12, జులై 2020, ఆదివారం

భాను సప్తమి

నేడు  భాను సప్తమి భాను సప్తమి అంటే ఏమిటి? ఈ నియమాలు ప్రతి ఆదివారానికి వర్తిస్తాయి

ఆదివారం రోజు సప్తమి తిధి రావడం వలన దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం.  సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని *ధర్మశాస్త్రం* చెబుతోంది. వాటిలో ప్రధానంగా చూస్తే...    మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవడం 
రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు , ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి.  మూడవది ఒంటికి , తలకు నూనె పెట్టుకోరాదు.
నాల్గవది ఉల్లి , వెల్లుల్లి , మద్యము , మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి.

నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సుర్యారాధనతో విద్యా , వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.  నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహమవుతుంది. సంతానం కలుగుతుంది. మనఃశ్శాంతి లభిస్తుంది.  సూర్యారాధనతో లభించనిది అంటూ ఏదీ ఉండదు.

ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినము లాంటిది , గొప్ప యోగము.  ఈ రోజు చేసే స్నానం , దానము , జపము , హోమము లక్ష రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.  ఈ రోజున ఆవుపాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు.


సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి స్నానోదకాలు చేయక , ఆహార నియమాలు పాటించని వారికి అనారోగ్యం చేసి రోగాలు వస్తాయని , దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని పరమశివుడే సూర్యాష్టకంలో చెబుతారు.

*ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే*
*సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా*

*స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే*
*న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి*

*భావం*

తినకూడని పదార్ధాలు , మద్యము , మాంసము మొదలైనవి తినేవాడు ఏడు జన్మల పాటు రోగాలతో బాధపడతారు. ఆజన్మాంతం దరిద్రం ఉంటుంది. స్త్రీ సమాగమము , తైలం రాసుకోనుట , మద్య మాంసాలను ఆదివారం విడిచిపెట్టినవానికి శోకం , వ్యాధి , దారిద్ర్యం ఉండదు , వారు సరాసరి సూర్యలోకనికి వెళతారు.
ఈ నియమాలు ఒక్క భానుసప్తమికే పరిమితం కాదు ప్రతి ఆదివారం విధిగా పాటించమని పరమశివుడు సూర్యాష్టకంలో చెప్పారు. కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోమని దుర్వినియోగం చేయవద్దని సూచన.
ఈ రోజు సూర్యుని అనుగ్రహం కోసం సూర్యాష్టకం , ఆదిత్య హృదయం , సూర్య ద్వాదశ నామాలు పఠించడం శ్రేష్ఠం.  సూర్యనమస్కారాలు చేయడం వలన ఎన్నో శుభఫలితాలను , ఇష్ట కామ్యసిద్ధిని ఇస్తాయి.
శ్రీ రామచంద్రుడంతటి వాడు రావణున్ని యుద్దంలో జయించడానికి సూర్యదేవుని ప్రార్ధించాడు ఇది అందరికీ తెలిసినదే ప్రతి రోజు ఎవరైతే సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేస్తారో వారికి అన్నింటా విజయం కలుగుతుంది. 

*ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః*

కామెంట్‌లు లేవు: