి ఉపదేశించిన ఉపదేశమును ధర్మరాజుకు ఉపదేశించాడు. 


ఈ పవిత్రమైన ఉపాఖ్యానమును పఠించుతూ పాండవులు విష్ణుమూర్తిని భజిస్తూ కాలంగడిపారు” అని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు.


వ్యాసమహర్షి ఆకాశగమనం:

జనమేజయమహారాజా వ్యాసుడు కూడా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు అని వైశంపాయనుడు చెప్పగా … జనమేజయుడు “మహర్షీ ! నీవు మోక్షము అత్యంత సుఖప్రథము అని చెప్పావు. కాని సదా ప్రాపంచిక సుఖములలో మునిగితేలే ప్రజలు వారే కాక దేవతలు కూడా హవిర్భాగాలు పొందడానికి చూపించే ఉత్సుకత మోక్షసాధన అందు చూపరు కదా ! ఇలా ఎందుకు జరుగుతుంది అని నా మనసు సదా మధనపడుతుంది. మానవులే కాక దేవతలు సహితము ఇలా మోక్షమార్గమును వదిలి కర్మబంధాలలో చిక్కుకు పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించండి”అని అడిగాడు. 


వైశంపాయనుడు …”జనమేజయమహారాజా ! వ్యాసభగవానుడు తన శిష్యులకు నాలుగు వేదములను భారతమును బోధించాడు. ఆ సమయంలో సుమంతుడు, పైలుడు, జైమిని నీవు అడిగిన విధంగా మేము మా గురువు గారిని అడిగాము. అప్పుడు మా గురువైన వ్యాసుడు నేను ఒకప్పుడు భూతభవిష్యత్తు వర్తమానం తెలుసుకోవడానికి క్షీరసాగరంలో తపస్సు చేసాను. ఆ నారాయణుడి దయ వలన నాకు భూత, భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే దివ్యజ్ఞానం లభించింది. దాని ప్రభావంతో నేను ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మొదలైన వారు చేసిన పనులు చూడగలిగాను. వాటిని మీకు చెప్తాను. మరుత్తులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలగు దేవతా గణములు, మునులు, బ్రహ్మదేవుడిని చూసి ‘మాకర్తవ్యము బోధించండి’ అని అడిగారు. 


బ్రహ్మదేవుడు ‘నా మనసులో మెదిలే విషయమే మీరు నాకు గుర్తుచేసారు. మనమందరం విష్ణుమూర్తిని అడిగి మన కర్తవ్యం తెలుకుందాము రండి’ అని వారిని విష్ణులోకము తీసుకు వెళ్ళి అక్కడ వారంతా కలిసి విష్ణువును గురించి తపస్సు చేయగా వారికి అప్పుడు ఒక దివ్యమైన వాక్కు వినిపించింది…



#పరమాత్మ వాణి:


దివ్యవాణి… “దేవతలారా ! మునులారా ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. బ్రహ్మదేవుడు ఈ లోకములకు గురువు. ఆయన చెప్పినదే వేదవాక్కు. నాకు కూడా ఆయన చెప్పినదే వేదవాక్కు. మీరందరూ కలిసి వేదోక్తంగా యజ్ఞము చేసి అందు నాకు హవిర్భాగం కల్పించండి” అని పలికింది. 


ఆ మాటలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒక యాగమును ఏర్పాటు చేయమని దేవతలకు ఆదేశం ఇచ్చాడు. 


దేవతలందరూ వేదోక్తంగా యాగం చెయ్యడానికి పూనుకున్నారు. ఆ యాగమునందు విష్ణుమూర్తికి హవిర్భాగము కల్పించారు. 


విష్ణుమూర్తి అదృశ్యరూపంలో ఆకాశంలో నిలబడి “దేవతలారా ! మునులారా ! మీరు నేను చెప్పినట్లు యజ్ఞము చేసారు. మీరు చేసిన పుణ్యముకు తగిన ప్రతిఫలం ఇస్తాను. మరీచి, పులహుడు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అను బ్రహ్మమానసపుత్రులు వేదములకు ఆచార్యులు. వీరు ఏర్పరిచిన నియమాలు, ఆచారములు, పద్ధతుల ప్రకారం మానవులు యజ్ఞములు చేస్తారు. అందులో మీకందరికి హవిర్భాగములు సమర్పిస్తారు. దానితో వారు తృప్తి పొందుతారు. బ్రహ్మమానస పుత్రులైన సన, సనక, సనంద, కపిల, సనత్కుమారులు సహజమైన జ్ఞానసంపద కలిగి ముక్తి గురించే సదా చింతిస్తుంటారు. వీరు మోక్షధర్మములను జగములకు వివరిస్తారు. మీ అందరికి తల్లి, తండ్రి, గురువు బ్రహ్మదేవుడే. అతడు నా అభీష్టము మేరకు లోకాలను శాసిస్తాడు. నా నుండి పుట్టిన రుద్రుడు లోకాలకు ఆరాధనీయుడు, పూజ్యుడు, సకల వరములను ప్రసాదించు కరుణామయుడు. ఇక మీరు వెళ్ళి మీకు విధించిన వేదోక్త కర్మలను బ్రహ్మ, మరీచి, ప్రజాపతులు చెప్పినట్లు విని ఆచరించండి. ఇది కృతయుగము అను పేరుతో ఉత్తమమైన కాలంగా వర్ధిల్లుతుంది. యజ్ఞయాగములలో పశువధ చేయరాదు. ఇందు ఏమాత్రము సందేహము లేదు” అన్నాడు. దేవతలు, మునులు విష్ణుమూర్తికి నమస్కరించి వెళ్ళారు.



#హయగ్రీవుడు:


దేవతలు, మునులు వెళ్ళినా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి ముందు హయగ్రీవరూపంలో వేదాధ్యయనం చేస్తూ దండ కమండలములతో ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడిని కౌగలించుకుని “బ్రహ్మదేవా ! నీవు సర్వ లోకములకు విధాతవు, గురుడవు, అధిపతివి అందుకే నేను ఈ జగముల భారం నీ అందు ఉంచి నేను సుఖంగా ఉన్నాను. ఈ లోకమును సక్రమంగా నడపడం నీ బాధ్యత. ఈ లోకమును నడపడంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను కల్పించుకుని తీర్చుతుంటాను”అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. 


ఇలా యజ్ఞయాగములలో అగ్రభాగమునకు అర్హుడు, యజ్ఞధారి అయిన మహావిష్ణువు ప్రవృత్తి ధర్మమును నిర్వహించడానికి బ్రహ్మదేవుని, దేవతలను నియమించి తాను మాత్రం నివృత్తి ధర్మమును నిర్వర్తిస్తూ జ్ఞానమూర్తి అయి సర్వత్రా సంచరిస్తున్నాడు.” అని వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు.



#విష్ణుతత్వము:


వ్యాసుడు ఇంకా ఇలా ….                     “వైశంపాయనా ! ఈ సమస్త లోకములను వాటిని పదిలంగా రక్షిస్తూ తిరిగి వాటిని తనలో లీనం చేసుకునే విష్ణుమూర్తిని నేను కొలుస్తాను. అజుని, విశ్వమే తన రూపముగా కలవాడిని, మృత్యంజయుడిని, దేవతలకు అధినాధుడిని, ఆది అయిన వాడిని, నాలుగు వేదములను అధ్యయనం చేసిన వాడిని, ఆత్మతో కాని ఎరుగ లేని వాడిని, ఈశానుడిని, నాశనం లేని వాడిని, అన్ని తపములకు కర్మఫలదాతను నేను ఆశ్రయిస్తాను. ఈ విధంగా వ్యాసుడు నారాయణుడిని స్తుతించాడు. వ్యాసుడు మమ్ము చూసి నా పూర్వ వృత్తాంతము మీకు చెప్పాను. మీరు కూడా నాకు విష్ణుమూర్తి చెప్పిన ఉపదేశములను ఆచరించండి. ఆ పరమేశ్వరుడిని కొలవండి. వేదముల చెప్పిన ప్రకారము నడవండి అని మాకు చెప్పాడు. మేము వ్యాసుడు చెప్పిన విధముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ప్రకారము ఈ త్రిలోకాధిపతిని స్తుతించాము. మనసులో ఆరాధించాము” అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. జనమేజయ మహారాజా ! వ్యాసుడు మాకు బోధించిన పుణ్యప్రథమైన విష్ణుతత్వము చదినను విన్న విప్రుడు వేదవేదాంగములను చదివిన ఫలమును పొందుతాడు, క్షత్రియుడు సర్వత్రా విజయము పొందుతాడు, వైశ్యుడు ధనలాభము పొందుతాడు, శూద్రుడు అత్యంత సుఖములను పొందుతాడు. పెళ్ళికాని వారికి పెళ్ళి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరిగి మంచి పుత్రుడిని పొందుతుంది. గొడ్రాలు సంతానవతి ఔతుంది” అని వైశంపాయనుడు ఫలశృతి చెప్పాడు.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                    .🙏

కామెంట్‌లు లేవు: