15, ఏప్రిల్ 2023, శనివారం

పంచభూతాల ప్రాణశక్తి...

 #పంచభూతాల ప్రాణశక్తి.....


ఆయురారోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరిసంపదలు, పదవీ వైభవాలు, ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడయ్యీ ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా పదికాలాలపాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు, ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది.


మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్తప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.


.....


.....


ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది.. హృదయగుహలో పురీతత్‌ అనే నాడీమండలంలో ఆత్మనీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై, జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి, జీవసృష్టి చేయడం వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం. ఈ రెండు పనుల్లో భాగంగానే ప్రాణం శరీరధారణ, శ్వాసధారణ చేస్తుంది.


శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండిఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాసరూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ  సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులుగా మారుతుంది. వీటినే వాయుపంచకమని, పంచప్రాణాలని అంటారు.


వాయుపంచకంలో మొదటిదైన మూలప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపానవాయువు శరీరంలోని అధోభాగంలో సంచరిస్తూ, మలమూత్రవీర్య విసర్జనక్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యానవాయువు వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణశక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదానవాయువు కంఠస్థానంలో ఉండి, మనసును గాఢనిద్రలోకి దించి, సేదదీర్చి శాంతిని అందిస్తుంది. సమానవాయువు నాభిస్థానంలో ఉండి, జీర్ణక్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది.


శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే  మరణం తప్పదు. దీర్ఘకాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం. దీర్ఘశ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామమంటారు. పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోను, ధ్యానయోగ ప్రక్రియల్లోను దీన్ని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువును ఆరోగ్యాన్ని ప్రసాదించడంతోపాటు, చిత్తచాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది...

కామెంట్‌లు లేవు: