శ్రీరామ (17 )
( వాల్మీకి రామాయణం - 10)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
ఆ తరువాత విశ్వామిత్రుని ఆశ్రమానికి ప్రయాణం చేస్తున్న ఆ ముగ్గురిని త్రోవలో "తాటకి" అనే వేయి ఏనుగుల బలంగల రాక్షసి ఎదుర్కొంది.
తాటకిని సంహరించమని రామునికి చెప్పాడు విశ్వామిత్రుడు.
"తాటకి" స్త్రీగదా! సంహరించవచ్చునా! అని సందేహిస్తున్నాడు రాముడు.
"ఈ తాటకి యజ్ఞములను నశింపజేసే దుష్టాత్మురాలు. దేవ బ్రాహ్మణ హితం కోసం, సందేహించకుండా ఈ రాక్షసిని వధించు"
అన్నాడు విశ్వామిత్రుడు.
పితృవాక్యపాలకుడైన రాముడు తన స్వంత ఆలోచనలకు తావివ్వకుండా విశ్వామిత్రునితో ఇలా అన్నాడు.
శ్లో// పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్/
వచనం కౌశికస్యేతి కర్తవ్య మవిశంకయా//
(మా నాన్నగారు మీరు ఏమి చెబితే అది చేయమని మాకు ఆజ్ఞ ఇచ్చారు.
ఆయన ఆజ్ఞ పాటించడమే మా ధర్మం.
అందువలన మీరు చెప్పినట్లు నిస్సందేహంగా తాటకిని సంహరిస్తాను)
విశ్వామిత్రుని ఆదేశానుసారం రాముడు ఆ రాక్షసిని సంహరించాడు.
తాటకి సంహారానికి దేవతలు, దేవేంద్రుడు,విశ్వామిత్రుడు,సంతోషించారు.
దేవేంద్రుని సూచనను అనుసరించి,
విశ్వామిత్రుడు, తన వద్ద ఉన్న దివ్యాస్త్రాల నన్నింటినీ రామునకు ఉపదేశించాడు.
" ఓ రామా ! స్నానం చేసి తూర్పు ముఖంగా కూర్చో. నా అస్త్రసంపదనంతా నీకు ఇస్తున్నాను, స్వీకరించు "
అని,
ధర్మచక్ర, కాలచక్ర, విష్ణుచక్రాలను,
ఇంద్రుని వజ్రాయుధాన్ని, శివుని త్రిశూలాన్ని,
బ్రహ్మాస్త్రాన్ని, ఐషీకాస్త్రాన్ని,
మోదకి,శిఖిరి, అనే గదలను,
గాంధర్వాస్త్ర, మానవాస్త్రాలను,
ఇంకా వేలకొలది తన అధీనంలో ఉన్న అస్త్రాలనన్నింటినీ సాంగోపాంగంగా, ప్రయోగ, ఉపసంహారాలతో సహా రామునికి ధారపోసాడు.
ఆ అస్త్రదేవతలంతా రాముడికి నమస్కరించి,
" ఓ రామా ! మేమందరము నీ కింకరులము " అన్నారు.
రాముడు వారినందరిని ఆదరంగా స్ప్రశించి, "మీరందరూ ఎల్లప్పుడూ నా మనస్సులో సంచరించుచుందురు గాక" అని ఆజ్ఞాపించాడు.
ఆ తరువాత అనేక గాధలు,ఆ యా ప్రాంత విశేషాలు చెబుతూ విశ్వామిత్ర మహర్షి చాలా దూరం ప్రయాణం చేసి,రామ లక్ష్మణులతో కలిసి,
' సిద్ధాశ్రమము ' అని పిలువబడే తన ఆశ్రమంలో ప్రవేశించాడు.
ఈ ఆశ్రమము ఎవరిదని శ్రీరాముడు ప్రశ్నించగా ,
విశ్వామిత్ర మునీంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు.
" పూర్వము కశ్యప మహర్షి ఈ ఆశ్రమంలో తపస్సు చేసి శ్రీమహావిష్ణువు తనకు పుత్రుడుగా జన్మించే వరం పొందాడు.
ఆ మహర్షి అభీష్టానుసారం విష్ణువు " వామనుడు " గా అదితి గర్భంలో జన్మించి, బలిచక్రవర్తిని నిర్జించి త్రిలోక సామ్రాజ్యాన్ని ఇంద్రుని వశం చేశాడు.
అప్పటినుండి ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అనే పేరుతో పిలువబడుతోంది.
ఈ ఆశ్రమంలోనే నేను తపస్సు చేసుకుంటూ, ప్రస్తుతం ఈ యాగాన్ని. తలపెట్టాను"
అని చెప్పి, తన యాగరక్షణకేతించిన రామలక్ష్మణులను అక్కడ ఉన్న మునులకు పరిచయం చేసాడు.
అప్పుడు ఆ ఆశ్రమవాసులైన మునులందరూ, విశ్వామిత్రుని,రామలక్ష్మణులను పూజించారు.
మౌనవ్రతధారియై విశ్వామిత్రమహర్షి నియమ,నిష్ఠలతో కూడిన యజ్ఞదీక్షలో వెంటనే ప్రవేశించాడు.
తాము చేయవలసిన పని సవివరంగా చెప్పమని రామ లక్ష్మణులు అడుగగా, ఆ మునీశ్వరులు అందరూ ఇలా అన్నారు:
"రామ లక్ష్మణులారా! నేడు మొదలు, ఆరు ఆహోరాత్రములు మీరు యాగ రక్షణ చేయవలెను.
విశ్వామిత్రమహర్షి దీక్షలో వున్నారు కాబట్టి మౌనం పాటిస్తారు".
శ్లో//తౌ తు తద్వచనం శ్రుత్వా రాజ పుత్రౌ యశస్వినౌ/
అనిద్రౌ షడహోరాత్రం తపోవన మరక్షతాం//
(కీర్తిమంతులైన ఆ రామ లక్ష్మణులు,వారు చెప్పిన విధంగా, ఆరు, రేయింబవళ్లు, నిద్రపోకుండా ఆ తపోవనాన్ని రక్షించారు).
ఆరవ దినమున మారీచుడు, సుబాహువు, అనే ఇద్దరు రాక్షసులు, వేలకొలది రాక్షసానుచరులతో కూడి ఆకాశమార్గాన వచ్చి, యజ్ఞాశాలలో రక్తవర్షాన్ని కురిపించారు.
వెంటనే రాముడు మానవాస్త్రాన్ని ప్రయోగించాడు.
శ్లో// స తేన పరమాస్త్రేణ మానవేన సమాహత:/
సంపూర్ణం యోజన శతం క్షిప్త: సాగర సంప్లవే//
( గొప్పదైన ఆ మానవాస్త్రం చేత కొట్టబడిన, మారీచుడు, నూరు యోజనముల దూరంలో సముద్రజలములలో పడ్డాడు).
పిమ్మట రాముడు ఆగ్నేయాస్త్రం ప్రయోగించి, సుబాహువును సంహరించాడు.
తరువాత వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి,మిగిలిన రాక్షసులనందరిని సంహరించాడు.
శ్లో//స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన:/
ఋషిభి: పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా//
(యజ్ఞములను నశింపజేసే ఆ రాక్షసుల నందరిని, ఆ విధంగా సంహరించిన రాముని, ఋషులందరు, విజయం సాధించిన ఇంద్రుని, పూర్వము దేవతలు పూజించినట్లు, పూజించారు).
ఎంతో సంతోషం పొందిన విశ్వామిత్ర మహర్షి, రామునితో ఇలా అన్నాడు:
శ్లో//కృతార్థో౽స్మి మహాబాహో కృతం గురు వచ స్త్వయా/
సిద్ధాశ్రమ మిదం సత్యం కృతం రామ మహా యశ://
(ఓ మహాబాహూ!నేను తలపెట్టిన పని పూర్తి అయినది. నీవు నీ తండ్రి వచనమును చక్కగా పాటించినావు.
గొప్ప యశశ్శాలివైన ఓ రామా!నీవు ఈ సిద్ధాశ్రమము యొక్క పేరు నిలబెట్టావు).
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు,
23-3-'26
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి