19, మార్చి 2026, గురువారం

రామాయణం

 శ్రీరామ (9)


                (వాల్మీకి రామాయణం - 2)

  (19-3-'26 ఉదయం పోష్టు తరువాయి భాగం )


" కౌసల్యా ౽జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్"

(సమస్త శుభలక్షణములతో కూడిన శ్రీరామచంద్రుని కౌసల్యాదేవి ప్రసవించినది)

అని ఇంతకుముందు చెప్పుకున్నాము.



మంచి గుణములు ఉన్నవారిని లోకం కోరుకుంటుంది.

దయ, దాక్షిణ్యాది మంచి గుణములు మనచేత మంచిపనులను చేయించి మనకు, ఇతరులకు శాంతిని కలిగిస్తాయి.

ద్వేషము, పగ, అసత్యము, అసూయ, లాంటి దుర్గుణములు చెడు పనులు చేయించి మనకు లోకమునకు అశాంతిని కలిగిస్తాయి.


కాబట్టి మంచిగుణముల ప్రస్తావనతో రామాయణ మహాకావ్యం మొదలైంది.


  

1. శ్లో // తపస్స్వాధ్యాయనిరతం, తపస్వీ వాగ్విదాం వరమ్ /

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ //


( నారదమహర్షి ఎల్లప్పుడూ తపస్సు, వేదాధ్యయనము చేసుకుంటూ ఉంటాడు.

పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ, స్వరూపమైన వాక్కును తెలుసుకున్న వారిలో ఆ మహర్షి శ్రేష్ఠుడు.

తన ఆశ్రమానికి విచ్చేసిన,

మునులలో శ్రేష్ఠుడైన ఆ నారద మహర్షిని, తపస్వి అయిన వాల్మీకి మహర్షి, ఎంతో వినయంతో ఇలా ప్రశ్నించాడు )


2. శ్లో// కోన్వస్మిన్ సామ్ప్రతం లోకే గుణవాన్కశ్చవీర్యవాన్/

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢ వ్రత://



(ఓ మహర్షి! ఈ భూలోకంలో ప్రశస్తములైన గుణములు కలవాడు ఎవడైనా ఇప్పుడున్నాడా? 

గొప్ప పరాక్రమము కలవాడు, 

అన్ని ధర్మములు తెలిసినవాడు, 

చేసిన మేలు మరచిపోనివాడు, 

ఎల్లప్పుడూసత్యమేపలికేవాడు,

నియమములయందు దృఢముగా వుండేవాడు, 

అయిన వ్యక్తి ఎవడైనా ఇప్పుడు ఉన్నాడా?)



3.శ్లో// చారిత్రేనచ కో యుక్త: సర్వ భూతేషు కో హిత:/

విద్వాన్ క: క: సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః//

(అందరూ మెచ్చుకునే నడవడి కలవాడు,

అందరి మేలు కోరేవాడు,

విద్యలన్నీ నేర్చుకున్నవాడు,

కార్యములు సాధించడములో సమర్ధుడు,

ఎప్పుడు చూసినా ఆనందం కలిగించేవాడు, 

అయిన మహాపురుషుడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా?).




4. శ్లో// ఆత్మవాన్ కో జితక్రోధో, ద్యుతిమాన్ కో౽నసూయక:/

కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే//


(ఎల్లప్పుడూ ధైర్యముతో కూడినవాడు,

కోపమును తన అధీనములోఉంచుకున్న వాడు,

ఆహ్లాదాన్నికలిగించే కాంతి కలవాడు, 

అసూయ లేనివాడు,

 యుద్ధరంగములో ఎవరి కోపము చూచి దేవతలు కూడా (రాక్షసుల సంగతి చెప్పనక్కర లేదు)భయపడుతారో, అటువంటి వాడు ఇప్పుడు ఎవడైనా ఉన్నాడా?).


5. శ్లో//ఏత దిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే/

మహర్షే త్వం సమర్థో౽ సి జ్ఞాతు మేవం విధం నరమ్//

(ఓ మహర్షీ!ఇట్టి గుణములు గల మనుష్యుని గురించి తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉన్నది.

మీరు మాత్రమే ఈ విషయం తెలియజెప్పడానికి

సమర్థులై వున్నారు).

అని వినయపూర్వకంగా నారదమహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నించారు.


సద్గుణములే మనచేత సత్కార్య ములు చేయించి ఇహపర లోకములలో సుఖశాంతులను, తద్వారా మోక్షమును, ప్రసాదిస్తాయి కాబట్టి ఆ సద్గుణములను మనం అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సద్గుణ వర్ణణతో మహర్షి రామాయణ మహాకావ్యం ప్రారంభించారు.


                 శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                   ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః



శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

19-3-'26.

కామెంట్‌లు లేవు: