26, ఆగస్టు 2024, సోమవారం

శ్రీకృష్ణుని గురించి

 *🌹🙏🌹 శ్రీమతే రామానుజాయ 

 నమః. 🌹


🌹. శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం*అనుగ్రహించిన వారు 🌹🙏🌹 శ్రీమాన్ రంగనాధ ఫణిహారం ఆచార్యుల వారు. 🙏*


1. శ్రీకృష్ణుడు 5,246(5121సం||కలియుగాది+ 125సం|| ఆయన జీవితకాలం ) సంవత్సరాల క్రితం అవతరించారు

2. పుట్టిన తేది: ఇది క్రీస్తు శకం ప్రకారం గణిపశక్యం కాని విషయం. ఎందుచేతనంటే క్రీస్తు శకం అనేది 12 నెలలు పూర్తిగా కాలి సంవత్సరం గా పరిణామం చెందటానికి అనేక వందలసంవత్సరాలు పట్టింది. వారి గణన ప్రకారం క్రీస్తు పుట్టినదగ్గరనుండి మరణించే వరకూ సున్నా గా తీసుకుని క్రీస్తు పూర్వం, క్రీస్తు మరణానంతరం అని విభజించారు. అలాంటిది క్రీస్తు జననం మ తంత్రం డిసెంబర్ 25 అని ఎలా నిర్ణయించారో తెలియదు. ఇటువంటి అవకతవకల గణన కృష్ణావతార కాలనిర్ణయానికి తగదు. పైగా సింహమాసంలో బహుళ పక్షంలో అష్టమినాటి అర్థరాత్రి వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో చివరి పాదంలో అవతరించినట్లు ప్రమాణమున్నది. అదో జూలై నెలగా ఎలా నిర్ణయించారో తెలియదు.

3. మాసం : శ్రావణం- ఇదో దాక్షిణాత్య చాంద్రమానం. ఔత్తరాహులకు మాసం పూర్ణిమాంతం. అందుచేత వారి భాద్రపదమాసం అవుతుంది. 

4. తిథి: అష్టమి నవమి సంధి కాలం

5 . నక్షత్రం : రోహిణి చివరపాదం చివర్లో అవతారం. 

6. వారం : బుధవారం

7. సమయం : అర్థరాత్రి అని చెప్పబడిఃదే తప్ప 12 గంటలకు అని చెప్పటానికి ప్రమాణం లేదు. 

8 జీవిత కాలం : 125 సంత్సరాల 

9. నిర్యాణం: ఇది భారతంలో కలియుగాదిగా చెప్పబడింది. అందుచేత 🌹నేటికి 5123 సంవత్సరాల పూర్వం. 

10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది అనటానికి ప్రమాణం లేదు. 

11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం అనటానికీ ప్రమాణం లేదు

12. కురుక్షేత్రం క్రీ.పూ. మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 18రో జులపాటు జరిగింది. . ఆ సమయంలో పూర్ణిమ నాటికి భీష్ముడే సర్వసైన్యాధిపతిగా వున్నాడు. ద్రోణుని సైన్యాధిపత్యంలోనే పద్మవ్యూహం పన్ని అభిమన్యు వధ చేశారు. ఆ మరునాడే జయద్రధ వధ అర్జునుడు చేశాడు. ఆ సమయంలో సుదర్శన చక్రాన్ని లో అందరి కళ్ళు చీకట్లు కమ్మాయి సూర్యాస్తమయ భ్రాంతి కలిగిందే తప్ప గ్రహణం సంభవించలేదు. పూర్ణిమనాడు సూర్యగ్రహణానికి ఆస్కారం లేదు. కేవలం అమావాస్యనాడు మాత్రమే సూర్యగ్రహణం సంభవించడానికి ఆస్కారం వున్నది. యుద్ధం సమయంలో అమావాస్య రాలేదు. కనుక గ్రహణమే అబద్ధం. ఇక గ్రహణాలు నిర్ణయం అనేది భ్రాంతి మాత్రమే.

13. భీష్ముడు ఉత్తరాయణంలో మాఘ శుక్ల అష్టమి నాడు శరీరత్యాగంచేశాడు.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య

ఒడిశాలో జగన్నాధ్

మహారాష్ట్ర లో విఠల (విఠోబ)

రాజస్తాన్ లో శ్రీనాధుడు

గుజరాత్ లో ద్వారకాధీశుడు & రణ్ ఛోడ్

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ, ఆంధ్ర దేశంలో వేణుగోపాలుడు, తమిళ దేశాన -పార్థసారధి, రాజగోపాలుడు, కణ్ణన్ అంటారు. కేరళలో గురువాయూర్ అప్పన్ అంటారు. 


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ

17. పెంచిన తండ్రి నందుడు

18. పెంచిన తల్లి యశోద

19. సవతి సోదరులు- బలరాముడు, సాత్యకి గదుడు, మొదలైనవారు 

20. సవతిసోదరి సుభద్ర,

21. జన్మ స్థలం మధుర

22. భార్యలు : నీళాదేవి,(ఇతిహాసమైన భారతంలోని ఖిలభాగమైన హరివంశం ప్రమాణం)రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ, ఇంకా 16100 మంది రాచకన్నెలు(నరకుని చెరలోని వారు)

23. శ్రీ కృష్ణుడు తన అవతారకాలంలో అనేక మంది రాక్షసులను హతమార్చినట్టు సమాచారం. ఛాణూరుడు - కుస్తీదారు

కంసుడు - మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు, నరకాసురుడు-భూదేవి కుమారుడు, మురాసురుడు- నరకుని సైన్యాధిపతి, పంచజనుడనే రాక్షసుడు- సముద్రంలో వుండేవాడు), అఘాసురుడు, బకాసురుడు, పూతన, శకటాసురుడు,తృణావర్తుడు, ధేనుకాసురుడు, కపిద్థాసురుడు, కేశి, కాళీయుని గర్వం అణచబడింది. 

24. శ్రీకృష్ణుని తల్లి వృష్ణి వంశీకుడైన ఉగ్రసేనుని కూతురు వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం కాదు. 

25. శ్రీ కృష్ణుడు చామనఛాయ కలిగిన శరీరముతో పుట్టాడు. ఆయనకు యాదవ్ వంశీ పురోహితుడైన గర్గమహర్షి నామకరణ చేశాడు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. తన బాల్యమంతా పోరాటాలతో సాగింది. 

26. కరువు, రాక్షసుడు వలన శ్రీకృష్ణుని 3 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27 12 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 12 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఎప్పుడు బృందావనానికి తిరిగి రాలేదు.

29.జరాసంధుని వలన ప్రజలకు ముప్పు వున్నందున మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది. కాలయవన అనే రాక్షసరాజు ను ముచికుందుడనే రాజర్షి ద్వారా సంహరింపజేశాడు. 30. వైనతేయుడు గరుత్మంతుడు ఆయన శ్రీకృష్ణుని వాహనం. ఆటవికులు కాదు. జరాసందుడిని భీముని ద్వారా నేటి బీహార్ ప్రాంతంలో సంహరింపజేశాడు.

31. శ్రీకృష్ణుడు ద్వారక ను నిర్మించాడే తప్ప పునర్నిర్మాణం చేయలేదు. 

32. విద్యాభ్యాసం కొరకు 12 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద వరుణుని వద్దనుండి సముద్రంలో మునిగిపోయిన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.

34. పాండవుల వనవాసములో లక్క ఇంటి నుంచి కాపాడినది విదురుడు. శ్రీకృష్ణుడు కాదు ద్రౌపది ద్రుపదరాజపుత్రి శ్రీకృష్ణుని సోదరి కాదు తన సోదరి అయిన సుభద్రను అర్జునునికి ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులకు తోడుగ నిలిచి ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. పాండవులకు పరోక్షంగా తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39 ద్వారక నగరము కృష్ణుని నిర్యాణానంతరము ఒక వారం తరువాత నీట మునిగింది.  

40. అడవిలో జర అను వేటగాడి బాణముచేత శ్రీకృష్ణుని పాదమందు దెబ్బతగిలింది.

41. శ్రీకృష్ణుడు అనేక అద్భుతాలు చేశాడు. జీవితములో ఒక్క క్షణం కూడా సంఘర్షణకు లోను కాకుండా ప్రశాంతముగానే వున్నాడు. ఆయన నిర్వికారుడు. . జీవితపు ప్రతీ మలుపులో అనేక సంఘర్షణలను ఎలా ఎదుర్కోవాలో మనకి నేర్పాడు

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తాను ఎపుడు నిమిత్తం కారణంగానే నిలిచారు  

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఆదర్శం. అర్థం చేసుకుంటే అదొక మహా సముద్రం.

_ఆగష్టు 26, 2024_*

 ॐ శుభోదయం  ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

   *_ఆగష్టు 26, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం*

*వర్ష ఋతువు*

*శ్రావణ మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *సప్తమి* ఉ8.39

వారం: *ఇందువాసరే*

(సోమవారం)

నక్షత్రం: *కృత్తిక* రా9.28

యోగం: *ధృవం* ఉ6.47

&

*వ్యాఘాతం* తె4.18

కరణం: *బవ* ఉ8.39

*బాలువ* రా7.43

వర్జ్యం: *ఉ10.03-11.34.*

దుర్ముహూర్తము: *మ12.27-1.17.*

&

*మ2.57-3.47*

అమృతకాలం: *రా7.11-8.42*

రాహుకాలం: *ఉ7.30-9.00*

యమగండం: *ఉ10.30-12.00.*

సూర్యరాశి: *సింహం*

చంద్రరాశి: *వృషభం*

సూర్యోదయం: *5.48*

సూర్యాస్తమయం: *6.17*

       👣 *శ్రీ కృష్ణాష్టమి* 👣

      🪈 *శ్రీ కృష్ణాష్టమి* 🪈 

    💐 *శుభాకాంక్షలతో* 💐

లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

గోకులాష్టమీ



      గోకులాష్టమీ శుభాభినందనములు!


గోవర్ధనోధ్ధారము!


బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి

కెం

గేలన్ దాల్చినలీల లేనగవుతోఁ గృష్ణుండు దా నమ్మహా

శైలంబున్ వలకేలఁదాల్చి విపులథ్ఛత్రంబుగాఁబట్టె నా

భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప

గోపంక్తిన్,.

       భాగ-దశ-స్కం. 915పద్యం.

       గోపకులు దేవేంద్రని పూజింపనుపేక్షించుటను సహింపలేక సురాధిపుడు ప్రచండమైన శిలావర్షమును గురిపించగా

శ్రీకృష్ణపరమాత్మ తనవారిని రక్షించుటకు గోవర్ధనపర్వతమునెత్తి దానికి క్రిందికి గో గోపాలక గోపికా బృందములను జేర్చి రక్షించుట కృష్ణలీలలో అత్యద్భుతమైన ఘట్టము.

దానిని అంతే ఆశ్చర్యభాజనముగా తనభాగవతమున చిత్రించిన పోతనకవి ధన్యుడు.

      మహత్తరమైన ఆసన్ని వేశమును వర్ణించు పద్యరత్నమిది.

      పసి బాలుడాడుకొనుచు పూలచండును(బంతిని) సునాయాసముగా పైకి ఎత్తినట్లు కృష్ణుడు గోవర్ధనపర్వతమును గొడుగుగా నెత్తిపట్టి

చిటికెన వ్రేల నిలిపి ,రాళ్ళవానకు వెరచి పరుగెత్తు గోపబాలురను గోపికలను,గోగణములను  పర్వతము క్రిందకుచేర్చి కాపాడిన యద్భుత ఘట్టమునకు అద్దముబట్టిన ఈపద్యము అనవద్యము హృద్యము.

ఆకు కూరలు

 ఆకు కూరలు మరియు వాటిలోని ఔషధ గుణాలు  


        మనకి ప్రకృతి అనేక రకాలు అయిన ఆహారపదార్థాలని మనకి ప్రసాదించింది. వాటిని సంపూర్ణంగా వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . 


         అపథ్యం అని తెలిసీ ఒక పదార్థం రుచిగా ఉంది అని తినకూడదు. ఏది తినవలనో , ఏది తినకూడదో బాగుగా పరీక్షించి పదార్థాలను భుజించవలెను . ఆహారం వలన పుట్టిన ఈ శరీరం ఆహార వైషమ్యం వలన నశిస్తుంది. కావున ప్రతిదినం మనం తీసుకునే ఆహారం వల్ల మన ఆరోగ్యం చెడిపోకుండా కొత్తగా ఏ రోగం రాకుండా చూసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం రక్షించబడుతుందో ఆ ఆహారాన్ని మనం సర్వదా తీసుకుంటూ ఉండాలి అని చరక మహర్షి వివరించారు . 


            మనలో చాలామంది ఆకుకూరలు తింటారు కాని వాటి యొక్క ఉపయోగాలు చాలా మందికి తెలియదు . కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు అయా రకాల ఆకుకూరలు తీసుకోవడం వలన కూడ శరీరానికి పుష్కలంగా విటమిన్స్ లభించి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చు.  


        కొన్ని ముఖ్యమైన ఆకుకూరల గురించి మీకు ఇప్పుడు తెలియచేస్తాను . 


  అవిసె ఆకు కూర  - 


 *   ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఎరుపు మరియు తెలుపు దీని పువ్వులనుబట్టి చెప్పవచ్చు. 


 *  ఏకాదశి ఉపవాసం మొదలయిన ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా ఉపయోగిస్తారు . ఉపవాసం వల్ల వచ్చిన నీరసాన్ని ఇది చాలా బాగా తగ్గిస్తుంది.


 *  దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా ఉపయోగిస్తారు . గాయాలకు , దెబ్బలకు మంచి మందు.


 * జలుబు , రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గును. లొపల నుంచి జలుబు నీరు రూపంలో కారిపోయి తలనొప్పి, బరువు తగ్గును.చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి వాడవలెను . 


 *  పురిటిబిడ్డలలో పడిసెం ఎక్కువుగా ఉంటే రెండు చుక్కల అవిసె రసంలో 10 చుక్కల తేనె వేసి రంగరించి పాతకాలం లో వైద్యులు ఆ బిడ్డ ముక్కులలో వేలితో పైపైన రాస్తారు . 


 *  ఈ అవిసె ఆకులు రుచికి కారంగా , కొంచం  చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది . ఈ మధ్య మార్కెట్లో అవిసె కారం దొరుకుతుంది దానిని పిల్లలు మరియు పెద్దలు విరివిగా వాడుకొనవలెను . 


 *  సాలీడు , పులికోచ మున్నగు జంతువుల విషాన్ని కూడా ఈ ఆకురసం విరిచేస్తుంది.


 *  అవిసె ఆకుల రసం టాన్సిల్స్ కి పూస్తే అవి కరిగిపోతాయి.


 * రేజీకటి రోగం కలవారు అవిసె ఆకులకూర వాడటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.అవిసె ఆకులు దంచి ముఖ్యంగా రోట్లో కర్ర రోకలి వాడవలెను . ఆ దంచిన పిప్పిని కుండలో వేసి ఉడకపెట్టి రసం తీసి ఆ రసాన్ని 10ml లొపలికి తీసుకోవడం వలన రేజీకటి పుర్తిగా దూరం అగును.


 *  నాలుగు రోజులకు వచ్చే జ్వరానికి దీని ఆకురసం అయిదారు చుక్కలు ముక్కులలో వేసుకొని లొపలికి పీలిస్తే మంచి ప్రభావం కనిపించును.


 *  అవిసె ఆకు , మిరియాలు కలిపి నూరి రసం పిండి ఆ రసాన్ని ముక్కులలో వేస్తే అపస్మారంలో ఉన్న వ్యక్తి కోలుకుంటాడు.  


 *  చిన్నపిల్లలో వచ్చే బాలపాప చిన్నెలకు ఇది అద్భుత ఔషదంగా పనిచేయును 


 *  దీనిలో ఉన్న కారం మరియు చేదు ఉన్నను వండాక మధురంగా ఉండును.


 *  ఇది క్రిమి రహితం అయ్యి శరీరంలో మలిన పదార్థాలు మరియు మల పదార్థాలు బయటకి పంపును. దీనిని మనకంటే తమిళ సోదరులు ఎక్కువ వాడతారు.


 కరివేపాకు  - 


 *  దీనిని రావణ , గిరి నింబిక , మహానింబ అని కూడా పిలుస్తారు .


 *  ఈ చెట్టుకు ప్రతిరోజు బియ్యం కడిగిన నీరు పోస్తూ ఉంటే లేత కరివేపాకు చెట్లు ఏపుగా ఎదుగుతాయి.అదే విధంగా ముదురు చెట్లకు బియ్యం కడిగిన నీరు పోస్తే వాటి ఆకులు మంచి సువాసనలు వెదజల్లుతాయి .


 *  ఈ కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం మరియు వాతాన్ని పోగొడుతుంది. 


 *  అగ్నిదీప్తి ఇస్తుంది.


 *  దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన గ్రహణి రోగం అనగా విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు తగ్గించును . 


 *  ఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు మరియు దద్దుర్లకు ఉపయోగిస్తారు . 


 *  కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాదిని కూడా నివారించును.


 *  కరివేపాకు , మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేపాకు కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి నోటి యెక్క అరుచిని పొగొట్టును.


   కామంచి ఆకు కూర  - 


 *  దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గును. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పట్టును . 


 *  శరీరం ఉబ్బుతో కూడి యున్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్బుతంగా పనిచేయును . 


 *  ఎలుక కాటు సమయంలో ఈ ఆకుల రసం పైన రాయవలెను . 


 *  ఈ కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరించును . 


 *  ఔషదాలతో పాటు కుష్టు వ్యాధి కలవారు దీనికి కూడా వాడుకుంటే చాలా మంచి ఫలితాలు వేగంగా వస్తాయి.  


కొత్తిమీర  - 


 *  ధనియాల లేత మొక్కలని మనం కొత్తిమీర అంటాము . 


 *  వీటియొక్క రుచి కారంగా మరియు వాసన సుగంధభరితంగా ఉండును. 


 *  కొత్తిమీర గాఢ కషాయంలో పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంఖ అనగా రక్తంతో కూడిన మొలల వ్యాధి , అజీర్ణ విరేచనాలు , జఠరాగ్ని తగ్గుట , కడుపులో గ్యాస్ సమస్య వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది . 


 *  కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుంది . విదాహాన్ని అనగా దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుంది . భ్రమ ని తగ్గిస్తుంది . కొత్తిమీర మంచి జీర్ణకారి.


 * కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి.లేదా కొత్తిమీర వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరును .


 *  కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది.


 *  ప్రాచీన కాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేయవలెను.


 *  నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేయును . 


 *  ఈ కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్రాన్ని బాగా జారీచేస్తుంది.


 *  దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని అణుచును.


 *  దీని ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణ అగును.


 కొత్తిమీర కారం తయారీ విధానం  - 


     కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలని 

తొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. 


          దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గును.


 గమనిక  - 


           గ్రహణి రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదు.


 గంగపాయల కూర  - 


 *  ఇది చూడటానికి ఎర్రని కాడలతో గలిజేరుని పోలి ఉంటుంది. నేలమీద పాకుతుంది. కాడలు , ఆకులు మందంగా ఉంటాయి. ఇది పసుపుపచ్చని పూలు పూస్తుంది.


 *  దీని రుచి పుల్లగా ఉంటుంది. ఇది సులభంగా పెరుగును . 


 *  ఇది పాలకంటే మరియు వెన్నకంటే మంచిది .


 *  దీనిలో A ,B విటమినులు బాగా ఉన్నాయి .పాలకంటే , వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉన్నది అని తమిళనాడు ప్రభుత్వ పరిశోధనలో తేలింది . అదేవిధంగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండును అని కూడా పరిశోధనలో తెలిసింది.


 *  ఈ కూరలో ఐరన్ ,  కాల్షియం ఎక్కువుగా ఉన్నాయి. A విటమిన్ ఎక్కువ , B ,C D విటమినులు కొద్దిగా ఉన్నాయి.


 *  రక్తహీనత వ్యాధి కలవారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు పొందగలరు.


 *  శరీరంలో దుష్ట పదార్థాలను తొలిగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు .


 *  మన శరీర ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలి అంటే " క్షారశిల " అను మూల పదార్థం కావాలి ఈ పదార్థం గంగపాయల కూరతో దేహములోకి చేరును . ఎముకలు మరియు దంతాల పెరుగుదల కొరకు అది అత్యంత అవసరం.


*  సంగ్రహణి , కుష్టు , మూత్రాశయం లో రాయి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు  ఈ కూరని ఆహారం లో బాగం చేసుకోవాలి .


 *  వెంట్రుకలకు బలాన్ని ఇచ్చును.


 *  రక్తం కక్కుకునే వ్యాధి వారికి మంచి ఔషధం గా పనిచేయును . 


        ఈ కూరని తప్పకుండా మన ఆహార పదార్థంలో బాగం చేసుకోవలెను . 


 గమనిక  - 


            ఈ ఆకుకూరని పారేనీటిలో కడగడం ఉత్తమమైన పని. ఇది నేల మీద పాకును కావున ఇసుక , మట్టి ఎక్కువుగా ఉండును. కావున జాగ్రత్తగా శుభ్రపరుచుకోవాలి 


             దీనిని మరీ అతిగా తినరాదు. ఎందుకంటే ఇది చలువచెసే గుణం కలిగినది.కావున ఎక్కువ తిన్నచో శరీరంలో శ్లేష్మమును పెంచును. కండ్లకు మరియు మూత్రపిండముల పై , తలలో నరములపై కొంచం ప్రభావం చూపించును. కావున 10 రోజులకు ఒకసారి తిన్నచో చాలును.


 గుంటగలగర  - 


 *  దీనిని కేశరంజన , భృంగరాజ అని సంస్కృతంలో పిలుస్తారు . 


 *  దీనిని పితృదేవతల అర్చనల్లో వాడుతారు.


 *  తేమగల ప్రదేశాలలో ఉంటుంది. లంక నేలల్లో శీతాకాలంలో పెరుగును .


 *  ఇది మూడు రకాలుగా ఉంటుంది. తెలుపు, పసుపు, నలుపు . నలుపు దొరకటం మహాకష్టం దీనిలో పసుపురంగు పువ్వులు పూసేది మంచి ప్రశస్తమైనది.


 *  దీనియొక్క రుచి కారం,చేదు కలిసి ఉంటుంది. 


 *  దీనిని లోపలికి తీసుకోవడం వలన శరీరం నందలి కఫం మరియు వాతాన్ని పోగొడుతోంది 


 *  దంతాలు , చర్మం వీనికి హితంగా ఉంటుంది. ఆయువుని , ఆరోగ్యాన్ని వృద్ధిచేస్తుంది.


 *  కుష్టువు, నేత్రరోగం , శిరోరోగం , వాపు , శరీరం యొక్క దురద నివారించును.


 * హెర్నియా , ఆయాసం , పొట్టలోని క్రిములు , ఆమరోగం అనగా రుమాటిజం , పాండు రోగం అనగా భయంకరమైన రక్తక్షీణత , గుండెజబ్బు , చర్మరోగం వంటి వ్యాధులు హరించును . 


 *  కొన్ని రకాల ఆకుకూరలు నేత్రాలకు చెడుచేస్తాయి అని అంటారు. కాని ఆకుకూరల్లో పొన్నగంటి కూర తరువాత నేత్రాలకు మేలుచేసేది గుంటగలగర కావున గుంటగలగరని ఉపయొగించవలెను . 


 *  గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. 


 *  కేశాలువృద్ధి , మేధావృద్ధి ని కలుగచేస్తుంది.


 *  స్ప్లీన్ , కామెర్లు , సుఖఃరోగాల్లో దీనిని వాడటం వలన మంచి ఫలితం కనిపించును.


 *  గుంటగలగర ఆకు రసం మజ్జిగలో కలిపి తీసుకోవడం వలన పాముకాటు నుంచి కాపాడవచ్చు.


 *  ఎనిమిది చుక్కల తేనెలో రెండు చుక్కల గుంటగలగర ఆకు రసాన్ని వేసి పురిటి బిడ్డల జలుబురోగాల్లో వాడతారు.


 *  కడుపులో నులిపురుగులు ఉన్నాయి అని అనుమానం వచ్చినపుడు ఆముదంతో ఈ ఆకుపసరు కలిపి పుచ్చుకోవడం మంచిది .


 *  చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు.


 *  ఈ ఆకులు ముద్దగా నూరి తేలు కుట్టినచోట వేస్తే విషం విరుగును.


 *  చర్మరోగాల్లో ఈ ఆకుపసరు బాగా పనిచేస్తుంది .


 *  గుంటగలగర ఆకుల పొగని కాని , ఆ ఆకులు వేసి కాచిన నీటి ఆవిరి కాని గుదముకు పట్టించిన మూలశంక రోగం తగ్గును.


 *  గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది . 


  గుంటగలగర ఉపయోగించు విధానం  - 


     దీనిని తరచుగా కూరగా, పచ్చడిగా ఉపయోగించడం మంచిది . తియ్యకూరగా కాని , పులుసుకూరగా కాని వండుకోవచ్చు. గుంటగలగర ఆకువేయించి చేసిన పచ్చడికి 

కొంతవరకు గోంగూర పచ్చడి రుచి వస్తుంది.

గుంటగలగర ఆకులో ఇనుము ఎక్కువుగా ఉంటుంది. దీనిని లోపలికి తరచుగా తీసుకోవడం వలన శరీరానికి ఇనుము చక్కగా అందును. మరియు నేత్రాలకు చల్లదనం , కేశాలకు వృద్ది కలుగును.


 గోంగూర  - 


             వెల్లులి బెట్టి పొగిచిన 

      పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా ?

              మొల్లముగ  నూని వేసుక 

       కొల్లగ  భుజియింపవలయు గువ్వల చెన్నా !


         పైన చెప్పిన పద్యం గువ్వలచెన్న శతకంలోనిది. దీనిలో ఆ కవి వర్ణించిన తీరు చూస్తుంటే తెలుస్తుంది . గొంగూర యొక్క గొప్పతనం . ఇప్పుడు మీకు దానిలోని పోషక విలువలు మీకు తెలియచేస్తాను. 


 *  దీనిని సంస్కృతంలో పీలు , గుచ్ఛఫల , ఉష్ణప్రియ అని కూడా పిలుస్తారు . 


 *  ఆకుకూరలలో ఇది మిక్కిలి ప్రశస్తమైనది.


 *  ఈ ఆకుల్లో రాగి ఎక్కువ ఉంటుంది.


 *  దీనిలో పోటాష్ కూడా ఉంటుంది.


 *   ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో గోంగూరని వేడిని కలుగజేసేదిగా పేర్కొన్నది. బలం కలుగచేసే ఆకుకూర గా తెలియచేశారు .


 *  రక్తపిత్తవ్యాధి అనగా నోటినుంచి రక్తం పడువ్యాధిని హరించును . 


 *  శరీరంలోపలి గడ్డలు , మూలవ్యాధి , స్ప్లీన్ సంబంధ సమస్యల ను నివారించవచ్చు.


 *  వాతం , కఫం ఉన్నవారు దీనిని లొపలికి తీసుకోవలెను . 


 *  ఇది మంచిరసాయనం . 


 *  ఈ గోంగూరలో నాలుగు రకాలు ఉన్నాయి.

గొంగూరలో పుల్లగోంగూర , ఎర్ర గోంగూర , తెల్ల గోంగూర దీనిని దేశివాళి గోంగూర అని కూడా అంటారు. మరొక రకం ధనాసర గోగు అని 4 రకాలు ఉన్నాయి.


 *  పుల్లగోంగూర కాయలు ఎర్రగాకాని , తెల్లగా కాని ఉంటాయి. పుల్లగోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు . 


 *  ఎర్రగోగు చెట్టు కాడలు బూడిద రంగుతో కలిసిన పచ్చని రంగుతో ఉంటాయి.


 *  తెల్లగోంగూర సర్వసామాన్యమైనది. దీనిని నాటు గోంగూర లేదా దేశివాళి గోంగూర అని కూడా అంటారు.


 *  ధనాసర గోంగూర విదేశీది మలేసియా దేశం లోని తర్నాసరి రాష్ట్రం నుంచి వచ్చింది. తర్వాత దాని పేరు ధనాసరి గా క్రమంగా మారింది. ఇది మంచి పథ్యకరమైనది . బాలింతరాళ్ళకి కూడా పెట్టవచ్చు.


 *  పైర గోంగూర అని ఇంకోరకం కూడా ఉన్నది. దీన్ని శీతాకాలంలో సాగుచేస్తారు . ఇది మిగిలిన గోంగూరల కంటే మంచి రుచిగా ఉంటుంది. పచ్చజొన్న , పైరగోంగూర రెండు శ్రేష్టం అయినవని సామెత .


 *  నువ్వుల చేలో పండిన గోంగూర అంత పథ్యకరం కానిది అని వైద్యులు చెప్తారు . 


 *  గుంటూరు జిల్లాలో పెరిగే గోంగూర చాలా రుచిగా ఉంటుంది. దీని ఆకుతో పులుసు , పచ్చడి చేసుకుంటారు . 


 *  గుంటూరు జిల్లాలో దీనిని నిలువ పచ్చడిగా పెడతారు.


  నిలువపచ్చడి పెట్టే విధానం  - 


       నిలువ పచ్చడి పెట్టడానికి పైర గోంగూర వేయించాలి . కావాలిసిన ఉప్పు చేర్చి ముందు ఒకసారి తొక్కాలి. ఆ తరువాత పండు మిరపకాయలు కొద్దిగా పసుపు చేర్చి మరలా తొక్కాలి . తరువాత గిన్నెలోకి తీసుకుని ఊరనివ్వాలి . 


 *  సంవత్సరానికి పైగా ఊరిన ఈ పచ్చడి చాలా పథ్యకరం అయినది. పైన చెప్పిన పచ్చడి నూనెతో కూడా చేయవచ్చు . కాని పైన చెప్పినవలె నూనె కలిపితే పథ్యకరం కాదు.


 *  గోంగూర మంచి బలకారం అయిన శాకం . అందుకే గొంగూర పచ్చడి కోడి మాంసంతో సమానం అయినది అని చెప్తారు . 


 *  రేజీకటి రోగం కలవారు ఈ కూర చాలా మేలు చేయును . 


 *  గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి అని చెప్తారు . 


 *  మేహ సంభందమైన వ్రణాలు కు గోంగూర ఆకు ఉడికించి కడితే మేహవ్రణాలు పక్వానికి వస్తాయి.


 *  గోంగూర నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి.


 *  బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.


 *  గేదల లేగదూడలకు నాలుగయిదు గోంగూర ఆకులు పెట్టడం వలన మల సమస్య తీరి ఆరోగ్యంగా ఎదుగుతాయి.


 *  గోంగూరని ఎక్కువ ఉడికించడం వలన మరియు కుక్కర్లలో ఉడికించడం వలన దానిలోని జీవపోషకాలు నశిస్తాయి.


  గమనిక  - 


       ఈ గోంగూరని ఎక్కువుగా వాడరాదు . శరీరంలో వేడిని పెంచును. మరియు మలబద్దకం సమస్య పెంచును.


 చక్రవర్తి కూర  - 


 *  దీనిని సంస్కృతంలో వాస్తుక , శాకపత్ర , కంబీరా , ప్రసాదక అనే పేర్లతో పిలుస్తారు . 


 *  ఇది తొందరగా జీర్ణం అవుతుంది. రుచిగా ఉంటుంది. 


 *  శుక్రవృద్ధిని కలిగి ఉండి , శరీరంలో తొందరగా వ్యాపిస్తుంది.


 *  స్ప్లీన్ , రక్తంలో దోషం , పిత్తం అనగా శరీరంలో వేడి తగ్గించును . 


 *  మూలవ్యాధి , కడుపులో నులిపురుగులు , త్రిదోషాలు వీటిని పోగొట్టును .


 *  ఇది మధురంగాను మరియు కొంచం ఉప్పగాను ఉంటుంది.


 *  మలమూత్ర సమస్యలని నివారిస్తుంది.


 *  ఈ కూర బుద్ధిబలాన్ని పెంచును.


 *  ఆకలి పుట్టిస్తుంది.


 *  కళ్ళకు మేలు చేయును . 


 *  మలబద్దకం సమస్యని నివారించును.


 *  వాత పిత్త శ్లేష్మ దోషాలను నివారించడంలో దీనికిదే సాటి .


 *  చర్మరోగాలు ను పోగొడుతుంది . 


 గమనిక  - 


     దీనిని ఎక్కువుగా తీసుకొన్నచో మలబద్దకం మరియు ఉష్ణాన్ని చేయును.


 చామ ఆకు  - 


 *  చామ ఆకు కూర చాలా మంచిది . జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర చాలా అద్భుతంగా పనిచేస్తుంది .


 * మూలశంక సమస్యతో బాధపడేవారు దీనిని లోపలికి తీసుకోవడం చాలా మంచిది 


 *  ఈ ఆకుకూర మూత్రాన్ని బాగా జారిచేస్తుంది .


 *  అరుచి అనగా నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది.


 *  ఆకలి పుట్టిస్తుంది.


 *  ఈ చామ ఆకులను పులుసుకూరగా తినడం చాలా మంచిది . 


 *  ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి.


 *  రక్తనాళాల నుంచి కారే రక్తం ఆగిపోతుంది.


 గమనిక  - 


          దీనిని అధికంగా తీసుకోవడం వలన శరీరంలో వాతం , శ్లేష్మంని కలిగించును.దీనికి పులుసు విరుగుడు కావున పులుసు కూర చేసుకోవడం వలన దీనిలో దుర్గుణాలు నశించును.


  చింతాకు  - 


 *  కూరగాను , పచ్చడిగాను దీనిని ఉపయోగిస్తారు . దీని లేత చిగురుని చింతచిగురు అంటారు.


 *  ఈ చింతచిగురు హృదయానికి మేలు చేయును . 


 *  ఇది వగరు మరియు పులుపు రసాలని కలిగి ఉంటుంది.


 *  రుచిని పుట్టిస్తుంది.


 *  బుద్ధికి మేలు చేయును . 


 *  జీర్ణక్రియకు మేలు చేయును . 


 *  కఫ మరియు వాతాలని అద్భుతంగా నిర్మూలించును.


 *  చింతచిగురు ఎక్కువుగా వేసవికాలంలో దొరకును. కాని ఒక ప్రక్రియ ద్వారా అకాలంలో కూడా చింతచిగురు పొందవచ్చు.


 అకాలంలో చింత చెట్టు చిగురించేలా చేసే ప్రక్రియ  - 


    మనం ఏ చెట్టుకి అయితే అకాలంలో చింతచిగురు తెప్పించాలి అనుకుంటున్నామో ఆ చెట్టు కొమ్మ పాత ఆకులని రాలిపివేయాలి . ఆ తరువాత ఆ కొమ్మకి సెగ బాగా తగిలేలా అక్కడ తాటాకు మంట వేయాలి . ఈ విధంగా చేసిన వారం పదిరోజుల్లో ఆ చెట్టుకి బాగా చిగురు తొడుగును.ఇలా కొత్తగా వచ్చిన ఆకుతో పచ్చడి చేసుకుని తినవచ్చు 


 *  చింతచిగురు శరీరానికి వేడిచేస్తుంది అనుకుంటారు . కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట విస్తారంగా పట్టును . చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదు.


 *  చింతచిగురు వాత వ్యాధులని , మూలరోగాన్ని , శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గించును . 


 *  పైత్యం , వికారములు ను తగ్గించును . 


 *  కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు.


 *  ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత కలదు. ఈ పొడికూర చాలా పథ్యకరమైనది మరియు తినదగినది.


 *  చింతాకు రసంలో పసుపు కలుపుకుని తాగితే మసూచికా వ్యాధి నివారణ అగును.


 *  మోకాళ్ళ వాపు తో చింతాకు ముద్దగా చేసి నీళ్లతో నూరి పట్టు వేయవచ్చు.


 *  మొండి వ్రణాలను చింతాకు కషాయంతో కడిగితే అవి త్వరగా నయం అవుతాయి. 


 *  ఎర్రగా కాల్చిన ఇనుప గరిటె చింతాకు రసంలో ముంచి ఆ రసం వేడిగా ఉండగానే తాగితే అజీర్తి విరేచనాలు కట్టుకుంటాయి.


 గమనిక  - నేత్ర వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినరాదు. కొంచం జఠరాగ్నిని కూడా తగ్గించును . 


 చిర్రికూర  - 


 *  దీనిని సంస్కృతంలో మేఘనాధ , భండీర , విషఘ్న , కచర అని రకరకాల పేర్లతో పిలుస్తారు . దీనికి పథ్య శాకం అని పేరుకూడా కలదు . అనగా అన్ని రకాల వ్యాధుల్లో దీనిని ఉపయోగించవచ్చు అని అర్ధం .


 *  ఇది కొద్దిపాటి తేమగల ప్రదేశాలలో చిర్రికూర బయలుదేరి బాగా పెరుగును . 


 *  ఇది చూడటానికి ముళ్లతోటకూరలా ఉంటుంది. కాని దానిలా ముళ్ళు ఉండవు.


 *  చిర్రికూరలో మూడురకాల జాతులు కలవు. చిర్రి , నీటి చిర్రి , చిన్న చిర్రి అనేవి కలవు. వైద్యగ్రంధాలలో మాత్రం నీటిచిర్రి గురించి వివరించబడి ఉంది. కాని వంటకాలలో ఉపయోగిస్తున్నట్టు ఎక్కడా కనపడదు.


 *  వైద్యగ్రంధాలలో వివరించినదాని ప్రకారం పిత్తాన్ని , కఫాన్ని , రక్తదోషాన్ని పోగొట్టును . 


 *  మలమూత్రాన్ని బాగా బయటకి పంపిస్తుంది.


 *  నాలుకకు రుచిని పుట్టిస్తుంది.


 *  రక్తం కక్కే వ్యాధిని పోగొడుతుంది . శరీరంలో జఠరాగ్ని పెంచును.


 *  చిర్రికూర పాషాణాది విషాన్ని , సర్ప విషాన్ని మొదలయిన విషాలను హరిస్తుంది అని పేరు కలదు.


 *  విషంతో కూడిన రక్తాన్ని  శుభ్రపరచడంలో దీనికి మంచి పేరు ఉంది.


 *  పెట్టుడు మందుల విషాన్ని పోగొట్టడానికి 

చిర్రికూర వండిపెడతారు.


 *  కందిపప్పు మొదలయిన పప్పుల్లో చేర్చి ముద్దకూరగా , లేదా పొడికూరగా వండవచ్చు.


 *  ఈ కూర బాగా ఆకలి కలిగిస్తుంది.


 *  వాత, పిత్త, శ్లేష్మాలు అనే త్రిదోషాలను  నివారిస్తుంది.


 *  కళ్ళజబ్బులు , మెదడు జబ్బులు కలవారికి ఇది మిక్కిలి హితకరం అయినది.


 *  ఈ కూరలో ఉక్కు లోహం ఉంది అని చెప్తారు . 


 * రక్తం కక్కుకునే వ్యాధుల్లో , గుండెజబ్బుల్లో చిర్రిఆకుకూర చాలా ఉపయోగికారిగా ఉంటుంది.


 *  ఈ కూర తినటం వలన అతిసార వ్యాధి తగ్గును.


  చిలుకకూర  - 


 *  దీనిని "జలబ్రహ్మి" అని అంటారు.


 *  నదుల గట్టులు , చెరువు గట్టులు మొదలయిన తేమగల ప్రదేశాలలో ఈ కూర పెరుగును . 


 *  ఇది సరస్వతి మొక్కని పోలి ఉంటుంది. మరియు నీరుగల ప్రదేశాలలో ఉండటం చేత జల బ్రహ్మి అని పేరు వచ్చింది.


 *  దీనిలో రెండురకాల జాతులు కలవు. ఒకరకాన్ని పెద్ద చిలకూరాకు రెండో రకాన్ని తెల్ల చిలకూరాకు అని పిలుస్తారు . 


 *  ఇది రుచిగా ఉండి బుద్దికి బలాన్ని ఇస్తుంది. 


 *  శరీరంలో జఠరాగ్ని పెంచును. 


 *  స్ప్లీన్ , రక్తదోషం , త్రిదోషాలు , శరీర అంతర్భాగంలో గల క్రిములను హరించును . 


 *  తెల్ల చిలుకకూర తియ్యగా ఉంటుంది. ఇది పిత్తాన్ని హరించును . జ్వరంతో పాటు వచ్చే దోషాలని , త్రిదోషాలని హరించును . 


 *  ఇది రుచికి చేదుగా ఉంటుంది.


 *  ఇది మంచి విరేచనకారి.


 *  కడుపులో నులిపురుగులని హరిస్తుంది.


 *  కుష్టురోగాన్ని తగ్గించే గుణంకూడా దీనిలో కలదు.


 *  శరీరానికి పుష్టి ఇచ్చే కూరల్లో ఇది చాలా గొప్పది.


 *  మూలవ్యాధుల్లో , గ్రహణి రోగం అనగా బంక విరేచనాలలో , ఉబ్బు రోగాల్లో , కడుపులో బల్లలు పెరిగే రోగాల్లో ఈ ఆకుకూర వాడవలెను.


 *  మసూచి వంటి వ్యాధుల్లో చిలుకకూరాకు రసంలో తెల్ల చందనం ముద్ద ను రంగరించి తాగితే ఆ రోగము తగ్గును.


  చుక్క కూర  - 


 

 *  ఈ చుక్కకూర బచ్చలి కూరని పోలి ఉంటుంది. పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని అన్ని ప్రాంతాలలో పుల్లబచ్చలి అంటారు.


 *  ఈ చుక్క ఆకులు దళసరిగా , పెళుసుగా ఉంటాయి. ఈ చుక్క ఆకులో జిగురు పదార్థం ఎక్కువుగా ఉంటుంది.


 *  దీనిలో 2 రకాల జాతులు కలవు. అవి  

    చుక్కకూర , చిన్న చుక్కకూర .


 *  ఈ చుక్కకూర పుల్లగా , తియ్యగా ఉంటుంది. చిన్న చుక్క కూర పుల్లగా కొంచం వగరుగా ఉంటుంది. 


 *  ఇది జఠరాగ్ని పెంచును.


 *  ఇది రుచిని పుట్టించును . 


 *  కఫం , వాతం పోగొడుతోంది . పిత్తాన్ని కలిగిస్తుంది . 


 *  గ్రహణి , మూలరోగం , అతిసారం , కుష్టువు వీనిని నశింపచేస్తుంది.


 *  మలబద్దకం ని తొలగించి సుఖవిరేచనం కలిగించును.


 *  నోటిలో కొంతమందికి అతిగా లాలాజలం ఊరుతుంది.అది కఫ సంబంధమైన సమస్య ఆ సమస్యకి చుక్కకూర తరచుగా తీసుకోవడం వలన సమస్యకి అద్బుతంగా పనిచేయును .


 *  వాంతులని అరికట్టడంలో ఈ కూర అద్బుతంగా పనిచేయును . 


 *  వేడిశరీరం కలవారికి ఈ కూర చాలా మేలు చేయును .


 *  జీర్ణకోశంలో ఏర్పడే మంటని , వేడిని ఇది తగ్గించును . 


 *  పైత్యం అధికం అవ్వడం వలన కలిగే విరేచనాలని , రక్తంతో కూడియున్న బంక విరేచనాలని తగ్గించడంలో చుక్కకూర చాలా అద్బుతంగా పనిచేస్తుంది .


 *  మూలరోగాలు , గుల్మాలు , క్షయలు , మేహవ్యాధులు మొదలయిన వ్యాధుల్లో ఈ కూరని ఉపయోగించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.


 *  గుండెజబ్బులు కలవారు , ఆమవాతం , గుండెల్లో నొప్పిని తగ్గించును . 


 *  విషాదోషాలు పొగొట్టును.


 *  బుద్దికి చలువచేయును .


 *  శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది .


 *  మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చూస్తుంది.


 *  పక్వము అవ్వని గట్టిగా ఉండే వ్రణాల పైన చుక్క ఆకు వేసి కడితే మంచి గుణకారిగా ఉంటుంది.


 *  చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయం అగును.


 *  తెలంగాణా ఏరియాలో దీన్ని ఎక్కువుగా వాడతారు.


  చెంచలి కూర  - 


   

 *  ఏ ఆకు కూరలు దొరకని ఆషాడ మాసంలో ఈ ఆకుకూర దొరుకుతుంది .


 *  ఎందుకనో ప్రజలు దీనిగురించి ఎక్కువ పట్టించుకోరు.


 *  దీనిలో  చెంచలికూర, నీరు చెంచలి కూర అని రెండురకాలు కలవు. సాదారణంగా చెంచలి కూరనే వంటకానికి వాడతారు.


 *  ఇది మలాన్ని గట్టిపరుస్తుంది.


 *  మేహాంని , త్రిదోషాన్ని పోగోట్టును . 


  తమలపాకు  - 


 *  దీన్ని సంస్కృతంలో భక్ష్యపత్రి అంటారు.


 *  భరత ఖండంలో తమలపాకుల వాడకం అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉంది. శుశ్రుత సంహితలో కూడా తమలపాకు గురించి వివరణ ఉన్నది.


 *  తమలపాకు ని సంస్కృతంలో తాంబూల వల్లి ,  నాగవల్లరి అని కూడా పిలుస్తారు . 


 *  వానాకాలం వచ్చే తమలపాకులు దళసరిగా , పెద్దగా ఉంటాయి. ఎండాకాలం వచ్చే ఆకులు పలచగా కొద్దిగా ఉంటాయి. వానకాలం తమలపాకుల కంటే ఎండాకాలం వచ్చే తమలపాకులు ఎక్కువ రుచిగా ఉంటాయి.


 *  తమలపాకులు శరీరాన్ని శోధనం చేస్తాయి.అనగా శరీరం నుండి వ్యర్థాలను బయటకి పంపుతాయి.


 *  రుచిని కలిగిస్తాయి. శరీరంకి వెంటనే వేడి పుట్టిస్తాయి.


 *  వగరు , చేదు , ఉప్పు రుచిని కలిగి ఉంటాయి. శరీరంలో వేగంగా వ్యాపించే గుణం కలిగి ఉంటాయి.  శ్లేష్మాన్ని , నోటికంపుని , బడలికని పోగొట్టును . 


 * మిగిలిన ఆకుకూరలు చెట్టు నుంచి కోసిన తరువాత ఎంత త్వరగా ఉపయోగిస్తే అంత మంచిది . కాని తమలపాకు విషయంలో  దీనికి పూర్తి వ్యతిరేకం . చెట్టు నుండి అప్పుడే కోసిన తమలపాకులు దోషంతో మరియు జడంగా ఉంటాయి. 


 *  దోషయుతమైన తమలపాకులు వాడటం వలన వాంతులు , మలం స్థంభించుట , నాలిక రుచి లేకుండా పోవడం . దాహం వేయడం , రక్తదోషం వంటి సమస్యలు సంభంవించును.


 *  పండిన తమలపాకులు రుచిలో అత్యుత్తమంగా ఉండి త్రిదోషాలని నాశనం చేస్తాయి . 


 *   భోజనం చేసుకున్నాక తాంబూలం వేసుకోవడం వలన మంచి జీర్ణశక్తి పెరుగును .


 *  తమలపాకులు అతిగా తినటం వల్ల వచ్చే భుక్తాయాసాన్ని నివారించును.


 *  నోటి దుర్వాసన పోగొట్టును 


 *  తమలపాకులు వేడిచేసే స్వభావాన్ని కలిగి ఉండి కామోద్రేకాన్ని కలిగిస్తాయి . 


 *  వాత , కఫాలని హరిస్తాయి.


 *  కంఠస్వరాన్ని బాగుచేస్తాయి.


 *  తమలపాకులు పండు ఆకులను సేవిస్తే పసరు పెరగదు . బాలింతలు కూడా తీసుకోవచ్చు .


 *  పత్తిచెట్టు వేరు , తమలపాకు రసంతో నూరి ముద్దచేసి ఉపయొగిస్తే వజ్రం కూడా భస్మం అగును.


 *  ఇంతగొప్ప లక్షణాలు ఉన్నను తాంబూలం మితిమీరి సేవించరాదు . సేవిస్తే దంతవ్యాదులు కలుగుతాయి.


 *  తాంబూలం అతిగా సేవించటం వల్ల నాలిక మొద్దుబారిపోయి పదార్థాల రుచులు మధ్య బేధాన్ని గుర్తించలేకుండా అవుతుంది.


 *  భోజనం చేసిన వెంటనే తాంబూలం వేసుకోకూడదు. ఒక గడియసేపు ఆగి తాంబూలం వేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే , వాంతి చేసుకున్న వెంటనే , నిద్రలేచిన వెంటనే తాంబూలం వేసుకోరాదు.


 *   వెలగపండు , పుల్లనిపండ్లు , పనసతొనలు , అరటిపండ్లు , చెరకు గఢ  , కొబ్బరికాయ , పాలు , నెయ్యి తిన్నతరువాత తమలపాకు ఎట్టి పరిస్తతుల్లో తినరాదు.


 *  తాంబూలం వేసుకున్నప్పుడు సమస్య అనిపిస్తే చల్లని నీరు విరుగుడు. లేదా నోటితో నీరు పుక్కిలించి పుల్లటి వస్తువుగాని తియ్యటి వస్తువుగాని చప్పరించాలి.


 తొటకూర  - 


 *  తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గును. శరీరంలో ఉన్న అతివేడిని తగ్గించి శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది.


 *  ఋషిపంచమి వంటి పుణ్యదినాల్లో మరియు వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం .


 *  తోటకూర మూడు లేక మూడున్నర అడుగుల వరకు ఎదిగే చిన్నమొక్క . తోటకూరని ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు.


 *  విత్తనం మొలకెత్తి మూడో ఆకు వేసేదాకా తోటకూరవిత్తనాలు చల్లిన మళ్ల మీద అరటిసోరగు కాని ఎండు కొబ్బరిఆకులు కాని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన పక్షుల నుంచి విత్తనాలను కాపాడవచ్చు.


 *  మడిలో విత్తులు ఒత్తుగా చల్లడమే మంచిది . లేతగా ఉండగానే నడుమనడుమ కొన్ని మొక్కలని పీకేస్తూ కూరకు ఉపయోగిస్తుంటే ఉన్న మొక్కలు ముదిరి బాగా కాస్తాయి. ఇలా ముదిరిన మొక్కల కాడలు కూరకి మరియు పులుసుకి పనికివస్తాయి.


 *  తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి.


పెరుగుతోటకూర , కొయ్యతోటకూర , చిలుకతోటకూర , ఎర్రతోటకూర , ముళ్లతోటకూర మెదలైనవి.


 *  కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది.కాబట్టే దీనిని బాలింతలకు , నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడవలెను . వాతత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. ఉష్ణశరీరం కలవారికి గుండెలో నొప్పి , కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు. 


 *  ముళ్లతోటకూర ఆకులని పప్పుకూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.


 *  ఈ మొక్కల్ని తెచ్చి ఎండించి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని బట్టలసోడాకు బదులుగా చాకలివారు  వాడతారు. దీనికి కారణం ముళ్లతోటకూరలో క్షారపదార్థం విస్తరించి ఉందని తెలుస్తుంది.


 *  సోడాపెట్టి ఉతికిన బట్టలు కంటే ముళ్లతోటకూర బూడిద పెట్టి ఉతికే బట్టలు చాలారోజులు మన్నుతాయి. మరియు సోడా పెట్టిన వాటికంటే ఇవి శుభ్రముగా ఉంటాయి.


 *  చిలకతోటకూర పెరళ్ళలో బాగా ఎదుగును. పెరుగుతోటకూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది.


 *  అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తల పరిశోధనలలో కనుగొనబడినది.


 *  ఇది పుల్లకూరగా , తీయకూరగా,  పప్పుకూరగా , పులుసుగా వండుకుంటారు.


  దోసకాయ ఆకు కూర  - 


 *  మనం దోసకాయలను ఆహారంగా తీసుకుంటాం కాని దోస ఆకు లో కూడా చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఇది లొపలికి కూరగా తీసుకొవడం వలన మలమూత్రాలను జారీచేస్తుంది. 


 *  పైత్యం పెరగటం వలన బ్రాంతి తగ్గును.


  పుదీనా ఆకు  - 


 *  నోటియొక్క అరుచి పోగట్టడానికి పుదీనా పచ్చడి చేసుకుని తినవలెను . పుదీనా  ఆకులు , ఖర్జురపు కాయలు , మిరియాలు , సైన్ధవ లవణం , ద్రాక్షా మొదలయిన పచ్చడిచేసి అందులో నిమ్మకాయల రసం పిండి ఉపయోగిస్తారు 


 *  పుదీనా ఆకుని నేతితో వేయించి కాని పచ్చిది కాని నూరి పచ్చి మిరపకాయలు , ఉప్పు చేర్చి నూరి నిమ్మరసం పిండి ఉపయోగిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.


 *  జ్వరాలు మొదలయిన వాటితో నీరసపడి లేచినవారికి నోరు రుచి పోతుంది . వారికి ఈ పచ్చడి అద్బుతంగా ఉంటుంది.


 *  గుండెలకు పుదీనా చాలా పథ్యకరం అయినది. కలరా రోగాల్లో పుదీనా మంచి గుణకారిగా ఉంటుంది. ఎక్కిళ్లు మరియు వాంతుల్లో మొదలయిన రోగాల్లో పుదీనా వాడతగినది.


 *  పుదీనా ఆకుల రసం తేనెతో కలిపి చెవిలో వేస్తే చెవిపోటు తగ్గును. కణతలు కు రాసుకుంటే తలనొప్పి నయం అగును. పుళ్లు మొదలయిన వాటికి రాస్తే తొందరగా నయం అగును. 


 *  అజీర్ణ రోగులకు పుదీనా నిత్యం సేవించటం మంచిది .


 పొన్నగంటి ఆకు కూర  - 


  

 *  ఇది నేత్రవ్యాధులు కలవారికి చాలా అద్బుతంగా పనిచేస్తోంది .


 *  ఇది మలాన్ని గట్టిపరుస్తుంది. శీతలంగా ఉంటుంది.


 *  కుష్టు వ్యాధి , రక్తదోషం , కఫం , వంటి సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది . 


 *  జ్వరం , శరీరంలో వాపు , దురద , స్ప్లీన్ సమస్య , వాతం , వాంతి , అరుచి వీనిని పోగొడుతుంది.


 *  హృదయానికి మేలు చేస్తుంది.


 *  ఇది చలువచేయును . జ్వరతాపాలను , అతిదాహం తగ్గిస్తుంది . 


 *  ఆవునెయ్యితో ఉడికించి పొన్నగంటి ఆకుని కండ్లకు కడితే వేడివల్ల కలిగే నేత్రవ్యాధులు నయం అవుతాయి.


 *  మూలవ్యాధుల్లో కూడా పొన్నగంటికూర చాలా బాగా పనిచేస్తుంది 


 *  వేడివలన వచ్చే తలపోట్లలో పొన్నగంటి ఆకు తలకు కట్టడం మంచిది . 


 *  పొన్నగంటిఆకు రక్తదోషాలను మరియు కుష్టురోగాలను నయం చేస్తుంది.


  మునగాకు  - 


 *  ఆషాడ మాసంలో మునగాకు కూర తినవలెను అని పెద్దలు చెపుతారు.


 *  మునగాకులో 5 ,000 యూనిట్ల A విటమిన్ ఉంది . అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు .


 *  మలాన్ని గట్టిపరుస్తుంది. 


 *  జఠరాగ్నిని పెంచును.


 *  కఫాన్ని , వాతాన్ని హరించును . 


 *  శరీరంకు వేడిచేయును . రక్తములో వేడి పెంచును కావున తక్కువ తీసుకోవడం మంచిది .


 *  మునగాకుని పప్పులో వేసి ముద్దకూరగా కాని పొడికూరగా కాని వండుకోవచ్చు .


 *  ఈ కూర దృష్టిమాంద్యాన్ని పోగొడుతుంది అని చెబుతారు.


 *  శరీరంలో చెడ్డ నీరు తొలగించుటకు మునగాకు కూర చాలాబాగా పనిచేస్తుంది .


 *  వేడిశరీరం కలవారు ఈ మునగాకుని వాడకుండా ఉంటే మంచిది .


 *  స్త్రీ ముట్టులో ఉన్నప్పుడు మునగాకు కూర పెట్టడం చాలా మంచిది . దీనికి కారణం స్త్రీలు ముట్టులో ఉన్నప్పుడు శరీరంలో వాతం ఎక్కువుగా ఉండును. ఈ సమయంలో మునగాకు తినిపించడం వలన వాతం హరించును . 


 

  మెంతి ఆకు   - 


 

 *  ఈ మెంతులు ఆశ్వయుజ కార్తీక మాసాల్లో చల్లితే చల్లిన నెలా పదిహేను రోజుల్లొ మెంతికూర ఉపయోగించడానికి అనువుగా ఎదుగును.


 *  నల్లనేలల్లో శీతాకాలంలో వేసిన మెంతికూర చాలా రుచిగా ఉంటుంది.


 *  మెంతికూర పచ్చిగా ఉన్నప్పుడు కాని , ఎండపెట్టి వరుగు చేసి కాని ఉపయోగించుకోవచ్చు.


 *  రక్తపిత్తం , అగ్నిదీప్తి , మలాన్ని బందించును., బలాన్ని కలిగించును.


 *  జ్వరం , వాంతి , వాతరక్తం , కఫం , దగ్గు , వాయువు అనగా వాతం , మూత్రరోగం , క్రిమి , క్షయ , శుక్రం వీటిని నశింపచేస్తుంది.


 *  ఈ ఆకులు నూరిన ముద్ద కాలిన పుండ్లకు , వాపులకు పట్టువేస్తే చల్లగా ఉండి మేలు చేస్తుంది.


 *  ఈ మెంతిఆకులు నూరి ముద్దకడితే వెంట్రుకలు మృదువుగా అవుతాయి.వెంట్రుకలు రాలే జబ్బు తగ్గును.


 *  మెంతికూర స్త్రీల గర్భాశయాన్ని బాగుపరచడంలో ఋతుస్రావాన్ని సుష్టుచేయడంలో మెంతికూర బాగా పనిచేయును .


 *  ఈ మెంతిఆకుల వల్ల కలిగే దోషాల్ని పోగొట్టడంలో పులుసు వస్తువులు వాడవలెను.


***************  సంపూర్ణం ****************


         మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


    గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

శ్రీకృష్ణుని గురించి

 *శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు*


శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం


1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు

2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228

3. మాసం : శ్రావణం

4. తిథి: అష్టమి

5 . నక్షత్రం : రోహిణి

6. వారం : బుధవారం

7. సమయం : రాత్రి గం.00.00 ని. 

8  జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు

9. మరణం: క్రీ పూ. 18.02.3102

10. శ్రీకృష్ణుని 89 వ యేట కురుక్షేత్రం జరిగినది

11  కురుక్షేత్రం జరిగిన 36 సం.ల తరువాత మరణించెను

12. కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139 న మృగశిర నక్షత్ర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139 న 3గం. నుంచి 5గం.ల వరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.

13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను.

14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:

మధురలో కన్నయ్య,

ఒడిశాలో జగన్నాధ్,

మహారాష్ట్ర లో విఠల (విఠోబ),

రాజస్తాన్ లో శ్రీనాధుడు,

గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్,

ఉడిపి, కర్ణాటకలో కృష్ణ


15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు

16. జన్మనిచ్చిన తల్లి దేవకీ

17. పెంచిన తండ్రి నందుడు

18. పెంచిన తల్లి యశోద

19. సోదరుడు బలరాముడు

20. సోదరి సుభద్ర

21. జన్మ స్థలం : మధుర

22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ

23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం.  వారు : ఛణురా - కుస్తీదారు

కంసుడు - మేనమామ

శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు

24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం. 

25. శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం మొత్తంలో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నారని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది. 

26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది. 

27 . 14-16 ఏళ్ల వయసు వరకు బృందావనంలో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధురలో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.

28. తను మళ్ళీ ఎప్పుడూ బృందావనానికి తిరిగి రాలేదు.

29. కాలయవన అను సింధూ రాజు  నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.

30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.

31. శ్రీకృష్ణుడు  ద్వారకను పునర్నిర్మించారు.

32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమమునకు తరలివెళ్ళెను.

33. గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపాడెను.

34. తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.

35. పాండవులతో ఇంద్రప్రస్థ అను నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.

36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.

37. రాజ్యము నుండి  వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.

38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.

39  ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.

40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.

41. శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. అతని జీవితం విజయవంతమైన దేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు. 

43. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.

అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడూ వర్త మానములోనే బ్రతికారు. 

44. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.

శ్రీకృష్ణ పరమాత్మ

 🌹శ్రీకృష్ణ పరమాత్మ🌹


శ్రీమహావిష్ణువు క్షితిభారమును బాప

        ప్రార్థితుండయ్యును బ్రహ్మవలన 

వసుదేవప్రభువుకు వనిత దేవకికిని 

        పుట్టె చెఱసాలలో గుట్టు గాను 

శ్రీకర వర్షమౌ "శ్రీముఖ" మందున 

        భవ్య " శ్రావణ మాస బహుళ " మందు 

" అష్టమి తిథి " యందు నర్థరాత్రంబున 

         జన్మించె కృష్ణుడు జగతి పొంగ 

మథురానగరు నుండి మందలన్ జేరియు 

         న్నందు నింట బెరిగె నందనునిగ 

పడతి యశోదమ్మ పాలను ద్రావియు 

       న్నల్లారు ముద్దుగా నలరి బెరిగి 

పడతి పూతన మృత్యు పాలను ద్రావియున్ 

       బంపెనా పడతిని పరమపదము 

పెక్కు లీలలు జూపి బృందావనము నందు 

       పరిమార్చె కంసుని పదుగు రెదుట

నష్ట భార్యల పొంది నలరించి నందరిన్

       కళ్యాణపురుషుడై ఘనత నొందె

పౌండ్రక శిశుపాల పగతుర జంపియున్ 

       జగదభిరక్షణ జరిపి చూపె

భవరమధ్యంబున పాండునందనునకు 

        పూతమౌ గీతను బోధ జేసె

దుర్యోధనాదుల దురమందు ద్రుంచియున్ 

       ధరణిపట్టము గట్టె ధర్మజునకు 

ధర్మ సంస్థాపనార్థము ధరణి వెలసి 

దుష్టులనుద్రుంచె బ్రోచియు శిష్టజనుల, 

విష్ణు పరిపూర్ణ రూపుడౌ “కృష్ణు” నకును

ప్రణతు లర్పింతు నత్యంత భక్తి తోడ


"శ్రీకృష్ణజన్మాష్టమి" పర్వదిన శుభాకాంక్షలులతో 

గోపాలుని మధుసూదన రావు

కృష్ణాష్టమి విశేషం

 ఈ సంవత్సరం కృష్ణాష్టమి విశేషం  

 అష్టమి తిది  8

 తేదీ 26 (2+6) 8

 సంవత్సరం 2024 (2+0+2+4) = 8

 అలాగే ఆగస్టు మాసం సంఖ్య = 8

 విష్ణు యొక్క కృష్ణుని అవతారం సంఖ్య = 8 

కృష్ణునికి భార్యలు సంఖ్య = 8

 దేవకి వసుదేవులకు అష్టమగర్భంలో  

కృష్ణుడు జననం. అంటే సంఖ్యా ప్రకారం = 8


 మొత్తంగా ఈ సంవత్సరం 8 సంఖ్యకు చాలా ప్రాచుర్యం ఏర్పడింది.

*శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు*

 *శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు*

🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ 

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

కృష్ణ కృష్ణ కృష్ణ గోపాలకృష్ణ

lకృష్ణ కృష్ణl


సువ్వి బాలకృష్ణ సువ్వి

సువ్వి రాధాకృష్ణ సువ్వి

సువ్వి గోపాలబాల సువ్వలాలె

lకృష్ణ కృష్ణl


వసుదేవ వరకుమార దానవేంద్ర మదవిదార

విచితమూర్తి కీర్తిహార విశ్వపూజిత

lకృష్ణ కృష్ణl


వస్తువైన మాణిక్య వైఢూర్యము మెడలోన

సుస్థిరముగనున్న మా కస్తూరిరంగ

lకృష్ణ కృష్ణl


రాధికా ముఖారవింద సంచారిక దేవబృంద

మానవేంద్ర మౌనిబృంద వంద్య పదయుగ

lకృష్ణ కృష్ణl


కరియు చిక్కి మకరి వద్ద గావుమన్న అంతలోన

కరియు గాచినట్టి మా ఘనుడ రంగ

lకృష్ణ కృష్ణl


ఉట్టిమీద పాలకుండ లందుకున్న ముకుంద రంగ

నందనందనుడ గోవింద రంగ

lకృష్ణ కృష

ముందు దేవతలకెల్ల ముదముతోడ అమృతమైన

వెన్న మిన్న అన్న మా ప్రసన్న రంగ

lకృష్ణ కృష్ణl


గోపికా జీవన స్మరణం గోవింద గోవింద

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ 

కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ

కృష్ణ కృష్ణ కృష్ణచంద్రాయ మంగళం


                - సాంప్రదాయ భక్తి గీతం

       గానం - చిllలు రక్షిత, అవ్యక్త, ఆద్య, ప్రకృతి, శ్రీరంజని

25, ఆగస్టు 2024, ఆదివారం

కృష్ణనామం

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. 

కృష్ణ దివ్యనామం చాలు - కష్టాలన్నీపోవడానికి.

మానవులు తెలిసి కొంత, తెలియక కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగంటే - కృష్ణనామంతో!

నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప /

ప్రాయశ్చిత్త మశేషాణాం పాపానాం మోచకం పరమ్ //


కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః 

జలం హిత్వా యధా పద్మం నరకాదుద్ధరామ్యహమ్ // 

కృష్ణ కృష్ణా అని నిత్యం జపిస్తే చాలు, నీటిలో ఉన్నను తడి బురదా అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించినవారు నరకలోకబాధలు లేకుండా ఉద్ధరింపబడతారు.  


కృష్ణ కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ వ్రజం స్తధా /

యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ధి సః //

కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రదవస్థలలో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణ స్వరూపాన్ని పొందుతారు.


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే 

ఇతి షోడశకం నామ్నాం కలికల్మషనాశనం 

నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే 

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే అను ముప్పదిరెండు అక్షరములను కలిగిన షోడశనామమంత్రమే కలియుగ దుష్టప్రభావములనుండి రక్షించును. వేదములన్నింటిని వెదికినను ఈ మహామంత్రమును మించినది మరొకటి లేదు. 


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸

Panchaag