30, మే 2021, ఆదివారం

అష్టస్థాన పరీక్ష

 ఆయుర్వేదం నందు గల అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ  - 


  మనుష్యునకు సంభవించు సమస్త వ్యాధులకు మొదట 8 స్థానములను పరీక్షించవలెను .  అవి 


 1 - నాడి , 2 - స్పర్శము ( తాకుడు ) , 3 - రూపము , 4 - శబ్దము , 5 - నేత్రములు , 6 - పురీషము , 7 - మూత్రము , 8 - జిహ్వ   


      ఇప్పుడు వీటి గురించి మీకు వివరిస్తాను.  


 * నాడి  - 


       దీనిని ఆంగ్లము నందు " pulse " అందురు. రోగమును గుర్తించుటకు ఈ నాడీ పరీక్ష అద్భుతముగా పనిచేయును . ఒకసారి గాలిని లోపలికి పీల్చి , బయటకి వదిలిన 4 సార్లు నాడీస్పందన కలుగును.  


        వయస్సుని అనుసరించి నాడీస్పందన తెలుసుకొనవలెను . 


  గర్భము నందలి పిండము నాడి స్పందన  150 నుంచి 130 వరకు ఉండును. 


  శిశువు పుట్టగానే  నాడీ స్పందన 140 నుంచి 130 వరకు ఉండును . 


 1 సంవత్సరం లోపున నాడీస్పందన 130 నుంచి 115 వరకు ఉండును. 


 2 సంవత్సరాల లోపున నాడీస్పందన 115 నుంచి 100 వరకు ఉండును. 


 3 సంవత్సరాల లోపున నాడీస్పందన 100 నుంచి 90 ఉండును. 


 7 సంవత్సరం నుండి 14 సంవత్సరం వరకు నాడీస్పందన 90 నుంచి 75 ఉండును.


 14 వ సంవత్సరం నుంచి 20 వ సంవత్సరం వరకు 85 నుండి 75 వరకు ఉండును . 


 21 సంవత్సరం నుండి 60 సంవత్సరం వరకు 75 నుంచి 65 వరకు ఉండును. 


 60 సంవత్సరాల పైన  85 నుంచి 75 వరకు నాడీస్పందన ఉండును. 


      రక్తక్షీణత , జీర్ణజ్వరము , దౌర్బల్యము , భోజనం చేసినపిమ్మట , మలవిసర్జన చేసిన తరువాత నాడీ క్షీణించును. జ్వరాదుల యందు నాడీపరీక్ష చేసినప్పుడు మరియు ఎంత వ్యాధి ఉన్నను , వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు. 


              ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . హస్తము , పాదము , కంఠము , నాస ఈ నాలుగు భాగముల యందు ఒకొక్క దాని యందు 2 చొప్పున మొత్తం 8 నాడీ స్థానములు ఉండును. రెండు చేతుల మణి బంధములు , రెండు పాదముల చీలమండల యందు , ముక్కుకి రెండు ప్రక్కలా , కంఠము కు రెండువైపులా నాడీపరిక్ష చేయవలెను . 


      హస్తనాడి శరీరం అంతయు వ్యాపించి వాత , పిత్త , కఫములను , రసరక్తములను మొదలగు విషయములకు బాధ్యతకారిగా ఉండును. ఇది మన బొటనవ్రేలి మూలము నందు 3 వేళ్లు కలిసి ఉండు చోట ధాన్యపు గింజ పరిమితిన చరించుచుండును. దీని ద్వారా మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసముల గమనము బాగుగా తెలియును . 


          ఇది జీవసాక్షి అయ్యి శరీరం యొక్క ఆరోగ్య , అనారోగ్యములును సరైన కాలం తెలుపు గడియారం వలే స్పష్టముగా తెలియచేయును . మన ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు శరీరం అంతయు వ్యాపించుచుండును. అట్లు వ్యాపించు సమయమున శరీరం నందు ఎటువంటి ఒడిదుడుకులు లేకున్న  నాడి సమముగా ఉండును ఎక్కడన్నా దోషము ఉండి ఉచ్చ్వాస , నిశ్చ్వాసములు ఒడిదుడుకులు ఎదురైనచో ఈ నాడి గమనం తేడావచ్చి నెమ్మదిగా జలగ , పాము వలే సంచరించును . లేదా తొందరగా , ఎగురుచూ సంచరించును. 


      తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

తెలుగు సామెతలు

 Dedicated to all Telugu lovers👍మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు.


*Please Share all Telugu People*


1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

5. అనువు గాని చోట అధికులమనరాదు

6. అభ్యాసం కూసు విద్య

7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం

9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

12. ఇంట గెలిచి రచ్చ గెలువు

13. ఇల్లు పీకి పందిరేసినట్టు

14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు

15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు

17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు

18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ

19. కోటి విద్యలూ కూటి కొరకే

20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

22. పిట్ట కొంచెం కూత ఘనం

23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక

25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె

27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

29. ఆది లొనే హంస పాదు

30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

32. ఆకాశానికి హద్దే లేదు

33. ఆలస్యం అమృతం విషం

34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ

35. ఆరోగ్యమే మహాభాగ్యము

36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట

37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు

40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు

41. ఏ ఎండకు ఆ గొడుగు

42. అగ్నికి వాయువు తోడైనట్లు

43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు

44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట

45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

48. అప్పు చేసి పప్పు కూడు

49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా

50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

51. బతికుంటే బలుసాకు తినవచ్చు

52. భక్తి లేని పూజ పత్రి చేటు

53. బూడిదలో పోసిన పన్నీరు

54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,

గిల్లితే యేడుస్తాడు

55. చాప కింద నీరులా

56. చచ్చినవాని కండ్లు చారెడు

57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

58. విద్య లేని వాడు వింత పశువు

59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

61. చక్కనమ్మ చిక్కినా అందమే

62. చెడపకురా చెడేవు

63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు

64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ

65. చింత చచ్చినా పులుపు చావ లేదు

66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,

ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట

67. చిలికి చిలికి గాలివాన అయినట్లు

68. డబ్బుకు లోకం దాసోహం

69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

71. దాసుని తప్పు దండంతో సరి

72. దెయ్యాలు వేదాలు పలికినట్లు

73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

75. దొంగకు తేలు కుట్టినట్లు

76. దూరపు కొండలు నునుపు

77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు

78. దురాశ దుఃఖమునకు చెటు

79. ఈతకు మించిన లోతే లేదు

80. ఎవరికి వారే యమునా తీరే

81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట

83. గాజుల బేరం భోజనానికి సరి

84. గంతకు తగ్గ బొంత

85. గతి లేనమ్మకు గంజే పానకం

86 గోరు చుట్టు మీద రోకలి పోటు

87. గొంతెమ్మ కోరికలు

88. గుడ్డి కన్నా మెల్ల మేలు

89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు

90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు

91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా

92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు

93. గుడ్ల మీద కోడిపెట్ట వలే

94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట

95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు

96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు

97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు

99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు

100. ఇంటికన్న గుడి పదిలం

101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ

102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట

103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు

104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు

105. కాకి ముక్కుకు దొండ పండు

106. కాకి పిల్ల కాకికి ముద్దు

107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది

108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా

109. కాసుంటే మార్గముంటుంది

110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు

111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును

112. కలి మి లేములు కావడి కుండలు

113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు

114. కంచే చేను మేసినట్లు

115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !

116. కందకు కత్తి పీట లోకువ

117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం

118. కీడెంచి మేలెంచమన్నారు

119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు

121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు

122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా

123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట

124. కూటికి పేదైతే కులానికి పేదా

125. కొరివితో తల గోక్కున్నట్లే

126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు

127. కొత్తొక వింత పాతొక రోత

128. కోటిి విద్యలు కూటి కొరకే

129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట

130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

131. కృషితో నాస్తి దుర్భిక్షం

132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము

133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు

134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

135. ఉన్న లోభి కంటే లేని దాత నయం

136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక

137. మెరిసేదంతా బంగారం కాదు

138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో

139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు

141. మనిషి మర్మము.. మాను చేవ...

బయటకు తెలియవు

142. మనిషి పేద అయితే మాటకు పేదా

143. మనిషికి మాటే అలంకారం

144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ

145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు

146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా

147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా

148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట

149. మొక్కై వంగనిది మానై వంగునా

150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు

151. మొసేవానికి తెలుసు కావడి బరువు

152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి

153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు

154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి

155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు

156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు

157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది

158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా

159. నవ్వు నాలుగు విధాలా చేటు

160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు

161. నిదానమే ప్రధానము

162. నిజం నిప్పు లాంటిది

163. నిమ్మకు నీరెత్తినట్లు

164. నిండు కుండ తొణకదు

165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు

166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు

166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి

167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు

168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు

169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు

170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు

171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు

172. ఊరు మొహం గోడలు చెపుతాయి

173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు

174. పాము కాళ్ళు పామునకెరుక

175. పానకంలో పుడక  

176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట

177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు

178. పండిత పుత్రః పరమశుంఠః

179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు

181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట

182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది

183. పెళ్ళంటే నూరేళ్ళ పంట

184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు

185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట

186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది

187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

188. పిచ్చోడి చేతిలో రాయిలా

189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా

190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం

191. పిండి కొద్దీ రొట్టె

192. పిట్ట కొంచెము కూత ఘనము

193. పోరు నష్టము పొందు లాభము

194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు

195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట

196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు

197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు

198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము

199. రామాయణంలో పిడకల వేట

200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు

201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు

202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు

203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు

204. రౌతు కొద్దీ గుర్రము

205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు

206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు

207. సంతొషమే సగం బలం

208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే

209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు.🙏

అందరూ సమానమే

 1. *ఆదివారం* గడవాలనే చింత లేదు.

2. *సోమవారం* వస్తుందనే భయం లేదు.

3. *డబ్బు* సంపాదించాలనే మోహము లేదు.

4. *ఖర్చు పెట్టే* ఆసక్తి లేదు.

5. *హోటల్ లో*  తినాలనే కోరిక లేదు.

6. బయట తిరిగే ఆలోచన లేదు.

7. *బంగారం వెండి* పై మోహము లేదు.

8. *కొత్త బట్టలు* ధరించాలనే ఆతృత లేదు.

9. *సుందరంగా తయారవ్వాలనే* చింత లేదు.


" *మనం మోక్ష ద్వారం చేరుకున్నామా?*" ఏమో కలియుగం సమాప్తమై *సత్య యుగం* వచ్చేసిందేమో*.."


* పూజా, వ్రతం, పరివారం జతలో, ఉపవాసం, రామాయణం మరియు మహా భారతం¶

* కాలుష్య రహిత వాతావరణం¶

*పరుగుతో నిండిన జీవనం* సమాప్తి¶

* సాధారణ జీవనం¶

* అందరూ రొట్టె:పప్పు తింటున్నారు¶

* అందరూ సమానమే..అనే భావన¶

* ఏ నౌకర్లు లేదు..ఇంట్లో అందరూ కలిసి పని చేసుకుంటున్నారు¶

* ఖరీదైన బట్టలు, ఆభరణాలు ధరించాలి అనే ఆశ లేదు¶

* ప్రజలు అపార దాన ధర్మాలు చేస్తున్నారు¶

* అహంకారం శాంతించింది..¶

*పిల్లలు అందరూ ఇంటికి వచ్చి తల్లి తండ్రుల తో కలిసి ఉంటున్నారు¶ 

మంచి మాటలు మాట్లాడు కుంటున్నారు               

*సర్వే జనా సుఖినోభవంతు*

సుదాముడి భక్తి.)

 *నీ పాద కమల సేవయు,*

*నీ పాదార్చకుల తోడి నెయ్యమును, నితాం*

*తాపార భూత దయయును,*

*తాపస మందార నాకు దయసేయ గదే.!!*


(పోతన భాగవతము .. దశమ స్కంధము .. సుదాముడి భక్తి.)


తెలుగు భాగవతం లో ప్రసిద్ధ పద్యాల లో ఇది ఒకటి. 


ఒక్కో భక్తుడు ఒక్కో కోరికతో భగవంతుడిని పూజిస్తారు. కొద్దిమంది విలక్షణ మైన కోరికలు కోరతారు. 


పాండవుల తల్లి కుంతీ దేవి కష్టాలు పడీ పడీ అవి అలవాటవడమే కాకుండా కష్టాలకు addiction కూడా వచ్చినట్లుంది. ఆమె కృష్ణుడిని "నిరంతరం నాకు కష్టాలు ఉండేటట్లు అనుగ్రహించ వయ్యా అని ప్రార్ధిస్తుంది. కష్టాలు లేనప్పుడు నేను దేవుడిని మరచి పోతున్నాను అందుకని దేవుడు నిరంతరం గుర్తుండాలని ఈ కోరిక కోరానని చెపుతుంది". తమాషా కోరిక. 


ఏదడిగినా ఇస్తాడని తెలిసి కూడా మొహమాటం అడ్డొచ్చి ఏదీ అడగ కుండా వెళ్ళిపోయిన వాడు కుచేలుడు. 


శివుడి లాగా విష్ణుమూర్తి సాధారణంగా అంత తొందరగా భక్తులను అనుగ్రహించడు. పరీక్షలు పెట్టీ పెట్టీ, భక్తుడి దుంప తెంచీ, వాడు ఆయన పెట్టే అన్ని  పరీక్షల్లో నెగ్గితే ఆఖరకు అనుగ్రహిస్తాడు. 


సుదాముడనే వాడు మధురా నగర వాసి. కుచేలుడికి కూడా సుదాముడనే పేరుంది. ఇతను వేరు. ఇతను ఇంకో కృష్ణ భక్తుడు.  వాడు  ఎంత తపస్సు చేశాడు ఎన్ని పూజలు చేసాడు అనే వివరాలు,  భాగవతం లో లేవు.  ఇతను మాలాకారుడు అంటే పూల మాలలు తయారు చేసేవాడు. కుబ్జ కథ కు సరిగ్గా ముందు ఇతని కధ వస్తుంది.  స్వయంగా కృష్ణుడే అతని ఇంటికి వెళతాడు. ఆయన ఆతిధ్యం తీసుకుని మాలలు తీసుకుని, నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అంటే అప్పటికే సుదాముడి కి పరీక్షలూ తపస్సులూ అన్నీ పూర్తయినాయన్న మాట. సుదాముడు కూడా వచ్చినవాడు భగవంతుడని గుర్తు పడతాడు. ఈ సందర్భం లో ఆయన కోరిన కోరికే పైన వ్రాసిన పద్యం. ఈయన కోరిన కోరిక విలక్షణ మైనది.  వ్యాసుడి శ్లోకం కంటే పోతన తెలుగు పద్యం బావుంది. అందుకే ఇది వ్రాసాను. దీని అర్థం గమనించండి. 


*తాపస మందార* :: పారి జాతము, సంతానము, కల్ప వృక్షము, మందారము, హరి చందనము ఇవి ఐదూ స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టుకు పేర్లు. తెలుగులో మందారమంటే దాసాని చెట్టు, హరిచందనమంటే గంధం చెట్టు ఇలాగ ఉంటాయి. సంస్కృత సమాసాలలో మాత్రం స్వర్గం లో కోరికలు తీర్చే చెట్టు అని అర్థం. ఆశ్రిత పారిజాతమా భక్త మందారమా అంటే అదీ అర్ధము. నీకోసం తపించే (తపస్సు చేసే) వారి అన్ని కోరికలు తీర్చేవాడా అని అర్ధము. 


*నీ*:: భగవంతుడిని ఏకవచనం లో సంబోధించాలంటే ఆయన తనవాడు, తను ఆయన వాడిని అనే భావం పూర్తిగా వుండాలి. త్వమేవాహం అన్న స్థితి.  అది వున్న వాడే ఆవిధంగా భగవంతుడిని ఆత్మీయం గా ఏక వచనం లో పిలవ గలడు. అనన్యశరణత్వము, అనన్యా ర్హ శేషత్వము మొదలైన భావనలు ఉండడం. లేదా అలా పిలవడం ద్వారా ఆభావాలు అలవాటు చేసు కోడము అనుకోవాలి. 


*పాద కమల సేవయు*::  పాదాలను కవులు కమలాల తో పోలుస్తారు. Physical పోలిక ఉండదు. కావాలంటే బెంగుళూరు వంకాయలతో పోల్చుకోవచ్చు. కమలాల తో పోలికేమిటి. నిజానికి కోల ముఖం ఉన్న వాళ్ళను కూడా చంద్ర ముఖి అని పద్మ ముఖి అని పిలుస్తారు. ముఖం గుండ్రంగా ఉంటుందని కాదు. చంద్రుడి లోను, పద్మం లోనూ లక్ష్మీ కళ ఆకర్షణ ఉంటాయి. ఆగుణం తో పోలిక. ఆ పోలిక అనుభవించిన వాడికి దేవుడి పాదాలు వదల బుద్ధి కాదు. ముక్తులు చాలా రకాలు. అందులో సామీప్యం, సాలోక్యం అని రెండుంటాయి. విష్ణుమూర్తి పాదాలు చూస్తూ నిత్యం వాటిని సేవించాలంటే సామీప్య సాలోక్య ముక్తులు రెండూ ఉండాలి. సామీప్య సాలోక్య ముక్తులు రెండూ కావాలని లోపలి కోరిక.


*నీ పాదార్చకుల తోడి నెయ్యము* :: నీ భక్తులతో మాత్రమే సత్సంగత్వం కావాలి అని కోరిక. మన పక్క నుండేవాళ్ళు కూడా అదే కోరికతో వున్న వాళ్ళయితే మన భక్తి కి diversion కలగదు. భగవత్సేవ తో పాటు భాగవతుల సాంగత్యం కూడా కావాలి అని.


*నితాంతాపార భూత దయయును*:: అద్వేష్టీ సర్వ భూతానం .. భగవద్గీత గుర్తుంది కదా. ఆ శ్లోకాల కొసలో యోమే భక్తః సమే ప్రియః అని ఉంటుంది. భూతదయ కలగాలి దాని తరవాత దానివల్ల విష్ణుమూర్తికి తాను ఇష్టుడు కావాలి అని కోరిక. 


పద్యం అంతా ప్రధమ పురుష లో  (you)  నడుస్తుంది. భగవంతుడిని ఎదురుగా ఉన్నాడని భావించి మన మాట ఆయన వింటున్నాడనే నమ్మకంతో పలికే ప్రార్ధన ఇది. ఇందులో భగవంతుడు శివుడు రాముడు కృష్ణుడు అని ఏమీ ఉండదు. అమ్మవారి ముందు కూడా చెప్పుకోవచ్చు. స్తుతీ,  ప్రార్ధన,  సంకల్పమూ,  సంపూర్ణ శరణాగతీ అన్నీ ఈ పద్యం లో ఉన్నాయి. 


భగవంతుడు అడగలేదని కుచేలుడికి ఎగ గొట్టడు. అడిగింది కదా అని కుంతికి కష్టాలు ఇవ్వడు. ఎవరి కర్మఫలం వారికి తూచి సరిగ్గా ఇవ్వడం భగవంతుడి ప్రత్యేకత. ఈ కోరిక విని కృష్ణుడు నవ్వి  సుదాముడికి అడిగినవీ అడగనివీ అన్నీ ఇచ్చాడని భాగవతం లో ఉంది. 


మన కున్న కర్మ తాలూకు balance ఏమిటో మనకు తెలీదు. పోనీ నష్టం లేదు కనుక మనం కూడా సుదాముడు పద్ధతి లో ఓ application ఇస్తే సరిపోతుంది. మనం రోజూ పూజలో చదువు కోవచ్చు పిల్లలకు నేర్పించ వచ్చు... మంచి పద్యం... 


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

విష్ణు తత్వము

 శం నో అగ్నిః శం వరుణః, శం నో విష్ణుః ఉరు క్రమః ఉరుగాయో అని కూడా శ శిం అయినది. పూర్ణము ౦ వలననే ఈ అనే విష్ణు తత్వము క్రమముగా అనగా వక సూత్ర పధ్దతిలో వ్యాప్తమై ఉరుగాయెూ క్షేత్రమును,భూమిని తెలుపుచున్నది. విష్ణువనే ఈశ తత్వం వ్యాప్తి వలన భూ లక్షణము. శం నో మిత్రః శం వరుణః. అగ్నిని మిత్ర సూర్యుడుగా విశ్వానికి మిత్రుడుకూడా పిలువబడును. ఎన్నో కోట్ల సంవత్సారాల కాల క్రితంనుండి యున్న శక్తిని మానవ రూపంలో ఎవరూ సృష్టించలేదు.దానిని తెలుసుకొనుటకు ప్రయత్నించుటయే జీవ లక్షణము ఙ్ఞానం. శక్తి వ్యాప్తమై సూక్ష్మమని అది ఆది అంతము లేనిది. దేవతలకు అమృతత్వము కలదని అంటారు అది మనకు భౌతికంగా కనపడదు. మన శక్తి మృతము అనగా వేరు దేహమును ఆశ్రయించకుండా నుండుటయే అమృతం.దైవ శక్తి వక వేళ దేహమును ధరించినా తిరిగి దాని పపిధి తరువాత తిరిగి విడిచి మూల తత్వం లో లీనమగుదురు. యిదిగో యిదే ఋషి తత్వం.మృతముగానిది. దేహమునకు అమృత పూర్ణ మైన ఋక్కు లక్షణమును తెలియుటయే. తెలిసి దానిని ఏ దేహములోనికి ప్రవేశించకుండా యుండుట అమృతం. శం న ఓ ఓ జీవ రూప ౦ పూర్ణ శక్తి ఈ అనే శక్తియే మూలం. అది శ అనగా రాహు కేతు శక్తి. అవి వకటి ఏన్టీ క్లాక్ పద్దతిలో చలనము కలిగియుండును. కేతువు సవ్య గతిలో తిరుగును. వీటి శక్తియే మిగిలిన సమస్త ప్రపంచమునకు మూలము. రాహువు మాత్రమే మూల శక్తి కలిగి అమృత తత్వం కలిగియున్నట్లు దానిగురించి ఎక్కడా అది యిదియని దాని లక్షణము యిది యని వేదము యిత మిధ్దంగా తెలిపియుండలేదు. తెలియక పోవుట ఈశ యని తెలియుట విషు  విష్ణు యని వకటి నిర్గుణముగా  వేరొకటి సగుణముగా. సగుణము ప్రకాశించు తత్వమును తెలుపుచున్నది. నిర్గుణం ప్రకాశము లేనిది. దానినుండి సమస్తం తెలియాలి. క్రమముగా అనగా హవిస్సు ఉష రూప కాంతి వక క్రమ పద్దతి యనగా సూత్ర పరంగా వ్యాప్తి యని, అనగా శబ్ద శక్తిని వేద పరంగా క్రమ యని క్రమముగా యిప్పటికి వాడుకలో యున్నది. ఉదయం కాంతిలో లక్షణము పూర్తిగా తెలియదు  మధ్యాహ్న కాంతిలో తెలియుట అసంభవం. సాయంకాలం కాంతిలో ఉదయకాంతి మధ్యాహ్న కాంతి లక్షణములు మిశ్రమమై తెలియును. అది ప్రకృతియని సృష్టి యని తెలియుచున్నది. అనంతమైన ఙ్ఞానశక్తిని తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*పండితులు..పరామర్శలు..*


*(నలభై మూడవ రోజు)*


శ్రీ స్వామివారి గురించి క్రమంగా జనబాహుళ్యానికి తెలియడం మొదలైంది..ఎవరో ఒక యోగి ఇలా మొగలిచెర్ల గ్రామ సమీపంలో ఆశ్రమం నిర్మించుకుంటున్నారనీ..అందుకు శ్రీధరరావు దంపతులతో పాటు మరికొందరు స హకారం అందిస్తున్నారనీ.. నలుగురూ అనుకోవడం కూడా ప్రారంభం అయింది..


శ్రీ స్వామివారు ఎన్నడూ మహిమలు చూపడానికి ఇష్టపడేవారు కాదు..ఎవరైనా ఆయనను సంప్రదిస్తే..చాలా తేలికగా.."ప్రారబ్ధాన్ని అనుభవించక తప్పదు!.." అని చెప్పి పంపించేసేవారు..అలా కోరికలతో వచ్చిన వాళ్ళతో ఎక్కువ సేపు మాట్లాడటానిక్కూడా ఒప్పుకునేవారు కాదు..ఎంత దగ్గర వాళ్ళైనా..తన ధ్యానం ముగిసిన తరువాతే..వారితో ముచ్చటించేవారు..మితాహారం, మితభాషణం..ఈ రెండింటినీ పాటించేవారు..


జనవరి నెలలో సంక్రాంతి పండుగ దాటిన తరువాత ఒకరోజు మధ్యాహ్నం వేళ.. శ్రీధరరావు గారింటికి నెల్లూరు నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు..అందులో ఒకాయన సంస్కృతాంధ్రములు రెండింటిలోనో పాండిత్యం కలవారు..ఆశువుగా ఛందోబద్ధంగా పద్యములు చెప్పగలరు..అష్టావధానం చేసిన అనుభవం కూడా ఉంది..ఇక పురాణాలు ఇతిహాసాల మీద మంచి పట్టు ఉంది..ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న వారు..ఇవన్నీ కాకుండా..శ్రీధరరావు దంపతులకు దూరపు చుట్టరికం కూడా ఉంది..(ప్రభావతి గారు ఆయనను బాబాయిగారూ అని పిలిచేవారు)..రెండవ వ్యక్తి ఈ పండితుడికి చేదోడుగా వచ్చాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు వాళ్ళను సాదరంగా ఆహ్వానించి..భోజనం పెట్టారు..భోజనం చేసిన తరువాత.. ఆ పెద్దాయన కుశలప్రశ్నల పరంపర ముగించి.."శ్రీధరా..ఎవరో ఒక స్వామిని మీరు ఇక్కడికి తీసుకొచ్చారట గదా..ఆయనకు ఆశ్రమం కట్టుకోవడానికి పొలం కూడా ఇచ్చావుట!..మీ దంపతులు ఆయనకు పడి పడి మొక్కుతున్నారట..మనవాళ్ళు అనుకుంటుంటే విన్నాను..ఒకసారి మిమ్మల్ని చూసి, విషయం కనుక్కుని..ఆ స్వామిని కూడా చూసి..ఏపాటి వేదాంతం చెపుతాడో విని వెళ్లాలని వచ్చాను.."అన్నారు..


ఆయన మాటల్లో హేళన, వ్యంగ్యం ఎక్కువగా వినిపించాయి ఆ దంపతులకు..ప్రభావతి గారు వుండబట్టలేక.."ఏదోలే బాబాయిగారూ..మేము ఆయనను మహానుభావుడు అనుకుంటున్నాము..మా పూర్వపుణ్యం కొద్దీ ఆయనకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని..మా తృప్తి కోసం మేము చేస్తున్నాము.." అన్నారు..


"ఇప్పుడు వెళదామా..ఆయన్ను చూడాలని ఉంది.." అన్నారా వచ్చిన పండితుడు..శ్రీధరరావు గారు ఆసరికే బండి సిద్ధం చేయమని పనివాడికి పురమాయించారు..ప్రభావతి గారికి మాత్రం వీళ్ళను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకెళ్లడం సుతరామూ ఇష్టం లేదు..అక్కడ  శ్రీ స్వామివారిని కించపరచినట్లు హేళనగా మాట్లాడితే..శ్రీ స్వామివారు నొచ్చుకుంటారేమో..తమ మీద చెడుగా భావిస్తారేమో నని ఆవిడ ఆలోచన..ఆమాటే మెల్లిగా శ్రీధరరావు గారితో ప్రక్కకు పిలచి అనేశారు కూడా..శ్రీధరరావు గారు మాత్రం నిబ్బరంగా.."నువ్వు అనుకున్నట్లు ఏమీ జరుగదు ప్రభావతీ..స్వామివారు అన్నీ సరి చేసుకోగలరు!.." అన్నారు..ప్రభావతి గారు లోపల పూజ గదిలోకి వెళ్లి..లక్ష్మీనరసింహ స్వామికి నమస్కారం చేసుకొని వచ్చి బండి ఎక్కారు..


మొగలిచెర్ల ఇంటి వద్ద నుంచి బండిలో.. శ్రీ స్వామివారు ఆశ్రమం నిర్మించుకుంటున్న ఫకీరు మాన్యానికి దాదాపు ముప్పావు గంట ప్రయాణం..దారిలో తమకు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అయింది..తదనంతర పరిణామాలు అన్నీ క్లుప్తంగా శ్రీధరరావు గారు చెప్పారు..


అంతా విని.."బాగా తెలివిగల వాళ్ళం అని తలపోసేవారు కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు చేస్తుంటారు..సరేలే..కాల మహిమ!.." అన్నారా పండితుడు సాలోచనగా..అంతటితో ఊరుకోలేదు..దొంగ స్వాములు..కుహనా యోగులు..ఇలా తనకు తెలిసిన వాళ్ళ గురించి..ఒక చిన్నపాటి ఉపన్యాసం ఇచ్చాడు..మొత్తంమీద శ్రీ స్వామివారిని నమ్మి ఈ దంపతులు తప్పు చేశారని తన వాదన ముగించాడు.. 

బండి ఫకీరు మాన్యం చేరింది..సమయం సాయంత్రం నాలుగు గంటలయింది..


బండి దిగి నలుగురూ శ్రీ స్వామివారు వున్న పూరిపాక దగ్గరకు వచ్చారు..ఆ సమయంలో శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని..నిటారుగా కూర్చుని..ధ్యానం చేసుకుంటున్నారు..తూర్పు ముఖంగా ఉన్న ఆ పాకలో ఉత్తరాభిముఖంగా శ్రీ స్వామివారు నిశ్చలంగా కూర్చుని వున్నారు..శ్రీధరరావు గారు పాక బైటనుంచే నమస్కారం చేసారు..ఈలోపల గొట్టిగుండాల గ్రామం నుంచి, ఆశ్రమ నిర్మాణం చేస్తున్న మీరాశెట్టి దంపతులు కూడా నడుచుకుంటూ అక్కడికి చేరారు..సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం నడచి వచ్చిన ఆ దంపతులు కూడా బైట నుంచే శ్రీ స్వామివారికి నమస్కారం చేసుకొని..ఒక ప్రక్కగా నిలబడ్డారు..


ఒక అరగంట కాలం గడచిన తరువాత...శ్రీ స్వామివారు సమాధి స్థితి నుంచి లేచారు..పూరిపాక బైటకు వచ్చి..అందరినీ చూసి.."మీరొచ్చి చాలా సమయం గడిచిందా?.." అన్నారు.."ఒక అరగంట అయిందని " శ్రీధరరావు గారు చెప్పారు..


"ఏమయ్యా..చాలా దూరం నుండి వచ్చినట్లున్నారే!..బాగున్నారా?.." అన్నారు పండితుల వారి వైపు ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా చూస్తూ..శ్రీ స్వామివారు అలా చనువుగా  పలకరించడం శ్రీధరరావు దంపతులకు ఒకింత ఆశ్చర్యం కలిగించింది..


పాండిత్యమూ..పరామర్శా.. రేపటి భాగంలో కూడా..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

29, మే 2021, శనివారం

ఒక్కరుపు అరిచాను

 వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన! 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ. 


ఎప్పుడు తెచ్చారు? ఎన్ని తెచ్చారు? ఒక్కొక్కరికీ ఎన్నేసొస్తాయి? వాటాలేసుకునేటప్పుడు ముందుగానే మంచివన్నీ చూసి తీసేసుకోవాలి. అసలే అయిదుగురం. పందార కలిశలనుకుంటా! భలే తియ్యటి వాసన గదంతా! గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడిలా మెరిసిపోతున్నాయి.


అప్పుడప్పుడు ఇంకా పండనివి తెచ్చేవారు. మునగపాక నుంచి వచ్చి రోజూ పాలుపోసే పైడమ్మని అడిగి ఎండుగడ్డి తెప్పించేవారు. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు. మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల ఆకలి చాలా దారుణమైన ఆకలి. వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే!


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది. నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు. అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి. అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి. 


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా! అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 


శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతఁవప్పుడు ఇరవయ్యొక్క రకాల పిండివంటలు వండినా విస్తట్లో ఓమూలగా క్షేత్రపాలకుడి పాత్రలో ఆవకాయ వుండాల్సిందే! 


ఇక భాద్రపదంలో వినాయక చవితికి ఉండ్రాళ్లలోకి కొబ్బరిపచ్చడీ, అల్లప్పచ్చడీ చేసినా సాయంత్రం మాత్రం పునఃపూజ తరవాత ఆవకాయ అద్దుకుంటూ ఉండ్రాళ్లు తినకపోతే వ్రతఫలం దక్కదుట! 


ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది. ఆ టైములో అర్జెంట్ ఆపరేషనన్నా వెళ్లబుద్ధి కాదు!


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు. ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి...‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!


అసలు వాణ్ణని ఏంలాభం? వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి!


వేసవి సెలవులప్పుడు తాడేపల్లిగూడెం వెళ్లేవాళ్లంకదా? అక్కడ ముగ్గురు మావయ్యలు, వాళ్లకి నలుగురేసి, అయిదుగురేసి పిల్లలు కదా!


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే జోగిరాజు మావయ్యనడిగి ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. అంతేగానీ పళ్లు తినొద్దంటే ఎలా?


కానీ పిర్రలమీద వస్తే మాత్రం చచ్చేచావే! నిక్కరేసుకోలేక పోయేవాళ్లం. అది పగిలేదాకా తువ్వాలు కట్టుకు తిరగాల్సొచ్చేది. ఆడపిల్లలు వెక్కిరిస్తారన్న బాధొకటి కురుపు కన్నా ఎక్కువ సలుపుతూ వుండేది.


దాసు మావయ్య హాస్పిటల్‌కి తీసుకెళ్లి పెన్సిలిన్ ఇంజక్షన్ చేయిస్తాననేవాడు. ఆ భయంతో తినడం తగ్గించేవాళ్లం. లేకపోతే మనల్ని ఎవరాపగలరు?


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు. మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు. అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు మాజా తాగడం బెటరు. లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా! అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! తీపి జ్ఞాపకం కూడా!

మెదడు కి మేత

 మెదడు కి చిన్న మేత



❓❓❓❓❓❓❓

***********************

👇 కింది ఆంగ్ల పదములకు తెలుగు లో రాయాలి.  ప్రతి పదం "" ఉ "" తో మొదలవ్వాలి .

***********************

1.salt ఉప్పు

2.free 

3.steel

4.swing ఊయల

5. potato 

6. Idea

7. relief

8. Run

9.  Both

10. Fasting 

11. Help 

12. Speech

13. teacher

14. Ring

15. Lump

16. Squirrel 

17. Anxiety 

18. Temperature 

19. Horse gram

20. Joint

21. Satellite 

22. Neglect 

23. Tsunami 

24. Escape 

25. Example

26. North 

27. Opinion 

28. Job

29. Rise

30. Production 

31. Water

32. Wash

33. park

34. Letter

35. Thunder 

36. Asthma 

37. Episode 

38. Movement 

39. Send off

40. Stomach

Fపిశాచత్వ విముక్తి*

 _*వైశాఖ పురాణం - 19 వ అధ్యాయము*_




🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*పిశాచత్వ విముక్తి*



☘☘☘☘☘☘☘☘☘



నారదుడు అంబరీషునకు వైశాఖ మహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయఉంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


శ్రుతదేవుడిట్లనెను , రాజా ! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు.


వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు.


ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు , తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో , తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును , వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా ! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి ?  కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము , ధ్యానము , మననము , ఆవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము , విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని , విష్ణుకథగాని , సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము , మననము , స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు , చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము , చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు , నిరాశ్రయుడు యెండిన పెదవులు , నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను , జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. అతడును నేను కర్మనిష్ఠుడనువాడను. దుర్వాసమహాముని శిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా అదృష్టవశమున మీ దర్శనమైనది. నన్ను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వారి పాదములపై బడి దుఃఖించెను.



సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను.  ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు - సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


శ్రుతకీర్త మహారాజా ! కావున శ్రీహరి కథల ప్రసంగము , శ్రవణము , ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు ఇహము , పరము , నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.


*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*

*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*

*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.

కాళీ గ్లాసు

 కాళీ గ్లాసు 


మనం రోజు చూస్తున్న ఒక సాధారణ విషయం. ఈ రోజుల్లో చాల పలచటి ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్నారు. వాటిని ఏదయినా విందులో వాడేటప్పుడు టేబులు మీద పెట్టి నీళ్లు పోస్తుంటే కాళీ గ్లాసులు గాలికి అటు ఇటు కదులుతూ కొంచం పెద్ద గాలి వస్తే టేబులు మీదినించి కింద అక్కడక్కడ పడుతూ వాటిలో నీళ్లు పోసే వారికి విసుకు కలిగిస్తాయి. అందుకే నీళ్లు పోసేవారు ఇంకొకడిని ఆ గ్లాసులు పట్టుకోమని చెప్పి వాటిలో నీళ్లు నింపటం నిత్యం మనం చూస్తూవున్న విషయం . 


అదే కొంత బరువు కలిగిన రాగి గ్లాసో లేక ఇత్తడి, కంచు లేక స్టీలు గ్లాసు అనుకోండి వాటిని టేబులు మీద పెట్టినవి పెట్టినచోట ఉండి వాటిలో నీరు నింపటం చాల సులువుగా అవుతుంది. 


ఇక విషయానికి వస్తే ప్రతి మనిషి ఒక కాళీ గ్లాసు లాంటి వారే దానిలొ నీరు నింపటం అంటే గురువుగారు చేసే జ్ఞాన బోధ. నింపటం అన్న మాట. ఎప్పుడైతే కాళీ గ్లాసు స్థిరంగా ఉండి  ఉంటే దానిలో నీరు నింపటం ఎలా అయితే సులువు అవుతుందో అదే విధంగా సాధకుని మనస్సు స్థిరంగా ఎటువంటి వత్తిడులకు లోనుకాకుంటే ఆ సాధకునికి గురువుగారు చేసే జ్ఞాన బోధ చక్కగా వంట పట్టి జ్ఞానిగా మారుతాడు. అదే ప్లాస్టిక్కు గ్లాసులాంటి చంచల మనస్సు కలవారికి జ్ఞానబోధ చేయుట బహు కష్టం. కాబట్టి ప్రతి వారు ఒక రాగి గ్లాసులాగా స్థిరంగా ఉంటే వారికి గురువులు చేసే తత్వ బోధ సులువుగా అర్ధమౌతుంది. కాబట్టి మనమందరం స్థిర మనస్కులుగా ఉంటే మనలో జ్ఞానం సులువుగా వికసిస్తుంది. 


ఓం తత్సత్.  


ఓం శాంతి శాంతి శాంతిః 


మీ భార్గవ శర్మ.