3, ఏప్రిల్ 2023, సోమవారం

*గుడి - దైవ దర్శనం

 *గుడి - దైవ దర్శనం* 


ఒక అమ్మాయి గుడికి వెళ్ళి తిరిగి వచ్చింది... దర్శనం బాగా జరిగిందా తల్లీ, అని ఆమె తండ్రి ప్రశ్నించారు.....


కూతురు:  ఇక మీదట నన్ను ఎపుడూ గుడికి వెళ్ళమనకండి నాన్నాగారు... కోపంగా చెప్పింది..

తండ్రి: ఏం జరిగింది తల్లీ?

కూతురు: గుడిలో ఒక్కరంటే ఒక్కరు దేవుని మీద ధ్యాసతో లేరక్కడ. అందరూ వారి మొబైల్ ఫోన్లలో మాట్లాడడం, ఫోటోలు తీయడం, భక్తికి సంబంధించినది కాక వేరే విషయాలు చర్చించడం చేస్తున్నారు. కనీసం భజనలు కూడా సరైన పద్దతులలో ఉండడం లేదు . ఎవరిలోను నాకు భక్తి కనిపించలేదు. 

తండ్రి: ( కాసేపు మౌనం పాటించి) సరే.. నువ్వు తుది నిర్ణయం తీసుకొనే ముందు నాదొక  చిన్న కోరిక.. చేస్తావా...?

కూతురు: తప్పకుండా నాన్నగారు.. మీమాట ఎపుడూ కాదనలేదు. చెప్పండి ఏమి చేయాలో....

తండ్రి:  ఈపూట గుడికి ఒక గాజు గ్లాసుతో నిండా నీళ్ళు తీసుకొని వెళ్ళు .. మూడంటే మూడే ప్రదక్షిణలు చేసి రావాలి.. అయితే చిన్న గమనిక.. నీ గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా నీరు తొలకరాదు సుమీ... ఈ పని చేయగలవా.....?

కూతురు:  అలాగే నాన్నగారు. తప్పకుండా చేస్తాను మీకోసం...  అని ఒక గ్లాసుతో నీరు తీసుకొని బయలు దేరింది.. ఒక మూడు గంటల తరువాత ఇంటికి గ్లాసు నీటితో తిరిగి వచ్చింది.. 

కూతురు: ఇదిగో నాన్నగారు.. నేను గుడికి గ్లాసు నీళ్ళతో వెళ్ళి మీరు చెప్పిన విధంగా మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చాను. ఒక్క నీటి చుక్క కూడా తొణకలేదు.. 

తండ్రి మూడు ప్రశ్నలు వేసారు. 

1. నువ్వు ప్రదక్షిణ చేస్తున్నపుడు ఎంతమంది తమ మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నారు.? 


2. ఎంత మంది అనవసర విషయాలు గుడిలో చర్చిస్తున్నారు ?


3. ఎంత మంది అసలు భక్తి అనేది లేకుండా ప్రవర్తించారు?


కూతురు: నేనేలా చెప్పగలను నాన్నగారు.. నాదృష్టి గ్లాసు నుంచి ఒక్క చుక్క కూడా నీరు   క్రింద పడకుండా చూసుకుంటున్నాను కదా.. 

తండ్రి: ఇదేనమ్మా నేను చెప్పదలచుకున్నది. నువ్వు గుడికి వెళ్ళినపుడు నీ దృష్టి భగవంతుని విగ్రహం మీద, నీ ధ్యాస ఆయన కరుణ మీద ఉండాలి. అపుడు నువ్వు అంతఃముఖివై భగవంతుని పొందగలవు. జీవితం వృద్ది చెందడానికి ఈ విధమైన ఏకాగ్రత సాధించాలి. 

కూతురు:  ధన్యురాలిని నాన్నగారు... ఈ రోజు నాకు భగవంతుని గుడి అన్నది ఎందుకు ఏర్పచుకొన్నామో, అంతఃర్ముఖులు అవడం అంటే ఏమిటి  అనే విషయాలపై అవగాహన కలిగించారు....


 శ్రీధర్ శర్మ తోటపల్లి

 శ్రీ సద్గురు పీఠం

కామెంట్‌లు లేవు: